Devotional Telugu
3.55K subscribers
105 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
అనిశ్చితే నిశ్చితి


‘అనిశ్చితే నిశ్చితి. అభద్రతతో జీవించడంలోనే భద్రత’ ఉంటుంది అని గణితశాస్త్రజ్ఞుడు జాన్‌ అలెన్‌ పౌలస్‌ అంటారు. అనిశ్చితిని మనం స్వీకరించలేకపోతే అది భయంగా మారుతుంది. అదే స్వీకరిస్తే ఉల్లాసానికి, సృజనాత్మకతకు దారితీస్తుంది. ఉన్నదున్నట్లుగా స్వీకరించడం మనం ఎదుర్కొనే సవాలు. నిశ్చితికోసం వెతకడం అర్థరహితం. అనిశ్చితిలోనే మన శక్తులను మనం తెలుసుకోగలుగుతాం. పరిస్థితులు ఎప్పుడెలా మారతాయో చెప్పలేం. శక్తికొద్దీ వాటిని ఎదుర్కోవాలి. కొన్నిసార్లు అద్భుతమైన ఫలితాలు చూస్తాం. కాని అవి మనం ఊహించినవి కాకపోవచ్చు. అయినా హుందాగా వాటిని స్వీకరిస్తూ ముందుకు సాగాలి. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎదుగుతూనే ఉండాలి.

ఒక సన్యాసి తన జీవితంలో బౌద్ధసూత్రాలను తు.చ.తప్పకుండా పాటిస్తూ వచ్చాడు. అయితే ఓ రోజు రాత్రి చీకట్లో నడుస్తుండగా కీచుమన్న శబ్దంతో పాటు కాలికింద ఏదో నలిగినట్లు అనిపించింది. కప్పను కాలితో తొక్కి చంపేశాననుకుని చాలా బాధపడ్డాడు. నిద్ర కూడా సరిగా పట్టలేదు. పొద్దున్నే ఆ ప్రదేశానికి వెళ్లి చూస్తే నలిగి పడి ఉన్న వంకాయ కనిపించింది. తాను ఏ ప్రాణికీ హాని చేయలేదని తెలిశాకే అతడిలో అశాంతి మాయమైంది.

ఏవేవో భయంకరమైన విషయాలన్నీ ఊహించుకుంటాం. దుఃఖపడతాం. చెడు జరగకముందే జరిగినట్లుగా ఊహించుకుని భద్రత లేదనుకుంటాం. ఏ క్షణంలో ఏమవుతుందో ఎవరికీ తెలియదు. జీవితం అంటేనే అనిశ్చితి. అంతమాత్రాన దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే- అది ఒత్తిడికి దారితీస్తుంది. భౌతిక, మానసిక ఆరోగ్యానికి భంగం కలిగిస్తుంది. ఏ పనీ చేయలేం. అన్నీ చెడుగా ఊహించుకునే బదులు మంచి విషయాలు తలచుకోవాలి. ఏకాగ్రత పెంపొందించుకుని వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. భవిష్యత్తు గురించి ప్రశ్నలు వేధిస్తే ఆందోళన, నిరాశ కలుగుతాయి. నిస్సహాయత ఎదురవుతుంది. చేపట్టిన పని సత్ఫలితాన్ని ఇస్తుందో లేదో తెలియదని అసలు చేయకపోవడం వివేకవంతుల లక్షణం కాదు. కష్టమో నష్టమో వెనకటి తరాల వారంతా చేయాలనుకున్నది ధైర్యంగా చేశారు కాబట్టే నాగరికత ఇంత దూరం వచ్చింది. మనకీ సౌకర్యాలన్నీ సమకూరాయి. అనిశ్చితి తాలూకు భయాలను వెనక్కి నెట్టి మన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. పనిచేయడం వరకే మన కర్తవ్యం, ఫలితం మన చేతిలో లేదని భగవద్గీత చెబుతోంది.

చాలావరకు నిత్యజీవితంలో అనిశ్చితిని ఎదుర్కొనడానికే ప్రయత్నిస్తాం. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకుంటాం. ప్రవర్తనను అదుపులో పెట్టుకుంటాం. అయితే అది అన్ని విషయాల్లోనూ చూపలేరు కొందరు. అలాంటి వాళ్లు శరీరంపట్ల, మనసుపట్ల శ్రద్ధ వహించాలి. కంటినిండుగా నిద్రపోవాలి. మనసును ఉల్లాసంగా ఉంచుకోవాలి. అంతా మంచే జరుగుతుందని, కోరుకున్న ఫలితం వస్తుందని ఆశించాలి. ఒకవేళ రాకపోతే మళ్లీ ప్రయత్నించాలి. అంతేకానీ నిరుత్సాహపడకూడదు. సహనాన్ని పెంపొందించుకోవాలి. నిత్యజీవితంలో మార్పులు స్వీకరించినట్లు పెద్ద సవాళ్లను కూడా స్వీకరించడం... అభిలషణీయం, ఆరోగ్యదాయకం.

తరిగొప్పుల విఎల్లెన్
పూర్ణ పురుషుడు

భగవంతుడు అన్ని ప్రాణులలో క్షేత్రజ్ఞుడిగా ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు. జగత్తు అంతా ఆయన మాయే. దానికి వశుడై ఉన్న జీవుడు ‘నేనే చేస్తున్నాను, అంతా నాదే, అన్నీ నాకే తెలుసు’ అనే అజ్ఞానపాశాలతో బంధితుడవుతున్నాడు. అరిషడ్వర్గాల ఊబిలో కూరుకుపోతున్నాడు. అందుకే మనిషి సంపూర్ణుడు కాలేకపోతున్నాడు. అజ్ఞానాంధకారంలో చిక్కుకుని జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించలేకపోతున్నాడు.

