Devotional Telugu
3.55K subscribers
105 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
ఆలోచనల్లో స్పష్టత

మనిషికి ఆలోచన అనేది దిక్సూచి వంటిది. ఏ దిశలో ఆలోచిస్తే, అటువైపే జీవితం ప్రయాణిస్తుంది. కాబట్టి ‘ఆలోచన’ అనేది అన్ని వైపులా, సమగ్రంగా పరిశీలించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ గుణం కలవారు భౌతికంగానే కాదు, ఆధ్యాత్మిక విషయాల్లోనూ గొప్ప ఫలితాలు పొందుతారు.

శ్రీకృష్ణుడు అర్జునుణ్ని యుద్ధానికి ప్రేరేపించేటప్పుడు విజయాన్ని మాత్రమే కాదు; ధర్మ పరిరక్షణ, భవిష్యత్తరాల సంక్షేమం వంటి అన్ని కోణాలను ఆలోచించి సలహా ఇచ్చాడు. అంత సమగ్రంగా ఆయన చేసిన ఆలోచన వల్లే పాండవులు ధర్మయుద్ధంలో విజయం సాధించారు. బుద్ధుడు సత్యాన్ని తెలుసుకోవడానికి రాజ్యాన్ని విడిచి వెళ్లినప్పుడు, అది క్షణికోత్సాహం కాదు. జీవితం, మరణం, దుఃఖం, విముక్తి- అన్నిటినీ లోతుగా పరిశీలించి తీసుకున్న నిర్ణయం. దాని వల్లే ధర్మచక్రం సమస్త లోకాన్ని చుట్టివచ్చింది.

దైనందిన జీవితంలో కూడా ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచించడం చాలా అవసరం. ఉదాహరణకు, ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలా, లేక క్షమించాలా అన్నదాన్ని కేవలం భావోద్వేగంతో కాకుండా; శాంతి, ధర్మం, కర్మ ఫలితాల దృష్టితో ఆలోచిస్తే నిర్ణయం మారుతుంది. భగవద్గీతలో చెప్పినట్లుగా, ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని నిర్వహించడం శ్రీకృష్ణుడి ఆలోచన తాలూకు శ్రేష్ఠ రూపం. ఒక సమస్యపై ఎక్కువ కోణాల్లో ఆలోచించినప్పుడు మెదడులోని ప్రీఫ్రాంటల్విభాగం ఎక్కువగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది నిర్ణయ సామర్థ్యం, భవిష్యత్ఫలితాల అంచనా, సమస్య పరిష్కారం వంటి అంశాలను మెరుగు పరుస్తుంది. క్రమబద్ధమైన, లోతైన ఆలోచన మెదడులో న్యూరల్సంబంధాలను బలపరచి, దీర్ఘకాలికంగా మన జ్ఞానాన్ని, మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది.
ఆలోచనకు సహనం, జ్ఞానం, ధర్మపరమైన దృష్టి అవసరం. వేగంగా స్పందించడం కన్నా, మనసును శాంతపరచుకుని, పరిస్థితిని అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటే అది అందరికీ మేలు చేస్తుంది. మొత్తానికి, సరైన ఆలోచన అనేది భౌతిక విజయాలకే కాదు, ఆధ్యాత్మిక వికాసానికి కూడా మార్గం చూపుతుంది. ఇది మనలో వివేకాన్ని పెంచి, శాశ్వతమైన సత్యం వైపు నడిపిస్తుంది. అందుకే మనం ఆలోచనా స్పష్టతను పెంపొందించుకోవాలి. ఆలోచనల స్వభావమే మన భవిష్యత్తును నిర్మిస్తుంది. మంచి ఆలోచనలు శుభఫలితాలను, దుష్ట ఆలోచనలు సమస్యలను తెస్తాయి. మనిషి ఎలా ఆలోచిస్తాడో అలాగే ఉంటాడు. కాబట్టి ప్రతి ఆలోచననూ జాగ్రత్తగా, సానుకూల దిశలో మలచుకోవాలి. ఆలోచనా శుద్ధి మనసుకు శాంతిని, జీవితానికి స్పష్టతను ఇస్తూ విజయానికి బాటలు వేస్తుంది.

మనసనే నదిలో తేలే దీపంలాంటిది ఆలోచన. అది చీకటిలో వెలుగునిచ్చి, ప్రవాహానికి దిశానిర్దేశం చేస్తుంది. మంచి ఆలోచనల సుగంధం మన హృదయాన్ని తోటలా మార్చి, దానిలో సత్సంకల్పాల పూలను వికసింపజేస్తుంది. లోతైన ఆలోచన కడలిలా విస్తరించి, జ్ఞాన ముత్యాలను జీవిత తీరానికి తీసుకువస్తుంది. ఆలోచన స్వచ్ఛమైతే జీవితం మధురగీతంలా సాగిపోతుంది.

ఆనందసాయి స్వామి
మనసే మూలం

మనిషి కీర్తినీ, ఆనందాన్నీ పొందాలనుకోవడం సహజం. అందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అప్పటికి సంతృప్తి లభించకపోతే ఇంకా ఇంకా కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉంటాడు. కానీ అన్నింటికీ మూలమైన అసలు సంగతిని మరచిపోతాడు.

సమంతుడు శ్రావస్తిలో ధనిక కుటుంబానికి చెందిన యువకుడు. గృహస్థు జీవితం అతడికి అంతగా ఆనందాన్ని ఇవ్వలేకపోయింది. భిక్షువుగా మారి ధ్యానసాధన చేసి జ్ఞానాన్ని పొంది ఆనందంగా, గౌరవంగా జీవించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఒక భిక్షువు దగ్గరికి వెళ్లి మనసులోని మాట చెప్పాడు. ఏదో ఒక ఇబ్బంది తలెత్తినప్పుడు భిక్షువుగా మారాలని వచ్చి, కొంతకాలం తరవాత గృహస్థుగా జీవించడానికి వెళ్లిపోయిన వారిని ఎందర్నో ఆ భిక్షువు చూశాడు. ఆ అనుభవంతో సమంతుడికి వెంటనే దీక్ష ఇవ్వకుండా ‘నాయనా! ముందు నీ ఆస్తిని మూడు భాగాలు చేసి ఒక భాగం నీ కుటుంబం కోసం వినియోగించు, మరో భాగంతో వ్యాపారం కొనసాగించు, మిగిలిన భాగాన్ని పూర్తిగా దానాలకు ఉపయోగించు. నువ్వు కోరుకున్న గౌరవం, ఆనందం లభిస్తాయి’ అని చెప్పి పంపాడు. సమంతుడు అలాగే చేశాడు కొన్నాళ్లకు మళ్లీ వచ్చి ‘అయ్యా మీరు చెప్పినట్లే చేశాను. అయినా నాకు శాంతి కలగలేదు’ అన్నాడు. ‘సమంతా! ఈసారి నేను చెప్పే ఓ అయిదు విషయాల్ని పాటించు... జీవహింస చేయకు, అబద్ధాలు చెప్పకు, పరుల సొమ్ము ఆశించకు, వ్యభిచరించకు, మద్యపానం- మత్తుపదార్థాల జోలికి వెళ్లకు. ఈ అయిదింటినీ ‘పంచశీల’ అంటారు. వీటిని పాటించు’ అని చెప్పి పంపించాడు.

కొన్నాళ్ల తరవాత సమంతుడు మళ్లీ వచ్చాడు. భిక్షువు ఈసారి ‘బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి’ అనే త్రిరత్నాల్ని శరణువేడమని చెప్పి పంపాడు. అవి కూడా సమంతుడికి శాంతిని ఇవ్వలేక పోయాయి. ‘స్వామీ... మీరు చెప్పినవి ఏవీ నాకు మనశ్శాంతిని చేకూర్చలేదు. నా చింత, దుఃఖం తీరలేదు.’ అని చెప్పాడు. సమంతుణ్ని సరైన దారిలో పెట్టడం తన వల్ల కాదని గ్రహించిన ఆ భిక్షువు అతణ్ని బుద్ధుడి దగ్గరికి తీసుకెళ్లి విషయమంతా చెప్పాడు. బుద్ధుడు ఆ యువకుడికి ధర్మోపదేశం చేశాడు.
‘సమంతా! మనిషికి మనసే మూలం. సుఖదుఃఖాలకు, కోరికలకు అన్నింటికీ అదే కేంద్రం. చిత్తాన్ని సంస్కరించకుండా బాహ్య విషయాలపై ఎంత సాధన చేసినా ఉపయోగం లేదు. మనసు తనకు ఇష్టమైన విషయాల మీదికి వేగంగా పోయి వాలుతుంది. తెలివిగలవాడు ముందుగా దాన్ని మంచి మార్గంలోకి మళ్లించుకుంటాడు. అప్పుడే దుఃఖాన్ని తొలగించుకుని ఆనందాన్ని గౌరవాన్ని తెచ్చుకోగలుగుతాడు’ అన్నాడు. అప్పుడు కానీ సమంతుడికి అసలు విషయం బోధ పడలేదు. మార్పు మూలంలోనే రావాలి. అలాంటి మార్పే సుస్థిరంగా ఉంటుంది. అదుపు చేయాల్సింది కోరికల్ని కాదు, కోరికల మూలమైన చిత్తాన్ని అని తెలుసుకుని ఆ దిశగా ప్రయాణం కొనసాగించాడు.

ఎన్‌.బి.యస్‌.శ్రీనివాస్‌పోలిశెట్టి
భయాన్నీ తెలుసుకుంటే


మనం భయపడాల్సింది భయానికేనంటారు రూజ్వెల్ట్‌. పిరికివాళ్లు తమ మరణానికి ముందే ఎన్నోసార్లు మరణిస్తారని, ధైర్యవంతులు మరణాన్ని ఒక్కసారే ఎదుర్కొంటారని షేక్‌స్పియర్‌ అంటాడు. అభద్రతా భావం భయానికి మూలకారణం. సహజంగానే పిరికివాళ్లు ప్రతి చిన్నదానికీ భయపడిపోతారు. ధైర్యశాలురు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటూ ముందుకువెళ్తారు.

