Devotional Telugu
3.83K subscribers
105 photos
23 videos
19 files
59 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
విదుర నీతి


జీవితం ప్రశాంతంగా గడపాలని ప్రతి వ్యక్తీ కోరుకుంటాడు. సమాజంలో శాంతి ఉన్నప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారు. ఇందుకు నీతినియమాలు తోడ్పడతాయి. నీతి తప్పిన సమాజంలో అశాంతి నెలకొంటుంది. మన సాహిత్యం లోక క్షేమాన్ని కోరుకొంటుంది. భారతీయ ధర్మశాస్త్రాలు మానవుడు ఎలా జీవిస్తే సమాజానికి మేలు జరుగుతుందో చెబుతాయి. ఈ గ్రంథాలను రచించినవారు మహర్షులే! యుగధర్మాలను బట్టి ఈ ధర్మశాస్త్రాలు విభిన్న మార్గాలను మనకు సూచిస్తాయి. కృతయుగంలో మనుధర్మ శాస్త్రం, త్రేతాయుగంలో గౌతమస్మృతి, ద్వాపరంలో శంఖలిఖితుల స్మృతి- ప్రామాణికాలు. కలియుగంలో పారాశర్య స్మృతిని పాటించాలని రుషులు భావించారు. మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని నీతుల గురించి అభిప్రాయాలూ మారుతున్నాయి. కొన్ని మాత్రం యుగాలు మారినా మారవు.
ఎప్పటికీ సమాజానికి ఉపయోగపడే నీతులు చెప్పినవారిలో విదురుడు ముఖ్యుడు. ఒక దాసికి,  వ్యాసుడికి జన్మించిన విదురుడు ధృతరాష్ట్రుడికి తోడుగా ఉంటూ హితోక్తులు చెబుతూ, పాండవుల మేలు కోరుతూ ఉండే కృష్ణభక్తుడు.
రాయబారానికి శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు ఎవరి ఇంట్లోనూ భోజనానికి అంగీకరించడు. విదురుడి ఆహ్వానాన్ని మన్నించి అతడి ఇంటికి మాత్రం వెళ్ళాడు. విదురుడు భక్తితో స్వయంగా తానే కృష్ణుడికి ఆహారం తినిపించాడు. భక్తి పారవశ్యంతో ఒడలు మరచి, అరటిపండు తొక్క ఒలిచి దాన్నే కృష్ణుడి నోటికి అందించి, లోపలి పదార్థాన్ని పారవేశాడు! విదురుడి నిర్మల భక్తికి ఇది నిదర్శనం.
సంజయుడు పాండవుల వద్దకు రాయబారానికి వెళ్ళివచ్చిన తరవాత, ధృతరాష్ట్రుడివి అన్నీ అధర్మ కృత్యాలేనని అధిక్షేపించాడు. అప్పటి నుంచి మానసిక క్షోభతో ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు. విదురుణ్ని పిలిచి మంచి మాటలతో తన మనసుకు ప్రశాంతత కలగజేయమన్నాడు. విదురుడు ముందుగా నిద్ర పట్టనివాళ్లెవరో చెబుతాడు. ‘బలవంతుడితో విరోధం పెట్టుకున్న వాడికి, సంపద పోగొట్టుకున్న వాడికి, కాముకుడికి, దొంగకు నిద్ర ఉండదు’ అని అంటాడు. విదురుడి నీతులకు ఏ యుగంలోనైనా విలువ అలాగే చెక్కుచెదరకుండా ఉంటుంది!
జ్ఞానులు ఎలా ప్రవర్తిస్తారో, మూర్ఖులు ఎలా ఉంటారో విదుర నీతులనుబట్టి చక్కగా తెలుసుకోవచ్చు. తనకు అందనిదాన్ని గురించి ఆరాటపడనివాడు, పోయినదాన్ని గురించి విచారించనివాడు, ఆపదలో సైతం వివేకం కోల్పోనివాడే జ్ఞాని. అధికమైన సంపద, విద్య ఉన్నప్పటికీ ఉత్తముడు వినయంగానే ఉంటాడు.
మూర్ఖుడు వెంటనే చేయవలసిన పనిని అడుగడుగునా అనుమానిస్తూ, ఆలస్యంగా చేస్తాడు. అతడు తాను తప్పుచేసి, ఎదుటివాణ్ని నిందిస్తాడు. ధనం లేకుండా కోరికలు పెంచుకోవడం, సమర్థత లేకపోయినా ఇతరులపై మండిపడటమనే ఈ రెండూ మనిషిని కృశింపజేస్తాయి.
‘మధుర పదార్థం నలుగురికీ పంచకుండా ఒక్కడే భుజించకూడదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక్కడే కూర్చుని బయటపడే ఉపాయం ఆలోచించకూడదు... అందరూ నిద్రపోతుంటే ఒక్కడే మెలకువతో ఉండకూడదు. మానవుడికి ఆరు సుఖాలున్నాయి. అవి ఆరోగ్యం, ధన సంపాదన, ప్రియురాలైన భార్య, చెప్పినట్లు వినే పుత్రుడు, సంపాదనకు పనికివచ్చే విద్య!’ అని విదురుడు విశదీకరించాడు.
సమాజానికి ఎప్పటికీ పనికొచ్చే విధంగా ఉపదేశించిన విదురనీతులు అజరామరాలు. అందుకే భారతానికి ‘ధర్మశాస్త్రం’ అనే పేరు వచ్చింది!
ఎది సత్యం?

అందరూ నిజాన్ని, నిజాయతీని ఇష్టపడతారు. కాని, అది ఇతరుల్లో చూడాలనుకొంటారు. తమకు వర్తించదనుకొంటారు కొందరు. ‘సత్యమేవ జయతే’ సూత్రం పాటిస్తున్నామంటూ అబద్ధం తప్ప పొరపాటునైనా నిజం చెప్పరు కొంతమంది.
అపనమ్మకానికి పునాది అబద్ధమే. అబద్ధాలు చెప్పడం కూడా అపరాధమే. ఆధ్యాత్మిక దృష్టిలో అసత్యం మహా పాపం. ఎందుకంటే, అసత్యానికి, మోసానికి ఆట్టే తేడా లేదు. మోసానికి పెట్టుబడి అబద్ధాలే.
సత్యహరిశ్చంద్రుడు సత్యదీక్ష కోసం ఎన్ని కష్టాలైనా పడ్డాడు కాని, ఒక్క అబద్ధం కూడా ఆడలేదు. ఇప్పటి కాలంలో కొందరు ఒక్క నిజం కూడా చెప్పరు. దొంగ సాక్ష్యాలన్నీ అబద్ధాల సంపుటులే.
ఆధ్యాత్మిక రంగంలో ‘ఏది సత్యం?’ అనే ప్రశ్నకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దానికి అనుబంధ ప్రశ్న ‘ఏది నిత్యం?’. ఏది సత్యమో అది నిత్యం అంటారు వేదాంతులు. భగవంతుడే సత్యస్వరూపుడంటారు. ‘సత్యమేవ జయతే’- అంటాయి ఉపనిషత్తులు. అంటే, దైవ సంకల్పానికి విజయం నిశ్చయం! వాక్కులతో ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆత్మకు అసలు నిజం తెలుసు. మనోవేగం కన్నా దైవజ్ఞాన వేగమే చాలా ఎక్కువంటారు. జరిగినవి, జరుగుతున్నవి మాత్రమే మనిషికి తెలుసు. జరగబోయేదీ భగవంతుడికి తెలుసంటారు. దీనినే త్రికాల జ్ఞానంగా చెబుతారు. మహర్షులు త్రికాల వేదులు. అందుకే వారు దైవ సమానులు. భగవంతుడితో మహర్షులు, దేవర్షులు పూజలందు కొంటారని పురాణ ఇతిహాసాల్లో చదువు తుంటాం. లోకకల్యాణం తప్ప వారికి ఇతర స్వార్థాలు ఉండవు. వసిష్ఠ, కశ్యప, నారద మునీంద్రులు ఈ కోవకు చెందినవారు.
‘సత్యం’ అనే ఇరుసు మీదనే లోకాలు పరిభ్రమిస్తున్నాయి. సుదర్శనమే లోకచక్రం. స్థితి కారకుడైన విష్ణువు సుదర్శనంతోనే లోకకంటకులను సంహరిస్తాడంటారు.
ఆగ్రహంలోనూ నిగ్రహం చూపగలవారే మహర్షులు. విశ్వా మిత్రుడు ఆగ్రహంతో తన నూరుగురు కుమారులను అంతం చేసినా, వసిష్ఠుడు విశేషమైన నిగ్రహం చూపాడు. అందుకే ఆయన బ్రహ్మర్షి కాగలిగాడు.
ప్రకాశవంతంగా సూర్యుడు వెలిగే వేళ మబ్బు కప్పినంతలో సూర్యుడు లేడనుకోగలమా? మనం మాయ ప్రభావంలో ఉన్నామని గ్రహించగలిగితే మనం చూసేది సత్యం కాదని తెలుస్తుంది. ‘ఏది సత్యం’ అనే ప్రశ్నతో శోధన చేస్తే, మన కృషి తీవ్రతను బట్టి సమాధానం దొరుకుతుంది.
మమకారమే ఆధ్యాత్మిక ప్రయాణానికి అడ్డుగోడ. అభిమన్యుడి మరణంతో కుంగిపోతున్న అర్జునుడికి సత్యబోధ చేస్తాడు శ్రీకృష్ణుడు.  చంద్రుడి కుమారుడిగా అభిమన్యుణ్ని చెబుతాడు. మరణానంతరం అభిమన్యుడితో అర్జునుడు సంభాషించే సన్నివేశాన్ని కృష్ణుడు కల్పించినప్పుడు- ‘నీవెవరో నాకు తెలియదన్నా’డంటారు. అర్జునుడి భ్రమ తొలగిపోవడం అక్కడ ప్రధానాంశం.
కేవలం పరమాత్మ ఒక్కడే సత్యం, నిత్యం. అందుకే గీతాకృష్ణుడు ‘మరే ఆలోచనలూ లేకుండా నన్ను మాత్రమే ఆశ్రయించు. నిన్ను రక్షిస్తాను’ అంటాడు. దేని నుంచి రక్షణ? అసాధ్యమైన అష్టవిధ మాయల ప్రభావం నుంచి అని మనం గ్రహించాలి.
గీతాబోధ అర్జునుడి కొరకే అనుకోకూడదు. మనందరికీ అని అర్థం చేసుకుంటే గీతా  ప్రయోజనం సిద్ధిస్తుంది.
సత్య దర్శనం!