భగవంతుడు పూర్ణ పురుషుడు. మనిషిగా జన్మించి, తనేమిటో, తన తత్త్వమేమిటో లోకానికి స్పష్టంగా విశదపరిచాడు. బ్రహ్మ సృష్టిలోని చాకచక్యం అంతా కృష్ణుడి రూపంలో సంపూర్ణంగా కనిపిస్తుంది. అందుకే అందరూ చేసే పనులు ఆపేసి మరీ చెంతకుచేరి ఆయన్నే చూస్తూ ఉండి పోయేవారు. త్రిగుణాత్మకమైన ప్రకృతికి, ముల్లోకాలకు ఆయనే అధిపతి. స్వయం ప్రకాశుడు, ఆనంద స్వరూపుడు. ఇక వినయంలో కృష్ణుడికి సాటి ఎవరూ లేరు. కంసవధ అనంతరం దేవకీ వసుదేవులకు నమస్కరించి ‘ఇన్నేళ్లుగా మీ పాదసేవా భాగ్యాన్ని పొందలేకపోయాను. క్షమించి అనుగ్రహించండి‘ అని వేడుకున్నాడు. కృష్ణుడి వల్లనే ఉగ్రసేనుడు మహారాజయ్యాడు. అయినా ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడి గౌరవంగా ‘మహారాజా!’ అని మాట్లాడేవాడు. తనను చూడవచ్చిన బంధువులు, పెద్దలకు తలవంచి నమస్కరించేవాడు.

దయామయుడైన శ్రీకృష్ణుడు పెంచిన తల్లి యశోదకు ఏ పుణ్యలోకాలను ప్రసాదించాడో తనను మట్టుపెట్టాలని వచ్చిన పూతనని కూడా అవే పుణ్యలోకాలకు పంపాడు. తన పట్ల శత్రుభావంగల రాక్షసులు కూడా తన భక్తులే అని భావించి మరణానికి ముందు వారికి తన పూర్ణదర్శన భాగ్యాన్ని అనుగ్రహించాడు. కృష్ణుడు ఏకసంథాగ్రాహి. సాందీపని మహర్షి ఆశ్రమంలో వేదాన్ని అధ్యయనం చేశాడు. మరణించిన గురుపుత్రుణ్ని పంచజనుడు అనే రాక్షసుడి ఉదరం నుంచి బయటకు రప్పించి గురుదక్షిణ ఇచ్చాడు. పరమాత్మ గృహస్థ ధర్మాన్ని పాటించి అష్టదేవేరులను ఆనందపరిచాడు. సచ్చిదానందమైన జ్ఞానంతో నిష్ఠ కలవాడై ద్వారకను సమర్థంగా పాలించాడు. లోకంలో జ్ఞానమార్గాన్ని నిలబెట్టాడు. అపూర్వ గీతావాణిని అందించాడు.

కోరికలు లేకుండా, కర్మలు అంటకుండా ఉండే స్వామి కర్మలు చేస్తున్నట్లు కనిపించాడు. కాల మృత్యుస్వరూపుడైనా శత్రువులకు భయపడి ద్వారకా ద్వీపంలో తలదాచుకున్నట్లు నాటకమాడాడు. ఒక వంక ‘జగత్తును నడిపించేది నేనే’నంటూనే మరో వంక ‘నిమిత్తమాత్రుణ్ని, నాకేమీ తెలియద’ని అనేవాడు. ఆయనపై పరిపూర్ణ విశ్వాసం ఉంటే గానీ ఆ తత్త్వం అర్థం కాదు. పరమ భక్తి కలిగినవారు నిత్యమూ భగవత్‌ సాన్నిధ్యాన్నే కోరుకుంటారు. వారి దృష్టి ఎప్పుడూ ఆయనపైనే ఉంటుంది. పాండవులు అంతటి భక్తిపరులు కాబట్టే వారికి రాజ్యం దక్కింది. ఇలాంటి పరాభక్తిని సాధన చేస్తే దైవం తనను తానే సమర్పించుకుంటాడు. దూడ వెంట గోవులా మన వెంటే ఉంటాడు.

మాడుగుల రామకృష్ణ
జీవితాన్ని అంగీకరిద్దాం

పంచభూతాత్మకమైన ప్రకృతి మన చుట్టూ అల్లుకున్న ఆవరణ మాత్రమే కాదు, కనిపించని చైతన్యశక్తి. అది ఉన్నందుకే సకల చరాచరాలు అస్తిత్వంలో ఉన్నాయి. జీవన గమనానికి ప్రకృతి దిశానిర్దేశమే ప్రామాణికం. దాని అడుగుజాడల్లో పయనించే పశు పక్ష్యాదులు ఆనందంగా ఉంటున్నాయి. కానీ, మనిషి మాత్రం భారంగా బతుకీడుస్తూ దుఃఖంతో ఉంటున్నాడు. అందుకు కారణం అతడు ప్రకృతి తాలూకు నియమనిబంధనలకు విరుద్ధంగా నడచుకోవడం, గాలి వీచినవైపు నడవకపోవడం, ప్రకృతిధర్మాల్ని అసలే లెక్కచెయ్యక వాటిని తుంగలో తొక్కేయడం... ఇదంతా మనిషి అజ్ఞానానికి పర్యవసానం. అజ్ఞానం అహంభావానికి దారితీస్తుంది. అది జీవితం పట్ల అవగాహన కుదరనివ్వదు.

