Devotional Telugu
3.55K subscribers
105 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
పనే పరమాత్మ

ప్రతి పనికీ ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. ‘నాకు పని అంటే ఇష్టం. అందుకే ఆవిడ చేస్తూ ఉంటే అలా కుర్చీలో కూర్చుని గంటల తరబడి చూస్తూ ఉంటా’నని చెప్పాడు వెనకటికో ప్రబుద్ధుడు. అలాంటి పనిదొంగల సంగతి పక్కనబెడితే- ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రంగా తీర్చిదిద్దడమైనా, విధి నిర్వహణలో భాగంగా దస్త్రాల దుమ్ము దులపడమైనా... చేసే పనిని కళాత్మకంగా చెయ్యాలి. ఇంట్లో పని, బయటి పని అని తేడా ఉండకూడదు. పని చేసేవారికి ఎంతో సహనం కావాలి. పూజని పనిగా కాదు.. పనిని పూజగా భావించాలి. శాంతంగా చేసుకోవాలి. అది మొక్క నాటడం కావచ్చు, భవనం నిర్మించడం కావచ్చు. తమను తాము పనిలో భాగంగా మలచుకుని కర్తవ్యాన్ని పూర్తిచేయాలి.

కాలక్షేపం కోసం చేసేది కాదు పని. యజమాని తోటలోకి రాగానే ఆయన వెనకాలే తిరుగుతాడు ఒక పనివాడు. మరొక పనివాడికి ఆ సంగతే పట్టదు. యజమాని వచ్చింది కూడా చూడకుండా తన పనిలో తాను నిమగ్నమై ఉంటాడు. రామకృష్ణ పరమహంస ఈ కథ చెబుతూ నిజంగా పనిచేసే వ్యక్తిపైనే యజమాని దృష్టి ఉంటుందనేవారు.

ఎవరికి వచ్చిన పని వారు చెయ్యాలి. శివుడి ఇల్లు కురుస్తోందట. ఇల్లు కప్పే వ్యక్తి కోసం ఈశ్వరుడు రాత్రీ పగలూ తిరుగుతున్నాడట. ఎక్కడా దొరకడం లేదు. ‘మీరు శివుడు కదా.. మీకే అన్ని పనులూ వచ్చు. ఈ పని మీరే చేయవచ్చు కదా..?’ అని అమ్మ అడిగిందట. ‘అలా కాదు.. నేనే చేసి ఆ పనిని నమ్ముకుని బతుకుతున్నవారి పొట్ట కొట్టలేను’ అని ఈశ్వరుడు నవ్వుతూ చెప్పాడట. ఇది వినడానికి హరికథలో పిట్ట కథే కావచ్చు. కానీ ఆలోచిస్తే ఎంతో లోతైన అర్థం దొరుకుతుంది. ఈ లోకంలో ప్రతి ప్రాణికీ తనవైన విధులుంటాయి. గురువు ఒక్కరోజు కూడా సెలవివ్వకుండా తాను పనిచేస్తూ తమచేతా పనిచేయిస్తున్నారని శిష్యులకు కోపం. అందుకని వాళ్లు పనిముట్లను కనబడకుండా దాచేశారు. దాంతో ఆయన భోజనం మానేశాడు. శిష్యులు జాలిపడి నాలుగో రోజు వాటిని తెచ్చిచ్చారు. ఆ రోజంతా ఆయన పనిచేశాకే కడుపు నిండా భోజనం చేశాడు. పనిచేస్తేనే తిండి తినడానికి అర్హత ఉంటుందని ఆ గురువు ఆచరణలో చూపించాడు శిష్యులకు.

పని చేసేవారి బాగోగులు ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఒక పేద కుటుంబానికి కొన్నాళ్లపాటు పని దొరకలేదు, దాంతో తిండీ లేదు. దేవుడి మీద భారం వేసి కూర్చున్నారు. ఆ ఊరి పెద్దమనిషికి పొలంలో అత్యవసర పని పడింది. స్వయంగా వాళ్ల ఇంటికెళ్లాడు. పరిస్థితి చూసి ముందు వాళ్లకు కడుపునిండా భోజనం పెట్టి ఆ తర్వాత పనికి తీసుకెళ్లాడు.
పనిని దైవకార్యంగా భావించాలి. నిష్ఠగా చేయాలి. అలా ఎరుకతో చేసే పని వ్యక్తికే కాదు, ఈ లోకానికి కూడా శాంతి సౌభాగ్యాలనిస్తుంది.

భమిడిపాటి వెంకటేశ్వర రావు
జీవన చిత్రం
ఎంత కాలం బతికామన్నది ముఖ్యం కాదు. ఎంత బాగా జీవించామన్నది లెక్క. మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితం ఒక కళాఖండంలా మిగులుతుంది. బతుకు కళ అనేది త్యాగం, క్షమ, ప్రేమ అనే రంగులతో రూపుదిద్దుకునే అపురూపమైన చిత్రం.

సమస్యల నుంచి పారిపోకుండా, వాటికి సమాధానాలు వెతుక్కోవడమే జీవితం. ఇతరులకు వెలుగిస్తే మన జీవితం కూడా ప్రకాశిస్తుంది. మనం లేనప్పుడు కూడా మన జ్ఞాపకాలు నిలిచిపోతే అది నిజమైన జీవితమవుతుంది. బతుకు కళను నేర్చుకున్నవారు ప్రతి రోజును కొత్తగా మార్చుకోగలరు. మనకు లభించే ప్రతి క్షణం ఒక తెల్ల కాన్వాస్‌లాంటిది. దానిపై ఏ రంగులు వేసుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి.

బతుకు కళలో స్వీయ అవగాహన ఉండాలి. మన బలాలు, బలహీనతలు తెలుసుకోవడం ఒక మంచి శిల్పి శిలను అర్థం చేసుకోవడంలాంటిది. ఏ భావన మనలో దృఢత్వాన్ని పెంచుతుందో, ఏ అలవాటు మనను వెనక్కి లాగుతుందో గమనించడం ముఖ్యం. సమయం తిరిగి రాని వరం. దాన్ని వృథా చేయకుండా లక్ష్యసాధనకు ఉపయోగించడం బతుకు కళలో ప్రధాన సూత్రం. సమస్యల పరిష్కారానికి కొత్త మార్గాలు ఆలోచించాలి. చిన్న చిన్న పనులను సైతం సమయానికి, నాణ్యతతో పూర్తిచేయడం వ్యక్తిత్వానికి పదును పెడుతుంది.

దృక్పథం స్పష్టంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితుల మధ్య సైతం అవకాశాలను గుర్తించడం, కష్టాల్లో కూడా పాఠాలను నేర్చుకోవడం జీవన కళాకారుడి లక్షణం. అగ్నిపరీక్షలలోనే ఆత్మవిశ్వాసం బలోపేతమవుతుంది. సంబంధాలూ కీలకమే. చుట్టూ ఉన్నవారి హృదయాలను గెలుచుకోవడం, సహానుభూతి చూపడం, కృతజ్ఞత వ్యక్తపరచడం- ఇవి బతుకు చిత్రంలో ప్రకాశవంతమైన రంగులు. ఇతరులను ప్రోత్సహించగలిగితే, జీవితం మరింత సార్థకం అవుతుంది. దినచర్యల్లోనూ అందాన్ని వెతకడం మనసును యవ్వనంగా ఉంచుతుంది.
బతుకు కళ అనేది ఒక నిరంతర సాధన. ఇది ఒక్కరోజులో నేర్చుకోలేని మేలిమి నైపుణ్యం. క్రమశిక్షణ, ధైర్యం, ప్రేమ, ఆశావాదం ఈ నాలుగింటి తోడ్పాటుతో దాన్ని సాకారం చేసుకోవాలి. ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే- మన జీవన చిత్రానికి మనమే చిత్రకారులం కావాలి. కుంచె మనసైతే, రంగులు మన ఆలోచనలు. కాన్వాస్‌మన కాలం. బతుకును కళగా మలచడం ఒక మహోన్నత సృజన.

బతుకు కళ అనేది వాన చినుకుల్లో ఇంద్రధనస్సును వెతకడం లాంటిది. అంటే- కన్నీటి బిందువులోనూ ఒక ముత్యాన్ని చూడగలగడం, చీకటిలోనూ ఒక దీపాన్ని వెలిగించగలగడం. ప్రతి క్షణాన్నీ ఓ రాగంలా ఆలపించడం, ప్రతి అనుభవాన్నీ ఓ పద్యంలా రాయడం. బాధలను కూడా చిత్రంలోని నీడలుగా భావించి, ఆనందాన్ని ఆ చిత్రంలోని వెలుగులా ఆరాధించాలి. జీవితం ఒక ఖాళీ కాన్వాస్‌అయితే, మనసు సమపాళ్లలో వేసే సరైన రంగులే దానికి అందం. ఆ వర్ణాలన్నీ కలిసినప్పుడే బతుకు కళ అద్భుతమైన చిత్రమవుతుంది.