నమ్మకం ఒక అయస్కాంత శక్తి. ‘దేవుడు వున్నాడు’ అన్న విశ్వాసమే ఆధ్యాత్మిక కార్యక్షేత్రంలో ఎంతటి ఘనతనైనా సాధించేలా చేస్తుంది.ఏ కార్య నిర్వహణలోనైనా సమష్టితత్త్వం, పరస్పరాధారిత విధానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ‘విపత్కర పరిస్థితులు’ ఏర్పడినప్పుడు జాతి మొత్తంగా ఒక్కతాటిపై నిలిచి వాటిని అధిగమించాలి. మనిషికి ఆరోగ్యవంతమైన జీవితమే ఉన్నతం. క్రమశిక్షణాయుతమైన జీవితం వ్యక్తిగత, సమష్టి అలవాట్లు, ఆలోచనలు, కార్యాచరణలలో నిబద్ధతను పాటించడం వంటి వాటివల్ల మాత్రమే అది సాధ్యపడుతుంది. కట్టుబాట్లతో కూడిన అలవాట్లను సమాజంలో ప్రతిష్ఠించేందుకు సనాతన సంప్రదాయం వేదమంత్రాలను, సూక్తాలను వాడుకున్నది. వీటిలో శాంతిమంత్రాలు ప్రముఖమైనవి. వాటిలో ‘ఐతరేయ ఉపనిషత్తు’లోని ‘శాంతిమంత్రం’ ఒకటి. ‘మంత్రం’ అంటే మననం చేసేవారిని రక్షించేది.

ఓం వాజ్ఞ్మే మనసి ప్రతిష్ఠితా/ మనోమే వాచి ప్రతిష్ఠితా/ మావిరావీర్మ ఏధి/ వేదస్య మ ఆణీస్థః/ శ్రుతం మే మా/ ప్రహాసీరనేనా ధీతేనాహో రాత్రాన్‌/ సందధామృతం వదిష్యామి/ సత్యం వదిష్యామి! తన్మావవతు/ తద్వక్తారమవత్వవతు/ మామవతు వక్తారమవతు వక్తారమ్‌/ ఓం శాంతిః శాంతిః శాంతిః’. ‘నా వాక్కు మనసులో ప్రతిష్ఠితమగుగాక. మనస్సు వాక్కులో ప్రతిష్ఠితమగుగాక’. ఇక్కడ వాక్కును వ్యష్టిగా తీసుకుంటే మనస్సు సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. వాక్కు, మనస్సు ఏకమవడం వల్ల కార్యం ప్రకాశితమవుతుంది.

‘ప్రకాశమవడం’ అంటే ‘సాక్షాత్కారమవడమే’. ఏదైతే ప్రకాశిస్తుందో అదే జ్ఞానం, అదే పరమాత్మ సాక్షాత్కారం. అలా సాక్షాత్కరించిన పరమాత్మను, ‘ఓ పరమాత్మా! నాలో ప్రకాశించెదవుగాక’ అని సాధకుడు వేడుకుంటున్నాడు. అలా ప్రార్థించడం అంటే ‘సత్యం బోధపర్చుకోవటమే’. వేదం అంటే తెలుసుకోవడం.

ఏది తెలుసుకోవడానికి యోగ్యమైందో, దేనివల్ల మన సమాజానికి శ్రేయస్సు కలుగుతుందో దానిని తెలుసుకోవడమే వేదజ్ఞానం. ‘ఆ శ్రేయస్కరమైన ఆలోచనలు నిరంతరం మనస్సులో నిలిచి పోవాలని’ సాధకుడు ప్రార్థిస్తున్నాడు. ‘దేనికి స్పందిస్తామో, దేనిని ఆలోచిస్తామో, దేనిని పలుకుతామో, దేనిని ఆచరిస్తామో అది శ్రేయస్కరమైందై నన్ను వీడకుండుగాక’. దేనిని ‘మనసా వాచా కర్మణా’ నమ్ముతామో దానిని స్మరిస్తాం. దేని స్మరణ మన ప్రగతికి, సుగతికి ఉపకరిస్తుందో దానిని మాత్రమే వినాలని, స్మరించాలని సాధకుడు భావిస్తున్నాడు.

‘నేర్చుకున్న దానిని నేను రేయింబవళ్ళూ యోచించెదనుగాక. బుద్ధికి గోచరమైన వ్యావహారిక సత్యాన్ని పలుకుదునుగాక. పారమార్థిక సత్యాన్ని పలుకుదును గాక’. ‘ప్రపంచావిష్కరణలో ముందుగా ఋతం, సత్యం ఉత్పన్నమైనవని’ శాస్ర్తాలు చెబుతున్నాయి. ‘ఋతం’ అంటే ‘ప్రాకృతిక నియమాలు’. ఇది వ్యావహారిక సత్యం. దేశకాలమాన పరిస్థితులకు అతీతంగా సర్వకాలీనం, సర్వజనీనం, సహజం, అవ్యక్తమైన ప్రకృతే సత్యంగా పిలువబడుతుంది. అదే భగవంతుడు. ఇది పారమార్థిక సత్యం. ‘సూర్యుడు ప్రతి నిత్యం తూర్పున ఉదయిస్తాడు, పశ్చిమాన అస్తమిస్తాడు’. ఇది వ్యావహారిక సత్యం. కానీ, నిజానికి సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. ఇది పారమార్థిక సత్యం. ప్రాకృతిక స్పందనల ద్వారా పొందిన విజ్ఞానం ధర్మాచరణకు దోహదపడితే ‘సత్యదర్శనం’ అవుతుంది.

సుప్తచేతనాత్మకమైన మనసుకు ఇచ్చుకునే సూచనలు ఎంత బలంగా ఉంటే మన ఆశయం అంత బలంగా సిద్ధిస్తుంది. చేతనాత్మక, సుప్తచేతనాత్మక మనసుల మధ్య పరస్పర సంబంధాలు ఎంత బలపడితే అంత ప్రభావవంతంగా కార్యావిష్కరణ జరుగుతుంది. నిజానికి ప్రతి ఆలోచనా ఒక కారణం కాగా ప్రతి స్థితీ ఒక కార్యం. ఆకృతి ఉంటేనే దానికి ప్రయోజనం ఉంటుంది. మానసిక ప్రపంచంలో రూపం ఏర్పడితేనే అది దాని కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. నిజానికి మానసిక ప్రపంచంలో ఒక రూపం ఏర్పడాలంటే అది నిజంగా ఉన్నట్లుగా మనం భావించాలి. ఎంత బలంగా భావించి, దర్శించగలిగితే ఆశయసాధనకు అంత దగ్గరగా వెళతాం. ‘నాకిది కావాలని’ కోరుకుంటాం. నిజంగా అది సాకారం కావాలంటే మన ప్రయత్నం పరిపూర్ణంగా ఉండాలి. కల్పన, నమ్మకం రెండు రెక్కలున్న పక్షి అనుకొంటే, ఆ ఊహనే మనం ‘ఆశయం‘ అనుకోవచ్చు. ఇది బలంగా ఉన్నచోటనే లక్ష్యం నిలుస్తుంది. మంత్రార్థాన్ని భౌతికంగా కాకుండా, దాని అంతరంగాన్ని గ్రహించి నియమిత అంతరాలలో ఆయా సూచనలతో అంతర్మనస్సును బలోపేతం చేయడం వల్ల ఎంతటి లక్ష్యాన్నయినా, ఏ వ్యాధినైనా జయించగలం.
నమ్మకమే అత్యున్నత శక్తి!
‘మననం చేయడం’ అంటే నిరంతర స్మరణ. దానివల్ల అంతర్మనస్సు అవసరమైన జ్ఞానాన్ని పొందుతుంది. బలమైన సంకల్పంతో కూడిన జ్ఞానం సత్కార్యాన్ని ఆవిష్కరిస్తుంది. వీటినే ‘ఇఛ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు’గా చెబుతారు. ఇవే వాక్కుకు, మనస్సుకు, శరీరానికి (మనస్సు ఆలోచనకు, వాక్కు జ్ఞానానికి, శరీరం ఆచరణకు) ప్రతీకలుగా నిలుస్తాయి. శ్రద్ధతో ప్రార్థించడం అంటే ఇనుముకు అయస్కాంత శక్తిని సమకూర్చడం వంటిది. ఈ అయస్కాంత శక్తినే నమ్మకం (విశ్వాసం) అంటున్నాం. ‘నమ్మకం’ ఉంటేనే ఏదైనా సాధించగలం. దీనిని కోల్పోతే అనామకులుగా మిగిలిపోతాం. భావన, అనుభూతి, శక్తి, సామర్థ్యం, ప్రేమ, సౌందర్యం... వీటి అంతరంగ శక్తిని ఊహించి, వినియోగించుకోగలిగితే అత్యున్నత ఫలితాలు ఆవిష్కారమవుతాయి. ఇది ఫాంటసీ కాదు. ఉదా॥కు మనం ఆక్సీజన్‌-హైడ్రోజన్‌లను 1-2 నిష్పత్తిలో కలిపితే నీరు వస్తుంది. ఇదేదో యాదృచ్ఛికం కాదు. ఎన్నిమార్లు కలిపినా ఆ మిశ్రమం అలా నీటినే ఇస్తుంది.
మీరు ఏ ఊర్లో ఉన్నా, మీ ఇంట్లోనే ఉంటూ, మీకు నచ్చిన సమయములో, మీ మొబైల్ ఫోన్ ద్వారా భగవద్గీతను ఉచితముగా నేర్చుకునేందుకు వీలుగా భగవద్గీత 18 అధ్యాయములు, 700 శ్లోకములను అర్ధాలతో సహా రికార్డ్ చేసి వెబ్ సైట్ లో పెట్టాము. మీరు చేయవలసిందల్లా http://learnbhagavadgitaonline.org అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి, మీ భగవద్గీత పుస్తకమును తెరచి, 1వ అధ్యాయము 1వ శ్లోకము నుండి మొదలు పెట్టి, రోజుకి పది శ్లోకములను అర్థాలతో సహా నేర్చుకోండి. 70 రోజులలో మీరు భగవద్గీత 700 శ్లోకములను చదవగలుగుతారు. భగవద్గీతను చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. ఎంతోమంది భగవద్గీతను నేర్చుకోవాలి అనుకున్నా నేర్పించేవారులేక నేర్చుకో లేకపోతున్నారు. దయచేసి ఈ మెసేజ్ ను వాళ్ళందరికీ అందేటట్టు చేయండి.
మృదు భాషణం