పులిని ధైర్యానికి ప్రతీకగా, పిల్లిని పిరికితనానికి ఉపమానంగా భావిస్తుంటాం. ఈ పోలికలు మనిషి ఆలోచనలే కానీ పులికి, పిల్లికి అవేమీ తెలియవు. అవి ఆ క్షణాల్లో ఎదురైన జీవితాన్ని యథాతథంగా స్వీకరిస్తాయి. సమయానుకూలంగా నడచుకుంటాయి. అంతేగానీ పౌరుషానికి పోవు, ఎవరి మెప్పూ పొందాలని అనుకోవు. ఒక వ్యక్తి పిల్లిని గదిలో బంధించి కర్రతో బాదుతున్నాడు. కాసేపటికి మూసిన గది తలుపులు గభాల్న తెరచుకున్నాయి. పిల్లి ఎదురుతిరిగి దాడి చేయబోగా కర్ర పట్టుకున్న వ్యక్తి పరుగు లంకించుకున్నాడన్న మాట. సాధుజంతువుగా ఉండే పిల్లి ఆపద వస్తే పులిలా మారింది. మరోచోట... ఊళ్లోకి పులి వచ్చింది. జనం గుంపుగా కర్రలతో దాని దారికడ్డంగా నిలిచారు. అప్పుడా పులి రెండడుగులు వెనక్కి వేసి తేరిపారజూసి వచ్చిన దారిన వెళ్లిపోయింది. అంతటి పెద్దపులి తనను చూసి పిల్లిలా వెనుదిరిగిందని మనిషి బీరాలు పోతాడు. నిజానికి ఆ జంతువుకు అవేమీ పట్టవు. ప్రతి జీవి సాధ్యమైనంత వరకు తనకే ఆపదా రాకుండా జీవించి ఉండాలని కోరుకుంటుంది. పరిస్థితిపై తనది పై చేయి కాగలదనుకుంటేనూ, తప్పనిసరి అయితేనూ మాత్రమే అది ప్రతిఘటిస్తుంది. ఆ అవకాశం లేదనుకుంటే నిశ్శబ్దంగా అక్కడినుంచి నిష్క్రమిస్తుంది. అంతేగానీ ఎవరో ఏమో అనుకుంటారని గొప్పలకు పోయి ప్రాణాలమీదకు తెచ్చుకోదు. వెనుకడుగు వెయ్యడాన్ని చిన్నతనమనుకోదు. అది వాటి సహజస్వభావమే కానీ రాజీపడటమో ఓటమిని అంగీకరించడమో కాదు. ఎక్కడ తగ్గాలో తెలియడం కూడా జీవితాన్ని ఎదుర్కోవడమే. ఒక పెద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రయాణంలో పెద్ద కొండ అడ్డువచ్చింది. అప్పుడా నది పరుగు వేగం తగ్గింది, కాస్త వెనక్కి మళ్లింది. కాసేపటికి కొండ పక్కనుంచి కొత్తదారి చూసుకుని ప్రయాణం కొనసాగించింది. ఒక్కోసారి వెనక్కి రావడమూ ముందుకు పోవడంలో భాగమే.

మిగిలిన రాళ్లకన్నా నాలుగు ఉలిదెబ్బలు ఎక్కువ తిన్నదే విగ్రహమై పూజలందుకుంటుంది. పట్టాభిషిక్తుడు కావాల్సిన శ్రీరాముడు అరణ్యవాసాన్ని అంగీకరించి ఆచంద్రతారార్కం దేవుడై నిలిచాడు. లక్ష్యసాధనకు ముందుకు సాగుతున్నప్పుడు తగిలే ఎదురుదెబ్బలను విజయానికి మెట్లుగా భావించాలే తప్ప పరాజయాలుగా కాదు. ప్రకృతి నియమాన్ని అనుసరించి జీవితాన్ని అంగీకరించాలి. సందర్భానికి తగినట్లుగా స్పందించాలి.

మునిమడుగుల రాజారావు
పుష్ప వైభవం

సప్తవర్ణ శోభిత పూదోటల్లో విహరిస్తున్నప్పుడు మనసు పరవశిస్తుంది. భగవంతుడి అద్భుత సృష్టిలోని విశిష్టత బోధపడుతుంది. వివిధ రంగుల పువ్వులు కంటికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సువాసనలు వెదజల్లే సుమాలను ఇష్టపడని వారుండరు. పూజాద్రవ్యాలలో పూలకే పెద్దపీట. సహస్ర నామార్చనకు సుమ సౌరభం తోడైనప్పుడు భగవంతుడు ప్రీతిచెందుతాడు.

శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి అచ్చంగా పువ్వులతో చేసే అలంకరణను తోమాలసేవ అంటారు. స్వామివారికి ఆపాదమస్తకం చేసే ఈ పుష్పాలంకరణ సేవలో పాల్గొన్నవారి మనసు అనే పుష్పం శ్రీవారి పాదాలచెంత చేరి జన్మ ధన్యమవుతుందని చెబుతారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలోనైతే ఆలయ ప్రాంగణమంతా పుష్పాలంకరణతో అలరారుతూ చూపరులకు నయనానందకరంగా ఉంటుంది. ఆ ఉత్సవాల అనంతరం ఏటా కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రం రోజున శ్రీవారి కల్యాణమండపంలో జరిగే పుష్పయాగమూ చూసి తీరాల్సింది. ఈ రోజుల్లో దైవార్చనకు వాడిన పువ్వులను వృథాగా పారవేయట్లేదు. వాటితో అగరుబత్తులు, పరిమళద్రవ్యాలు తయారుచేస్తున్నారు. ఆ విధంగా అవి రెండుసార్లు భగవంతుడికి సేవజేసుకునే భాగ్యానికి నోచుకుంటున్నాయి.