జియో లక్ష్మణ్‌
అంత సులభం కాదు

ముక్తి అందరికీ కావాలి. దాన్ని ప్రసాదించే భగవంతుడికి భక్తి కావాలి. భక్తి అంటే ప్రేమ, త్యాగం. భక్తి అంటే అంకితభావం- శరణాగతి. అలాంటి వ్యక్తికి మోక్షం ప్రసాదిస్తానని కృష్ణ పరమాత్మ చివరి మాటగా అర్జునుడికి చెప్పాడు. నన్ను నిజంగా శరణు కోరితే, ఆ వ్యక్తి పాపాలన్నీ హరిస్తాను. ముక్తినిస్తాను.. నా మాట నమ్ము- అని స్పష్టంగా చెప్పాడు. ఈ సమాజం ఆ మాటకు విలువనిస్తోందా అన్నదే పరిశీలనార్హమైనది. జన సమూహమే సమాజం. జనాల మధ్య నమ్మకాలు బలపడితే సమాజమూ సక్రమంగానే స్పందిస్తుంది. స్వీయ సంరక్షణకైనా, ధర్మరక్షణకైనా బలమైన మానవ సంబంధాలు అవసరం.

భక్తిలో రకాలు ఉన్నట్టుగానే ముక్తిలోనూ తేడాలున్నాయి. అపరభక్తి ఐహిక సుఖాలవైపు మొగ్గు చూపుతుంది. పరభక్తి ఆముష్మిక సుఖాలను కోరుకుంటుంది. ఐహిక సుఖభోగాలు ‘ఐసు’ముక్కల్లా కరిగిపోతాయి. ఆముష్మిక సుఖం నిరుపమాన ఆనందాన్ని ఆకాంక్షిస్తుంది. భూలోకంలో అనుభవించలేని సుఖాలను స్వర్గలోకంలో అనుభవించవచ్చని చెప్పడం మనుషులను మభ్యపెట్టడమే. పరుల కోసం త్యాగం చేయమని ప్రబోధించేవారే నిజమైన గురువులు. త్యాగం, పరోపకారం తదితరాలతో కూడిన ధర్మాచరణ ఉన్నచోట జయం కలుగుతుంది. మహాభారతానికి జయగ్రంథం అన్న పేరుంది. వ్యాస రచనలన్నీ పద్దెనిమిది సంఖ్యతోనే ఉన్నాయి. మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది. పద్దెనిమిది అధ్యాయాల గీత ధర్మంతో మొదలై ధర్మంతోనే ముగుస్తుంది. ‘ధర్మక్షేత్రే కురుక్షేత్రే’ అంటూ మొదలై ఎక్కడ కృష్ణార్జునులుంటారో అక్కడ సిరి, విజయం, ఐశ్వర్యం, దృఢమైన నీతి ఉంటాయని నా నమ్మకం- అంటాడు సంజయుడు. అతడు ధర్మానికి మారుపేరు. మొదటి శ్లోకంలో ‘మమ’కారం ధృతరాష్ట్రుడి స్వార్థసంకుచిత మనస్తత్త్వానికి ప్రతీక. చివరి శ్లోకంలోని ‘మమ’ నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక. భగవంతుడికి, భక్తుడికి నడుమ ఉన్న బంధానికి వ్యాఖ్యానం! మొదటి ఆరు అధ్యాయాలకు మిగతా పన్నెండూ భాష్యాలు అంటారు అరవిందులు.

అర్జున విషాదయోగం నరజాతికి పట్టిన భవరోగం గురించి చెబుతుంది. అజ్ఞానమనే చీకటిని తొలగించేది సాంఖ్యయోగం. జ్ఞాన, కర్మ, సన్యాస యోగం కర్తవ్యోపదేశం చేస్తే, కర్మ సన్యాసయోగం నిష్కామకర్మను విశ్లేషిస్తుంది. ఆత్మసంయమనంతో సాధన ద్వారా పరమ పురుషార్థమైన మోక్షం పొందవచ్చు. అలాగని ప్రబోధించే గీత- మత గ్రంథం కాదని, కర్మయోగ ప్రస్థానమని, విశ్వమానవ సమాజానికి దారి దీపం అని, పాశ్చాత్య వేదాంతులు సైతం ప్రశంసించారు.

ముక్తికి యుక్తమైన దారి సాధన. దాని ద్వారా మనిషి జీవన్ముక్తుడు కావాలి. ‘సాధనమయో జీవన్ముక్తో భవతి!’ తానొక్కడు అయితే చాలదు. తోటి మానవులకూ ఆ వివేకాన్ని పంచాలి. చెడ్డదారి నుంచి మంచిదారికి మళ్లించాలి. మృత్యు సమానమైన భవబంధాన్ని తొలగించాలి. ముక్తి అనుకున్నంత సులభం కాదు కానీ అనుకుని సాధన చేస్తే సాధ్యమే!

ఉప్పు రాఘవేంద్రరావు
కార్తిక పౌర్ణమి

కార్తిక పౌర్ణమి ఒక విలక్షణమైన పర్వదినం. సాహితీ ప్రియులకు, ఆధ్యాత్మిక వేత్తలకు సామాజిక ప్రియంభావుకులకు సమానంగా ఆనందాన్ని పంచి ఇచ్చే పండుగ కార్తిక పౌర్ణమి. తెల్లని వెన్నెల రాత్రులకు పేరెన్నికగన్న కార్తికం సాహిత్యవేత్తలకు నన్నయను గుర్తు చేస్తుంది. ‘శరత్కాలం నింగికి నేలకు శోభను చేకూరుస్తుంది’ అన్నాడు నన్నయభట్టు- పున్నమి రోజు రేయెండ(వెన్నెల) వర్షంలా కురుస్తూ భువనానికీ గగనానికీ మధ్య వంతెన నిర్మిస్తుంది కాబట్టి! అది చూసే మైమరచిపోయాడు భవభూతి. ఆయన పూర్వనామం శ్రీకంఠశర్మ. ‘అది వెన్నెల కాదు, కైలాసంలో తాండవనృత్యం చేస్తున్న భవుడి దేహం నుంచి జలజల రాలిపడుతున్న విభూతి’ అన్నాడో శ్లోకంలో. ముగ్ధ మనోహరమైన ఆ భావనకు మురిసిపోయిన రసజ్ఞ లోకం- ‘నీపేరు శ్రీకంఠుడు కాదు- భవభూతి’ అంది.

వానాకాలంలో దేవలోకాలకు తరలిపోయిన రాజహంసలు శరత్కాలం రాగానే క్రౌంచ పర్వత రంధ్రం ద్వారా తిరిగి భూలోకానికి వస్తాయని చెప్పినవాడు భవభూతే! దాన్నే కృష్ణదేవరాయలు ‘రాజమరాళ లబ్ధగిరి రంధ్రం’ అన్నాడు. గుండెల్లో వెన్నెల నింపే ఈ ఘట్టాలన్నీ స్ఫురించి మళ్లీ మళ్లీ సౌందర్య అనుభూతికి లోనవుతారు సాహితీప్రియులు. అందుకే వారికి కార్తికమన్నా, పౌర్ణమి అన్నా పరమప్రీతి.

శరదృతువులో స్ఫుటంగా గోచరించే సప్తర్షి మండలాన్ని వీక్షించడం ఆధ్యాత్మిక పరులకు ఆనందదాయకం. దానికి అనువైన రోజు కార్తిక పున్నమి. ‘శరత్కాల లక్ష్మి కార్తిక కౌముది వస్త్రంతో వెన్నెల దరహాసంతో లోకాన్ని మంత్రముగ్ధం చేస్తోంది’ అన్నాడు వైజయంతీ విలాసంలో సారంగు తమ్మయ్య. లక్ష్మీకళ మాత్రమే కాదు, శివకేశవ అద్వైత భావన సైతం ఆధ్యాత్మిక ప్రియులకు చాలా ఇష్టం. రూపా గోస్వామిది మరింత విలక్షణమైన చూపు. ‘వెన్నెల వెలుగులు తెల్లనివి కావు’ అన్నాడాయన. కృష్ణుడి కారణంగా నీలికాంతి అలుముకున్న అవి ‘నీలి వెన్నెలలు’ అని వర్ణించాడు. కృష్ణకాంతుల కారణంగానే భువనమంతటా అతిలోక మాధుర్యం వ్యాపించిందంటాడు రూపా గోస్వామి. ధాత్రీ(ఉసిరి) సహిత దామోదర కైంకర్యాలు, పరమశివారాధనలతో హరిహరాత్మకమై ప్రకాశిస్తున్న కార్తికమాసంలోని పున్నమి రాత్రి రాజచిహ్నాలతో అలరారుతుందని హరివంశం వర్ణించింది.