నిండైన నది నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది. పిల్లకాలువలుగా చీలి గులకరాళ్ల మీద ప్రవహిస్తున్నప్పుడు గలగలమంటూ శబ్దాలు చేస్తుంది. నీళ్లతో నిండుగా ఉన్నప్పుడు కుండ తొణికిసలాడదు. ఇలాంటి ఉపమానాలు మనిషికి ఎన్ని చెప్పినా మాట్లాడాలనుకున్నది అతడెప్పుడూ మాట్లాడటం మానడు. భావ వ్యక్తీకరణకోసం భగవంతుడు అతడికిచ్చిన మహత్తరమైన శక్తి- మాట. సృష్టిలో మరేజీవిలోనూ అది కనబడదు. మనసులోంచి వచ్చేదిలా ఆ మాట ఉండాలి. మంచి అభిప్రాయం అనిపించాలి. అందరినీ ఆలోచింపజేయాలి. ప్రయోజనం కలిగించగలదై ఉండాలి.
గీతలో భగవంతుడు మనిషికి ఆహ్లాదకరంగా మాట్లాడటం నేర్చుకొమ్మని చెబుతాడు. రెచ్చగొట్టి, ప్రలాపాలుగా అనిపించే మాటలు వద్దన్నాడు. అటువంటి మాటలు తనకు వినిపించిన తక్షణమే స్పందించవద్దన్నాడు. సత్యాన్ని ప్రతిబింబించేవి, ప్రియమైనవి, ఎదుటి వ్యక్తి హితాన్ని కోరేవిలా మాటలుండాలన్నాడు. ఆ విధంగా మాట్లాడగలవాడిని ‘వాక్‌ తపస్వి’ అన్నాడు. మృదుభాషణం మనుషులందరిలో  కనిపించాల్సిన లక్షణంగా శాస్త్రాలన్నీ గుర్తించాయి. వేదాంతి అరిస్టాటిల్‌ విశ్వసనీయత గోచరించేలా మాట్లాడితే అవి మానవ స్వభావాన్నే మార్చగలవంటాడు. పరస్పరం అవిశ్వాసం కలిగించే మాటలే మనుషులొకరినొకరు చూసి భయపడటానికి కారణ మన్నారు గాంధీజీ.

మనిషి తనను తాను సమర్థించుకునేందుకు మాట్లాడు తున్నానని ఎవరికీ అనిపించనీయ కూడదు. అదే ఉద్దేశమైతే అతడు మాట్లాడకుండా ఉండటమే మంచిది. కొన్ని మాటలు వింటున్నప్పుడు మధురమైనవిగా, సందేశమేదో అందజేస్తున్నవిగా అనిపించినా అందులో అంతర్లీనంగా విషం, వ్యర్థాల వంటివి దాగి ఉండవచ్చు. అనుభవంతో కానీ అర్థంకాని విషయమది. ఆ విధంగా మాట్లాడే మనుషుల్ని నీతిచంద్రిక కర్త చిన్నయసూరి పయోముఖ విషకుంభాలన్నాడు.
ఆచితూచి మాట్లాడటం అందరికీ చేతకాని అభ్యాసం. మాట నేర్పు ఉన్నవారినే మహారాజులు రాయబారులుగా, మహామంత్రులుగా నియమించుకునేవారు. రామాయణంలో హనుమంతుడు, భారతంలో విదురుడు, సంజయుడు, కృష్ణరాయల అమాత్యుడు తిమ్మరుసు... అటువంటి మాటకారులే.
మంచి ముత్యాలనిపించే మాటలెప్పుడూ మెరుస్తూనే ఉంటాయి. అవి పండితులకైనా పామరులకైనా శాశ్వతంగా వినపడతాయి. వ్యక్తులు, వ్యవస్థలను విమర్శించడమొక్కటే లక్ష్యం కాకుండా, ఛలోక్తులతో నర్మగర్భంగా, లోకజ్ఞానాన్ని ప్రస్ఫుటించే పొడుపు కథలు ఉపమానాలతో మాట్లాడిన మాటలు, ఆత్మవిమర్శకు అవకాశమివ్వటమే కాక, కాలపరీక్షకు సైతం నిలబడతాయి. శబ్దాడంబరంతో పాండిత్యాన్ని ప్రదర్శించాలనుకుంటే పొరపాటే అవుతుంది. వాగ్ధాటితో నిజాన్ని వక్రీకరించేవారు వక్తలనిపించుకోలేరు. నిజాన్ని క్రమబద్ధీకరించేందుకు చెప్పేవైనప్పుడు మాటలు వ్యక్తిత్వానికి వన్నెతెస్తాయి.
భర్తృహరి ‘వాగ్భూషణమే సుభూషణం’ అని నిర్ద్వంద్వంగా చెబుతాడు.
మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడకపోవటమూ మహాపరాధమే. ధృతరాష్ట్రుడు అవసరమైనప్పుడు నోరు మెదపకుండా ఉండటం మహాభారత యుద్ధానికి ముఖ్యకారణమని విశ్లేషకుల అభిప్రాయం.
వాక్‌ స్వాతంత్య్రంతో మనిషికి వచ్చే స్వతంత్రం ప్రత్యేకమైనదైనా నిజాన్ని నిర్భయంగా చెప్పడానికే అది ఉన్నదని మనుషులు గ్రహించాలి. మాటకు మంత్రానికుండే ప్రభావం ఉంటుంది. అది వరమిచ్చేదిలా ఉండాలి కానీ శాపమిచ్చేలా ఉండకూడదు. మనుషులను కలపాలి కానీ విడదీయకూడదు. ఆ గ్రహింపు ఉంటే మనుషులంతా మంత్రద్రష్టలవుతారు!
ధర్మ నిధులు


ధర్మ స్వరూప నిరూపణం, కర్తవ్య నిర్వహణం, భవబంధ విమోచనం అనే మూడు అంశాలూ మానవ ధర్మానికి మూడు స్కంధాలు. వీటిలో మొదటిదానికి మహాభారతం, రెండోదానికి రామాయణం, మూడోదానికి భాగవతం దర్పణాలుగా పండితులు భావిస్తారు. భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మలు, జీవధారలూ అయిన గ్రంథరాజాలు ఇవి. మానవ జాతికి సంస్కారాన్ని అందించే ఈ గ్రంథాల్లో సనాతన ధర్మం ప్రతిష్ఠితమై ఉంది. ఈ మూడు గ్రంథాల గమ్యం వేదప్రతిపాదనం. వేదమనే అంతర్యామితత్త్వానికి దేహేంద్రియ మానసాల్ని కల్పించి మూర్తిమత్వాన్ని పరికల్పించడమే ఈ మూడు గ్రంథాల పరమార్థం. వేదవేద్యుడైన పరమ పురుషుడు నరుడిగా ఎలా ప్రవర్తించాడో తెలిపేది రామాయణం. వేదాన్ని సమగ్రంగా మథనం చేసి ధర్మామృతాన్ని ఇచ్చింది మహాభారతం. భౌతిక జీవితం పొందిన జీవుడు నారాయణుడిగా వెలిగి, వెలిగించడానికి భావైక గమ్యమైన సులభ భక్తి మార్గాన్ని ఉపదేశిస్తుంది భాగవతం. వీటిని ప్రసాదించిన వాల్మీకి, వ్యాస మహర్షులు వేదావతారమూర్తులు.
సమస్త విశ్వంలో వ్యక్తి తాదాత్మ్యం చెందే స్థితిలో రామాయణ మహాకావ్యం ఆదికవి హృదయం నుంచి ఆవిర్భవించింది. తపస్వి వాల్మీకి సర్వమానవ జగత్కల్యాణానికి ఉపకరించే సద్గుణ సముపేతుడైన వ్యక్తి ఉన్నాడని నారదుడి ద్వారా తెలుసుకొని ఆ వ్యక్తి దృక్పథాన్ని ఉదాత్త రీతిలో హృదయాకర్షక కథనంగా చెప్పడానికి సంకల్పించాడు. ఈ భూమ్మీద నదులు, పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం లోకంలో రామాయణం స్థిరంగా నిలిచి ఉంటుందని బ్రహ్మ వాల్మీకిని ఆశీర్వదించినట్లుగా పండితుల వాక్కు. మంచిచెడుల సంఘర్షణ శ్రీరాముడి ప్రయాణం వెనక అంతర్లీనంగా గోచరిస్తుంది. దైవాంశను తనలోనే దాచుకొని విశ్వప్రేమ సుగంధాన్ని, ప్రేమను, కరుణను చుట్టూ ఉన్న ప్రపంచానికి పంచిపెట్టిన ధీరోదాత్తుడు శ్రీరాముడు. జీవితంలో అన్ని కోణాలకూ వర్తించిన శాశ్వత విలువలు కలిగిన విశ్వకావ్యం రామాయణం.
కృష్ణ ద్వైపాయనుడనే వ్యాసుడు భారతీయ సంస్కృతీ ప్రాసాదానికి మూలస్తంభం. వేదాలు బోధించే ధర్మాధర్మాల్ని సామాన్య మానవులకు అర్థమయ్యేటట్లు చెప్పడం కోసమే కౌరవ పాండవ కథా కథన వ్యాజంతో మహాభారతం రచించాడు. అందుకే భారతం పంచమ వేదంగా ప్రశంసలందుకొంది. మహాభారతం విజ్ఞాన సర్వస్వం. వ్యాసమునీంద్రులు దర్శించిన భారతం భారతీయ తత్వ సమగ్ర దృష్టి. విశ్వవాఙ్మయంలో ఇంతగా మానవ హృదయాన్ని మధించి వివిధ రీతుల్లో విస్తృతంగా చిత్రించిన కావ్యం మరొకటి లేదు. అన్ని కాలాలకు, అన్ని దేశాలకు ఉపయోగించే ధర్మాలు భారతంలో ఉన్నాయి. బహువిధ సంకీర్ణమైన మానవత్వ భావగతుల్ని అద్భుతంగా చిత్రించింది భారతేతిహాసం.
భగవంతుణ్నీ భక్తుణ్నీ సంధానించేది భాగవతం. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక తత్త్వాల స్వరూప స్వభావాల కూడలి, నిరాకారమైన భక్తికి సాకారమైన కథనం భాగవతం. భక్తికి, ముక్తికి ప్రాణాధారమైనది భాగవతం. భాగవత పఠనం మనిషిని శాంతచిత్తుణ్ని  చేస్తుంది. రామాయణం కావ్యమని, భారతం ఇతిహాసమని, భాగవతం పురాణమని స్థూలమైన అవగాహన. ఈ మూడు గ్రంథాలూ మానవ జాతిని అనుగ్రహించడం మొదలుపెట్టి ఎన్ని వేల సంవత్సరాలయిందో! ఈ జాతి వారసత్వ సంపదగా ఈ అక్షర సౌధాలు నిత్య నూతనంగా ప్రకాశిస్తూనే ఉంటాయి.
ఆశావహ జీవితం