కమలనాభుడు విష్ణుమూర్తి. కమల సంభవుడు బ్రహ్మ. శ్రీమహాలక్ష్మికి ఎర్ర తామర పూలంటే ఇష్టం. సరస్వతీ దేవికి అత్యంత ప్రీతికరమైనది తెల్ల తామర. ‘చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచా’ అని లలితా సహస్ర నామ స్తోత్రంతో అమ్మవారిని స్తుతిస్తాం. రుక్మిణీదేవి పద్మం వంటి శరీర పరిమళం కలిగి లక్ష్మీదేవి అంశతో జన్మించిందన్నది భాగవత కథనం. దేవదానవులు సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవించింది. బ్రహ్మదేవుడు లక్ష్మీదేవిని సృష్టించినప్పుడు వికసించిన ఎర్రతామరల కొలనులో సుగంధం వ్యాపించింది. తుమ్మెదల ఝంకార ధ్వనులతో కూడిన కలువపూల దండ పట్టుకుని లక్ష్మీదేవి మేఘాల నడుమ మెరిసిపోయే బంగారంలా దేవతల మధ్య నిలుచుందని భాగవతం వర్ణించింది. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త, జిల్లేడు, గన్నేరు, జాజి, మల్లె, పారిజాత పువ్వులతో శివుణ్ని పూజిస్తే ఉత్తమ ఫలాలనిస్తాడని శివపురాణం చెబుతోంది. భగవంతుడికి ప్రీతి పాత్రమైన పుష్పాలు మనుషుల మనసులనూ మురిపిస్తాయి. అందుకే వాకిట్లో ఓ పూల మొక్క పెట్టుకోవాలని ప్రయత్నించని వారుండరు. ప్రేమను వ్యక్తపరచడానికి గులాబీ సహకరిస్తుంది. శకుంతల కణ్వమహర్షి ఆశ్రమంలో పెరుగుతున్నప్పుడు చెట్లకు బాధ కలుగుతుందని ఒక్క ఆకు కూడా తుంచి ఎరుగదట. అవి మొదటిసారి పుష్పించినప్పుడు శకుంతల పండుగ చేసేదని కాళిదాసు వర్ణించాడు.

కనువిందు చేసే రంగులతో, మైమరపించే సువాసనలతో సూర్యోదయం కాగానే శుభోదయం చెప్పే పూబాలలను భగవంతుడి దరికి చేర్చే భాగ్యం మానవమాత్రులకు మాత్రమే లభించింది. నిర్మలత్వానికి, అమాయకత్వానికి, దైవత్వానికి ప్రతిరూపంలా ఉండే పువ్వులు నిష్కల్మషమైన హృదయానికి ప్రతీకలు. భగవంతుడి పాదాలదగ్గర పువ్వులను ఉంచడమంటే భక్తుడు తన హృదయాన్ని ఆయనకు సమర్పించుకున్నట్లే!

ఇంద్రగంటి నరసింహమూర్తి
నిరంతర సాధన

‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నాడు వేమన. ‘సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా’ అన్నారో సినీకవి. భగీరథుడి అకుంఠిత సంకల్ప దీక్షతోనే దివినుంచి భువికి దిగింది భాగీరథి. రాజర్షి పదవి నుంచి బ్రహ్మర్షి పదవిని అందుకోవడానికి విశ్వామిత్రుడికి నిరంతర సాధనే తోడైంది.

సాధన అనేది కేవలం కొన్ని ప్రత్యేక సమయాలలో చేసే అభ్యాసం మాత్రమే కాదు, అది అనుక్షణం ప్రతి పనిలోనూ జరగాల్సిన మానవ ప్రయత్నం. ఏ పని సిద్ధించాలన్నా సాధన అవసరం. అందుకు కావాల్సింది ఓపిక. కార్యం పట్ల నిబద్ధత ఉంటేనే ఓపిక వస్తుంది. సాధన ఎంత చిత్తశుద్ధితో జరిగితే కార్యసిద్ధి అంత త్వరగా కలుగుతుంది. మనోనిగ్రహం లభించాలంటే రోజుకు ఒక గంటో రెండు గంటలో మనసును నియంత్రించి, మిగిలిన సమయంలో దాన్ని విచ్చలవిడిగా వదిలేయడం కాదు. ప్రతిక్షణం మనసును గమనిస్తూ దాని కదలికలను కనిపెడుతూ ఉన్నప్పుడే దాన్ని దారిలోకి తేగలం. అలా తెచ్చుకుని, మనం చేసే ఏ చిన్న పనైనా కౌశలంతో చేయడమే ఒక యోగం. గీతాచార్యుడూ అదే చెప్పాడు.