ప్రాణికి జీవితం మీద ఆపేక్ష సహజం. మరణానికి భయపడని ప్రాణి ఏదీ ఉండదు. కానీ జ్ఞానిని రోగ మృత్యు భయాదులు దరిచేరలేవు. ‘పుత్రాదపి ధనభాజాం భీతిః’ అంటారు శంకరులు. డబ్బున్న వాడికి దాన్ని ఎక్కడ నాశనం చేసేస్తాడోనని కొడుకంటేనే భయమట. అధిక సంపద అందరినీ అనుమానించేట్టు చేస్తుంది. కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ‘ఉన్న ఊరివాడికి కాటి భయం- పొరుగూరి వాడికి నీళ్ల భయం’ అనో సామెత. సాధారణంగా ప్రతి ఊళ్లోనూ నీటి అవసరాలను తీర్చడానికొక చెరువు, దహన సంస్కారాలు నిర్వర్తించడానికి శ్మశానం తప్పనిసరిగా ఉంటాయి. ఊరివాడికి వల్లకాడు ఎటు ఉంటుందో తెలుసు కాబట్టి రాత్రుళ్లు అటువైపు పోడు. పొరుగూరి నుంచి వచ్చిన వాడికి ఈ ఊళ్లో శ్మశానం ఎక్కడుందో తెలియదు కనుక ఆ భయం ఉండదు. కానీ నీరున్న ప్రాంతం చీకట్లో కనపడదు, కొత్త కాబట్టి లోతు తెలియదు. అందుకే అతడికి నీటి భయం.

జీవితంలో భయపడని వారుండరు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో విషయం మనల్ని భయపెట్టే ఉంటుంది. ధైర్యవంతుడు అంటే అసలు భయపడని వాడు కాదని, భయాన్ని జయించినవాడని అంటారు. భయాన్ని ఎదుర్కొనడంలోనే జీవితరహస్యం ఉంది. ఆధ్యాత్మిక గురువులు భయం అనేది కేవలం ఆలోచనే అంటారు. రకరకాల పరిస్థితులను ఊహించుకుని బెదిరిపోవడమే తప్ప భయాలన్నీ నిజాలు కావంటారు. రోగం వస్తుందేమోనని భయం, ప్రమాదం జరుగుతుందేమోనని భయం. అయినవాళ్లు దూరమవుతారేమోనని భయం. మన చేతిలో లేని విషయానికి భయపడీ ప్రయోజనమేంటి? పడవ నడపగలిగినవాడు తుపానుకు భయపడడు. భయాన్ని అధిగమించాలంటే ఎరుక ఉండాలి. ఎత్తైన కొండ శిఖరాన్ని చూసి ‘అమ్మో అంతెత్తు ఎక్కగలనా’ అనుకుంటే ఎవరూ ఎక్కలేరు. ఎక్కాలన్నది మీ కోరిక. పైకి ఎక్కి అక్కడి నుంచి చుట్టూరా పరచుకున్న అందాలను చూడాలని ఆశ. అది నెరవేర్చుకోబోతున్నానన్న ఆలోచనని మదినిండా నింపుకోవాలి. కొండ శిఖరాన్ని కాకుండా విశాలంగా ఉన్న కింది భాగాన్ని చూడాలి. అక్కడి నుంచి ఒక్కో అడుగూ వేయడం మొదలెడితే శిఖరం పాదాక్రాంతం కాదూ?

భయాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా మనకు తెలియని దాని గురించి భయం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏ విషయం గురించి మనసు భయపడుతోందో దాని గురించి సాధ్యమైనంత ఎక్కువ సమాచారం తెలుసుకుంటే సహజంగానే భయం తగ్గుతుంది. పెరిగే వయసూ ముంచుకొస్తున్న వృద్ధాప్యమూ కొందరిని భయపెడతాయి. కాలాన్ని ఆపడం మన చేతుల్లో లేదనీ శరీరం అనిత్యమనే జ్ఞానం తొలి వయసులోనే పొందిన వాళ్లు మలివయసులోనూ భయపడరు.


తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి
సహనం సజ్జన లక్షణం

సహనం మన సంస్కృతి... అన్నారు ప్రఖ్యాత తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ. ఇది యుగయుగాల సత్యం. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సహనం వహించి శిశుపాలుణ్ని వందతప్పుల వరకు క్షమించాడు. ఆ తరవాతే చర్య తీసుకున్నాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తాను ఎన్నో ఇబ్బందులు పడ్డా జీవితాంతం సహనం వహించాడు. ఆ యుగానికి ముందు కృతయుగంలో తన భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు కన్నతండ్రి కారణంగానే ప్రాణాంతకమైన ఇక్కట్లు పడుతున్నా విష్ణుమూర్తి ఓపిక పట్టి చివరికి హిరణ్యకశిపుణ్ని అంతమొందించాడు. సహనం దేవుడు జీవుడికి నేర్పిన ముఖ్యమైన పాఠం.

సహనం బలహీనత కాదు, గొప్ప బలం. వీరుడి లక్షణమే తప్ప భీరుడి అవలక్షణం కాదు. అనాదిగా భారతీయత ప్రపంచానికి ఆదర్శప్రాయం కావడానికి ప్రధాన కారణం మన సహనశీలతే. అది మానవత్వం మూర్తీభవించిన శక్తి. ఏదో కొద్దికాలం పాటు సహనం చూపిస్తే సరిపోదు. కాల పరీక్షకు తట్టుకోగలగాలి. ఏవో తక్షణ ప్రయోజనాలు ఆశించిగానీ, వ్యూహాత్మకంగా కానీ సహనం వహించకూడదు. ఓపిక పట్టడం వెనక ధర్మదృష్టి ఉండాలి కానీ మర్మదృష్టి ఉండకూడదు. సహనం వినయం నేర్పుతుంది. విషయం నేర్పుతుంది. ‘అణగి మణగి ఉండే వాడే అందరిలోకి ఘనుడు’... అన్నారు. సహనం అంటే ఓర్పు... జీవికి మంచి మార్పు. సహనం అంటే అసమర్థత కాదు. ధార్మికమైన బలాన్ని కూడగట్టుకుని సమర్థంగా పుంజుకోవడం. ఆధ్యాత్మిక శక్తిని పరిపుష్టం చేసుకోవడం. సహనం భక్తుడు చేసే ఉపవాసం లాంటిది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాలను మెరుగుపరుస్తుంది. సహనం ఉన్నవాడు అజాత శత్రువు. అంతే కాదు, అంతశ్శత్రువులనూ జయించగలడు. ధర్మపరమైన సాధన చేస్తే గానీ దక్కని ఫలం సహనం. అపకారికి సైతం ఉపకారం చేసే బుద్ధినిస్తుంది. ప్రతీకార బుద్ధిని మటుమాయం చేస్తుంది. అసహనం చేయరాని పనులను చేయించవచ్చు. కానీ సహనం ఆచితూచి అడుగులు వేయిస్తుంది.

సహనం సజ్జన లక్షణం. ఇది సాత్వికులకు మాత్రమే ఉంటుంది. రజో, తమో గుణం ఉన్న వాళ్లకు స్వచ్ఛందమైన సహనం ఉండదు. ఉన్నట్టు బయటికి కనిపిస్తే అది నిర్బంధమైనది కావచ్చు. సహజమైన ఓర్పునకు, నిర్బంధమైన సహనానికి మధ్య ఉన్న తేడా స్వచ్ఛమైన స్వర్ణానికి, కాకి బంగారానికి మధ్య ఉన్నంత! సహనం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది. బుద్ధి వికసిస్తుంది. మంచి ఆలోచనలు కలుగుతాయి. ధర్మాచరణకు బాటలు పడతాయి.

నిదానం ప్రధానమంటారు పెద్దలు. నిదానం అంటే సహనంగా ఉండటమే. సహనంలో భూమాతను మించిన వారు లేరు. జీవులు తనకు ఎన్ని అపచారాలు, అపకారాలు చేసినా భరిస్తుంటుంది. ఆ సహనం ఈ భూమి మీద నడయాడే జీవులకు ఎప్పుడు అబ్బుతుందో అప్పుడే లోకకల్యాణం సాధ్యపడుతుంది. భువికి, దివికి తేడా చెరిగిపోతుంది. సహనం వల్ల కాపురాలు సజావుగా సాగుతాయి. మనశ్శాంతి కలుగుతుంది. సహనాన్ని దేశాలు అలవరచుకుంటే అదే ప్రపంచ శాంతికి రాజమార్గం వేస్తుంది.

శంకర నారాయణ
పర్వదినాల కార్తికం
కృత్తికా నక్షత్రం పౌర్ణమినాడు ఉండే మాసం కార్తికం. ఈ నెలలో దీపాన్ని వెలిగించడం ద్వారా లౌకిక, అలౌకిక, జ్ఞానాన్ని పొందవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. కార్తికం పర్వదినాల మాసం. అందుకే ‘న కార్తిక సమో మాసః’ (కార్తికానికి సమానమైన నెల మరొకటి లేదు) అంటారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాస దీక్షను విరమించే సంప్రదాయం కార్తికానికే ప్రత్యేకం.

దీపావళి తరవాత పాడ్యమి నుంచి కార్తికం మొదలవుతుంది. దీనికి ‘కౌముది’(వెన్నెల) మాసమని పేరుంది. సంవత్సరంలో శైవ, వైష్ణవ భగవదారాధనకు మిక్కిలి అనువైన మాసమిది. కార్తికంలో తెల్లవారుతూనే స్నానం చేయడం వల్ల కాయక, వాచిక, మానసికాది దోషాలు పోతాయంటారు. పగటి కాలం తక్కువగా ఉంటుంది కాబట్టి పొద్దునంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్రాన్ని చూసి దీక్షను విరమించే ‘నక్త వ్రతం’ గురించి పద్మ, స్కాంద పురాణ కథల ద్వారా తెలుస్తోంది. ఈ మాసంలో సోమవార ఉపవాస దీక్ష కూడా విశేషమైంది. ఉసిరి చెట్టు నీడ సోకే నీటి స్నానం, ఆ చెట్టు కింద పూజ, ప్రదక్షిణలు, భోజనం... ప్రత్యేకంగా చేయదగిన పనులుగా పౌరాణికులు చెబుతారు.

యమద్వితీయగా పేరొందిన విదియ నాడు సోదరి ఇంట భోజనం చేయాలని వ్రత గ్రంథాలు తెలుపుతున్నాయి. కార్తిక శుద్ధ చవితి నాగుల చవితి. ఆరోజు నాగవ్రతం చేయాలని, నాగులను పూజించాలని ‘చతుర్వర్గ చింతామణి’ గ్రంథం సూచిస్తోంది. కార్తిక శుద్ధ ఏకాదశి (ప్రబోధనైకాదశి) చాతుర్మాస దీక్షకు ముగింపు. మర్నాడు క్షీరాబ్ధి ద్వాదశి. విష్ణువు క్షీరాబ్ధి నుంచి లక్ష్మీ, బ్రహ్మ తదితరులతో కలిసి తులసి బృందావనానికి వచ్చి భక్తులతో పూజలు అందుకుంటాడు.