పుట్టిన ప్రతి ప్రాణికీ పూర్తికాలం జీవించాలన్న కోరిక ఉంటుంది. చరాచరాలకూ అలాగే ఉంటుంది. చెట్టును కాండం మొదలు వరకు నరికినా అది మళ్ళీ చిగురించాలన్న కాంక్షతో ఉంటుంది. నిత్యం పారే నదికి ఓ కొండ అడ్డుపడ్డప్పుడు అది కొద్దిసేపు ఆగి సేదదీరుతుంది. పల్లం ఎటువైపుందో తెలిసేదాకా నిరీక్షిస్తుంది. ఆ తరవాత దారి చూసుకొని ముందుకు ప్రవహిస్తుంది.
అడవిలో మొలిచే మొక్కలకు నీళ్లు పోసేవారెవరూ ఉండరు. అలాగని అవి నిరాశకు లోనుకావు. వర్షాల ఆగమనానికై ఆశగా ఎదురుచూస్తాయి. వీలుకానప్పుడు పులి కూడా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది. దానికీ మరణభయం ఉంటుంది. ఆయుష్షు తీరేదాకా బతకాలన్న బలమైన వాంఛా ఉంటుంది.
ఒక్కోసారి వెనక్కి రావడమూ ముందుకు పోవడంలో భాగం అవుతుంది. వాస్తవానికి అది సార్వజనీనం! జీవన పయనం- ఏ దిశలో సాగుతోంది అన్నది ముఖ్యం కాదు. అది ఆరోహణా భావనతో ఉందా లేదా అన్నదే ప్రధానం. జీవచైతన్యానికి నిర్విరామంగా విస్తృతం కావడమే తెలుసు. ఆ సహజాతి సహజ గమనం పటాటోప ప్రదర్శన కాదు. ఎవరి మెచ్చుకోలు కోసమో చేసే పని అంతకన్నా కాదు.
పశు పక్ష్యాదులు, ఎడారుల్లో సంచరించే జీవులు, ఉభయచరాలు ఎంతో ఓర్పు, సహనంతో కాలం వెళ్ళ బుచ్చుతాయి. మున్ముందు కాలం అనుకూలంగా ఉంటుందన్న ఆశతో ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకొని జీవిస్తాయి. జీవకోటిలో తెలివితేటలున్న మనిషి మాత్రం అనుకున్నదే తడవుగా ఫలితం వెంటనే కనబడాలని చూస్తాడు.
ఒక పేదవాడు తన ఇంటిముందు ఓ మొక్క నాటాడు. కొన్ని రోజులకు అది పెరిగి పెద్దదయింది. అది పండ్లు ఇచ్చి ఆకలి తీర్చుతుందని ఆశపడ్డాడు. చాలా రోజులు ఎదురు చూశాడు. కాని, అలా జరగలేదు. తగినంత ఆహారం అందక శరీరంతోపాటు మనసూ బలహీనపడింది. ఫలితంగా, అతడి నిరీక్షణ- కాలాన్ని మరింత పొడిగించిన భావన కలగజేసింది. విసుగు తెప్పించింది. కోరిక నెరవేరలేదని అతడిలో కోపాగ్ని రగిలింది. విచక్షణా జ్ఞానం కోల్పోయాడు. పూత, కాత రెండూ లేని చెట్టు ఎందుకని దాన్ని నరికివేశాడు. మరుసటి రోజు తెల్లవారి లేచి చూస్తే పడిపోయిన చెట్టుకు ఒక పువ్వు పూసి ఉంది. ఆ సన్నివేశం చూశాక అతడిలో దుఃఖం పొంగుకొచ్చింది. ఆ చెట్టును పట్టుకుని విలపించాడు. తొందరపడ్డానని బాధపడ్డాడు. జీవితం ఇలాగే అనూహ్య తీర్పునిస్తుంది. కారణం, అది నిత్యనూతనం. అందువల్లే ‘ఫలితం పని చేసేవాడి చేతిలో లేదు. అది కాలపురుషుడి నిర్ణయం’ అని గీత చెబుతుంది.
అనుకూలించని పరిస్థితుల్లో ఆకలిగొన్న జంతువు ఒకటి ఎత్తున ఉన్న కొమ్మ ఆకులు తిందామనుకుంది. అందుకోసం దాని పొట్టి మెడ సాచడం మొదలు పెట్టింది. కాళ్లూ పొడుగుంటే బాగుండేదని భావించింది. రోజూ దాని ప్రయత్నాలు సానుకూల వైఖరితో సాగేవి. కొంత కాలానికి దాని మెడ పొడుగ్గా సాగింది. కాళ్లూ పెద్దగా అయ్యాయి. అదే జిరాఫీగా రూపాంతరం చెందింది. మానసిక భావాలకు అనుగుణంగా శరీరం స్పందిస్తుంది. అది ప్రాకృతిక నియమం. అమీబా నుంచి చింపాంజీ దాకా జరిగిన జీవ పరిణామ క్రమంలో ‘ఆశావహ దృక్పథం’ కీలకం. అందువల్లే, ‘యద్భావం తద్భవతి’ అన్నారు వేదాంతులు. ‘నీ ఆలోచనే(సంకల్పం) నువ్వు’ అని బుద్ధుడూ ప్రబోధించాడు. దుందుడుకు వైఖరితో ఏ ప్రయోజనాలూ సిద్ధించవు. సానుకూల ధోరణితోనే మానవుడు ముందుకు వెళ్ళగలడు!
మహిత గుణ సంపద

శరీరానికి గుణాలకు ఎంతో అంతరం ఉంది. శరీరం క్షణ భంగురం. గుణాలు ఆకల్పాంతం నిలిచే ఉంటాయి- హితోపదేశంలోని ఒక శ్లోక భావం ఇది గుణాల వల్ల కలిగే కీర్తి చరిత్రలు నాశనం లేనివని అర్ధం సద్గుణ సంపత్తి గలవారి జీవితాలు ఎల్లప్పుడూ సమాజానికి అనుసరణీయమే. మహానుభావుల మంచి గుణాలను, మహిత చైతన్యాన్ని శక్తి మేరకు అనుసరించి ఆ స్ఫూర్తితో జీవించడం ఆవశ్యకమైన లక్షణం. అటువంటి ఆదర్శ జీవన విధానం వల్ల జాతి, దేశం, సంప్రదాయం, సంస్కృతి, జీవనవికాసం సురక్షితమవుతూ ఉంటాయి.

మహాకవులు మహాపురుషుల జీవితాలను ఉజ్వలంగా చిత్రించి భావితరాలకు వెలుగుబాటలు పరిచారు. సంస్కృత సారస్వత ప్రపంచంలో కవికుల గురువు కాళిదాసు. ఆయన కావ్యాల్లో రఘువంశం ప్రసిద్ధమైంది. ధర్మరక్షకులైన రఘువంశ ప్రభువుల చరిత్రల్ని ఉదాత్తంగా చిత్రించి ఆ ఆదర్శ జీవన క్రమాన్ని కాళిదాసు పాఠకులకు బోధించాడు. రఘువంశ రాజుల్లో దిలీపుడి సేవాపరాయణతను, రఘు మహారాజు దాననిరతిని, అజుడి కోమల స్వభావాన్ని, శ్రీరాముడి ఆదర్శ జీవితాన్ని సర్వోత్తమంగా చిత్రించాడు. కావ్యారంభంలో కాళిదాసు రఘువంశీకుల ఉదాత్త గుణాలను పేర్కొని, అవి తనను వారి చరిత్ర రాయడానికి ప్రేరేపించాయని తెలిపాడు. దానం చేయడం కోసం ధనం సంపాదించడం, సత్యం కోసం మితంగా మాట్లాడటం, కీర్తి కోసం శత్రువులను జయించడం పితృరుణ విముక్తికి సాధనమైన సంతానం కోసం వివాహం చేసుకోవడం ఆనే గుణాలు కలిగినవారిగా సూర్యవంశ ప్రభువుల్ని వర్ణిస్తాడు. కాళిదాసు. ఈ లక్షణాలు ఏ కాలంలోనైనా మానవ సమాజానికి

వర్తిస్తాయి మనిషి ధనం సంపాదించాలి కాని అత్యాశతో కాదు కూడబెట్టాలన్న తపనతో కాదు. మన ఆర్డన, వ్యయం రెండూ దర్మబద్ధంగా ఉండాలి. అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఆలోచన ధనం సంపాదించేవారిలో కలగాలి. తమ రాజ్యంలోని పేదలకు కూడు, గుడ్డ, గూడు కల్పించవలసిన బాధ్యత పాలకులపై ఉంది. నేటి అంతర్యామి పాలకులే కాదు, సంపన్నులందరూ ధనం ప్రయోజనం త్యాగమని గుర్తుంచుకోవాలి. ఎంత మితంగా మాట్లాడితే అంత మేలు. సాధారణంగా తక్కువగా మాట్లాడినప్పుడు సత్యమే పలకగలం. మితవాక్యం హితవాక్యం కావాలి. వాచాలత్వం అసత్యాలకు, అనౌచిత్యాలకు నెలవు కావచ్చు.

పూర్వం రాజులు కీర్తికాంక్షతో శత్రువుల్ని జయించేవారు. ఆధునిక ప్రపంచంలోనూ స్పర్థలంటాయి. ఆరోగ్యకరమైన పోటీవల విద్యలు వర్ధిల్లుతాయి. జిజ్ఞాసతో పాండిత్యాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించుకొని తనను మించినవారిని గెలవాలనే పట్టుదల వాంఛనీయమే. ఇది కుటిల ప్రయత్నాల వల్ల కాక సక్రమ పద్ధతిలో జరగాలి. కామం ఒక పురుషార్ధం. అది అతి శక్తిమంతమైంది. కామ తృప్తికి వివాహమే ఉత్తమ మార్గం. శారీరక సుఖం కాక సంతానోత్పత్తిని వివాహ పరమార్ధంగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. భారతీయ జీవన వ్యవస్థలో గృహస్థాశ్రమం చాలా శ్రేష్టమైనది. తన పూర్వీకుల పరంపరను తన ద్వారా మరో తరానికి అందించడం ప్రకృతి ధర్మం. తన వారసత్వంగా ఇంకొక తరాన్ని సృష్టించడం వల్ల పితృ రుణం నుంచి విముక్తులవుతారని రుషుల సందేశం

త్యాగం, సత్యభాషణం, కీర్తి, కాంక్ష, సంతాన సృష్టి అనే ఈ నాలుగు భావనలూ చాలా ఉత్కృష్టమైనవి. మహా కవులు ఎవరికి ఆపాదించి చెప్పినా ఆ గుణాలు లక్షణాలు మొత్తం మానవ జాతికి అనుసరణీయమని వారి దృష్టి క్రాంతదర్చులైన కవుల వాక్కులు సర్వ కాలాలకు, సకల జనులకు శిరోధార్యం. ప్రాచీన వాంగ్మయం అందించే అమృత సందేశం విస్మరించరానిది
సామజ వరగమనా!