అందమైన వెన్నెలంతా అడవి పాలవుతుందని విచారిస్తూ కూర్చుంటారు కొందరు. నిజానికి వెన్నెలకు స్వపర భేదం లేనే లేదు. ఎర్రని ఎడారిలోనూ, పచ్చని అడవిలోను, చివరకు ప్రతి పెరట్లోనూ ఒకేలా వికసిస్తుందది. మనసుల్లో అలాంటి తారతమ్యాలు ఉండరాదని పాఠం చెబుతుంది. కలిసి బతకడాన్ని ప్రోత్సహిస్తుంది. రూపా గోస్వామో లీలాశుకుడో జయదేవుడో మదిని ఆవేశిస్తే కౌముది తత్వం గుండెకు పడుతుంది. కార్తికాన్ని వెన్నెల మాసం అనడంలోని అంతరార్థం బోధపడుతుంది. చంద్రుణ్ని షోడశ కళాప్రపూర్ణుడని ఎందుకంటారో తెలుస్తుంది. అమృత, మానద, పూష, తుష్టి, పుష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, పూర్ణామృత- అనే పదహారు కళలతో నిండుగా వెలిగే పున్నమి చంద్రుడి అతిలోక సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదించాలంటే కార్తిక పౌర్ణమిని మించిన రోజు లేనేలేదు.

ఎర్రాప్రగడ రామకృష్ణ
పరశురాముడు

పూర్వం కొంతమంది మహర్షులకు ముక్కుమీదే కోపం ఉండేది. విశ్వామిత్రుడు, దూర్వాసుడు, పరశురాముడు... వీరంతా ఆ కోవకు చెందినవారే. అందుకే దేవతలు సైతం వారితో జాగ్రత్తగా ఉండేవారని చెబుతాయి పురాణాలు.

ముఖ్యంగా పరశురాముడి గురించి చెప్పాల్సివస్తే.. ఆయన జమదగ్ని, రేణుకల చిన్న కుమారుడు. శివుడి దగ్గర అస్త్రశస్త్ర విద్యలు అభ్యసించి అజేయుడిగా నిలిచాడు. ఎంతటి పరాక్రమవంతుడో అంతటి కోపిష్టి. ఆయన ఆయుధం గండ్రగొడ్డలి (అందుకే పరశురాముడన్న పేరు వచ్చింది). దీన్ని శివుడి నుంచి పొందాడు. ప్రభువుల అహంకారం, నిరంకుశత్వం, దౌర్జన్యాలను నిలువరించడానికి పరశురాముడు ఆయుధం చేపట్టి యోధుడిగా మారతాడు. కార్తవీర్యార్జునుడి కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతి రాజ్యానికి పట్టుకుపోతారు. దాంతో పరశురాముడు తీవ్ర మనోవేదనకు గురవుతాడు. ఆ బాధ కోపంగా, ప్రతీకారంగా మారుతుంది. నేరుగా వెళ్లి కార్తవీర్యార్జునుడి కొడుకులను సంహరించి తండ్రి తల తీసుకొచ్చి మొండేనికి అతికించి జీవం పోస్తాడు. ఏలికలందరినీ తెగనరికి వారి రక్తాన్ని తెచ్చి శ్యమంతక పంచకమనే అయిదు సరస్సులలో నింపుతాడు. తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. ధర్మం నాలుగు పాదాల మీద నడవాలన్నదే ఆయన లక్ష్యం. ఎవరైతే దారి తప్పి, అన్యాయానికి ఒడిగడతారో వారిపై తీవ్రంగా స్పందించడం ఆయన నైజం. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఆరవది పరశురామావతారం. పాలకుల్లో దుష్టులైనవారిని శిక్షించి, వారి అవినీతి అక్రమాలను అంతమొందించేందుకే విష్ణుమూర్తి ఈ అవతారం ఎత్తాడన్నది పురాణాల సారాంశం.

పరశురాముణ్ని భార్గవరాముడనీ పిలుస్తారు. ఏతావాతా ఆయన ఆగ్రహం బహుముఖంగా ఉందన్నది నిర్వివాద అంశం. అంతటి కోపం ఉన్నప్పటికీ తండ్రి మాట జవదాటని పుత్రుడిగా చరిత్రలో నిలిచాడు. ఒకానొక సందర్భంలో జమదగ్ని భార్య రేణుకపై ఆగ్రహోదగ్రుడై ఆమెను సంహరించాలని తన కొడుకులను ఆదేశిస్తాడు. మిగిలిన వారు నిరాకరించడంతో ఆ కార్యాన్ని చిన్న కొడుకు పరశురాముడికి అప్పజెబుతాడు. అప్పుడాయన తల్లిని, సోదరులను సంహరిస్తాడు. దానికి సంతోషించిన తండ్రి ఏదైనా వరం కోరుకోమనగా.. తల్లి, సోదరులను తిరిగి బతికించమని అడిగి, సాధిస్తాడు. మహాభారతంలోనూ పరశురాముడి కోపాన్ని కర్ణుడు చవిచూస్తాడు. అతడు అబద్ధమాడి పరశురాముడి దగ్గర విద్యలను అభ్యసిస్తాడు. తరవాత ఆ విషయం తెలుసుకున్న పరశురాముడు ఆగ్రహంతో ఊగిపోతూ... యుద్ధ సమయంలో తాను నేర్పిన ఏ విద్యా గుర్తుకురాదని కర్ణున్ని శపిస్తాడు. శివుడి దర్శనానికి వెళ్లిన సందర్భంలో వినాయకుడు అడ్డుకోవడంతో పరశురాముడు కోపంతో తన పరశువును విసిరేస్తాడు. దాంతో గణేశుడి దంతం విరుగుతుంది. కోపం మనిషి ప్రథమ శత్రువైనప్పటికీ.. కొన్ని సందర్భాల్లో మంచికీ ఉపయోగించవచ్చని పరశురాముడి కథ చెబుతుంది.

చెన్నాప్రగడ శర్మ
పోలి స్వర్గం

కార్తీక మాసం పూర్తయి, కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే రోజుని “పోలి పాడ్యమి,” లేదా “పోలి స్వర్గం” అంటారు. ఈ రోజు నుంచే మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది. కార్తీక మాసంలో శివుడిని పూజిస్తే, మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తారు. ప్రాచీనకాలం నుండి స్త్రీలందరినీ ప్రభావితం చేసే నోములలో పోలి స్వర్గం పవిత్రమైనది. మరణానంతరం స్వర్గాన్ని పొందాలనే కోరికతో, పోలి పాడ్యమి రోజున మహిళలు, యువతులు అరటి డొప్పలలో దీపాలు వెలిగించి, నీటి కొలనులు, చెరువులు, నదుల్లో పసుపు కుంకుమ, పూలు పెట్టి వదులుతారు.

ఆశ్వయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకూ ప్రాతః కాలమున నదీ స్నానం చేసి దీపాలను వెలిగించలేనివారు, ఈ పోలి స్వర్గం రోజు తెల్లవారుఝామునే స్నానమాచరించి నదిలో భక్తితో అరటిదొప్పలో దీపములు వెలిగించి నీటిలో వదిలిన వారికి, కార్తీక మాసం అంతా తెల్లవారు ఝామున నదీస్నానమాచరించి, దీపములు వెలిగించిన ఫలితాలు కలుగుతాయి. తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు.

మనిషి చేసే సత్కర్మలు స్వర్గానికి చేరువ చేస్తాయి. స్వర్గాన్ని అమృతలోకం అంటారు. వాల్మీకి రామాయణంలో స్వర్గాన్ని “పుణ్యలోకం” అని పిలుస్తారు.

ప్రతి మనిషి స్వర్గాన్ని చేరడానికే ఆరాట పడతాడు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు స్వర్గలోక ప్రాప్తికి చేయవలసిన మంచి కర్మల గురించి చెబుతాయి. ఈ మంచి కర్మలు సమాజంలో వ్యక్తిని మహామనీషిగా నిలబెట్టడమే కాకుండా పుణ్యలోక ప్రాప్తికి అర్హుడిగా చేస్తాయి.