కార్తికం దీపాల మాసం కూడా. ఈ నెలలో చేసే దీప దానం ప్రశస్తమైంది. దానివల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్తి. కార్తిక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అనీ అంటారు. ఆనాటి మునిమాపు వేళ ఈశ్వర ప్రీతి కోసం దీపాలను వెలిగిస్తారు. ఈరోజు చేసే మరొక ప్రత్యేక ఉత్సవం జ్వాలాతోరణం. దీని గురించి పలు పురాణగాథలు ఉన్నాయి. క్షీరసాగర మథనం వేళ పుట్టిన హాలాహలాన్ని శంకరుడు లోకహితార్థం తన కంఠంలో నిలిపి వేస్తాడు. దాంతో ఆందోళన చెందిన పార్వతీదేవి ఈ గండం నుంచి బయటపడితే తాను కుటుంబ సహితంగా చిచ్చుల తోరణం కింద ముమ్మారు దూరి వస్తానని మొక్కుకుందట. అప్పటినుంచి జ్వాలాతోరణ ఉత్సవం ఏర్పడిందంటారు. ఆరోజు శివాలయాలలో ఎండు గడ్డితో తోరణాన్ని కట్టి, వెలిగిస్తారు. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి మండుతున్న ఆ జ్వాలాతోరణం కింద నుంచి మూడుసార్లు తిప్పుతారు. కార్తిక బహుళ త్రయోదశి నాడు యమదీప దానం చేయాలని ‘స్మృతి కౌస్తుభం’ అనే గ్రంథం చెబుతోంది. తెల్లారగట్టే స్నానాలు, ఉపవాస దీక్షలు, దీప దానాలు ఇలా ఎన్నో పుణ్యకార్యాలను ఆచరించే పవిత్ర మంగళకర మాసం కార్తికం. వనభోజనాలతో అందరికీ ఆనందోత్సాహాలను అందించే ఆహ్లాదకర సమయం కూడా ఇది!

గంటి ఉషాబాల
మమతనురాగల పండుగ

మనల్ని ధర్మం రక్షించినట్లే, కరుణ కూడా కాపాడుతుంది. యముడు ధర్మం అయితే, యమున కరుణ. వారి దివ్య సోదరసోదరీ బంధమే ‘భగినీ హస్త భోజనం’ రూపంలో మనకు పండుగయ్యింది.

సూర్య భగవానుడి కుమారుడైన యముడు- ధర్మం, సత్యం, సమత్వం అనే త్రిగుణాల సమ్మేళనం. ఆయన తీర్పు కర్మఫల సిద్ధాంతానికి ప్రతీక. సత్యమే యముడి శ్వాస. యముడి చెల్లెలైన యమునను పురాణాలు పాపహారిణి, పుణ్యప్రద, కాళింది, శ్రీకృష్ణుడి అర్ధాంగిగా కృష్ణప్రియ అని స్తుతిస్తాయి. అన్న ఆశీర్వాదం చెల్లికి ఐశ్వర్యాన్నిస్తుంది. ఇలాంటి అనురాగ బంధానికి యమధర్మరాజు, యమునా ప్రతీకలుగా నిలిచారు. వారిని స్మరించుకుంటూ చేసుకునే పండుగే ‘భగినీ హస్త భోజనం’. అంటే అక్కచెల్లెళ్లు ప్రేమతో సోదరులకు భోజనం వడ్డించడం. భగినీ అంటే అక్క లేదా చెల్లి. ఈ పండుగ దీపావళి తరవాత రెండో రోజు, కార్తీక శుక్ల విదియ నాడు వస్తుంది. దీన్ని దక్షిణ భారతదేశంలో యమ ద్వితీయ, కాంతి ద్వితీయ, పుష్ప ద్వితీయ అని అంటారు. ఉత్తర భారతదేశంలో భాయీ దూజ్‌ అని, నేపాల్లో భాయీ టిక్కా, పంజాబ్లో టిక్కా అని పిలుస్తారు. రాఖీ నాడు సోదరులను సోదరి దీవిస్తే, ఈ పండుగ రోజు సోదరుడు సోదరిని ఆశీర్వదిస్తాడు.

భగినీ హస్త భోజనం వెనక పురాణ సంబంధమైన కథ ఉంది. వివాహానంతరం తన ఇంటికి రమ్మని యమున ఎన్నిసార్లు పిలిచినా రాని యముడు కార్తికమాసం విదియ రోజున అనుకోకుండా చెల్లెలింటికి వస్తాడు. అన్న రాకతో సంతోషించిన యమున అతడికి తిలకం దిద్ది, హారతి ఇచ్చి పిండివంటలతో భోజనం పెడుతుంది. ఆ ఆనందంలో యమధర్మరాజు చెల్లెల్ని ఏదైనా వరం కోరుకోమన్నాడు. యమున, తనకు అత్యంత ఆనందాన్నిచ్చిన ఈ రోజు, ఏ అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ల ఇంట్లో భోజనం చేస్తారో- వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని కోరుతుంది. చెల్లెలి నిస్వార్థ కోరికకు సంతోషించిన యముడు- కార్తికమాసంలో విదియ రోజు సోదరి చేతి భోజనం చేసిన సోదరుడికి అపమృత్యు దోషం ఉండదని... ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందని వరాలిచ్చాడట. అంతేకాకుండా తన సోదరి అనుగ్రహానికి పాత్రులైనవారికి అకాల మరణదోషం ఉండదని కూడా హామీ ఇచ్చాడట. అందుకే యమునా నదిలో స్నానం చేసినవారికి ఆకస్మిక మరణభయం ఉండదని చెబుతారు.

పద్మపురాణం ప్రకారం యమునా జలాలు మనసులోని మలినాలను కడిగేస్తాయి. యముడు శిక్షిస్తే, యమున క్షమిస్తుంది. యముడు మనలోని వివేకం. యమున హృదయం. ఒకటి ధర్మానికి మార్గం చూపితే, మరొకటి ప్రేమకు ద్వారం తెరుస్తుంది. ఈ రెండూ కలిసినప్పుడే జీవితం సంపూర్ణమవుతుంది. ధర్మం తోడైన కరుణే యమున. న్యాయం తోడైన ప్రేమే మానవత్వం. భగినీ హస్త భోజనం సోదర సోదరీమణుల బాంధవ్యం బలపడటానికి చేసుకునే పర్వదినం.

డాక్టర్‌ శ్రీదేవీ శ్రీకాంత్
గురుసన్నిధి

పదార్థానికీ వాస్తవానికీ, యథార్థానికీ కల్పితానికీ మధ్య ఉండే వ్యత్యాసాన్ని గుర్తించడంలో మనిషికి సాయపడేది గురువే. చీకట్లను పారదోలి మనల్ని వెలుగుదారుల్లో గమ్యస్థానానికి నడిపించేది ఆయనే. ఆనందాన్ని బయటి వస్తువుల నుంచి కోరుకునేవారికి అది దూరంగా ఉంటుంది. ఆ భ్రమలను కలిగించేది మనసు. తొలగించేది గురు అనుగ్రహం. ఎవరైనా మనసును అధిగమించి పైకి వస్తే, అతడు తన సహజ స్థితిని గ్రహించి, పరమానందస్థితిని పొందుతాడు. అద్వైత తత్వవేత్త శంకరులు ఉద్బోధించినట్లు, జ్ఞానం ద్వారా మాత్రమే ఎవరైనా నిజమైన ఆనందం పొందగలరు.

జ్ఞానాన్ని పొందేందుకు అనేక మార్గాలున్నాయి. పురాణ గ్రంథాల అధ్యయనం, ఆత్మపరిశీలన, స్వీయ అన్వేషణ... లాంటివి. అయితే గురువు అనుగ్రహం పొందడం అత్యంత ప్రభావమంతమైన మార్గం. ప్రపంచంలో దేనినైనా నిర్వచించేటప్పుడు దాంతో మన సంబంధం ఏంటో కూడా తెలుస్తుంది. గురువును ఎలా చూస్తాం అనేది ఆయనతో మన బంధంపై ప్రభావం చూపుతుంది. గురువుగా చూస్తే శిష్యులమవుతాం, ప్రవచనకర్తగా చూస్తే శ్రోతలమవుతాం. భగవంతుడిగా చూస్తే భక్తులమవుతాం. సమకాలికుడిగా చూస్తే స్నేహితులమవుతాం. మన దృష్టి మన సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది.

ఇరవైనాలుగు మంది గురువుల నుంచి జ్ఞానోదయం పొందిన దత్తాత్రేయుడి గురించి శ్రీమద్భాగవతం చెబుతుంది. ఆ గురువుల్లో చాలామంది మనుషులు కారు. సర్వజీవులూ ఉన్నాయి. వాటి నుంచి ఏం నేర్చుకోవచ్చో తెలుసుకోవాలంటే వినయంగా ఉండాలి. అణకువ, అంకితభావం ఉన్న వ్యక్తికి గురువు సరైన సమయంలో తారసపడతాడు. ఆదిశంకరుల ఆదర్శ శిష్యులలో ఒకరైన ఆనందగిరికి జ్ఞానం లేదు కానీ గురువు పట్ల అమితమైన ప్రేమ. శంకరులు కర్ణాటక గుండా వెళ్తున్నప్పుడు గిరి ఆయన శరణుకోరుతూ సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు శంకరులు ‘స్వచ్ఛమైన భక్తి, వినయం ద్వారా వ్యక్తి జ్ఞానోదయం పొందుతాడు. నిన్ను నా శిష్యుడిగా అంగీకరిస్తున్నాను’ అన్నారు. గురువు సేవకు తనను తాను అంకితం చేసుకున్న గిరి ఆధ్యాత్మిక సమావేశాల్లో మౌన ప్రేక్షకుడిగా ఉండేవాడు. ఒకసారి ఓ సమావేశాన్ని ప్రారంభించకుండా ఆచార్యులు బట్టలు ఉతుకుతున్న గిరి కోసం వేచి చూస్తున్నారు. ‘జీవం లేని స్తంభంలాంటి వాడు గిరి(తోటక్‌). పాఠం అతడికి చెప్పినా, ఆ గోడకు చెప్పినా ఒకటే’ అన్నాడు మరో శిష్యుడు నెమ్మదిగా.