సామజ వరగమనా అంటే శ్రేష్టమైన ఏనుగు నడక వంటి నడకగలవాడా! అని

అర్ధం. త్యాగరాజు స్వామివారు శ్రీరామచంద్రమూర్తిని కీర్తిస్తూ గానం చేసిన కృతి ఇది ఎంతటివాడైనా తనను మించిన స్వామి భక్తుడు లోకంలో లేడన్న ఆహంభావం ఇసుమంతైనా ఉన్నా వారిని భగవంతుడు క్షమించడు. భక్తుడి ఆర్తికి, నిష్కామమైన స్మరణకు ప్రసన్నుడయ్యేవాడు పరమాత్మ. భక్తిలతలు తప్ప మరేమీ ఆయనను బంధించలేవు. భక్తిలో ఆర్తి ఉండాలి. చిత్తశుద్ధి, ఏకాగ్రత ఉండాలి. శరణాగతి ఉండాలి. 'నీవే తప్ప ఇత:పరంబెరుగ' అని గర్వం సర్వం ఖర్వమై బలహీనుడై గత్యంతరం లేని నిస్సహాయ స్థితిలో పరమాత్మను నిండుమనసుతో ప్రార్థించినప్పుడు, దయ చూపని దైవముంటుందా? సాంసారిక విషయ పరిజ్ఞానం అందించే స్వాభావిక ప్రవృత్తి నిష్కామరూపంలో దైవోన్ముఖమైతే అదే భక్తి' అంటుంది భాగవతం గీతలో 'ఆర్తుడు, జిజ్లాసువు, అర్ధార్థి, జ్ఞాని అని నాలుగు విధాలైన భక్తులున్నారు నాకు' అంటాడు కృష్ణ పరమాత్మ భక్తిని నాదమార్గమని, రసమార్గమని రెండు విధాలుగా అభివర్ణించాడు నందదాసు. నిర్గుణోపాసనకు సగుణోపాసనే తొలి సోపానమని పేర్కొంటూ జీవుడికి బ్రహ్మకు భేదం లేదన్న అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించారు అది శంకరులు. బ్రహ్మను సగుణ నిర్గుణ ఉభయలక్షణ సమన్వితుడిగా దర్శించారు. రామానుజులు.

ఆనందో బ్రహ్మ' అనే సూత్రాన్ని దృడంగా విశ్వసిస్తున్నాయి. ఉపనిషత్తులు. ఇది భక్తి అన్న సంగతే తెలియక ఒకానొక తన్మయావస్థలో పిచ్చి ప్రేమ, మూడభక్తి, సమర్ప ణభావంతో ఆరాధించిన సాలెపురుగు. పాము, ఏనుగు, ఉడుత, పక్షి వంటి ప్రాణులకు సైతం కైవల్యం ప్రసాదించాడా కరుణామయుడు శబరి గుహుడు, అసురుడైన విభీషణుడు, వానరుడైన హనుమను అక్కున చేర్చుకుని ఆప్యాయత నందించాడు అంతర్యామి, బాల్య స్నేహానికి అమూల్య ప్రేమను కానుకగా ఇచ్చి, పిడికెడు అటుకులకే పొంగిపోయి అనంతమైన సిరి సంపదలు కుచేలుడికి ప్రసాదించాడా ఆపద్బాంధవుడు అపారమైన త్యాయ్ ధనకనక వస్తు వాహనాలకు తూగక, భక్తితో మహాసాధ్వి సమర్పించిన ఒక్క చిన్న తులసిదళానికే వశమైనవాడు వేణుమాధవుడు. అచంచల భక్తి తత్వాన్ని ఆకళింపు చేసుకుని పారవశ్యంలో పరమాత్ముడి నామస్మరణం చేసేవారికి మోక్షప్రాప్తికి అర్హత ఉంటుందని మీరా, తుకారాం, రామదాసు, క్షేత్రయ్యలు నిరూపించారు

సోక్రటీస్ శిష్యుడు ప్లేటో తన యధార్ధ జ్ఞానాన్వేషణ ద్వారా భగవంతుడి ఆస్తిత్వాన్ని తెలుసుకున్నాడు. దైవానుగ్రహం పొందాలంటే మానవుడు జీవితాంతం సత్కర్థులు చేస్తూనే ఉండాలని సందేశమిచ్చాడు అరిస్టాటిల్

ప్రేమ ద్వారా మాత్రమే దైవాన్ని తెలుసుకోగలమని ఖురాన్ కూడా చెబుతుంది. సర్వమతాలు ప్రేమ, సేవ, మానవీయతలనే మానవుడి పరమ లక్ష్యాలుగా ప్రబోధిస్తున్నాయి. విద్యార్థన, జ్ఞానార్థన, సంస్కృతీ సంప్రదాయాల పరిపోషణ ద్వారా భగవత్ శరణాగతి లక్ష్యంగా మనోవికాసం పొంది మోక్షార్హత సంపాదించుకోవాలని సూచిస్తున్నాయి. మానవాతీత మహోన్నత శక్తి రూపంలో పరమాత్మ ఈ విశ్వాన్ని పాలిస్తున్నాడు. ఆ శక్తి ముందు మానవుడితో సహా సకల ప్రాణికోటీ ఆల్బమైనదే. పరమేశ్వరుడు శరణాగతత్రాణ బిరుదాంకితుడు. ఎంతటి పండితుడైనా, పరమజ్ఞాని అయినా సర్వాంతర్యామిని శరణు వేడవలసిందే! నేను' అన్న ఆహం వీడి నిర్మల హృదయంతో 'సామజవరగమనా' అని వినమ్రతతో, విదేయతతో, అతుల భక్తితో అభిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడ్ని, ఆర్తత్రాణ పరాయణుణ్ని అర్చించడం, ఆరాధించడం, విశ్వసించడం వినా మానవుడికి మరో మార్గం లేదు. ఆ మార్గ ప్రయాణంలో మనకు సంతృప్తినిచ్చే విరామమే- మానవనేవ., భూతదయ. ధర్మవర్తన కరుణ. ఈ విరామమే రామదర్శనం చేయించగలుగుతుంది!
దివ్య సంపద

సంపదలన్నీ సుఖ సౌఖ్య సంతోషాలకేనన్న బలమైన అపోహ ప్రజల్లో ఉంది. ప్రాపంచిక సంపదలన్నీ చేతులు మారుతున్నవే తప్ప స్వయంసృష్టిగా చెప్పదగ్గవి తక్కువ. వంశానుగతంగా సంక్రమించే పూర్వీకుల ఆస్తులన్నీ ఇలా లభిస్తున్నవే.
అర్థశాస్త్ర గ్రంథకర్త చాణక్యుడు సంపదను కూడబెట్టడాన్ని వ్యతిరేకించాడు. ఏ రోజు ఆదాయం ఆ రోజుకు సరిపోతే చాలన్నాడు. అప్పుడు మనిషి స్వార్థమనే బోనులో బందీ కాడు.
రాజ్య నిర్వహణ కోసం పాలకుడు పటిష్ఠమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండాలని ‘శుక్రనీతి’ చెబుతుంది. కష్టార్జితమే న్యాయార్జితమని విదురనీతి శాస్త్రం బోధిస్తుంది.
ప్రపంచంలో అన్యాయార్జన కోసం ఆరాటపడేవాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. మాయాద్యూతంలో పాండవుల సంపదను దోచుకున్న దుర్యోధనుడు, సూది మోపిన స్థలాన్ని కూడా తిరిగి ఇవ్వనన్నాడు. అలా ఉంటుంది సంపద మీద వ్యామోహం. కానీ, వ్యామోహాల పర్యవసానాలన్నీ దుఃఖాంతంగానే ఉంటాయి. దుఃఖం తప్పదని తెలిసినా వ్యామోహాన్ని వదులుకోరు. ధృతరాష్ట్రుడి విపరీత పుత్రవ్యామోహం లోకప్రసిద్ధం.
మహాకవి భారవి తండ్రి తన పుత్రప్రేమను గుప్తంగా ఉంచుకుని, అందుకు కారణం కుమారుడి క్షేమమేనని చెప్పడం గుర్తుంచుకోదగిన చారిత్రకాంశం. సంతానం సాధించిన విజయాలను తండ్రి అభినందించి ప్రోత్సహించాలి. అతిగా పొగడకూడదు.
సంపద అంటే కేవలం ధనధాన్య వస్తువాహనాలు కావు. సరస్వతీ ప్రసాదాలుగా చెప్పుకొనే కళా సాహిత్య స్వరూపాలు కూడా. అక్షర సంపదలన్నీ అక్షయమే. కోటీశ్వరులు, మహారాజులు కూడా కవులకు, కళాకారులకు చేతులు జోడించక తప్పదు. లక్ష్మీ కటాక్షం కన్నా సరస్వతీ కటాక్షమే గొప్పదని రుజువైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని వారికి గండపెండేరం తొడిగినా, తన శ్రోత్రియత్వాన్ని పక్కనపెట్టి విశ్వనాథవారు కవికోకిల జాషువాను గండపెండేరంతో సత్కరించినా- అందుకు వారి అక్షర సంపదే కారణం.
తరతరాల సంపద ఆర్జించి వారసులకివ్వడంతో తమ కర్తవ్యం ముగిసిపోయిందనుకునేవారే ఎక్కువ. వారసులకు సంస్కారం, సంప్రదాయాలను కూడా ఇవ్వకపోతే, కొండంత సంపదైనా కళ్లముందే కరిగిపోతుంది. ఉత్తమ గుణాలు కలిగి ఉన్నవారికి ప్రాపంచిక సంపదల పట్ల ఆసక్తి ఉండదు. వారు అంతర్ముఖులై అంతర్యామిని ఆరాధించడంలో నిమగ్నులై ఉంటారు. దేహాన్ని కేవలం జీవన వాహనంగా భావిస్తారు. ఆత్మభావనతో జీవిస్తారు. చూసేవారికి వారు కాలాన్ని వ్యర్థం చేస్తున్నారనిపిస్తుంది. కానీ వారు జీవితానికి అర్థం చేకూర్చుకుంటున్నారని తెలియదు.
వాల్మీకి పుట్టలో కూచుని కాలం వ్యర్థం చేశాడా? శ్రీరమణులు, అరవిందులు, శ్రీరామకృష్ణులు ఏమీ సాధించలేదా? వారంతా దివ్య సంపదలు ఆర్జించారు. వాటిని ఆశ్రితులకు, జిజ్ఞాసువులకు ఉదారంగా పంచిపెట్టారు.
భారతదేశం దివ్యమైన ఆధ్యాత్మిక సంపదలకు నెలవు. ఎందరో మహానుభావులు తరతరాలకు సరిపడా దివ్య సంపదను వారసత్వంగా ఇచ్చారు. ఆ విషయాన్ని గుర్తించని వారంతా ప్రాపంచిక సంపదలకు ప్రాధాన్యమిస్తున్నారు. కొన్ని తరాలకు సరిపడా కూడబెట్టి వారసులకు ఇచ్చామని ఘనంగా భావిస్తున్నారు. కానీ, దివ్య సంపదను కోల్పోయామన్న గ్రహింపు లేకపోవడం ఒక జీవితకాలపు నష్టం.
శ్రీ మల్లికార్జున అష్టోత్తరశతనామావలిః

శ్రీశ్రీశైలక్షేత్రవిశిష్ఠతని... శ్రీమల్లికార్జునస్వామి భ్రమరాంబాదేవిల మహిమా విశేషాల్ని తెలిపే గ్రంథం శ్రీశైలఖండం, మల్లికార్జునస్వామివారిని షోడశోపచారాలతో పూజించాడు నందీశ్వరుడు. ఈ విషయం. ఆ పూజావిధానం ఉమాదేవికి మహేశ్వరుడు ప్రత్యేకంగా ఉపదేశించాడు కూడా. దీన్ని అనుసరించి భక్తులు తనను పూజించి శుభములు పొందమని ఆయన నిర్దేశం.