శివపురాణం శివలోకమే స్వర్గమని తెలియజేస్తుంది. అథర్వవేదం ప్రకారం పుణ్యకర్మల ఫలంగా పొందే ప్రకాశమయమైన లోకమే స్వర్గలోకమని వివరిస్తుంది. గరుడ పురాణంలో జీవాత్మ స్వర్గ–నరక ప్రవేశ మార్గాల గురించి ఉంది. రామాయణంలో జటాయువు స్వర్గప్రాప్తి, రాముడు చేసే పితృకార్యము ద్వారా స్వర్గ ప్రాప్తి, అహల్య శాపవిమోచనం ద్వారా స్వర్గస్థితి గురించి ప్రస్తావనలు ఉన్నాయి. మహాభారతంలో ప్రధాన స్వర్గప్రవేశ కథ – యుధిష్ఠిరుని స్వర్గారోహణం, అర్జునుడు – దేవలోక యాత్ర, నరకస్వర్గాలను ప్రత్యక్షంగా దర్శించిన ప్రసంగాలు, కృష్ణుడు చెప్పిన స్వర్గఫలం గురించి వివరాలు ఉన్నాయి. అయితే పై అన్నింటికన్నా – బొందితో స్వర్గ లోకం పొందిన పోలి గాథ మనకు ఆదర్శం. పోలిలా స్వర్గాన్ని చేరాలనే తాపత్రయం మానవమాత్రులకు ఉండడం సహజం.

ఒక చాకలి మాలినికి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు. ఆ స్త్రీ ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక బహుళ అమావాస్య వరకు తెల్లవారు ఝామున పెద్దకోడళ్ళు నలుగురితోపాటు నదీ స్నానము చేసి, దీపము పెట్టేది. అత్త, మిగిలిన తోడికోడళ్ళు పోలిపై కనికరం చూపకుండా, ప్రతి రోజూ నదికి అట్టహాసముగా వెళ్ళి దీపాలు పెట్టుకొని వచ్చేవారు. కాని పోలి ఇంట్లోని నూతి దగ్గరే స్నానమాచరించి, మజ్జిగ చిలికి కవ్వమునకు అంటిన వెన్నతో, పత్తి చెట్టు కింద రాలిన పత్తి తెచ్చుకొని వత్తి చేసుకొని అరటి దొప్పలో వేసి, చాకలి బానలో నీళ్లు పోసి అందులో దీపం వెలిగించి వదిలి శ్రీహరికి నమస్కరించేది. ఈ విధంగా నిత్యమూ చేసేది. శ్రీహరి ఆమె శ్రద్ధాసక్తులకు ప్రసన్నుడై, పుష్పకవిమానమును పంపి పోలిని బొందితో స్వర్గమునకు రప్పించెను. ఆ విమానంలో ఉన్న పోలిని చూసి అత్తాకోడళ్లు పోలి స్వర్గమునకు వెళ్ళుతున్నదని ఆశ్చర్యపడసాగిరి. అది చూచి విష్ణు భగవానుడు: “ఈ పోలి అత్యంత శ్రద్ధాసక్తులతో నిత్యమూ జ్యోతి వెలిగించింది. కానీ మీరు కల్మష హృదయముతో ఆడంబరానికి పోయి అట్టహాసముగా జ్యోతులు వెలిగించారు. నిజానికి మీలో భక్తి ఇసుమంతయినా లేదు. కావున మీకు స్వర్గానికి వచ్చే అదృష్టము లేదని” చెప్పాడు. నోములకు, వ్రతాలకు, పూజాపునస్కారాలకు నిజానికి కావలసింది భక్తి శ్రద్ధలు గానీ, ఆడంబరాలు, అట్టహాసాలు కావు.

శ్రీధర్ కక్కెర్ల
పరమాత్ముడి ప్రవచనం
భగవద్గీత... శ్రీకృష్ణ పరమాత్మ పాండవ మధ్యముడైన అర్జునుడికి బోధించిన అద్భుత వికాస పాఠం. పరమాత్మ ప్రబోధం అర్జునుడికే అయినా, విశ్వ మానవాళి దైనందిన జీవితంలో తెలుసుకోవాల్సిన అనేక విషయాలు భగవద్గీతలో దర్శనమిస్తాయి. భగవద్గీత అపురూపమైన విశ్వమానవ విజ్ఞానకోశం! నిత్యసత్యాలు, మార్గదర్శకమైన బోధనలు అన్ని అధ్యాయాలలోనూ అంతర్భాగమై, నవ్యమైన జీవనానికి బంగరు బాటలు వేస్తాయి.

అమృతతుల్యమైన గీతాసారాన్ని పరికిస్తే, మంచి చెడుల మధ్య జరిగే నిరంతర సంఘర్షణ, మానవులు ఆచరించాల్సిన జీవన నియమాల వంటివి వ్యక్తిత్వవికాసానికి హితమైన రీతిలో కన్పిస్తాయి. ఇంద్రియ భోగం క్షణభంగురమనీ, ఆవేశాలను, ఆవేదనలను మనిషి వీలున్నంతగా నిగ్రహించుకోవడం అవసరమని గీత చెబుతోంది. దేహినిత్యుడని, దేహాలు అనిత్యాలనీ ప్రబోధిస్తూ, ఒంటి మీద పెంచుకునే మమకారం శుష్కమైందని కృష్ణ పరమాత్మ ప్రబోధించాడు. తద్వారా లంపటాలపై, అనుబంధాలపై నిండిన అమితమైన ఆసక్తి మనుషులకు నిరర్థకమని విశదం చేశాడు.

ప్రాపంచిక సుఖభోగాలపట్ల మమకారంతో మెలిగే జీవులు చిత్తభ్రాంతికి లోనవుతారు. భగవత్‌ప్రాప్తి పథంలో సాఫల్యానికి కావాల్సిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు. కళ్ల ముందు కనిపించే అందాలు, ఆనందాలు శాశ్వతమని భావించే అల్పమనస్కులు వీరు. ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా, సముద్రం ఎలా నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంటుందో, అలాగే వాంఛనీయ వస్తువులు కనులముందు దర్శనమిస్తున్నా, చలించని యోగి నిజమైన శాంతిని పొందుతాడన్న గీతా ప్రబోధం నిత్యసత్యం. వివేకులకు అనుభవైకవేద్యం. పనులను కర్తవ్యంలా పూనికతో నిర్వహిస్తూ, కర్మఫలాలపై ఆసక్తి లేకుండా వ్యవహరించే వ్యక్తి పరమపదాన్ని చేరుకోగలడని గీత బోధించింది. పండితుడైనవాడు అందరినీ, అన్నిటినీ సమదృష్టితో చూస్తాడని తెలుపుతూ పాండిత్యమన్న పదానికి మహితమైన నిర్వచనాన్ని భగవద్గీత అందించింది. మనిషికి మనసే మిత్రుడు, మనసే శత్రువు. మనసును జయించిన యోగులు శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, మానావమానాలవంటి ద్వంద్వాలకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. వారు ప్రశాంతతతో, స్థిరచిత్తంతో మెలుగుతారన్నది గీతావాక్యం. భగవద్గీత అనేది ఆధ్యాత్మిక బోధ కాదు. మనుషులు తాము చేయాల్సిన పనుల పట్ల ఎంతటి నిబద్ధతతో ముందుకు సాగాలో చెప్పే విశిష్ట గ్రంథం.

సత్వరజస్తమో గుణాలకు అతీతంగా ప్రవర్తించేవారే పరమాత్మను తెలుసుకోగలరని గీత పేర్కొంది. సుఖదుఃఖాలలో ఒక రీతిగానే ఉండేవారు; మట్టిముద్దను, బంగారాన్ని ఒకే విలువతో చూసేవారు; అనుకూల, ప్రతికూల పరిస్థితుల్లో ఒక్కరీతిగానే ఉండేవారు; నిందాస్తుతులను రెంటినీ సమంగా స్వీకరించేవారే త్రిగుణాలకు అతీతులు. వారి వర్తన అందరికీ మార్గదర్శకమనీ గీత ప్రబోధించింది. పరమాత్మ జగతికి అందించిన మహత్తర జీవన సందేశమిది.