గురువు దగ్గరికి కొత్తగా ఒక శిష్యుడు వచ్చాడు. అతణ్ని పూజామందిరం శుభ్రం చేయమన్నారు. తనకు ఇంత చిన్న పని అప్పగించారేంటని అనుకుంటూ హడావుడిగా పని పూర్తిచేశాడు. గురువు మందిరానికి వెళ్లి చేత్తో తడిమితే దుమ్ము అంటుకుంది. శిష్యుణ్ని పిలిచి ‘నేను చెప్పాను, నువ్వు చేశావు. అంతేకానీ జరగాల్సిన రీతిలో పని జరగలేదు. ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ప్రవచనాలు వినడం, నియమిత సమయాలలో జపధ్యానాలు చేసుకుపోవడమే సాధన కాదు. మనం చేసే ప్రతి చర్యలోనూ సాధన ప్రతిఫలించాలి. ఒక పని ఎలా చెయ్యాలో అలా చెయ్యడమే ఉత్తమ సాధకుడి లక్షణం. పైపైన చెత్త మాత్రమే ఊడ్చావుగాని లోతుగా పనిచేయలేకపోయావు. దీన్ని చిన్న పనిగా భావించావు. సాధన మొదట చిన్నపనులతోనే ప్రారంభమవుతుంది. మందిరాన్నే శుభ్రపరచలేని వాడివి, మనసును ఎలా శుభ్రపరచుకుంటావు? మనసు స్థితిని బట్టే మన ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. ఈ పని జరగాల్సిన రీతిలో జరగలేదంటే మనసు నీ స్వాధీనంలో లేదన్నమాట. హడావుడి, ఆత్రుత, అస్థిరత సాధనకు శత్రువులు. ఓపిక, పట్టుదల, నిబద్ధత సాధనకు మిత్రులు’ అని చెప్పారు. ఆయన సూక్ష్మ పరిశీలనాశక్తికి శిష్యుడు ఆశ్చర్యపోయాడు.

విద్యార్థులు పాఠశాల స్థాయిలో చేసే చిన్న చిన్న ప్రయోగాలే భావి జీవితంలో వారు సాధించబోయే పెద్ద విజయాలకు నాంది పలుకుతాయి. ఆ సమయంలో వారు చూపే ఓపిక, ఏకాగ్రత, శ్రద్ధ, పట్టుదల, సూక్ష్మ పరిశీలన వంటివి వారిని ఉన్నతులుగా నిలబెడతాయి. అందుకే చిన్న వయసునుంచే వారిలో ఆ లక్షణాలను ప్రోత్సహించాలి. సాధన అనేది వ్యక్తిగతంగానూ, సమష్టిగా సమాజ ఉన్నతికీ దోహదపడేదిగా ఉండాలి. అలాంటి సాధన ఒకరోజులో చేసి ఆపేది కాదు, అది నిరంతర ప్రక్రియ.

నెయిగాపుల కృష్ణ
పతనానికి మొదటి మెట్టు

ఈర్ష్య నుంచి ద్వేషం జన్మిస్తుంది; ద్వేషం నుంచి కలహాలు పుట్టుకొస్తాయి. కలహాల వల్ల మనసు భ్రమపడుతుంది. చివరికి మనిషే పతనమవుతాడు.

మనిషి జీవితంలో ఉన్నతికి, లేదా పతనానికి ప్రధాన కారణం అతడి గుణాలే అని పురాణకాలం నుంచి ఎన్నో కథనాలు రుజువు చేస్తున్నాయి. కొన్ని చెడు ప్రవృత్తులు ముఖ్యంగా ఈర్ష్య, అసూయ మన ప్రగతికి అతిపెద్ద శత్రువులు. ఇవి నిప్పులా హృదయాన్ని కాల్చేస్తాయి. ప్రశాంతతను హరిస్తాయి. చివరికి చరిత్రహీనుల్ని చేస్తాయి.

ఎన్ని దానధర్మాలు చేసినా, పూజలూ వ్రతాలూ ఆచరించినా, ఇతరుల విజయానికి ఈర్ష్య పెంచుకుంటే, ఇతరుల శ్రేయస్సును చూసి అసూయపడితే అది మనల్నే దహించి వేస్తుంది. ఏ దానాలు, పూజలు దానినుంచి రక్షించవు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాముడిపై ఎంతో ప్రేమ కలిగిన కైకేయి కూడా, తన కొడుకు భరతుడు అన్నకి అనుయాయిగానే మిగిలిపోతాడన్న విషయాన్ని తట్టుకోలేక ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయింది. తానెప్పుడో గతంలో దశరథ మహారాజు దగ్గర పొందిన వరాలను ప్రయోగించి రాముణ్ని అడవికి పంపించింది. ఇంత చేసినా భరతుణ్ని రాజుగా చూసుకోలేకపోయింది. తన కొడుకును ఎలాగైతే చూడకూడదని అనుకుందో అలాగే చూడక తప్పలేదు ఆ తల్లికి. అసూయతో అన్యాయంగా ప్రవర్తించినా తాను కోరుకున్న ఫలితాన్ని పొందలేకపోయింది. చివరికి ఎవరి కోసమైతే తాను అంత దారుణానికి ఒడిగట్టిందో ఆ కన్న కొడుక్కే మానసికంగా దూరమై బాధపడింది.