శ్రీశైలఖండంలో 44వ అధ్యాయంలో శ్రీమల్లికార్జున షోడశోపచార పూజావిధానమ్ అనే అధ్యాయంలో ప్రస్తుతం ఇక్కడ మీకందిస్తున్న శ్రీమల్లికార్జునస్వామివారి అష్టోత్తర శతనామావళి ఉంది. దీనిని మీరు కూడా పఠించండి. వినండి.. ఆయన అనుగ్రహానికి పాత్రులై తరించండి.

1. ఓం శివాయ నమః

2. ఓం సర్వేశ్వరాయ నమః

3. ఓం శంభవే నమః

4. ఓం శాశ్వతాయ నమః

5. ఓం చంద్రశేఖరాయ నమః

6. ఓం శంకరాయ నమః

7. ఓం పంకజాలోకాయ నమః

8. ఓం శూలపాణయే నమః

9. ఓం త్రిలోచనాయ నమః

10. ఓం కపర్దినే నమః

11. ఓం కరుణాసింధవే నమః

12. ఓం కాలకంఠాయ నమః

13. ఓం కలానిధయే నమః

14. ఓం విశ్వరూపిణే నమః

15. ఓం విరూపాక్షాయ నమః

16. ఓం త్యక్షాయ నమః

17. ఓం దాక్షాయణీపతయే నమః

18. ఓం విశ్వేశ్వరాయ నమః

19. ఓం విశ్వయోనయే నమః

20. ఓం విశ్వాత్మనే నమః

21. ఓం విశ్వరక్షకాయ నమః

22. ఓం విశ్వోద్భవాలయ

స్థైర్యవిధాయినే నమః

23. ఓం విశ్వమంగలాయ నమః

24. ఓం త్రిపురారయే నమః

25. ఓం త్రిలోకేశాయ నమః

26. ఓం త్రిధామ్నే నమః

27. ఓం త్రిగుణాశ్రయాయ నమః

28. ఓం గిరీశాయ నమః

29. ఓం గిరిశాయ నమః

30. ఓం శాస్త్రే నమః

31. ఓం శ్రుతివిదే నమః

32. ఓం గిరిజాపతయే నమః 34. ఓం సత్యాయ నమః 37. ఓం కపాలినే నమః

33. ఓం అంధకధ్వంసకాయ నమః

35. ఓం సత్యరూపిణే నమః 36. ఓం సురేశ్వరాయ నమః

38. ఓం కాలదర్పఘ్నాయ నమః

39. ఓం కుంజరాసురభంజనాయ నమః

40, ఓం పరమాత్మనే నమః
41. ఓం పరానందమూర్తయే నమః
42. ఓం పన్నగభూషణాయ నమః
43. ఓం పంచవక్తాయ నమః
44. ఓం పరబ్రహ్మణే నమః
45. ఓం పార్వతీశాయ నమః
46. ఓం పరాత్పరాయ నమః
47. ఓం పుణ్యమూర్తయే నమః
48. ఓం మహామూర్తయే నమః
49. ఓం దక్షిణామూర్తయే నమః
50. ఓం అవ్యయాయ నమః
51. ఓం భవాయ నమః
52. ఓం పరమకల్యాణనిధయే నమః
53. ఓం భవభయాపహాయ నమః
54. ఓం ఉగ్రాయ నమః
55. ఓం పశుపతయే నమః
56. ఓం భర్గాయ నమః
57. ఓం జటిలాయ నమః
58. ఓం నీలలోహితాయ నమః
59. ఓం వ్యోమకేశాయ నమః
60. ఓం త్రిలోకేశాయ నమః
61. ఓం శంబరారివిభేదనాయ నమః
62. ఓం జగదాదయే నమః
63. ఓం జగత్కర్తే నమః
64. ఓం జగన్నాథాయ నమః
65. ఓం జగద్గురవే నమః
66. ఓం భీమాయ నమః
67. ఓం సురగణశ్రేష్ఠాయ నమః
68. ఓం పరమాయ నమః
69. ఓం పరమేశ్వరాయ నమః
70. ఓం జటిలాయ నమః
71. ఓం నిటలాలోకాయ నమః
72. ఓం నటాయ నమః
73. ఓం నాట్యవిశారదాయ నమః
74. ఓం గర్వితాసురభిదే నమః
75. ఓం గాత్రే నమః
76. ఓం గరభుజే నమః
77. ఓం గౌతమస్తుతాయ నమః
78. ఓం సద్యోజాతాయ నమః
79. ఓం సహస్రార్చిషే నమః
80. ఓం స్వప్రకాశకచిన్మయాయ నమః
81. ఓం వామదేవాయ నమః
82. ఓం మహాదేవాయ నమః
83. ఓం వసురేతసే నమః
84. ఓం విధిస్తుతాయ నమః
85. ఓం అఘోరాయ నమః
86. ఓం సర్వభూతేశాయ నమః
87. ఓం సమస్తపురుషాయ నమః
88. ఓం శివాయ నమః
89. ఓం గంగాధరాయ నమః
90. ఓం కలాశాలినే నమః
91. ఓం సర్వదేవశిరోమణయే నమః
92. ఓం గౌరీపతయే నమః
93. ఓం గుణాధీశాయ నమః
94. ఓం గిరిధన్వనే నమః
95. ఓం వృషధ్వజాయ నమః
96. ఓం భసితోద్ధూలితాకారాయ నమః
97. ఓం శరణాగతకామదుహే నమః
98. ఓం శ్రీశైలశిఖరావాసవిలాసినే నమః
99. ఓం విశ్వమంగలాయ నమః
100. ఓం బ్రహ్మేంద్రాదిసురోపాస్యాయ నమః
101. ఓం యోషిత్సుంభావవిగ్రహాయ నమః
102. ఓం స్కేరప్రసన్నవదనాయ నమః
103. ఓం సర్వలోకేశ్వరేశ్వరాయ నమః
104. ఓం కల్యాణదాయ నమః
105. ఓం గుణాధారాయ నమః
106. ఓం పార్వతీప్రాణనాయకాయ నమః
107. ఓం శ్రీపర్వతమునేర్మూరవాసాయ నమః
108. ఓం శ్రీమల్లికార్జునాయ నమః
👇Link opened👇 👉https://vignanam.org/mobile/

ఈ వైదిక విజ్ఞానం అనే Link
అన్ని భాషలలో ఇంతవరకు మీరు చూసి ఉండరు

ఏ Book తో పని లేకుండా సమస్త దేవతల, దేవుళ్ళ స్తోత్రాలు, అస్త్రోత్రాలు , శతనామాలు, సుప్రభాతాలు, చాలీసాలు, హారతులు భగవద్గీత పతంజలి యోగ సూత్రాలు
ఒకటేమిటి మీరు ఉహించలేనివి

భారతమాత కు సంభందించిన
అన్ని వందేమాతరం జనగణమన సరేజహాసే అచ్చా మాతెలుగు తల్లికి దేశభక్తి ,జాతీయ గీతములు

అన్ని హారతులు అన్నమయ్య, రామదాసు త్యాగరాజు కీర్తనలు

ఇవి ఒక ఉదాహారణ మాత్రమే ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో....
ఇది మీకు జీవితాంతం మీతో ఉంచుకోతగిన Link .దీని కోసం ఎంతో శ్రమ పెట్టి ఇది తయారు చేసిన వారికి పాదాభివందనము.

ఇంత అత్యంత విలువైన దానిని ప్రతిఒక్కరు
ఉపయోగించుకుంటారని ప్రతిగ్రూప్ కి పంపుతారని కోరుకొoటూ....🙏😊
మాటలే ఆభరణాలు


మానవ సంబంధాల్లో మాటలు కీలకపాత్ర పోషిస్తాయి. జ్ఞానం, విజ్ఞత, వ్యవహారశైలి- మాటల ద్వారానే తేటతెల్లమవుతాయి. శ్రీరాముడి తొలిదర్శనంలోనే ఆంజనేయుడి మాటల తీరు ఆకట్టుకునేలా చేసింది. ఆ విషయాన్ని దాచుకోలేని దాశరథి మారుతి వాక్చాతుర్యం గురించి లక్ష్మణుడికి చెబుతాడు. ఇది రామాయణానికే పరిమితం కాదు. సార్వకాలీన సత్యం.
కొందరు స్పష్టత లేకుండా, సందర్భానికి విరుద్ధంగా పెద్దగొంతుతో, అవహేళన స్వరంతో మాట్లాడతారు. మరికొందరు ముభావంగా, మొహం ముడుచుకుని పది మాటలకు ఒక మాట మాట్లాడతారు. ఇంకొందరు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. పైగా ‘యథార్థవాదీ లోక విరోధి’ అంటూ తమను తాము సమర్థించుకుంటారు. ఎదుటివారు ముందుగా మాట్లాడితేగానీ కొందరు స్పందించరు. అంతవరకు చూపులు తిప్పుకొని, పరిచయస్తుల్ని కూడా ఎవరో తెలియనట్టు నటిస్తారు. మరికొందరు అతిగా మాట్లాడి ఇబ్బందిపెడతారు. వాక్కులు సరస్వతీదేవి ప్రసాదాలు వాటిని అంత పవిత్రంగా, గౌరవంగా వినియోగించాలి. మాటలు మిత్ర శత్రుబంధాలను తారుమారు చెయ్యగలవు.  