ఆదిశంకరుల వారు చూపుతోనే శిష్యుల ఆలోచనలను గ్రహించేవారు. ఎప్పుడూ నోరు కూడా మెదపని తోటక్‌ అప్పటికప్పుడు గురువును ఎంతో అందమైన, అద్భుతమైన శ్లోకాలతో స్తుతించేసరికి ఆశ్చర్యంతో ఎవరికీ నోట మాట రాలేదు. అదే తోటకాచార్య కూర్చిన ఎనిమిది శ్లోకాల ‘తోటకాష్టకం’. గురువు శిష్యుణ్ని ప్రేమతో కౌగిలించుకుని, దానికి స్వయంగా వ్యాఖ్యానం రచించారు.
భక్తుడు కేవలం భౌతిక అస్తిత్వం కాదు. ఆధ్యాత్మిక జీవి. ఆ మార్గంలో ముందుకెళ్లడానికి సరైన జ్ఞానం కావాలి. జగద్గురువు పాత్రను పోషిస్తూ, కృష్ణుడు ‘నిజమైన జ్ఞానాన్ని పొందగల ఏకైక మార్గం- స్వయంగా జ్ఞానాన్ని గ్రహించిన గురువును సంప్రదించడం’ అంటాడు.

మంత్రవాది మహేశ్వర్‌
సమయోచితం

మనం ఏదైనా పని ప్రారంభించగానే సహజంగానే, సాటి వారి నుంచి ఎంతో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎంత ఎక్కువ ప్రతికూలత ఎదురైతే, సంకల్పించిన కార్యక్రమం అంత బాగా విజయవంతమయ్యే అవకాశాలుంటాయి... అన్నారు స్వామి వివేకానంద ఓ సందర్భంలో. నదికి రాళ్లూరప్పలు, చెట్లూచేమలు అడ్డం వస్తేనే కదా మరి ప్రవాహం వేగం పుంజుకునేది! ప్రపంచ సర్వమత మహాసభలో ప్రసంగించేందుకు అమెరికా వెళ్లినపుడు, వివేకానందుడి వేషబాషలు చూసిన నిర్వాహకులు, ఆయన ప్రతిభా పాటవాలను తక్కువగా అంచనా వేశారు. ప్రసంగించేందుకు కేవలం కొద్ది నిమిషాల సమయమే కేటాయించారు. ‘అన్నదమ్ములారా, అక్కచెల్లెళ్లారా’ అన్న స్వామి తొలిపలుకులకు స్పందనగా మిన్నంటిన కరతాళధ్వనులు సద్దుమణిగేసరికే ఆయనకు కేటాయించిన సమయం అయిపోయింది! ఆ తరవాత చాలాసేపు, నిర్వాహకులతో సహా అందరూ మంత్రముగ్ధులై స్వామి ప్రసంగాన్ని చాలా శ్రద్ధగా విన్నారు.

సవాళ్లను అవకాశాలుగా మార్చుకోగలిగితే విజయం అదే లభిస్తుంది. అలాగే, సమయోచితంగా స్పందించకపోతే కోరి అనర్థాలను తెచ్చుకున్నట్లు అవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ శాంతిదూతగా కౌరవ సభకు వెళ్లాడు. భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ద్రోణాచార్యుడు తదితరులు అక్కడ శ్రీకృష్ణుడికి గౌరవ, మర్యాదలు ఇచ్చారు. దుర్యోధనాదులు మాత్రం ఆయనపట్ల అమర్యాదకరంగా నడచుకున్నారు. ఫలితంగా మహా సంగ్రామం తప్పలేదు. దౌత్య సమయంలో దుష్ట చతుష్టయం తప్పుడు స్పందన ఒక వంశం నాశనానికి కారణమైంది.

ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాల ప్రభావంతో వాలికి ఎదురుగా పోరాడే వారి సగం బలం అతడికి సంక్రమిస్తుంది. వాలి కిష్కింధ నుంచి తరిమేయడంతో సుగ్రీవుడు అనుచరులతో రుష్యమూక పర్వతంపై నివసిస్తున్నాడు. సీతమ్మ జాడకోసం వెతుకుతూ అక్కడికి వచ్చాడు శ్రీరాముడు. సుగ్రీవుడితో మైత్రి కుదిరిన తరవాత అతడి కోరిక మేరకు వాలిని సంహరించడానికి రాముడు అంగీకరిస్తాడు. సుగ్రీవుడు అన్నని యుద్ధానికి పిలుస్తాడు. ‘ఇన్నిసార్లు నా చేతిలో చావు దెబ్బతిన్నా వీడికి బుద్ధి రాలేదు’ అనుకుని వాలి యుద్ధం చేసి మరోసారి సుగ్రీవుణ్ని ఓడిస్తాడు. అన్నదమ్ములు ఒకేలా ఉండటంతో గుర్తుపట్టడానికి వీలుగా సుగ్రీవుణ్ని మెడలో గజపుష్పతీగ హారం ధరించమంటాడు శ్రీరాముడు. అలా అన్నని మళ్లీ యుద్ధానికి రమ్మంటాడు. ఓడిపోయి పారిపోయిన వాడు తిరిగొచ్చి పిలుస్తున్నాడంటే అందులో ఏదో మర్మం ఉందని, వెళ్లొద్దని చెబుతుంది తార. భార్య మాటని లెక్కచేయకుండా మరోసారి తమ్ముణ్ని ఓడిద్దామని వెళ్లి మృత్యువు పాలవుతాడు వాలి.

మన ప్రవర్తన, మాట తీరు... సమయ సందర్భాలకు తగినట్లుగా ఉండాలి. అప్పుడే మర్యాద, మన్నన లభిస్తాయి. ప్రమాదాలు తప్పుతాయి. పట్టుదుస్తులు కట్టుకుని పరామర్శకు వెళ్లలేం. వేడుకలకు వెళ్లేటప్పుడు ఉన్నంతలో మంచి దుస్తులు ధరించి వెళ్తాం. ప్రవర్తన కూడా అంతే. ఓపిగ్గా పరిస్థితులను సమీక్షించుకుని తదనుగుణంగా ప్రవర్తించే వారికి అంతా మంచే జరుగుతుంది.

ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్
కర్మ మార్గం

చాలామంది సత్యాన్వేషణ చేస్తారు కానీ, తామే సత్యమని గ్రహించలేరు. అసలు సత్యమంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించరు. సత్యవ్రతం మోక్ష సోపానమనుకుంటారు. సత్కర్మలు చేయాలనుకోరు. సత్యమనేది పుణ్యకర్మ కావచ్చు. కానీ సత్కర్మ కాదు. జ్ఞానంతో కూడినదే సత్కర్మ. ఎవరు దేవుడు అనేది ఎవరికి వారు జ్ఞానంతో తెలుసుకోవాలి. కర్మకాండలు చేస్తూ సత్యపథంలో ఉన్నామనుకునేవారు తమలోని దైవాన్ని దర్శించుకోవాలి.

కర్మమార్గంలో కొన్ని క్లిష్టతలు ఉన్నాయి. కర్మలు చేసినా ఫలితం ఆశించవద్దన్నది గీతాకారుడి వ్యాఖ్య. కర్మలలో అనేక అనర్థాలు ఎదురవుతాయి. మరి శ్రేయోదాయక కర్మలు ఏంటీ అనే సందేహానికి కూడా పరమాత్మ సమాధానం ఇచ్చాడు. జీవులు కర్మకు బద్ధులవుతారు. జ్ఞానంతో ముక్తులవుతారు. ఇది తెలుసుకుంటే కర్మ మార్గం ఫలవంతమవుతుంది. కర్మ చేసే క్రమంలో ‘వ్యక్తిత్వాన్ని’ మరచిపోవటం తగదు. మంచి, చెడు అనేవి మనసులో ఉండే భావనలంటారు మనస్తత్వవేత్తలు. వీటిననుసరించే చేసే కర్మ ఉంటుంది. రావణుడు, రాముడు, దుర్యోధనుడు, ధర్మరాజు ఇందుకు గొప్ప ఉదాహరణలు. వారిని పురాణ పురుషులుగా కాకుండా మానవ స్వరూపాలుగా గ్రహించగలిగితే ‘కర్మతత్వం’ అవగతమవుతుంది. ‘నేను ఏదో ఒకనాటికి మరణించాల్సిందే’నని రోజూ ఓ అయిదు నిమిషాలు ఆలోచించుకుంటే సత్కర్మలే చేయాలని మనసవుతుంది. అలా అద్భుతాలు సాధించవచ్చు.

కర్మకాండల్లో మునిగి తేలుతున్న జిజ్ఞాసువులు మోక్షానికి దూరమవుతున్నారని తలచిన శివుడు వారికి దిశానిర్దేశం చేయాలనుకున్నాడు. సాధారణ మనిషి రూపంలో వారిమధ్య అవతరించాడు. ఆయన ముగ్ధ మనోహర రూపాన్ని చూసిన రుషిపత్నులు ఆయనను అభిమానించసాగారు. ఎంతో తపశ్శక్తి కల రుషులు సత్యాన్ని తెలుసుకోలేకపోయారు. ఈ పాపాత్ముడు రుషిపత్నులను అపహరించటానికి వచ్చాడనుకున్నారు. ఎవరి కోసం సుదీర్ఘకాలం ‘నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచపతయే...’ అని ప్రార్థిస్తున్నారో స్వయంగా ఆయనే దిగి వస్తే గ్రహించలేకపోయారు. ఒక ఏనుగును, పులిని సృష్టించారు. పోయి అతణ్ని సంహరించమని చెప్పారు. పరమశివుడు వాటిని వధించి ఏనుగు చర్మాన్ని, పులి చర్మాన్ని ధరించాడని శివపురాణం చెప్పిన కథ. ఇది తెలుసుకున్న రుషులకు మోక్ష మార్గమేమిటో శివుడు నిజస్వరూపంతో బోధించాడు.

సత్కర్మలో- ‘కర్మకింపరం, కర్మతత్‌ జడం’- కర్మజడం. జడాన్ని కదిపే కర్త ‘నేను కాదు’ భగవంతుడని గుర్తుంచుకోవాలి. ఆ దేవుడి కోసం చేసే మంచి అంతా అన్నార్తుల కోసం చేయాలి. అదే సత్కర్మ. పక్షికి నాలుగు గింజలు, చెట్టుకు ఇన్ని నీళ్లు పోయడమూ ఈ కోవకు చెందుతాయి. కానీ దైవసేవ పేరిట కోట్లు ఖర్చు చేస్తున్నవారు ఈ చిన్ని జీవన సూత్రాన్ని గ్రహించలేకపోవటమే చిత్రం. స్వలాభాపేక్షతో చేసే కర్మలు సత్కర్మలు కావు. పైగా ‘అటువంటి కర్మల నుంచి ఎన్నటికి విముక్తులు కాలేరు’ అంటారు రమణ మహర్షి. ఎవరైతే సత్కర్మ భగవంతుడి కోసమే చేస్తారో అటువంటివారికి దుఃఖమే లేదు. అంతా సంతోషమే.