అందుకే ‘ఈర్ష్యా వ్యాధిః శరీరస్యం, ధర్మనాశస్య కారిణీ’ అన్నారు పెద్దలు. మహాభారతంలో పాండవ పుత్రులను చూసి పసిప్రాయం నుంచి కళ్లలో నిప్పులు పోసుకున్నారు కౌరవులు. యుధిష్ఠిరుడు రాజసూయ యజ్ఞం నిర్వహించినప్పుడు, పాండవుల వైభవాన్ని కళ్లారా చూసిన దుర్యోధనుడు తీవ్రంగా అసూయ చెందాడు. పాండవుల ప్రతిభను, ధర్మాచరణను, విజయాన్ని తట్టుకోలేక వంచనకు పాల్పడ్డాడు. అతడు చేసిన కుట్రలు, కుతంత్రాలు కురుక్షేత్ర యుద్ధానికి దారితీశాయి. చివరికి దుర్యోధనుడి అసూయ అతణ్నే కాదు, అతడి వంశం మొత్తాన్ని నాశనం చేసింది. శిశుపాలుడు తన జీవితమంతా కృష్ణుణ్ని ద్వేషిస్తూ గడిపాడు. ఆయన గొప్పదనాన్ని సహించలేకపోయాడు. రాజసూయ యజ్ఞంలో ఉన్నతమైన గౌరవాన్ని పొందుతున్న కృష్ణుణ్ని దూషించి సుదర్శన చక్రానికి బలయ్యాడు. అసూయ ఎంత పెరిగితే, అది అంతటి ముప్పు తెస్తుంది.

‘అసూయా పాపస్య మూలం’ అన్నది రుషి వాక్యం. అసూయ అన్నిరకాల పాపాలకు మూలమని దానర్థం. అందుకే ఇతరుల విజయాలను చూసి ఆనందించాలి. మనస్ఫూర్తిగా వారిని అభినందించాలి. చేతనైతే వారినుంచి స్ఫూర్తి పొంది విజయపథంలో ముందుకు సాగాలి.


మావూరి విజయలక్ష్మి
సత్య మార్గం

మూసిన గుప్పిట చూస్తే అందరికీ ఒకలాంటి ఆసక్తి, లోపల ఏముందోనని! ఏదో ఒకటి ఉండాలన్న ఆశ చాలా మందిది.

అలాంటివారికి ఏమీలేదని చెబితే ఒక పట్టాన నమ్మరు. తెరచి ఖాళీ చెయ్యి చూపించినా ఏదో మోసం చేశావనేవాళ్లే ఎక్కువ. ఏ కొద్దిమందో కనిపిస్తున్న దాన్ని నమ్ముతారు. తార్కికంగా ఆలోచిస్తారు. ఆ చేతిలో ఏమున్నా లేకపోయినా తమకు ఒరిగేదేమీ లేదన్న వాస్తవాన్ని గ్రహిస్తారు. తాము ఇబ్బంది పడకుండా, ఇతరులను ఇబ్బందిపెట్టకుండా తమ పని తాము చూసుకుంటారు. సమస్యంతా మిగిలిన వాళ్లతోనే. వీరికి సత్యం చెప్పి నమ్మించడం కన్నా అసత్యంతో మభ్యపుచ్చడం తేలిక. ఆ బలహీనతను తమ స్వార్థానికి వాడుకునేవారిని ఎందరినో మనం చూస్తుంటాం.

ఒక మర్రిచెట్టు దగ్గర జనాలు గుమిగూడి ఉండటం చూశాడు బ్రహ్మయ్య. వారంతా ఆ చెట్టు తొర్రలో చెయ్యి పెట్టడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. తొర్రలో చెయ్యి పెడితే ఏదో అద్భుతమైన అనుభూతి కలుగుతుందని, మహత్తర శక్తులు వస్తాయని అందరూ చెప్పుకొంటున్నారు. చెట్టు తొర్రలో చెయ్యి పెట్టగానే వారి ముఖాలు ఒక్క క్షణం ‘అబ్బా..’ అన్నట్లుగా ముడుచుకుంటున్నాయి. చెయ్యి తీసి ఇవతలకు రాగానే జనాలు వారిని చుట్టిముట్టి ఎలా ఉందీ అనడుగుతున్నారు. దానికి వారంతా ‘ఎంత బాగుందో... అద్భుతం’ అంటూ ముఖానికి నవ్వు పులుముకుని చెబుతున్నారు.  

అదేంటో తానూ తెలుసుకోవాలనుకుంటాడు బ్రహ్మయ్య. చాలాసేపు నిలబడి మొత్తానికి చెట్టు దగ్గరికి చేరాడు. తొర్రలో చెయ్యి పెట్టి ‘అబ్బా’ అని అరిచాడు. జనం అదేమీ పట్టించుకోకుండా అతణ్ని చుట్టుముట్టి ఎలా ఉందని అడిగారు. బ్రహ్మయ్య నొప్పి పెడుతున్న తన చేతిని వారికి చూపిస్తూ, ‘అద్భుతం లేదు, గిద్భుతం లేదు! గండు చీమలు కుట్టాయి...’ అని వాస్తవం చెప్పాడు. అది విని గండు చీమలతో కుట్టించుకోవడానికా ఇంత తోసుకుని వెళ్తున్నది... అని నవ్వుకుని కొందరు తమ సమయం వృథా కాకుండా కాపాడినందుకు బ్రహ్మయ్యకు ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయారు. మరికొందరు అతణ్ని కోపంగా చూస్తూ... ‘నువ్వు స్వార్థపరుడివి, కుళ్లుబోతువి... ఆ అద్భుత అనుభవం మేం పొందకూడదని అబద్ధం చెబుతున్నావు’ అని ఆక్షేపించారు. నేటి సమాజధోరణికి అద్దం పడుతుందీ కథ. 