ఇంటిగుట్టు ఎవరికీ చెప్పరాదనేది ప్రాథమికసూత్రం. ఎక్కువగా మాట్లాడేవారు ఎప్పటికప్పుడు మనసు కడిగేసుకుంటున్నట్టు- కనిపించిన వాళ్లందరికీ ఏకరువు పెడుతుంటారు. ఆ మాటల్లో ఇతరుల మీద విమర్శలూ ఉంటాయి. నేరుగా అంటే పెద్దగా పట్టించుకోని వాళ్లు, ఇతరుల ద్వారా విన్నప్పుడు మండిపడతారు.  
వేదాలు బ్రహ్మవాక్కులు. అందుకే వాటిని మహర్షులు మాత్రమే వినగలిగారు. అవే శ్రుతులు. పండితులు పొల్లుమాట దొర్లకుండా వాక్కుల్ని నిగ్రహిస్తారు. కవులు పదాలను రసార్ణవం చేస్తారు. ప్రతి కావ్యం ఒక తేనెపట్టులాంటిదే. లాఘవంగా మాధుర్యాన్ని ఆస్వాదించగలగాలి.
మనసులో స్వచ్ఛత, ప్రేమ, సమభావన ఉన్నవారి మాటలు కోయిలగానంలా, వెన్నెల విడిదిలా శ్రోతలను అలరింపజేస్తాయి. సిరి సంపదలు లేకపోయినా మధురభాషణలే, అమూల్య భూషణాలుగా ఉండేవారికి సర్వత్రా గౌరవ మర్యాదలు లభిస్తాయి.
భగవంతుడు స్త్రీలకు మధురస్వరం ఇచ్చాడు. వారి మాటలు మధురాతి మధురంగా ఉండాలని ఆయన ఆకాంక్ష. సంగీతం మగువల గొంతులో ఎంతో మధురంగా ధ్వనిస్తుంది. అందుకే వాణి వాక్కులరాణి అయింది.
మన మాటలే వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. మాటల్ని గుణాత్మకంగా, ఎంతో అర్థవంతంగా ఉపయోగించాలి. ఇతరుల మాటలు ఎలా ఉండాలని ఆశిస్తామో మనం అలాగే మాట్లాడేందుకు ప్రయత్నించాలి. ‘ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి’ అనే సూత్రం ఎంతో ఉపయోగపడుతుంది. మందహాసం మొహాన్ని అందంగా మారుస్తుంది. ఎన్ని చీకాకులు వేధిస్తున్నా వాటిని చిరునవ్వు వెనక దాచుకోవచ్చు. రాముడికి ‘పూర్వభాషి’ (ముందుగా తానే పలకరించే తత్వం) అనే లక్షణం ఉంది. ఇది మానవ సంబంధాల్లో అద్భుతమైన విజయాలను చేతికందిస్తుంది. కలివిడిగా అందరితో కలిసిపోవడంతో పాటు పొందికగా పొదుపుగా మాట్లాడటం వల్ల మనల్ని అందరూ ఇష్టపడతారు.
బంగారు ఆభరణాలు ఎన్ని ధరించినా రాని గౌరవాన్ని, మంచి మాటల ద్వారా పొందవచ్చు. అందుకే మాటల్ని వాగ్భూషణాలు అంటారు
నీ నగుమోమూ...


దైవం విశ్వాన్ని ఆనందంతోనే సృజించాడు. ఏమీ తెలియని శిశువులు ఆ విశ్వాన్ని మనుషుల్ని జీవరాశులను పారవశ్యంతో చూస్తారు. విశ్వంలోని పొందిక వారికి సామరస్యంగా కనిపిస్తుంది. వంకరచూపులు చూసే వారికి విశ్వం వికృతంగా కనిపిస్తుందని గోవింద భగవత్పాదులు బ్రహ్మసూత్రాల్లో ప్రస్తావించారు. ముఖంలోని చిరునవ్వు, మాటల్లోని మాధుర్యం ఇతరులను ఆహ్లాదానికి గురిచేస్తాయి. నవ్వుతూ మాట్లాడితే శత్రువైనా స్నేహితుడిగా మారతాడని ప్రఖ్యాత మానసిక శాస్త్రజ్ఞుడు ఫ్రాయిడ్‌ అనేవాడు. పదమూడో శతాబ్దానికి చెందిన హొయసల వంశానికి చెందిన విష్ణువర్ధనుడు కర్ణాటకలో హొయసలేశ్వర ఆలయం నిర్మించాడు. అందులో ఒక విభాగంలోని ఆలయం లోపలి స్తంభాలకు చెక్కిన దేవతామూర్తులు అందరూ చిరునవ్వులు చిందిస్తూ కనపడతారు. ఎందరో అన్యమత రాజులు ఆ ఆలయ నిర్మాణంపై దాడిచేసినా ఆ మూర్తులు చిందిస్తున్న చిరునవ్వులను గమనించి విగ్రహాలను నాశనం చేయలేకపోయారట. నవ్వు అంత ఆకర్షణీయమైంది. చూసేవారిని సమ్మోహితులను చేస్తుంది.
సమాజంలోని ఇతరులతో సఫలమైన జీవితం గడపాలంటే మృదువుగా నవ్వుతూ తీయగా మాట్లాడాలని కిష్కింధలో హనుమతో పరిచయం తరవాత శ్రీరాముడు సౌమిత్రితో అంటాడు. శ్రీరాముడు సైతం నవ్వుతూ మధురంగా మాట్లాడేవాడని వాల్మీకి రామాయణం చెబుతోంది. కోకిల స్వరమంత తీయనిది రామనామం. రామ అనే రెండక్షరాలు మధురాక్షరాలని వాల్మీకి అంటాడు. శ్రీరాముడి వదనంలో చిరునవ్వే తనను ఆ దైవానికి దగ్గర చేసింది అనేవారట వాగ్గేయకారుడు త్యాగయ్య. ఆయనలోని సంగీత ప్రజ్ఞను గమనించి అభినందన పురస్సరంగా తంజావూరు రాజు పంపిన కానుకలను త్యాగయ్య తిరస్కరిస్తాడు. దానితో కోపించిన అతడి అన్నయ్య జపేశుడు, త్యాగరాజు నిత్యం పూజించుకునే శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరివేస్తాడు. శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక ‘నగు మోము గనలేని నా జాలి దెలిసి నను బ్రోవగ రాదా శ్రీరఘువర(అభేరి)’ అంటూ తన రాముడి నవ్వు మొఖాన్ని జ్ఞాపకం చేసుకొని ఆర్తి చెందాడు త్యాగరాజు.

వివాదాస్పద విషయాలు కాకుండా మనసుకు హాయినిచ్చే మాటలు మాట్లాడాలని అనుభవజ్ఞులు చెబుతారు. సాహిత్యం సంగీతం గొప్ప వాంగ్మయాల గురించి మాట్లాడితే మన మాటలు ఇంపుగా ఉండి అందరినీ ఆకర్షిస్తాయి. పదిహేనో శతాబ్దానికి చెందిన శ్రీపాద వల్లభాచార్యులు శ్రీకృష్ణుణ్ని వర్ణిస్తూ రాసిన మధురాష్టకంలో వెన్నుడి హసితం(నవ్వు) మధురం అన్నాడు. వచనం(మాట) మధురం అన్నాడు. చివరికి అఖిలం మధురం అంటూ గానం చేశాడు. మధురమైన మాట, నవ్వుతో వికసించే వదనం అందరినీ అలరిస్తాయి. సమాజంలో సైతం మధురమైన నవ్వు రాజిల్లే వదనంతో తీయని మాటలతో వ్యవహరించగలిగితే ఎవరైనా అందరివాడు అవుతాడు.
మన చుట్టూ ఉన్నవారితో సామరస్యంగా హాయిగా నవ్వుతూ... ఒకరు మెచ్చేలా మాట్లాడుతూ దుఃఖాల నుంచి బాధలనుంచి మానవులు వెలుగులోకి రావాలి. పవిత్రులై ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించాలి. అప్పుడే లోకంనుంచి దుఃఖం వైదొలగుతుంది. కష్టంగా ఉన్నా కాలక్రమంలో మేలు చేసే మార్గాన్ని నవ్వుతూనే స్వీకరించాలి. మంచిమాటలను మాట్లాడుతూ కష్టాలను కొనితెచ్చే మార్గాన్ని వదిలివేయాలి. అదే జీవితానందం.
శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల్లో రెండోది కూర్మావతారం. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది ఎన్నో లోతైన విషయాలను వెల్లడిస్తుంది. క్షీరసాగర మథనంలో వాసుకి, మందరం, సముద్రం అనే పదాలు అసాధారణ అర్థాలు కలిగి ఉన్నాయి. వాసుకి అంటే మూలాధారంలోని కుండలినీ సర్పం. ఇది యోగశక్తి, శ్వాసకు సంకేతం. మందరం అంటే నిలువుగా-అడ్డంగా కిందకి-పైకి కదిలేది. ఇది మనం ధ్యానంలో ఉన్నప్పుడు కిందకు-పైకి కదిలే కుండలినీ శక్తికి (ఉచ్ఛ్వాస - నిశ్వాసాలు) ప్రతీక. సముద్రం అంటే భగవత్‌ చింతనం. ఊగిసలాడే మందరానికి కింద ఆధారం లేకపోవడంతో అది సముద్రంలో మునిగి పోతున్నప్పుడు శ్రీహరి కూర్మావతారాన్ని ఎత్తి మునగకుండా ఉంచాడు. ఇందులో రహస్యార్థం ఏమంటే- ధ్యాన ప్రక్రియలో శ్వాసను ఎప్పుడూ ఊర్ధ్వంలోనే (పై మార్గంలో) ఉంచాలని, శ్వాస అవరోధం జరిగితే ఉపాసన-సాధనాలు దెబ్బతిని అనుకున్నది సాధించలేమని కూర్మావతారం తెలియజేస్తుంది. అలాగే నిరుక్త నిఘంటువులో కూర్మం అనే పదానికి ‘భూ సంబంధమైన ఆశ, శోకం, శ్వాస, ఆకలి, దప్పిక, మరణం అనే ఆరు లక్షణాలను కలిగిన షడూర్ముల జీవం’ అనే నిర్వచనం ఉంది. అంటే తాబేలు జీవ ధర్మాలు కలిగిన జీవి అని అర్థం. దీన్నిబట్టి వంశ వృద్ధి జరగాలన్నా, సంస్కారాలను సక్రమంగా నిర్వర్తించాలన్నా ఆరోగ్యంగా ఉండాలని కూర్మం బోధిస్తుంది. మరో కోణంలో చూస్తే సాధన చేసేటప్పుడు దాన్ని సాధించే వరకూ పట్టు విడవకూడదని, ఎంత కష్టమైనా భరించి తీరాలని, అందుకోసం సాధకుడు బలమైన ఆహారంతో శక్తిమంతుడై ఉండాలనే సందేశం కూర్మావతారంలో ఇమిడి ఉంది.
నిశ్శబ్ద మార్గం


ఒక పౌర్ణమి రోజున బుద్ధుడికి జ్ఞానోదయమైంది. ఆ వారమంతా ఆయన మౌనంలోనే ఉన్నారంటారు. ఒక్క మాటైనా మాట్లాడలేదు. పురాణగాథల ప్రకారం స్వర్గంలో దేవతలు భయపడిపోయారట. వాళ్లకు తెలుసు- కొన్ని లక్షల సంవత్సరాలకోసారి ఎవరో బుద్ధుడిలా వికసించడం జరుగుతుందని. ఇప్పుడు ఆయన మౌనంలో ఉన్నాడు.
దేవతలు ఏదైనా మాట్లాడమని ఆయనను కోరారు. అప్పుడాయన- ‘తెలిసినవారికి అర్థమవుతుంది నేనేం చెప్పకపోయినా... తెలియనివారికి నేనేం చెప్పినా బోధపడదు. ఇది అంధుడి ముందు వెలుగును వర్ణించడంలాంటిది. జీవితంలోని అమృతాన్ని రుచిచూడని వారితో నేనేం మాట్లాడినా వ్యర్థం. అందుకే ఈ మౌనం. పవిత్ర గ్రంథాలు ఏనాడో చెప్పాయి- ఎక్కడ మాటలు ఆగిపోతాయో, అక్కడ సత్యం మొదలవుతుంది’ అన్నాడు.