వెంకట్‌గరికపాటి
గెలుపు దారి

లోకంలో కొందరు తమ బుద్ధి విశేషంతో, అపార అనుభవంతో ఎలాంటి సమస్యలనైనా తేలిగ్గా ఎదుర్కొంటారు. సొంతంగా నిర్ణయాలు తీసుకోగల ఆ సామర్థ్యాన్ని స్వయం ప్రతిపత్తిగా చెప్పుకోవచ్చు. ఆ క్రమంలో విజయం సాధించినప్పుడల్లా తమపై తమకు నమ్మకం పెరుగుతూ వస్తుంది. ఆధ్యాత్మిక పరిభాషలో ‘పౌరుషం’ అంటే అదే!

మరికొందరు ప్రతి విషయానికీ దేవుడి సాయం ఆశిస్తారు. తమ చిత్తాన్ని దైవానికి అంకితం చేసి, కోరికలను ప్రార్థన రూపంలో భగవంతుడికి నివేదిస్తూ ఉంటారు. ఆ క్రమంలో గెలుపొందినప్పుడల్లా వారికి దేవుడిపై నమ్మకం మరింత బలపడుతూ వస్తుంది. అలా తమను తాము దైవానికి సమర్పణ చేసుకోవడమే- ‘శరణాగతి’. ఆ మార్గంలో దక్కిన విజయాన్ని ‘దైవికత’ అంటారు. దైవ, పౌరుషాల మధ్య సమన్వయం చేకూరితే సంపూర్ణ విజయం సిద్ధిస్తుందని పెద్దల సూచన. అర్జునుడికి లభించింది అది. పూర్తి సామర్థ్యంతో, పరాక్రమంతో తానే యుద్ధం చేసినా కీలక సమయాల్లో మాత్రం కృష్ణుడి సహకారాన్ని స్వీకరించాడు. దైవ, పౌరుషాల ఆ మేలికలయిక కిరీటికి గొప్ప విజయాన్ని అందించింది. ‘శిశుపాల వధ’లో మాఘకవి- ఆ కలుపుగోలు ధోరణిని వివరిస్తూ ‘విద్వాంసుడు పూర్తిగా దైవంపై ఆధారపడడు. అలా అని, అంతా తన ప్రతిభేననీ పొరబడడు. సత్కవులకు శబ్దం, అర్థం రెండూ అవసరమైనట్లే... విజేతల విషయంలో దైవ పౌరుషాలు ఒకటవ్వాలి’ అన్నాడు. ఆధునిక యుగంలో ఈ సూత్రాన్ని విజయవంతంగా అమలుచేసిన వారిలో భారత పూర్వ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్‌కలామ్‌అగ్రగణ్యులు.

‘ఆదినుంచీ దైవాన్ని నా కార్యకలాపాల్లో భాగస్వామిగా నమ్మడం అలవాటు. విధుల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించడం అన్నివేళలా సాధ్యం కాదని, అది నా శక్తికి మించినదని నాకు తెలుసు. నా సామర్థ్యాన్ని తొలుత అంచనా వేసుకుని దాన్ని యాభైశాతం పెంచి, నన్ను నేను దేవుడి చేతులకు సమర్పించుకుంటాను. ఆ తరహా సమష్టి భాగస్వామ్యంలో నేను అదనపు శక్తిని పొందడమే కాక, అది నిజంగానే నా ద్వారా ప్రసరిస్తున్న అనుభూతిని సైతం స్వయంగా ఆస్వాదించాను. దేవుడి రాజ్యం నీలోనే ఆ శక్తి రూపంలో ఉంటుందని నిశ్చయంగా చెప్పగలను’ అంటూ తన ఆత్మకథలో కలామ్‌చెప్పారు.

దిలీప్‌కుమార్‌గా పుట్టి పదహారో ఏట సూఫిజాన్ని స్వీకరించి, భారతీయ సినీ సంగీత జగత్తును శాసించే స్థాయికి ఎదిగిన ఎ.ఆర్‌.రెహమాన్‌అనుభవమూ అదే. ‘ఎప్పటికప్పుడు కొత్తదేదో చేయడానికి నన్నొక శక్తి ముందుకు తోస్తోందని నిత్యం అనిపిస్తూనే ఉంది’ అన్నారాయన. పడమటి సంగీతానికి పట్టుచీర కట్టినట్లు తన పౌరుషానికి దైవికతను చుట్టబెట్టానని దాని అంతరార్థం.

కలామ్, రెహమాన్‌ల విషయంలో ఆధ్యాత్మికత అనేది విశ్వాసాలకు చెందినది కాదు- అధ్యయనం చేయాల్సిన అంశంగా నిరూపణ అయిన విషయం. దాన్ని అర్థం చేసుకుంటే ఆధ్యాత్మికతను మనిషి తనకు చోదకశక్తిగా మలచుకోగలుగుతాడు. అది గెలుపు దిశగా మనిషిని నడిపించగలుగుతుంది.

ఎర్రాప్రగడ రామకృష్ణ
నువ్వేమిటో నీకు తెలియాలి

మనిషి తన జీవితంలో ‘ఎరుక’ను విస్మరిస్తున్నాడు. ఎక్కడెక్కడో దేనికోసమో నిరంతరం అన్వేషిస్తున్నాడు. కానీ, తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు. వెతుకుతున్నది తన దగ్గరే ఉందని గ్రహించడం లేదు. రామాయణ, భారత, భాగవతాలు చెప్పింది ఇదే. ‘తెలుసుకోవడం’ దగ్గరనే తడబాటు. మహాత్ములు, మహర్షుల కథల నుంచో, ప్రవచనాలు వినో తనని తాను తెలుసుకోవడం లేదు. సాధారణ వ్యక్తులే కాదు. బుద్ధుడు సహితం ఈ విషయం ఆలస్యంగానే గ్రహించాడు. సమాధానం గ్రహించి అవతార పురుషుడయ్యాడు.

మోక్షం కోసం, జ్ఞానసిద్ధి కోసం, దుఃఖం లేని లోక నిర్మాణం కోసం తన శరీరాన్ని శుష్కింపజేసుకున్నాడు. మరణం కొద్ది రోజులలో తథ్యమనిపించింది. అటువంటి సమయంలో ఓ కళాకారుల బృందం అటుగా ఏ జాతరకో వెళ్తోంది. ఆ గుంపులో ఓ కుర్రాడు తన తంబురాను సవరిస్తున్నాడు. అతణ్ని ఓ వృద్ధ కళాకారుడు హెచ్చరిస్తూ ‘ఒరేయ్అబ్బాయ్... ఆ తీగల్ని మరీ గట్టిగా బిగిస్తే తెగిపోతాయి. మరీ వదులుగా వదిలేస్తే అపస్వరాలు పలుకుతాయి. ఎలా ఉన్నవాటిని అలానే ఉంచితే కమ్మని స్వరాల్ని వినిపిస్తాయి’ అన్నాడు. శరీరం శుష్కించి, నీరసంగా ఉన్న బుద్ధుడి చెవులను తాకాయి ఆ మాటలు. వాటిలోని సత్యాన్ని ఆయన మనసు గ్రహించింది. తనకు అన్వయించుకుంది. ‘నేనూ ఆ తీగ వంటివాడినే. నిన్నటి వరకు రాకుమారుడిగా సుఖాలను అనుభవించాను. వదులైన తీగనయ్యాను. తరవాత శరీరాన్ని కఠోర నియమాలతో శుష్కింపజేశాను. బిగించిన తీగలా అయాను. రెండూ తప్పే. శరీరాన్ని శరీరంలా చూసుకోవాలి’ అనుకున్నాడు. జీవితంలో ధ్యానం కాదు... జీవితమే ధ్యానమని గ్రహించాడు బుద్ధుడు. ఆ దిశగా తనను తాను తెలుసుకుని ప్రసిద్ధుడయ్యాడు. ఆ తరవాత ఆయన దగ్గరికి పలు సమస్యలు, కష్టాల గురించి చెప్పుకోవడానికి వచ్చిన వారిని ‘జీవితం పట్ల మీకు ఎరుక ఉందా’ అని ప్రశ్నించేవాడు.

ఇది జెన్కథ కావచ్చు. కానీ... వర్తమానంలో ప్రతి ఒక్కరూ ఒక్క క్షణమైనా పునరాలోచన చేసుకోవాలి. అందరూ తమ గురించి తమకు బాగా తెలుసనుకుంటారు. కానీ... నిజంగా ‘ఎరుక’ అనేది వారికి తెలియదు. అదే ఉంటే అసలు సమస్యలకు, కష్టాలకు పరిష్కారం ఎవరి దగ్గర ఉందో తెలిసిపోవాలి కదా! రాముడు, కృష్ణుడు తదితర అవతారాల్లోని మూల సూత్రాన్ని దేవదేవుడు ముందుగానే నిర్ణయించుకోబట్టే కదా ఆయా లక్ష్యాలను పూర్తి చేశారు. భగవంతుడి కథలలో తెలుసుకోవాల్సిన నీతి - ఎవరిని వారు తెలుసుకోవడమే! అది జరగనంత వరకు మనిషి తనను తాను గుర్తించలేడనేది బుద్ధ భగవానుడి ఉవాచ. ‘నిన్ను నువ్వు ప్రేమించాలంటే.. నువ్వేమిటో నీకు తెలియాలి. తెలియకపోతే ప్రేమించలేవు’. ఆ ఎరుక ఇప్పుడు అందరికీ అవసరం.