భమిడిపాటి గౌరీశంకర్
సత్సంగమే ముక్తి మార్గం
మనిషి జీవితానికి ‘ముక్తి’ లేదా ‘మోక్షం’ అనేవి ముఖ్యమైన గమ్యాలు. పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొందడం, సకల కర్మ బంధాల నుంచి విడివడి పరమాత్మతో ఐక్యత సాధించడం అనే భావనలను ‘ముక్తి’ సూచిస్తుంది. శాశ్వత శాంతి, ఆనందం పొందడానికి ఇదే మార్గమని భావిస్తారు. అయితే ముక్తి సాధించడం ఎలా? భగవద్గీత ప్రకారం ముక్తి సాధనకు కొన్ని మార్గాలు ఉన్నాయి.

ఆత్మ, పరమాత్మ, సృష్టి... నిజ స్వరూపాలను తెలుసుకోవడం ద్వారా ముక్తి సాధించవచ్చు. ఇది జ్ఞాన మార్గం. భగవంతుడి పట్ల నిష్కళంకమైన ప్రేమతోనూ భక్తితోనూ ముక్తి పొందడం- ఇంకొకటి. నిష్కామ కర్మలు చేయడం ద్వారా; ధ్యానం, ఇంద్రియ నియంత్రణ ద్వారా ముక్తి సాధించడం... మరో రెండు మార్గాలు.

అయితే అసలు ముక్తిని ఎప్పుడు పొందగలం? మరణించిన తరవాతా లేక జీవించి ఉన్నప్పుడేనా? ఆదిశంకరాచార్యులు రచించిన భజగోవిందంలోని ఒక శ్లోకం మనిషి జీవించి ఉన్నప్పుడే ముక్తికి వీలు కల్పించే అంతర్గత మార్గాన్ని చాలా స్పష్టంగా వివరిస్తోంది.

సత్సంగత్వే నిస్సంగత్వం/ నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం/ నిశ్చలతత్వే జీవన్ముక్తిః

ఈ శ్లోకాన్ని విశ్లేషించినప్పుడు, ముక్తి సాధనలో ‘సత్సంగం’ అనే స్థాయి ప్రారంభ బిందువు అని తెలుస్తుంది. సత్సంగం అంటే మంచి స్నేహితులు, సద్గురువులు, సనాతన సత్యాన్ని పంచే జ్ఞానులతో కలిసిమెలిసి ఉండటం. ఇది మన జీవితానికి విశాల దృక్పథం అలవడేలా చేస్తుంది. ఈ సత్సంగం వల్ల ప్రాపంచిక బంధాల మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఆ స్థితినే ‘నిస్సంగత్వం’ అంటారు. దానివల్ల మనసులో మోహాలు, ఆకర్షణలు, అసత్య అభిప్రాయాలు తగ్గుతాయి. దీన్ని ‘నిర్మోహత్వం’ అంటారు. ఏ విధమైన మోహాలు లేని మనసు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటుంది... అదే ‘నిశ్చలతత్వం’. ఈ స్థితిలో జీవి తనలోని ఆత్మను చైతన్యంగా అనుభవిస్తూ పరమాత్మతో ఐక్యత సాధిస్తాడు- దీన్నే ‘జీవన్ముక్తి’గా పేర్కొంటారు.

ముక్తి అనేది ఏదో శరీరం విడిచిన తరవాత కలిగే స్థితి మాత్రమే కాదు. మనసు పూర్తిగా నిర్మలంగా, నిర్బంధనంగా మారినప్పుడు మనిషి జీవించి ఉన్నప్పుడే ముక్తిని అనుభవించవచ్చు. ఇదే జీవన్ముక్తి. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటీ అంటే- ముక్తి అనేది హఠాత్తుగా అప్పటికప్పుడు దొరికేది కాదు. అది ఒక సాధన, ఒక అంతరయాత్ర. సత్సంగం మొదలుపెట్టి, అంచెలంచెలుగా మనసును నిర్మలంగా చేసుకోవడం ద్వారా ముక్తిమార్గంలో ముందుకెళ్లవచ్చు. ముక్తి సాధించడానికి శాస్త్రాలు చదవడం, యోగ సాధనలు, కర్మలు ఒకవైపు అయితే- సత్సంగం వంటి సూక్ష్మ మార్గాలు మరొకవైపు. ఇవి మన మనసునే మార్చేస్తాయి. జీవన్ముక్త స్థితికి తీసుకెళ్తాయి.

కరణం హరికిషన్
మహనీయులు
చరాచర జగత్తులోని జీవులన్నిటా ఉత్కృష్టమైంది మానవ జన్మ. మనిషి అమితమైన మేధాశక్తిని, ఆలోచనతో కూడిన అనురక్తిని, ప్రగతి సాధించేందుకు కావాల్సిన అభివ్యక్తినీ సమృద్ధిగా కలిగినవాడు. ఆ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూ ఒకరి మేలు కోసమో, జాతి పురోగతి కోసమో, భాషా సంస్కృతుల కోసమో నిస్వార్థంగా కృషి చేసేవారి జీవితాలే సార్థకమవుతాయి. అలాంటి వారికి ముసలితనమూ, మరణమూ ఎన్నటికీ లేవని, భువిలో అమరులనీ అంటాడు భర్తృహరి.

మనిషి తన సంసారాభివృద్ధిని చూసుకోవడంలో ప్రత్యేకత ఏమీ లేదు. దాన్ని దాటి సార్థకమైన జీవితాన్ని గడపగలిగినవాడే ధన్యుడు. అంటే- నలుగురికీ ఉపయోగపడేలా కొన్ని పనులు చేయగలగడం, ఎంతో కొంత సమాజానికి మేలు చేయడం. మనం చేసిన పనివల్ల కొంతమంది సుఖంగా సంతోషంగా ఉన్నారంటే, అంతకన్నా కావాల్సింది ఏదీలేదు కదా! మనిషి తనకోసం, తన కుటుంబ సభ్యుల సుఖం కోసం కాకుండా, సమాజ సంక్షేమం కోసం కృషి చేస్తే జనహితం, పరహితం చేకూరుతుంది. ప్రతిఫలం ఆశించకుండా ఇంకొకరికి మేలు చేయడమే పరహితం.
ఎదిరికెప్పుడు చేయు హితమెల్ల తనదనుచు చదివి చెప్పనియట్టి చదువేలా...’ అంటాడు పద కవితా పితామహుడు అన్నమయ్య. అంటే, ఎదుటివాడికి సాయం చేసినవాడే నిజమైన విద్యావంతుడని అర్థం. మన కుటుంబ శ్రేయస్సు చూసుకుని, ఎవరికీ ఎటువంటి సాయమూ చేయకుండా జీవితాంతం గడిపేస్తే, మన బతుకుకూ ఎందుకూ పనికిరాని గడ్డిపువ్వుకీ ఎటువంటి భేదమూ ఉండదు. స్వార్థమే సర్వమని తలచేవారు నిరంతరం అంతులేని చింతలతో, ఇంకా సంపాదన పెంచుకోవాలనే ఆందోళనలతో సతమతమవుతుంటారు. కూడగట్టుకోవటమే పరమావధిగా బతుకుతారు. అలా కాకుండా గుబాళించే మల్లెపువ్వులా మనలో మానవత్వం పరిమళిస్తేనే, జీవితం సార్థకమవుతుంది.

పరహితమన్నదే ఆలంబనగా జీవించిన మహనీయులెందరో మనకు చరిత్రలో తారసపడతారు. అటువంటి పరోపకార గుణ సంపన్నులను సూక్తి సుధాకరం ‘మనుజకోటిలో ఉత్తములైన సాధు చరితులు’ అని నిర్వచిస్తుంది. ఈ విధమైన సుగుణ సంపత్తితో శోభించేవారిని దైవీగుణాలు కలవారని కృష్ణ భగవానుడు పేర్కొన్నాడు.దేశ దాస్య శృంఖలాలను తొలగించడానికి పాటుపడిన స్వాతంత్య్ర సమరయోధులు, సరికొత్త ఆవిష్కరణలతో జన శ్రేయస్సుకు నూతన బాటలు వేసే శాస్త్రవేత్తలు, నిస్వార్థంగా ప్రజాసేవ చేసే వ్యక్తులు అందరి జీవితాలూ సార్థకమైనవే. ప్రతి దేశానికీ విలక్షణమైన రీతిలో భాషా సంస్కృతులు పట్టుగొమ్మలుగా ఉంటాయి. వాటి అభివృద్ధికోసం పాటు పడేవారిదే సిసలైన జీవనం అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. సంస్కృతీ వికాసం లేని రాజ్యాలు, సిరులు వ్యర్థమన్నాడు ఆంధ్రభోజుడు. అలాంటి భాషా సంస్కృతుల సంరక్షణకు అంకితమైన వారు ప్రాత:స్మరణీయులే.

మన గురించి ప్రత్యేకంగా ఏదన్నా చెప్పుకోవాలంటే, అది పరుల అభివృద్ధిని కోరి చేసిన మేలు అయివుండాలి. జీవితంలో నిజమైన ఆనందమంటే, ఒకరికి చేసే సాయం వల్లనే లభిస్తుంది. అందుకే, అలాంటి మనుషులే మహానుభావులు. ఉన్నత ప్రమాణాలతో ఆదర్శాలను పాదుకొలిపే పరమ పావనులు!

వెంకట్‌ గరికపాటి
భారం నీదే

‘ఎన్నిసార్లు నిన్ను పిలవాలి? ఏ రీతి కొలవాలి? అనాథరక్షకుడివని, ఆపద్బాంధవుడివని అంటారే? మరెందుకు నా పిలుపు నిన్ను చేరడం లేదు? నా బాధ నీకెందుకు కనిపించడం లేదు?’... ఇలా మనకు కష్టం వచ్చినప్పుడల్లా దేవుడితో మొరపెట్టుకుంటాం. ఒళ్లంతా కళ్లున్న ఆయనకు మనం కనిపించమనుకోవడం, జగమంత చెవులున్న స్వామికి మన పలుకులు వినిపించలేదనుకోవడం... అవివేకమే!

గజేంద్ర మోక్షం ఘట్టంలో మొసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడిన గజరాజు, మకరాన్ని గెలవడం తనవల్ల కాదని నిశ్చయించుకుంది. ‘స్వామీ! బలం క్షీణించింది, ధైర్యం సన్నగిల్లింది, ప్రాణాలు అదుపు తప్పుతున్నాయి, స్పృహ కోల్పోతున్నాను. నువ్వు తప్ప దిక్కెవరు లేరు. నన్ను రక్షించే బాధ్యత నీదే!...’  అని సర్వేశ్వరుణ్ని వేడుకుంది.