ఇతరులను మభ్యపెట్టాలనుకోవడం, నేను మోసపోయాను కాబట్టి వాళ్లకీ అదే జరగాలనుకోవడం వివేకవంతుల లక్షణం కాదు. నిజం నిష్ఠూరంగానే ఉండవచ్చు, అంతమాత్రాన దాన్ని దాచనవసరం లేదు. కాకపోతే చెప్పి ఒప్పించడానికి చాలా ధైర్యం కావాలి. ‘నిజములాడువాని నిందించు జగమెల్ల’ అని వేమన అన్నట్లుగానే వాస్తవాలను అంత త్వరగా అంగీకరించదు లోకం. అయినా సరే, ఉత్తములు సత్య మార్గాన్నే ఎంచుకుంటారు. అందుకు ఫలితంగా మొదట కష్టాలూ అవమానాలూ ఎదురైనా చివరికి విజయం వారిదే.

డాక్టర్‌ గోనుగుంట్ల శ్రీనివాసరావు 
దేహభ్రాంతి

ధర్మాచరణకు, దైవాన్వేషణకు శరీరమే సాధనం. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది. అంటే మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, మంచి ఆలోచనలతో నిండాలన్నా శారీరక ఆరోగ్యం బాగుండాలి. మంచి ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణ కలిగిన జీవనవిధానం ఆరోగ్యాన్ని క్రమబద్ధం చేస్తాయి. అయితే శరీరం పట్ల ఈ జాగ్రత్త దేహభ్రాంతిగా మారకూడదు. విజ్ఞులైనవారు మేనిని కేవలం ధర్మసాధనంగా మాత్రమే భావిస్తారు.

సమస్త సృష్టిలో మరే జీవికీ సాధ్యపడని ఆలోచన, వివేకం, వివేచన మానవుల సొంతం. నిరంతర సాధన, ధర్మవర్తన ద్వారా ఈ జన్మను సద్వినియోగం చేసుకుని మోక్షానికి అర్హమైనదిగా మలచుకోవాలి. వ్యాకులత, దుఃఖం, రోగాలు.. చివరికి మరణం ఇవన్నీ శరీరానికి సహజంగా సంభవించేవే. కాబట్టి వీటిపట్ల మితిమీరిన ఆందోళన అనవసరం. ఈ విషయం తెలిసినా కొందరు- నా శరీరం వేరు, దైవం వేరు అనే ద్వైతభావం కలిగి ఉంటారు. దీనికి కారణం దేహభ్రాంతి. ఇది ఉన్నంతవరకు ఏకాత్మ భావం అలవడదు. ఈ దేహం శాశ్వతం కాదన్న సత్యం నిరంతరం మనసులో మెదులుతుండాలి.

అహంకారానికి కారణం కూడా దేహాభిమానమే. నేను, నాది అనే భావన ‘నేనే’ అనే అహానికి దారితీస్తుంది. దీన్ని క్రమంగా తగ్గించుకోవాలి. ఈ దేహం ముత్యపు చిప్ప వంటిది. విలువైన ముత్యం ఏర్పడటానికి చిప్పే ఆధారం. కానీ ముత్యం లభించాక చిప్పకు విలువ ఉండదు. అలాగే విలువైన ఆత్మ గురించి తెలుసుకున్నవారు దేహానికి ప్రాధాన్యం ఇవ్వరు. దేహాభిమానం ఉన్నంత వరకు మోహసంద్రంలోంచి బయట పడలేరని వేమన కూడా హెచ్చరిస్తాడు.

భగవాన్‌ రమణమహర్షికి రాచవ్రణం లేచినప్పుడు ఆయన బాధపడలేదు. శరీరం మాత్రమే తన కర్మఫలాన్ని అనుభవిస్తోంది అనుకున్నారు. ఒకసారి వాసుదేవానంద సరస్వతి స్వామివారికి అతిసార వ్యాధి వచ్చినప్పుడు భక్తులు అడిగారట.. ‘ఎంతోమంది రోగులకు సాంత్వన కలిగించే మీరు వ్యాధితో బాధపడటమేమిటి స్వామీ’ అని. దానికి ఆయన ‘శరీరమే తాము అని భ్రమించేవారికి, బాధలను అధిగమించలేనివారికి ఉపశమనం అవసరం. ఆత్మస్వరూపులు ఇలాంటివాటికి చింతించరు. దేహాన్ని నేనుగా భావించడంలేదు’ అని సమాధానమిచ్చారట!

‘తనువు తనువటంచు దపియించు జనులార! తనువులు స్థిరమని తలపరాదం’టాడు వేమన. కేవలం ఇంద్రియాల ద్వారా లభించే సుఖాలకు అలవాటు పడి దేహమే నిత్యమనే భ్రాంతిలో బతుకుతుంటారు చాలామంది. ‘పచ్చికుండ వంటిది మేను’ అన్న తత్వకవుల హెచ్చరికలోని అంతరార్థాన్ని గ్రహించలేరు. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మానవ రూపం లభిస్తుందంటారు పెద్దలు. దాన్ని భగవత్‌ ప్రసాదంగా స్వీకరించాలి. సద్వినియోగం చేసుకోవాలి. వ్యామోహాలు, రాగద్వేషాలు, భోగలాలస, ఇంద్రియ చాపల్యాలకు దూరంగా ఉండటమే దేహభ్రాంతి అనే భవరోగానికి దివ్యమైన ఔషధం.