భమిడిపాటి గౌరీశంకర్
కాలభైరవ తత్త్వం

కాలమే సృష్టిని నడిపేది, కాలమే జీవనాన్ని పరిపక్వం చేస్తుందని మహాభారతం చెబుతుంది. ‘కాలం మహా గురువై, దాన్ని గౌరవించేవారికి జీవితసత్యాలను బోధిస్తుంది’ అంటారు స్వామీ వివేకానంద. కాలం జగత్తులోని అత్యంత గూఢమైన శక్తి. ఈ కాలతత్త్వానికి మూలస్వరూపమే కాలభైరవుడు.

‘కాలస్తి భైరవః శంభోః’ అని శైవాగమాలు పేర్కొన్నట్లు, కాలం స్వయంగా శంభుడి తేజస్సని భావన. దీనికి వేదాలు, పురాణాలు తదితరాలన్నీ బలమైన ఆధారాలు. వీటన్నింటిలో భైరవుణ్ని- శివుని ఉగ్రమూర్తిగా, జగత్ప్రభువైన కాలాధిపతిగా వర్ణించారు. భారత ఆధ్యాత్మిక సంప్రదాయంలో కాలానికి అత్యున్నత స్థానం ఉంది. విశ్వం తన సృష్టి, స్థితి, లయ చక్రమంతటినీ కాలం ఆధారంగానే నడిపిస్తుందని వేదాలు స్పష్టం చేస్తాయి. రుగ్వేదంలోని కొన్ని సూక్తుల్లో భైరవ స్వరూపాన్ని ‘కాలో- రుద్రో భవతి’ అన్న భావంతో వర్ణించారు. ‘కాలో అశ్వో’ అంటూ కాలాన్ని శక్తిరూపంగా చెప్పే వచనాలు భెరవుడి తత్త్వానికి మూలాలు. వేదాంతదృష్టిలో కాలాన్ని నియంత్రించేవాడు దానికి అతీతుడై ఉండాలి. ఆ స్థితి పరబ్రహ్మ స్వరూపమైన శివుడిదే. శ్వేతాశ్వతర ఉపనిషత్తు రుద్రుణ్ని ‘జగద్ధారుడు’, ‘భూతకర్త’, ‘కారకాధిపతి’గా ప్రకటించడం, భైరవుడి కాలాధిపత్య భావనకు మరింత బలమిస్తుంది. ఉగ్రతలో కూడా రక్షణ ఉందని ఉపనిషత్తులు సూచిస్తాయి. అది కాలభైరవ తత్త్వ ముఖ్యస్వరూపం.
శివ, స్కంద, వాయుపురాణాల్లో భైరవుడి అవతార కథ ఉంది. బ్రహ్మ తన అయిదో శిరస్సుతో అహంకారాన్ని ప్రదర్శించిన సందర్భంలో, సృష్టిలో సమతుల్యాన్ని కాపాడేందుకు శివుడు ఉగ్రరూపాన్ని సంతరించుకున్నాడని పురాణాలు తెలియజేస్తాయి. రుద్రుడు బ్రహ్మ అయిదో శిరస్సును తొలగించడంలోని అహంకార నిర్మూలనకు ప్రతిరూపమే కాలభైరవుడు. అధర్మం ఎదురైనప్పుడు శివతత్త్వం ఉగ్రరూపం తీసుకుంటుందని ఈ కథ బోధిస్తుంది.


భైరవుణ్ని అత్యంత శక్తిమంతమైన రక్షకదేవతగా కొలుస్తారు. కాల నియంత్రకుడు, కర్మఫలదాత, జ్ఞానప్రదాతగా సేవిస్తారు. తాంత్రిక సంప్రదాయంలో భైరవుడు మానసిక భయాలను, సంకల్ప దౌర్బల్యాలను, అజ్ఞానాన్ని దహించే దివ్యశక్తిగా కనిపిస్తాడు. అంతేకాక భైరవుడి ప్రధాన రూపాలైన అష్టభైరవులలో కాలభైరవుడు శ్రేష్ఠుడు. ఆయన చేతిలోని కాలదండం- సమయం, నిర్ణయం, శిక్ష, రక్షణ అనే నాలుగు పరమార్థాలను సూచిస్తుంది.
ఆదిశంకరాచార్యులు రచించిన కాలభైరవాష్టకంలో భైరవుణ్ని కాశీక్షేత్రాధిపతిగా, మోక్షమార్గదర్శిగా, జ్ఞానమార్గాన్ని చూపించే పరమశక్తిగా వర్ణించారు. భైరవుడి రూపం శ్మశానవాసం, కపాలమాల, నీలవర్ణం, రౌద్రదృష్టి వంటి లక్షణాలతో కూడినప్పటికీ, ఇవన్నీ అనిత్యతను గ్రహించే జ్ఞానం, అభయాన్ని ప్రసాదించే రక్షణతత్వానికి సూచికలు. ఆయన వాహనం శ్వానం(జాగిలం)- విశ్వాసం, అప్రమత్తత, ధర్మరక్షణలకు ప్రతీక.
కాలభైరవ తత్త్వం మనిషికి మూడు ప్రధాన సందేశాలు అందిస్తుంది. అవి... కాలాన్ని గౌరవించాలి. సమయాన్ని సద్వినియోగం చేయాలి. జీవన పతనానికి మూలమైన అహంకారాన్ని వీడి ధర్మవర్తనులు కావాలి.

డాక్టర్శ్రీదేవీ శ్రీకాంత్
కృతజ్ఞత... యోగమార్గం

మనిషి జీవితంలో భావోద్వేగాలకు కీలకమైన స్థానం ఉంది. వాటిలో కృతజ్ఞత అనేది అత్యంత పవిత్రమైన భావన. కృతజ్ఞతలు... హృదయపూర్వకంగా చెప్పే ధన్యవాదాలు. మనకు ఉపకారం చేసినవారికి మనసారా ధన్యవాదాలు చెప్పడమే కాకుండా, వారు చేసిన మేలును గుర్తుంచుకుని జీవితంలో ప్రతిఫలించడం. అదే అసలైన కృతజ్ఞతా రూపం. మానవసంబంధాలు, పరస్పర గౌరవం, దయా మమతలు అన్నీ దాని ద్వారా స్థిరపడతాయి.

విద్యార్థులు గురువుల పట్ల, పిల్లలు తల్లిదండ్రుల పట్ల, భక్తులు భగవంతుడి పట్ల చూపే కృతజ్ఞత భావన వల్ల జీవితం ధర్మమార్గంలో నడుస్తుంది. ధన్యవాదమనేది ఒక ఆధ్యాత్మిక సాధనం. ఇది మనిషిని సానుకూల దృక్పథంతో నింపుతుంది. సంతోషం, శాంతి, దైవసాన్నిధ్యాల వైపు నడిపిస్తుంది. దానివల్ల అసంతృప్తి, అసూయ వంటి ప్రతికూల భావనలు తొలగిపోతాయి. పురాణ ఇతిహాసాల్లో కృతజ్ఞతను ఒక ధర్మంగా, జీవనవిలువగా వర్ణించారు. ఇది మనిషి హృదయాన్ని స్వచ్ఛంచేసి, సంబంధాలను మెరుగు పరుస్తుంది. కృతజ్ఞత లేని జీవితం అసంపూర్ణం. కృతజ్ఞత ఆత్మను పరమాత్మతో జోడిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ధర్మం, కర్మ, సమర్పణ గురించి బోధిస్తూ దైవంపట్ల, సమాజంపట్ల కృతజ్ఞత ఉండాలని సూచిస్తాడు. చేసిన మేలును గుర్తుంచుకోవడం మనిషిని వినమ్రతతో నడిపిస్తుంది. ఆధ్యాత్మిక దృక్కోణంలో కృతజ్ఞత ఒక రకమైన ధ్యానంలా పనిచేసి ఎదుగుదలకు పునాది వేస్తుంది. మనసును శాంతిమయం చేస్తుంది. చిన్న చిన్న విషయాలకు కృతజ్ఞత చూపడం అలవరచుకుంటే ఆ ఆనందాన్ని అనుభూతి చెందవచ్చు. రాముడు హనుమంతుణ్ని ఆత్మీయుడిగా, స్నేహితుడిగా గౌరవించాడు. దానికి ప్రతిగా హనుమంతుడు శ్రీరాముడి పట్ల అపారమైన కృతజ్ఞతను, భక్తిని చూపించాడు. సీతమ్మని వెతకడం, లంకను దహించడం, రాముడి కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడటం వంటివి హనుమంతుడి కృతజ్ఞతకు నిదర్శనాలు. కృష్ణార్జునుల అనుబంధం, కృష్ణ సుధాముల మైత్రి కథలూ ఇందుకు పేరొందినవే. కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసి అతణ్ని ధర్మమార్గంలో నడిపించాడు. దానికి ప్రతిగా అర్జునుడు కృష్ణుణ్ని గురువుగా, స్నేహితుడిగా గౌరవించాడు. సుధాముడు బీదవాడైనప్పటికీ కృష్ణుడితో ఉన్న స్నేహబాంధ]వ్యాన్ని గౌరవిస్తూ కానుకగా అటుకులు తీసుకెళ్లాడు. కృష్ణుడు ఆ అటుకులను అత్యంత ప్రేమతో స్వీకరించి సుధాముడికి అపారమైన సంపదను ప్రసాదించాడు. ఈ కథలు కృతజ్ఞత శక్తిని, అది ఎలా దైవానుగ్రహాన్ని తెస్తుందో చూపిస్తాయి.