బుద్ధుడి మాటలు కచ్చితంగా నిశ్శబ్దాన్ని సృష్టిస్తాయి. ఎందుకంటే ఆయన నిశ్శబ్దానికి ప్రతిరూపం. అదే జీవానికి మూలం, అన్ని రుగ్మతలకూ ఔషధం.
మనుషులు కోపంగా ఉంటే మౌనాన్ని పాటిస్తారు. ముందు అరుస్తారు, తరవాత నిశ్శబ్దం ఆవరిస్తుంది. తెలివైన వారూ చాలా సందర్భాల్లో మౌనంగా ఉండిపోతారు.
మాటల ఉద్దేశం నిశ్శబ్దాన్ని సృష్టించడానికే. మాటలు శబ్దానికి కారణమైతే వారు లక్ష్యాన్ని ఇంకా చేరుకోలేదని అర్థం. ‘శబ్దాలు, మాటలు ఏదైనా వ్యక్తపరచడానికే. అవి అనుబంధోత్పత్తి మాత్రమే. దానికంటూ అస్తిత్వం లేదు. ఆలోచనను వ్యక్తపరచేందుకు వాహకనాళం. ఒక మట్టికుండలాంటిది... మట్టికాదు... ఓంకారం అసలైనది’ అంటారు ఆది శంకరాచార్య మాండూక్యోపనిషత్తులో.
మనసులోని రొద దేని గురించి? ధనం, కీర్తిప్రతిష్ఠలు, సంబంధబాంధవ్యాలు... శబ్దం ఏదో ఒక దాని గురించి. దేని గురించీ కానిది నిశ్శబ్దం. నిశ్శబ్దం మూలం... శబ్దం ఉపరితలం.
మొదటినుంచీ బుద్ధుడిది సంతృప్తికరమైన జీవితం. ఏ సుఖమైనా కావాలనుకుంటే చాలు- ఆయన పాదాల దగ్గరుండేది. వెళ్ళి ప్రపంచాన్ని చూడాలనుకున్నాడు. తనకు తానుగా యథార్థం తెలుసుకోవాలనుకున్నాడు. తన స్థానాన్ని, భార్యను, కొడుకును వదిలిపెట్టాడు. నిశ్శబ్దం ఎంత దృఢంగా ఉంటే లోపలి నుంచి తలెత్తే ప్రశ్నలు అంత శక్తిమంతంగా ఉంటాయి. ఆయనను ఏదీ ఆపలేదు.

ఎటువంటి మనిషైనా జీవితంలో కొన్నిసార్లైనా మౌనంగా ఉండే పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఎందుకంటే మనసులో, హృదయంలో జరుగుతున్నదాన్ని సంపూర్ణంగా ఏ మాటలూ వివరించలేవు. మౌనం శక్తిమంతమైన సందేశాలను అందిస్తుంది. సహనం, మౌనం- రెండూ బలమైన శక్తులు. సహనం మానసికంగాను, మౌనం భావోద్వేగాలపరంగానూ అని అర్థం చేసుకోవాలి. మనిషి తన సహజ స్వభావాన్ని తెలుసుకోవాలి. సహజ లక్షణాలుగా భావించే శాంతి, కరుణ, ప్రేమ, స్నేహం, సంతోషం... ఇవన్నీ నిశ్శబ్దం నుంచి పుట్టేవే. నిశ్శబ్దం బాధను, అపరాధాన్ని, దుఃఖాన్ని మింగేస్తుంది.
వివేకంతో ప్రవర్తిస్తే ప్రతి ఒక్కరూ కష్టాలసాగరం దాటవచ్చు. సుఖాల తీరం చేరుకోవచ్చు. ఎవరైనా మౌనంగా ఉండిపోయారంటే వారు మాట్లాడలేకపోయారని, ఓడిపోయారని కాదు. అర్థం చేసుకోలేనివారితో వాదించడం ఇష్టంలేక అలా ఉండిపోయారనుకోవాలి.
సత్యాన్వేషణ


సత్యాన్ని తెలుసుకోవడానికి సగుణమా లేక నిర్గుణమా అన్న మీమాంస సదా సాగుతూనే ఉంటుంది. మీమాంస వదిలి సాధనా మార్గంలో పయనిస్తేగాని సత్యదర్శనం కలగదంటారు దార్శనికులు. ఈ భూమి మీద కళ్లు తెరవగానే కనిపించేది వస్తు ప్రపంచం. ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు; జలమయమైన సముద్రం, నదులు, కొలనులు, బావులు; అంబరాన్ని సంబరంగా తాకడానికి చేతులు చాచే వృక్షాలు; వాటిని నడిపించే కనిపించని వాయువు, నేలపై ఉన్నా నింగికి ఎగసిపడే నిప్పు, రగిలే నాల్కలు; కొండలు, కోనలతో నిండిన నేల- పంచభూతాలను మనిషి ఎలా కాదనగలడు? అంపశయ్య పైన ఉన్న భీష్మాచార్యులకు మొదట విశ్వం, తరవాత విష్ణువు కనిపించారు. సర్వ వ్యాపకమైన విష్ణుత్వాన్ని కురుపితామహుడు కృష్ణుడిలోనే చూడగలిగాడు. తెలిసినదాన్నిబట్టి తెలియనిదాన్ని పట్టుకోవడం సులభం. ఉట్టి కొట్టగలిగితే, స్వర్గం ఎక్కగలనన్న ధైర్యం, ఉత్సాహం ముందుకు నడిపిస్తాయి. ఈ సృష్టిలో ప్రతి జీవి పుట్టి, పెరిగి, గిట్టడం ప్రకృతి సహజమైన మార్పు.
విశ్వరహస్యాన్ని తెలుసుకోవడానికి మూడురకాల ప్రామాణికాల్ని విజ్ఞులు నిర్దేశించారు. ప్రత్యక్ష, అనుమాన, శబ్దప్రమాణాలు మూడూ సత్యాన్వేషణకు తగిన ఉపకరణాలు. కళ్లతో చూడాలి, మనసుతో తెలుసుకోవాలి, జ్ఞానసంపదతో కూడిన వేదమంత్రం ఉపాసించాలి. ఈ మూడింటికీ లొంగని మహత్త్వం యోగసమాధిలో హృదయనేత్రానికే అవగతం అవుతుంది. ఎవరికి వారే అనుభవం ద్వారా అనుభూతి చెందినప్పుడే సత్యసాక్షాత్కారం సాధ్యమవుతుందంటారు యోగీ శ్వరులు. చూపు, చూడదగినది, చూడగలవాడు (దృష్టి, దృశ్యం, ద్రష్ట) మూడూ ఒకటి అయితే నిత్యం, నిఖిలమైన సత్యస్వరూపం విశ్వవ్యాప్తమై విష్ణుసహస్ర నామమై ధ్వనిస్తుంది.

జ్ఞానమార్గంలో కొనసాగేవారికి నిర్గుణధ్యానం, కర్మ మార్గంలో పయనించేవారికి సగుణధ్యానం కలిసివస్తాయని, గురువులు శిష్యుల స్థాయినిబట్టి మార్గనిర్దేశం చేసేవారు. నేను సర్వజ్ఞుడిని అన్న అహంకారంతో అగ్నికార్యాలు మానివేసిన జ్ఞానికన్నా నిష్కామకర్మ చేసే యోగి మిన్న- అంటున్నది భగవాన్‌ ఉవాచ. విష్ణు సహస్రనామాలు వల్లెవేస్తూ, పాపపు పనులకు ఒడిగట్టేవాడిని నామాపరాధి అంటున్నది శ్రీభాగవతం. సగుణ, నిర్గుణమనే విభేదం కేవలం తాత్కాలికం. ఏరు దాటడానికి తెప్ప అవసరం. ఏరు దాటాక తెప్పను వదలకపోవడం అవివేకం. ఇహపర సాధన జీవిత పరమార్థం. జ్ఞానం, కర్మ, యోగం, భోగం- అన్నీ సత్యశిఖరానికి చేర్చే సోపానాలు. అంచెలంచెలుగా నిచ్చెనమెట్లు ఎక్కినప్పుడే నింపాదిగా చేరవలసిన చోటుకు చేరుకోవచ్చు. నేలవిడిచి చేసే సాముగరిడీలను నమ్ముకుంటే వైకుంఠపాళి పాము నోట్లో పడ్డ పాచికవలె జారిపడతారు. వైకుంఠానికి బదులు వైతరణికి తరలిపోగలరు. లోకంలో ఒకరి సహాయం లేకుండా జీవించడంగాని, కార్యసిద్ధి పొందడంగాని సాధ్యం కాదు. పొట్టు సాయంలేకుండా బియ్యపు గింజ మొలవదు. తోడూ నీడా లోకసహజమైన జోడుగుర్రాలు. సగుణం కాదని నిర్గుణం కోసం వెంపర్లాడితే గాడితప్పి బండి బోల్తా కొట్టవచ్చు. సాధన, ఉపాసన జోడుగుర్రాల్లాంటివి. ఈ రహస్యం తెలుసుకున్నప్పుడు నాణేనికి బొమ్మ-బొరుసు లాంటివే సగుణ నిర్గుణ సాధనామార్గాలన్న సమరస భావన కలుగుతుంది. సాధన వేగవంతమై యోగం వరిస్తుంది. సచ్చిదానందం అంటే అచ్యుతానంద గోవిందుడేనన్న సత్యం బోధపడుతుంది.