అక్కడెక్కడో వైకుంఠపురంలో లక్షీదేవితో వినోదిస్తున్నాడు శ్రీమన్నారాయణుడు. ‘పాహీ! పాహీ!’ అనే ఆర్తనాదం వినిపించగానే గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే ఆతృతతో ఆయన లక్ష్మీదేవికి ఏమీ చెప్పలేదు; శంఖచక్రాలను చేతుల్లోకి తీసుకోలేదు, సేవకులనెవరినీ పిలవలేదు, గరుడవాహనాన్నీ సిద్ధపరచుకోలేదు, ప్రణయకలహంలో భాగంగా పట్టుకున్న లక్ష్మీదేవి కొంగైనా వదల్లేదు... ఉన్నపళంగా భువికి బయలుదేరాడు. లక్ష్మీదేవితోపాటు సుదర్శన చక్రం కూడా శ్రీహరిని అనుసరించింది. గజరాజు ఉన్న సరోవరాన్ని చేరుతూనే విష్ణుమూర్తి తన చక్రాన్ని విడిచి పెట్టాడు. ఆ సుదర్శనం విస్ఫులింగాలు చిమ్ముతూ మరుక్షణంలో మొసలి తలను ఖండించింది. అప్పుడు గజేంద్రుడు ఊపిరి పీల్చుకుని కొలను నుంచి బయటికి వచ్చి సంతోషంతో తొండం ఎత్తి హరికి నమస్కరించాడు.

కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు తనను రక్షించేవారి కోసం శోకంతో ఆమె చుట్టూ కలియజూసింది. ఎవరూ ముందుకు రాకపోవడంతో ‘నాకు దిక్కెవరు?’ అనుకున్న సమయంలో కృష్ణుడు ఆమె కళ్ల ముందు సాక్షాత్కరించాడు. వెంటనే ‘ద్వారకావాసా శ్రీకృష్ణా పాహిమాం!’ అని వేడుకుంది. ఆయన కొన్ని ఘడియలు ఆలస్యంగా వచ్చాడు. ‘పిలిచిన వెంటనే పలికే దైవానివి కదా, నా పట్ల ఎందుకు ఆలస్యం చేశావు’ అని ద్రౌపది ప్రశ్నించింది. ‘సోదరీ! నువ్వు ద్వారకావాసా... అని పిలిచావు. అందుకే ద్వారక వెళ్లి మళ్లీ తిరిగి వచ్చేసరికి ఆలస్యమైంది’ అని మనోహరమైన మందహాసంతో జవాబిచ్చాడు నందగోపాలుడు. అప్పుడు ద్రౌపదికి తన పిలుపులోని దూరం అర్థమైంది.

భక్తుల ప్రార్థనలకు సులభంగా కరిగిపోయే భక్తవల్లభుడికి కావాల్సింది ఆడంబరంగా చేసే పూజలు కాదు. నిండు మనసుతో ధ్యాస ఆయన మీద కేంద్రీకరించాలి. ‘పాల ముంచినా నీట ముంచినా నీదే భారం స్వామీ!’ అనుకుని మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. మనకు ప్రాప్తమనుకున్నది ఆయన అనుగ్రహిస్తాడు. లేదంటే అంతకన్నా మంచిదేదో మనకోసం వేచి ఉన్నదని గ్రహించాలి. ఆ వాస్తవాన్ని జీర్ణం చేసుకుంటేనే సంతృప్తిగా జీవించగలం! కాదని విధిని దూషిస్తుంటే అసంతృప్తి జ్వాలలకు అజ్ఞాన తిమిరం తోడై దహించుకుపోవాల్సి వస్తుంది. ఆర్తితో అంతరాంతరాల్లో ఆయన్నే స్మరిస్తూ ‘సర్వాంతర్యామీ! నువ్వే దిక్కు!’ అనుకుంటే పరమాత్ముడి కరుణాకటాక్షాలు ఏదోనాడు అమృత జల్లుగా వర్షిస్తాయి!

కె.వి.సుమలత
తెలివి - వివేకం

తెలివికి వివేకానికి తేడా ఉంది. ప్రతి జీవికీ దాని స్థాయి తెలివి దానికుంటుంది. దాంతోనే అవి కూడు, గూడు సంపాదించుకుంటాయి. శత్రువు నుంచి రక్షణ పొందుతాయి. అయితే ఆ తెలివిని ఎందుకు ఎలా వాడాలో నిర్ణయించుకునే సామర్థ్యమే వివేకం. అది మనిషికి మాత్రమే సొంతం. మనిషి జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి వివేకం అవసరం. సకల జీవులు ఆ పరమాత్ముడి అంశతో జన్మించినవే అనే వివేకం, లోకానికి తగిన మేలుచేస్తూ జీవించాలనే జ్ఞానాన్ని ఇస్తుంది.

బాల్యంలో ఎవరికీ జీవితం గురించి ఏ విధమైన అవగాహనా ఉండదు. ఏ సమయానికి ఎలా నడచుకోవాలో ఏమీ తెలియదు. అవన్నీ పెద్దలే పిల్లలకు నేర్పుతారు. ఇంటా బయటా ఎక్కడ ఎలా ఉండాలో, ఏవి తినవచ్చో ఏవి తినకూడదో, ఎవరు ఎవరితో ఎలా ప్రవర్తించాలో... అన్నీ ఇతరులను చూసి కొన్ని, అనుభవంతో మరికొన్ని నేర్చుకుంటారు. ఆ విషయ పరిజ్ఞానం గురించి మన పెద్దలు, శ్రేయోభిలాషులైన పూర్వికులు వివేకంతో మార్గదర్శకత్వం చేశారు. అయితే స్వార్థం మితిమీరినప్పుడు వివేకం నశిస్తుంది. జీవితమంటే ఆధ్యాత్మిక, భౌతిక అనుభూతుల కలయిక. ఆ రెండింటి ప్రగతికీ వివేకం అవసరం. ‘వినదగునెవ్వరు చెప్పిన’ అని సుమతీ శతకకారుడు అన్నట్లు ఎవరి మాటైనా వినవచ్చు. చేయదగింది, చేయకూడనిది అని విశ్లేషించుకుంటూ ధర్మాధర్మ విచక్షణతో వివేకిగా ఉండాలి. ఎవరైనా ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకోవడం సహజమే. ఆ కోరిక వల్ల పరుల శ్రేయస్సుకు భంగం కలిగినట్లైతే అది ధర్మమైన కోరిక కాదు. ధర్మంగా, నిర్భయంగా జీవించడానికి వివేకమే మార్గదర్శకం అవుతుంది. వివేకవంతుల ఉనికి లోకానికి శ్రేయోదాయకం.

మనిషి వివేకవంతమైన జంతువు అని ఆంగ్లంలో నానుడి. కొన్ని జంతువులలో సైతం వివేకాన్ని గమనించవచ్చు. పెంపుడు జంతువులు తమ యజమాని ఆదేశాలను అర్థం చేసుకుంటాయి. అతడి అనుమతి లేకుండా ఏ పనీ చేయవు. ఆహారం తమ ఎదురుగా ఉన్నా తినమని చెబితే కానీ ముట్టుకోవు. ఆ వివేకం నేర్పేవారు ఉండరు కాబట్టే వీధికుక్కలు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాయి. అట్లాగే నేడు కొందరి ప్రవర్తనలోనూ వివేకం కొరవడుతోంది. దానివల్ల సమాజం అస్తవ్యస్తమవుతోంది.

ఇతరులకు ఇబ్బంది కలుగకుండా తమ అవసరాలూ ఆకాంక్షలపై కొంత అదుపు పాటించడం వివేకవంతుల లక్షణం. అదే ఆధ్యాత్మిక సాధనలో ‘లోకా సమస్తా సుఖినోభవంతు’ అనే భావనను అర్థవంతం చేస్తుంది. ఆ సాధనలో అంతర్భాగమైన దైవభక్తిని ప్రబోధించడంతో పాటు లోకానికి సరైన మార్గదర్శకత్వం వహించిన నరేంద్రుడు వివేకానందుడిగా ఆదర్శప్రాయుడు అయ్యాడు. పరుల శ్రేయస్సు సైతం ప్రధానం అనే వివేకమే మానవత్వం. జీవులలో మానవుడు వివేకవంతుడు అనే భావనకు అదే ప్రామాణికం.

దువ్వూరి రామకృష్ణ వర ప్రసాదు
పనే పరమాత్మ

ప్రతి పనికీ ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. ‘నాకు పని అంటే ఇష్టం. అందుకే ఆవిడ చేస్తూ ఉంటే అలా కుర్చీలో కూర్చుని గంటల తరబడి చూస్తూ ఉంటా’నని చెప్పాడు వెనకటికో ప్రబుద్ధుడు. అలాంటి పనిదొంగల సంగతి పక్కనబెడితే- ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రంగా తీర్చిదిద్దడమైనా, విధి నిర్వహణలో భాగంగా దస్త్రాల దుమ్ము దులపడమైనా... చేసే పనిని కళాత్మకంగా చెయ్యాలి. ఇంట్లో పని, బయటి పని అని తేడా ఉండకూడదు. పని చేసేవారికి ఎంతో సహనం కావాలి. పూజని పనిగా కాదు.. పనిని పూజగా భావించాలి. శాంతంగా చేసుకోవాలి. అది మొక్క నాటడం కావచ్చు, భవనం నిర్మించడం కావచ్చు. తమను తాము పనిలో భాగంగా మలచుకుని కర్తవ్యాన్ని పూర్తిచేయాలి.

కాలక్షేపం కోసం చేసేది కాదు పని. యజమాని తోటలోకి రాగానే ఆయన వెనకాలే తిరుగుతాడు ఒక పనివాడు. మరొక పనివాడికి ఆ సంగతే పట్టదు. యజమాని వచ్చింది కూడా చూడకుండా తన పనిలో తాను నిమగ్నమై ఉంటాడు. రామకృష్ణ పరమహంస ఈ కథ చెబుతూ నిజంగా పనిచేసే వ్యక్తిపైనే యజమాని దృష్టి ఉంటుందనేవారు.