కృతజ్ఞత ఒక యోగమార్గం. మనసును అహంకారం నుంచి విముక్తంచేసి, దైవంతో ఐక్యం కావడానికి సాయపడుతుంది. ప్రతి వ్యక్తీ తన కర్తవ్యాలను నిస్వార్థంగా నిర్వహించి ఫలితాల పట్ల కృతజ్ఞతగా ఉండాలి. ప్రకృతి పట్ల కృతజ్ఞత చూపడం ఒక ఆధ్యాత్మిక సాధనంగా పురాణాలలో పేర్కొన్నారు. అది మనిషిని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, సందిగ్ధం నుంచి స్పష్టత వైపు నడిపిస్తుంది. కాబట్టి, కృతజ్ఞతను జీవన విధానంగా మార్చుకోవడం ద్వారా శాంతి, సంతృప్తి, దైవ సాన్నిధ్యాలను పొందవచ్చు.

తల్లాప్రగడ గోపాలకృష్ణ
మహాభక్తులు
శ్రీవైష్ణవ సంప్రదాయంలో 12 మంది ఆళ్వారులు ఉంటారు. ఆళ్వారులంటే లోతులను చూసినవారని ఒక భావన. కాపాడేవాడనీ, పరిపాలకుడనీ, భగవంతుడనీ భిన్నార్థాలున్నాయి. శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మమని, పరంధాముడని ప్రకటించిన మహా భక్తులు ఆళ్వారులు. వీరు తమిళంలో రచించిన స్తోత్రాలను పాశురాలంటారు. నాలుగువేల పాశురాలు గల ‘వాలాయిరమ్‌’ అనే దివ్య ప్రబంధాన్ని ద్రావిడ వేదమన్నారు.

భిన్న సామాజిక నేపథ్యం కలిగిన ఆళ్వారుల్లో మొదటి ముగ్గురిని మొదలాళ్వారులంటారు. ఈ ముగ్గురు పాయ్‌గై, పూదత్త, పేయాళ్వారులు. శ్రీమన్నారాయణుడి శంఖమైన పాంచజన్యం, గద కౌమోదకి, ఖడ్గం నందకం... అంశలతో జన్మించిన ఈ ముగ్గురూ విశ్వక్సేనుల నుంచి మంత్రోపదేశం పొంది దేశసంచారం చేశారన్నది భక్తుల విశ్వాసం. తిరుమళిశైయాళ్వార్‌సుదర్శన చక్రం అంశగా చెబుతారు. మేదరి ఇంట పెరిగిన ఆయన బుట్టలు, చేటలు అల్లి అమ్ముతుండేవారు. వైష్ణవ సిద్ధాంతంలో ప్రముఖుడైన నమ్మాళ్వార్‌చింతచెట్టు తొర్రలో నివసించేవారని, 108 దివ్యదేశాల్లోని స్వాములనూ కీర్తించారని సంప్రదాయం చెబుతోంది. నమ్మాళ్వారు ఆత్మవంటివాడని మిగిలిన పదకొండుమందీ అవయవాలని భావిస్తారు. నమ్మాళ్వారు తన 35వ ఏట ముక్కోటి ఏకాదశినాడు పరమపదించారు. ఆయన శిష్యుడు మధురకవి ఆళ్వారు నమ్మాళ్వారు ప్రవచించిన దివ్య ప్రబంధాలను ప్రచారం చేశాడు. వేదాలు, కావ్యాలు అధ్యయనం చేసి మధురకవిగా విఖ్యాతుడైన ఆయన శ్రీమన్నారాయణుడి గణాల్లో ప్రముఖుడైన కుముదుడి అంశతో జన్మించినట్టు భక్తుల విశ్వాసం. విల్లిపుత్తూరుకు చెందిన విష్ణుచిత్తుడే ఏడో వారైన పెరియాళ్వారు. గరుత్మంతుడి అంశగా భావించే ఆయన నిత్యం స్వామికి తులసిమాలలూ, రంగురంగుల పూదండలూ సమర్పించేవాడు. మధుర పాలకుడైన వల్లభదేవుడు మోక్షసాధనకు సులభమైన మార్గం తెలుసుకోవాలని అన్ని దేశాల విద్వాంసులనూ ఆహ్వానించాడు. కొంత ధనాన్ని మూట కట్టి స్తంభానికి వేలాడగట్టించి ఎవరి వాదన అనంతరం ఆ మూట కింద పడుతుందో అదే సరైన ధర్మమని నమ్ముతానని ప్రకటించాడు. వటపత్రశాయి కృపవల్ల విష్ణుచిత్తుడు విజేతగా నిలిచాడు. మహానందంతో 12 పాశురాలు గానం చేశాడు. కేరళలో ధృడవ్రతుడనే రాజదంపతులకు పుట్టిన కులశేఖరాళ్వారు రాజ్యాన్ని పాలించాడు. భక్తిరసమయంగా ముకుందమాల రచించాడు.

విష్ణుచిత్తుడి పెంపుడు కూతురు ఆండాళ్‌గోదాదేవిగా ప్రసిద్ధం. తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని లోకానికి ఉపదేశించారు. తిరుమంగై ఆళ్వారు హరి చేతిలోని ధనుస్సు అంశగా ప్రసిద్ధి. శ్రీరంగనాథుడే ఆయనకు అష్టాక్షరి ఉపదేశించాడట. విప్రనారాయణుడే తొందరప్పొడి ఆళ్వారు. దేవదేవి అనే వేశ్యకు వశుడై చివరకు పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతాడు. నారాయణుడి గుండెపై ఉండే శ్రీవత్సమనే పుట్టుమచ్చ అంశ అంటారు. లోకసారంగముని, తిరుప్పాణను భుజాలపై మోసుకుని రంగనాథుడి సన్నిధికి తీసుకుపోయినట్టు ఒక ఉదంతం బహుళ ప్రచారంలో ఉంది. ఈ ఆళ్వారును మునివాహనుడంటారు. మొదటి ముగ్గురు తప్ప మిగిలిన ఎనిమిది మంది క్రీ.శ 6- 10 శతాబ్దాల మధ్య జీవించినట్టు ఆధునిక చరిత్రకారులు పేర్కొంటున్నారు.

డాక్టర్‌దామెర వేంకట సూర్యారావు
పంచ సూత్రాలు

భూమి నిశ్చలంగా ఉన్నట్లు కనిపించినా, అది ప్రతిక్షణం చలనంలో ఉంటుంది. మరి ఈ స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తోంది? పురాణాల ప్రకారం, భూమిని నాలుగు దిగ్గజాలు (ఐరావతాలు) మోస్తున్నాయి. ఆ దిగ్గజాల పేర్లు విరూపాక్షుడు, భద్రుడు, మహాకాలుడు, మహాపద్ముడు. ఈ పేర్లలో దాగి ఉన్న నాలుగు శక్తులు - జ్ఞానం, ధర్మం, కాలజ్ఞానం, శాంతి. ఈ నాలుగింటిని ఒక్కటిగా ముడిపెట్టే అయిదో శక్తే... భక్తి.