ఎవరికి వచ్చిన పని వారు చెయ్యాలి. శివుడి ఇల్లు కురుస్తోందట. ఇల్లు కప్పే వ్యక్తి కోసం ఈశ్వరుడు రాత్రీ పగలూ తిరుగుతున్నాడట. ఎక్కడా దొరకడం లేదు. ‘మీరు శివుడు కదా.. మీకే అన్ని పనులూ వచ్చు. ఈ పని మీరే చేయవచ్చు కదా..?’ అని అమ్మ అడిగిందట. ‘అలా కాదు.. నేనే చేసి ఆ పనిని నమ్ముకుని బతుకుతున్నవారి పొట్ట కొట్టలేను’ అని ఈశ్వరుడు నవ్వుతూ చెప్పాడట. ఇది వినడానికి హరికథలో పిట్ట కథే కావచ్చు. కానీ ఆలోచిస్తే ఎంతో లోతైన అర్థం దొరుకుతుంది. ఈ లోకంలో ప్రతి ప్రాణికీ తనవైన విధులుంటాయి. గురువు ఒక్కరోజు కూడా సెలవివ్వకుండా తాను పనిచేస్తూ తమచేతా పనిచేయిస్తున్నారని శిష్యులకు కోపం. అందుకని వాళ్లు పనిముట్లను కనబడకుండా దాచేశారు. దాంతో ఆయన భోజనం మానేశాడు. శిష్యులు జాలిపడి నాలుగో రోజు వాటిని తెచ్చిచ్చారు. ఆ రోజంతా ఆయన పనిచేశాకే కడుపు నిండా భోజనం చేశాడు. పనిచేస్తేనే తిండి తినడానికి అర్హత ఉంటుందని ఆ గురువు ఆచరణలో చూపించాడు శిష్యులకు.

పని చేసేవారి బాగోగులు ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఒక పేద కుటుంబానికి కొన్నాళ్లపాటు పని దొరకలేదు, దాంతో తిండీ లేదు. దేవుడి మీద భారం వేసి కూర్చున్నారు. ఆ ఊరి పెద్దమనిషికి పొలంలో అత్యవసర పని పడింది. స్వయంగా వాళ్ల ఇంటికెళ్లాడు. పరిస్థితి చూసి ముందు వాళ్లకు కడుపునిండా భోజనం పెట్టి ఆ తర్వాత పనికి తీసుకెళ్లాడు.
పనిని దైవకార్యంగా భావించాలి. నిష్ఠగా చేయాలి. అలా ఎరుకతో చేసే పని వ్యక్తికే కాదు, ఈ లోకానికి కూడా శాంతి సౌభాగ్యాలనిస్తుంది.

భమిడిపాటి వెంకటేశ్వర రావు
జీవన చిత్రం
ఎంత కాలం బతికామన్నది ముఖ్యం కాదు. ఎంత బాగా జీవించామన్నది లెక్క. మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితం ఒక కళాఖండంలా మిగులుతుంది. బతుకు కళ అనేది త్యాగం, క్షమ, ప్రేమ అనే రంగులతో రూపుదిద్దుకునే అపురూపమైన చిత్రం.

సమస్యల నుంచి పారిపోకుండా, వాటికి సమాధానాలు వెతుక్కోవడమే జీవితం. ఇతరులకు వెలుగిస్తే మన జీవితం కూడా ప్రకాశిస్తుంది. మనం లేనప్పుడు కూడా మన జ్ఞాపకాలు నిలిచిపోతే అది నిజమైన జీవితమవుతుంది. బతుకు కళను నేర్చుకున్నవారు ప్రతి రోజును కొత్తగా మార్చుకోగలరు. మనకు లభించే ప్రతి క్షణం ఒక తెల్ల కాన్వాస్‌లాంటిది. దానిపై ఏ రంగులు వేసుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి.

బతుకు కళలో స్వీయ అవగాహన ఉండాలి. మన బలాలు, బలహీనతలు తెలుసుకోవడం ఒక మంచి శిల్పి శిలను అర్థం చేసుకోవడంలాంటిది. ఏ భావన మనలో దృఢత్వాన్ని పెంచుతుందో, ఏ అలవాటు మనను వెనక్కి లాగుతుందో గమనించడం ముఖ్యం. సమయం తిరిగి రాని వరం. దాన్ని వృథా చేయకుండా లక్ష్యసాధనకు ఉపయోగించడం బతుకు కళలో ప్రధాన సూత్రం. సమస్యల పరిష్కారానికి కొత్త మార్గాలు ఆలోచించాలి. చిన్న చిన్న పనులను సైతం సమయానికి, నాణ్యతతో పూర్తిచేయడం వ్యక్తిత్వానికి పదును పెడుతుంది.

దృక్పథం స్పష్టంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితుల మధ్య సైతం అవకాశాలను గుర్తించడం, కష్టాల్లో కూడా పాఠాలను నేర్చుకోవడం జీవన కళాకారుడి లక్షణం. అగ్నిపరీక్షలలోనే ఆత్మవిశ్వాసం బలోపేతమవుతుంది. సంబంధాలూ కీలకమే. చుట్టూ ఉన్నవారి హృదయాలను గెలుచుకోవడం, సహానుభూతి చూపడం, కృతజ్ఞత వ్యక్తపరచడం- ఇవి బతుకు చిత్రంలో ప్రకాశవంతమైన రంగులు. ఇతరులను ప్రోత్సహించగలిగితే, జీవితం మరింత సార్థకం అవుతుంది. దినచర్యల్లోనూ అందాన్ని వెతకడం మనసును యవ్వనంగా ఉంచుతుంది.
బతుకు కళ అనేది ఒక నిరంతర సాధన. ఇది ఒక్కరోజులో నేర్చుకోలేని మేలిమి నైపుణ్యం. క్రమశిక్షణ, ధైర్యం, ప్రేమ, ఆశావాదం ఈ నాలుగింటి తోడ్పాటుతో దాన్ని సాకారం చేసుకోవాలి. ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే- మన జీవన చిత్రానికి మనమే చిత్రకారులం కావాలి. కుంచె మనసైతే, రంగులు మన ఆలోచనలు. కాన్వాస్‌మన కాలం. బతుకును కళగా మలచడం ఒక మహోన్నత సృజన.

బతుకు కళ అనేది వాన చినుకుల్లో ఇంద్రధనస్సును వెతకడం లాంటిది. అంటే- కన్నీటి బిందువులోనూ ఒక ముత్యాన్ని చూడగలగడం, చీకటిలోనూ ఒక దీపాన్ని వెలిగించగలగడం. ప్రతి క్షణాన్నీ ఓ రాగంలా ఆలపించడం, ప్రతి అనుభవాన్నీ ఓ పద్యంలా రాయడం. బాధలను కూడా చిత్రంలోని నీడలుగా భావించి, ఆనందాన్ని ఆ చిత్రంలోని వెలుగులా ఆరాధించాలి. జీవితం ఒక ఖాళీ కాన్వాస్‌అయితే, మనసు సమపాళ్లలో వేసే సరైన రంగులే దానికి అందం. ఆ వర్ణాలన్నీ కలిసినప్పుడే బతుకు కళ అద్భుతమైన చిత్రమవుతుంది.

జియో లక్ష్మణ్‌
అంత సులభం కాదు

ముక్తి అందరికీ కావాలి. దాన్ని ప్రసాదించే భగవంతుడికి భక్తి కావాలి. భక్తి అంటే ప్రేమ, త్యాగం. భక్తి అంటే అంకితభావం- శరణాగతి. అలాంటి వ్యక్తికి మోక్షం ప్రసాదిస్తానని కృష్ణ పరమాత్మ చివరి మాటగా అర్జునుడికి చెప్పాడు. నన్ను నిజంగా శరణు కోరితే, ఆ వ్యక్తి పాపాలన్నీ హరిస్తాను. ముక్తినిస్తాను.. నా మాట నమ్ము- అని స్పష్టంగా చెప్పాడు. ఈ సమాజం ఆ మాటకు విలువనిస్తోందా అన్నదే పరిశీలనార్హమైనది. జన సమూహమే సమాజం. జనాల మధ్య నమ్మకాలు బలపడితే సమాజమూ సక్రమంగానే స్పందిస్తుంది. స్వీయ సంరక్షణకైనా, ధర్మరక్షణకైనా బలమైన మానవ సంబంధాలు అవసరం.

భక్తిలో రకాలు ఉన్నట్టుగానే ముక్తిలోనూ తేడాలున్నాయి. అపరభక్తి ఐహిక సుఖాలవైపు మొగ్గు చూపుతుంది. పరభక్తి ఆముష్మిక సుఖాలను కోరుకుంటుంది. ఐహిక సుఖభోగాలు ‘ఐసు’ముక్కల్లా కరిగిపోతాయి. ఆముష్మిక సుఖం నిరుపమాన ఆనందాన్ని ఆకాంక్షిస్తుంది. భూలోకంలో అనుభవించలేని సుఖాలను స్వర్గలోకంలో అనుభవించవచ్చని చెప్పడం మనుషులను మభ్యపెట్టడమే. పరుల కోసం త్యాగం చేయమని ప్రబోధించేవారే నిజమైన గురువులు. త్యాగం, పరోపకారం తదితరాలతో కూడిన ధర్మాచరణ ఉన్నచోట జయం కలుగుతుంది. మహాభారతానికి జయగ్రంథం అన్న పేరుంది. వ్యాస రచనలన్నీ పద్దెనిమిది సంఖ్యతోనే ఉన్నాయి. మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది. పద్దెనిమిది అధ్యాయాల గీత ధర్మంతో మొదలై ధర్మంతోనే ముగుస్తుంది. ‘ధర్మక్షేత్రే కురుక్షేత్రే’ అంటూ మొదలై ఎక్కడ కృష్ణార్జునులుంటారో అక్కడ సిరి, విజయం, ఐశ్వర్యం, దృఢమైన నీతి ఉంటాయని నా నమ్మకం- అంటాడు సంజయుడు. అతడు ధర్మానికి మారుపేరు. మొదటి శ్లోకంలో ‘మమ’కారం ధృతరాష్ట్రుడి స్వార్థసంకుచిత మనస్తత్త్వానికి ప్రతీక. చివరి శ్లోకంలోని ‘మమ’ నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక. భగవంతుడికి, భక్తుడికి నడుమ ఉన్న బంధానికి వ్యాఖ్యానం! మొదటి ఆరు అధ్యాయాలకు మిగతా పన్నెండూ భాష్యాలు అంటారు అరవిందులు.

అర్జున విషాదయోగం నరజాతికి పట్టిన భవరోగం గురించి చెబుతుంది. అజ్ఞానమనే చీకటిని తొలగించేది సాంఖ్యయోగం. జ్ఞాన, కర్మ, సన్యాస యోగం కర్తవ్యోపదేశం చేస్తే, కర్మ సన్యాసయోగం నిష్కామకర్మను విశ్లేషిస్తుంది. ఆత్మసంయమనంతో సాధన ద్వారా పరమ పురుషార్థమైన మోక్షం పొందవచ్చు. అలాగని ప్రబోధించే గీత- మత గ్రంథం కాదని, కర్మయోగ ప్రస్థానమని, విశ్వమానవ సమాజానికి దారి దీపం అని, పాశ్చాత్య వేదాంతులు సైతం ప్రశంసించారు.