తూర్పుదిక్కున విరూపాక్షుడు రూపాలకు అతీతమైన దృష్టికి ప్రతీక. జ్ఞానమంటే కేవలం చదవడం కాదు, అవగాహన. నిజాన్ని చూడాలంటే చైతన్యం ముఖ్యమని విరూపాక్ష దృష్టి చెబుతుంది. మనిషిలో అవగాహన ఉన్నప్పుడే సత్యం కనిపిస్తుంది. జ్ఞానం మనసుకు సరైన దిశనిచ్చే దివిటీ. అదే భూమిని స్థిరంగా ఉంచే మొదటి బలం. ఉత్తరాన్ని భద్రుడు పాలిస్తాడు. ఆయన పేరు శుభాన్ని సూచిస్తుంది. ధర్మమే నిజమైన భద్రత; ఆత్మనిబద్ధతే అంతిమ రక్షణ. ధర్మాన్ని కాపాడినవాడే సురక్షితంగా ఉంటాడు. ధర్మం ఆత్మ తాలూకు కర్తవ్యబోధ. ధర్మం ఉన్నచోట న్యాయం వెల్లివిరుస్తుంది. మహాభారతంలో యుధిష్ఠిరుడు ధర్మరాజుగా, ధర్మమే సమాజ స్థిరత్వానికి మూలమని నిరూపించాడు. వేదాలు సైతం ప్రజలు ధర్మం నుంచే ఉద్భవిస్తారని చెబుతాయి. పశ్చిమ దిక్కున మోసే మహాకాలుడు కాలస్వరూపుడు. కాలం మనకు అవగాహన కలిగించే గురువు. సమయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడు భాగ్యవంతుడవుతాడు. సమయాన్ని వ్యర్థం చేసినవాడు జీవితాన్ని వృథా చేసుకుంటాడు. కాలజ్ఞానం ఉన్నవాడు సృష్టిలో స్థిరంగా నిలబడతాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కాలాన్ని తన స్వరూపంగా చెప్పాడు. ఇక, దక్షిణ దిక్కున మహాపద్ముడు శాంతి, కరుణ, నిర్మలత్వానికి చిహ్నం. పద్మం మలినజలంలో పుట్టినా స్వచ్ఛంగా ఉంటుంది. అదే జీవన తత్త్వం. పరిస్థితులు ఎలాంటివైనా మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. శాంతి అంటే సమత్వం. శాంతి మనసుకు లభించే అంతరానందం. శాంతి ఉన్న చోటే దైవం ఉంటాడు. మహాపద్ముడు మనకు క్షమ, ప్రేమ, సహనం, తపస్సు నేర్పుతాడు.

భక్తి అంటే దైవంపై నమ్మకమే కాదు, మనలోని దివ్యత్వంపై విశ్వాసం. సమర్పణతో కూడిన భక్తి అంటే భగవంతుడిలో విలీనం కావాలనే తపన కలిగి ఉండటం. భక్తి లేకుంటే జ్ఞానదీపం వెలగదు, ధర్మం నిలవదు, శాంతి దొరకదని భగవద్గీత చెబుతోంది. భక్తి విశ్వానికి హృదయ స్పందన. దాన్ని వినగలిగితే దైవాన్ని దర్శించడం కష్టం కాదు. ఈ పంచతత్త్వాలు మనలో మేల్కొన్నప్పుడే... జ్ఞానంతో వివేచన, ధర్మంతో న్యాయం, కాలజ్ఞానంతో సమయోచిత నిర్ణయాలు, శాంతితో సహనం, భక్తితో ఐక్యత అలవడతాయి. భూమి నిలబడేది గజాలపై కాదు, విలువలపై. మానవత్వం నిలబడేది జ్ఞానం, ధర్మం, కాలజ్ఞానం, శాంతి, భక్తి అనే పంచసూత్రాలపై!

శ్రీధర్‌ కక్కెర్ల
అసలైన పూజ ఏది?

మ నిషి భగవంతుడికి దగ్గరవడానికి ఎంచుకునే మార్గమే పూజ. మన ఆత్మను పరమాత్మతో అనుసంధానించే వంతెనలాంటిది అది. అలాగని దేవుడి పటాలకు పూలు పెట్టి, ధూపదీపాలు సమర్పించినంత మాత్రాన అది పూజ అయిపోదు. పునాది లేని భవనం ఎలా కూలిపోతుందో.. భక్తి, ధర్మం లేని పూజ కూడా అలాగే నిష్ఫలమవుతుంది. పెద్దలు అన్నట్లు ‘భావం లేని పూజ- పత్రికి చేటు’. భగవంతుడు బాహ్య ఆడంబరాలకు కాదు, హృదయంలోని భావానికి మాత్రమే వశుడవుతాడు. శాస్త్రం ‘భావగ్రాహీ జనార్దనః’ అని చెబుతుంది. మనసులో కల్మషం పెట్టుకుని చేసే పూజ ఎంత గొప్పదైనా అది దేవుడికి చేరదు. మనసు భగవంతుడిపై కాకుండా ప్రాపంచిక విషయాలపై ఉంటే, ఆ పూజ అర్థహీనమవుతుంది. భగవద్గీత ప్రకారం ‘ఈశ్వరః సర్వభూతానాం’ అంటే- భగవంతుడు మన హృదయంలోనే నివసిస్తాడు.

‘నేను గొప్పగా పూజిస్తున్నాను’ అనే అహంకారంతో ఆర్భాటంగా చేసే పూజ రాజస గుణంతో నిండిపోతుంది. దక్ష ప్రజాపతి శివుణ్ని అవమానించాలనే ఉద్దేశంతో చేసిన మహాయజ్ఞం ఫలితం లేకుండా ధ్వంసమైంది. అలాగే రావణుడు గొప్ప భక్తుడైనా, అహంకారం వల్ల తపో ఫలాలను కోల్పోయాడు. అన్యాయంగా సంపాదించిన డబ్బుతో దేవుడికి బంగారు ఆభరణాలు అర్పించినంత మాత్రాన పుణ్యం రాదు. దుర్యోధనుడు శ్రీకృష్ణుడి కోసం వైభవంగా విందులు ఏర్పాటు చేశాడు. అవి అహంకారం, అన్యాయంతో కూడినవి కావడంతో కృష్ణుడు వాటిని తిరస్కరించాడు. బదులుగా, విదురుడు ప్రేమతో పెట్టిన సాధారణ భోజనాన్ని స్వీకరించాడు. ఇది భక్తి ముందు ఆడంబరం విలువలేనిదని స్పష్టం చేస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులను బాధపెడుతూ, బయట ఆలయాలకు వెళ్లి అర్చనలు చేస్తే పుణ్యం రాదు. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ’ అనేది మన సంస్కృతికి మూలసూత్రం. పుండరీకుడు తల్లిదండ్రులను సేవిస్తున్నప్పుడు స్వయంగా పాండురంగడు దర్శనమిచ్చినా, సేవ పూర్తయ్యేవరకు దేవుణ్నే వేచి ఉండమన్నాడు. తల్లిదండ్రుల సేవనే అసలైన పూజగా భావించాడు.

పైకి మంత్రాలు జపిస్తూ, లోపల ప్రాపంచిక విషయాలు ఆలోచించడమూ నిజమైన పూజ కాదు. చేత్తో దేవుడి ముందు దీపం వెలిగిస్తూ నోటితో పరులమీద నిందారోపణలు చేస్తుంటే... ఆ పూజ కేవలం శారీరక చర్యగా మిగులుతుంది. మనస్ఫూర్తిగా సమర్పించే చిన్న పువ్వు, యాంత్రికంగా చేసే వెయ్యి పూజలకన్నా గొప్పది. ఇక ఇతరులకు హాని చేయాలనే ఉద్దేశంతో చేసే పూజలు చివరికి నాశనానికే దారితీస్తాయి. భస్మాసురుడు ఘోర తపస్సు చేసినా, దురుద్దేశం వల్ల పొందిన వరమే అతడి మరణానికి కారణమైంది. శబరి ఎంగిలి పండ్లు, కన్నప్ప కంటి అర్పణ శాస్త్రోక్తంగా చేయకపోయినా, వారి నిష్కల్మషమైన భక్తి వల్ల అవి అత్యున్నత పూజలయ్యాయి. ఆడంబరాల జోలికి వెళ్లకుండా మనసును నిర్మలంగా ఉంచుకుని, తోటి జీవుల పట్ల కరుణతో, ధర్మబద్ధంగా జీవించడమే భగవంతుడికి మనం చేసే అసలైన పూజ.

కె. నారాయణ స్వామి పిళ్లై