ముక్తికి యుక్తమైన దారి సాధన. దాని ద్వారా మనిషి జీవన్ముక్తుడు కావాలి. ‘సాధనమయో జీవన్ముక్తో భవతి!’ తానొక్కడు అయితే చాలదు. తోటి మానవులకూ ఆ వివేకాన్ని పంచాలి. చెడ్డదారి నుంచి మంచిదారికి మళ్లించాలి. మృత్యు సమానమైన భవబంధాన్ని తొలగించాలి. ముక్తి అనుకున్నంత సులభం కాదు కానీ అనుకుని సాధన చేస్తే సాధ్యమే!

ఉప్పు రాఘవేంద్రరావు
కార్తిక పౌర్ణమి

కార్తిక పౌర్ణమి ఒక విలక్షణమైన పర్వదినం. సాహితీ ప్రియులకు, ఆధ్యాత్మిక వేత్తలకు సామాజిక ప్రియంభావుకులకు సమానంగా ఆనందాన్ని పంచి ఇచ్చే పండుగ కార్తిక పౌర్ణమి. తెల్లని వెన్నెల రాత్రులకు పేరెన్నికగన్న కార్తికం సాహిత్యవేత్తలకు నన్నయను గుర్తు చేస్తుంది. ‘శరత్కాలం నింగికి నేలకు శోభను చేకూరుస్తుంది’ అన్నాడు నన్నయభట్టు- పున్నమి రోజు రేయెండ(వెన్నెల) వర్షంలా కురుస్తూ భువనానికీ గగనానికీ మధ్య వంతెన నిర్మిస్తుంది కాబట్టి! అది చూసే మైమరచిపోయాడు భవభూతి. ఆయన పూర్వనామం శ్రీకంఠశర్మ. ‘అది వెన్నెల కాదు, కైలాసంలో తాండవనృత్యం చేస్తున్న భవుడి దేహం నుంచి జలజల రాలిపడుతున్న విభూతి’ అన్నాడో శ్లోకంలో. ముగ్ధ మనోహరమైన ఆ భావనకు మురిసిపోయిన రసజ్ఞ లోకం- ‘నీపేరు శ్రీకంఠుడు కాదు- భవభూతి’ అంది.

వానాకాలంలో దేవలోకాలకు తరలిపోయిన రాజహంసలు శరత్కాలం రాగానే క్రౌంచ పర్వత రంధ్రం ద్వారా తిరిగి భూలోకానికి వస్తాయని చెప్పినవాడు భవభూతే! దాన్నే కృష్ణదేవరాయలు ‘రాజమరాళ లబ్ధగిరి రంధ్రం’ అన్నాడు. గుండెల్లో వెన్నెల నింపే ఈ ఘట్టాలన్నీ స్ఫురించి మళ్లీ మళ్లీ సౌందర్య అనుభూతికి లోనవుతారు సాహితీప్రియులు. అందుకే వారికి కార్తికమన్నా, పౌర్ణమి అన్నా పరమప్రీతి.

శరదృతువులో స్ఫుటంగా గోచరించే సప్తర్షి మండలాన్ని వీక్షించడం ఆధ్యాత్మిక పరులకు ఆనందదాయకం. దానికి అనువైన రోజు కార్తిక పున్నమి. ‘శరత్కాల లక్ష్మి కార్తిక కౌముది వస్త్రంతో వెన్నెల దరహాసంతో లోకాన్ని మంత్రముగ్ధం చేస్తోంది’ అన్నాడు వైజయంతీ విలాసంలో సారంగు తమ్మయ్య. లక్ష్మీకళ మాత్రమే కాదు, శివకేశవ అద్వైత భావన సైతం ఆధ్యాత్మిక ప్రియులకు చాలా ఇష్టం. రూపా గోస్వామిది మరింత విలక్షణమైన చూపు. ‘వెన్నెల వెలుగులు తెల్లనివి కావు’ అన్నాడాయన. కృష్ణుడి కారణంగా నీలికాంతి అలుముకున్న అవి ‘నీలి వెన్నెలలు’ అని వర్ణించాడు. కృష్ణకాంతుల కారణంగానే భువనమంతటా అతిలోక మాధుర్యం వ్యాపించిందంటాడు రూపా గోస్వామి. ధాత్రీ(ఉసిరి) సహిత దామోదర కైంకర్యాలు, పరమశివారాధనలతో హరిహరాత్మకమై ప్రకాశిస్తున్న కార్తికమాసంలోని పున్నమి రాత్రి రాజచిహ్నాలతో అలరారుతుందని హరివంశం వర్ణించింది.

అందమైన వెన్నెలంతా అడవి పాలవుతుందని విచారిస్తూ కూర్చుంటారు కొందరు. నిజానికి వెన్నెలకు స్వపర భేదం లేనే లేదు. ఎర్రని ఎడారిలోనూ, పచ్చని అడవిలోను, చివరకు ప్రతి పెరట్లోనూ ఒకేలా వికసిస్తుందది. మనసుల్లో అలాంటి తారతమ్యాలు ఉండరాదని పాఠం చెబుతుంది. కలిసి బతకడాన్ని ప్రోత్సహిస్తుంది. రూపా గోస్వామో లీలాశుకుడో జయదేవుడో మదిని ఆవేశిస్తే కౌముది తత్వం గుండెకు పడుతుంది. కార్తికాన్ని వెన్నెల మాసం అనడంలోని అంతరార్థం బోధపడుతుంది. చంద్రుణ్ని షోడశ కళాప్రపూర్ణుడని ఎందుకంటారో తెలుస్తుంది. అమృత, మానద, పూష, తుష్టి, పుష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, పూర్ణామృత- అనే పదహారు కళలతో నిండుగా వెలిగే పున్నమి చంద్రుడి అతిలోక సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదించాలంటే కార్తిక పౌర్ణమిని మించిన రోజు లేనేలేదు.

ఎర్రాప్రగడ రామకృష్ణ
పరశురాముడు

పూర్వం కొంతమంది మహర్షులకు ముక్కుమీదే కోపం ఉండేది. విశ్వామిత్రుడు, దూర్వాసుడు, పరశురాముడు... వీరంతా ఆ కోవకు చెందినవారే. అందుకే దేవతలు సైతం వారితో జాగ్రత్తగా ఉండేవారని చెబుతాయి పురాణాలు.

ముఖ్యంగా పరశురాముడి గురించి చెప్పాల్సివస్తే.. ఆయన జమదగ్ని, రేణుకల చిన్న కుమారుడు. శివుడి దగ్గర అస్త్రశస్త్ర విద్యలు అభ్యసించి అజేయుడిగా నిలిచాడు. ఎంతటి పరాక్రమవంతుడో అంతటి కోపిష్టి. ఆయన ఆయుధం గండ్రగొడ్డలి (అందుకే పరశురాముడన్న పేరు వచ్చింది). దీన్ని శివుడి నుంచి పొందాడు. ప్రభువుల అహంకారం, నిరంకుశత్వం, దౌర్జన్యాలను నిలువరించడానికి పరశురాముడు ఆయుధం చేపట్టి యోధుడిగా మారతాడు. కార్తవీర్యార్జునుడి కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతి రాజ్యానికి పట్టుకుపోతారు. దాంతో పరశురాముడు తీవ్ర మనోవేదనకు గురవుతాడు. ఆ బాధ కోపంగా, ప్రతీకారంగా మారుతుంది. నేరుగా వెళ్లి కార్తవీర్యార్జునుడి కొడుకులను సంహరించి తండ్రి తల తీసుకొచ్చి మొండేనికి అతికించి జీవం పోస్తాడు. ఏలికలందరినీ తెగనరికి వారి రక్తాన్ని తెచ్చి శ్యమంతక పంచకమనే అయిదు సరస్సులలో నింపుతాడు. తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. ధర్మం నాలుగు పాదాల మీద నడవాలన్నదే ఆయన లక్ష్యం. ఎవరైతే దారి తప్పి, అన్యాయానికి ఒడిగడతారో వారిపై తీవ్రంగా స్పందించడం ఆయన నైజం. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఆరవది పరశురామావతారం. పాలకుల్లో దుష్టులైనవారిని శిక్షించి, వారి అవినీతి అక్రమాలను అంతమొందించేందుకే విష్ణుమూర్తి ఈ అవతారం ఎత్తాడన్నది పురాణాల సారాంశం.

పరశురాముణ్ని భార్గవరాముడనీ పిలుస్తారు. ఏతావాతా ఆయన ఆగ్రహం బహుముఖంగా ఉందన్నది నిర్వివాద అంశం. అంతటి కోపం ఉన్నప్పటికీ తండ్రి మాట జవదాటని పుత్రుడిగా చరిత్రలో నిలిచాడు. ఒకానొక సందర్భంలో జమదగ్ని భార్య రేణుకపై ఆగ్రహోదగ్రుడై ఆమెను సంహరించాలని తన కొడుకులను ఆదేశిస్తాడు. మిగిలిన వారు నిరాకరించడంతో ఆ కార్యాన్ని చిన్న కొడుకు పరశురాముడికి అప్పజెబుతాడు. అప్పుడాయన తల్లిని, సోదరులను సంహరిస్తాడు. దానికి సంతోషించిన తండ్రి ఏదైనా వరం కోరుకోమనగా.. తల్లి, సోదరులను తిరిగి బతికించమని అడిగి, సాధిస్తాడు. మహాభారతంలోనూ పరశురాముడి కోపాన్ని కర్ణుడు చవిచూస్తాడు. అతడు అబద్ధమాడి పరశురాముడి దగ్గర విద్యలను అభ్యసిస్తాడు. తరవాత ఆ విషయం తెలుసుకున్న పరశురాముడు ఆగ్రహంతో ఊగిపోతూ... యుద్ధ సమయంలో తాను నేర్పిన ఏ విద్యా గుర్తుకురాదని కర్ణున్ని శపిస్తాడు. శివుడి దర్శనానికి వెళ్లిన సందర్భంలో వినాయకుడు అడ్డుకోవడంతో పరశురాముడు కోపంతో తన పరశువును విసిరేస్తాడు. దాంతో గణేశుడి దంతం విరుగుతుంది. కోపం మనిషి ప్రథమ శత్రువైనప్పటికీ.. కొన్ని సందర్భాల్లో మంచికీ ఉపయోగించవచ్చని పరశురాముడి కథ చెబుతుంది.

చెన్నాప్రగడ శర్మ