శ్రీమత్కందాళ బాలసరస్వతి
జీవిత లక్ష్యం

జీవిత లక్ష్యం ఏంటి? మానవ జీవితానికి ఏదైనా ప్రయోజనం, పరమార్థం ఉన్నాయా? ఈ మౌలిక ప్రశ్నలపై స్పష్టత వస్తే జీవితాన్ని సంఘర్షణారహితంగా, ఆనందమయంగా మలచుకోవచ్చు. జీవితాన్ని రెండు కోణాలనుంచి చూడవచ్చు. ప్రకృతిపరంగా చూస్తే మనిషి- ప్రాణికోటిలో ఓ భాగమంతే. ఇలా చూసినప్పుడు మానవ జీవితానికి ఒక నిర్దిష్ట లక్ష్యం, ప్రయోజనం లేవనే చెప్పాలి. జీవించడమే జీవిత లక్ష్యం!

ఇక ప్రపంచపరంగా చూస్తే- మనిషి ఈ నాగరిక సమాజంలో అంతర్భాగం. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, ఉద్యోగి, వ్యాపారి, దేశ పౌరుడు- ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తాడు. ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ప్రతి వ్యక్తికీ కొన్ని ఆశలు, ఆశయాలు ఉంటాయి. వాటిని సమర్థంగా నెరవేర్చడం ముఖ్యం. కానీ వాటినే జీవిత లక్ష్యాలుగా భ్రమపడతారు చాలామంది. అప్పుడు ఆ పాత్రల పరంపరే జీవితంగా తయారై ఆందోళన పెంచుతుంది. ప్రస్తుతం ఇదే అతిపెద్ద సమస్య. జాగ్రత్తగా గమనిస్తే- పోషించే పాత్ర, వయసు, కాలాన్ని బట్టి మనిషి ఆశలు, ఆశయాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ‘లక్ష్యం’ అనుకున్నది ఒకటి పూర్తవగానే మరొకటి కనిపిస్తుంది. అందుకే ప్రాపంచిక విషయాల్లో దేన్నీ జీవితలక్ష్యంగా, ప్రయోజనంగా పేర్కొనలేం.

ప్రకృతిపరంగా, ప్రపంచపరంగా కూడా ఏ లక్ష్యం, పరమార్థం లేకపోతే ఇక జీవించి ఉపయోగమేంటి అన్న కీలక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిజానికి ఈ ప్రశ్న ‘అహం’ నుంచి పుడుతుంది. సంకుచితమైన మనసు నుంచి జనిస్తుంది. నిరంతరం భద్రత కోసం పాకులాడే మనసు- ఏదో ఒక పాత్ర పోషణలోనే నీ జీవిత పరమార్థం ఉందని భ్రమింపచేస్తుంది. ఇక్కడే మనిషి జీవితపు విశిష్టతను అర్థం చేసుకోవాలి. జంతువులు జంతువులుగా పుడతాయి, అలాగే మరణిస్తాయి. మేధస్సు, ఊహాశక్తి, స్వీయ ఎరుక ఉన్న మనిషి మాత్రమే సృజనాత్మకంగా ఉండగలడు. ఆధ్యాత్మికంగా ఎదగగలడు. సూర్యోదయాన్ని ఆస్వాదించగలడు. ఈ విశ్వ రహస్యాలను శోధించగలడు. ఇంతటి మహాద్భుతమైన జీవితాన్ని పూర్తిగా జీవించడమే జీవిత లక్ష్యం. ఏ ఇతమిత్థమైన అర్థమూ, లక్ష్యమూ లేకపోవటమే జీవితానికి అందం.

రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులను పక్కన పెడితే- జీవితంలో దేన్నయినా కళాత్మకంగా మార్చవచ్చు, ఏ పనిలోనైనా సృజనాత్మకతను కనబరచవచ్చు. అభిరుచి ఉన్న రంగంలో లోలోతులకు వెళ్లే స్వేచ్ఛ ఉంటేనే మనిషి తనలో దాగి ఉన్న సృజనశక్తిని వెలికి తీయగలుగుతాడు. నిజమైన విద్య ప్రయోజనం అదే. శాస్త్రవేత్త అయినా, సంగీత విద్వాంసుడైనా, కార్మికుడైనా, కర్షకుడైనా- ఎవరైనా సరే, తమ వ్యాపకంలో, తమ సృజనాత్మక సాగరంలో మునిగినప్పుడే వర్తమానాన్ని ఆస్వాదించగలరు. తమదైన ముద్రతో సృజన చేయగలరు. అదే స్వీయాన్వేషణకు నాంది, ఆధ్యాత్మికతకు పునాది. అలా అస్తిత్వం ప్రసాదించిన విషయాల్లో తనదైన స్వధర్మాన్ని జోడించి మూసకు కట్టుబడకుండా ముందుకు సాగడమే జీవిత పరమార్థం. మనిషి ఆనందానికి అదే అసలైన మార్గం.

ఈదర రవికిరణ్‌
స్రీ శక్తి

సృష్టికి మూలశక్తిగా అలరారే స్త్రీకి ఎక్కడ గౌరవనీయ స్థానముంటుందో అక్కడ శుభం, సౌభాగ్యం వర్ధిల్లుతాయి. అలాంటి స్త్రీ గొప్పతనం గురించి ఎంత చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా తక్కువే అవుతుంది. ‘శక్తి రూపాలైన సీత గౌరీ వాగీశ్వరి వంటి వారి రూపంలో గాని ఉన్నావా రామా?’ అని ‘ఏతావునరా నిలకడ నీకు?’ అనే కీర్తనలో అడిగాడు త్యాగయ్య. పౌరాణిక గ్రంథాలు, కావ్యాలు సైతం మానవజాతి భవిష్యత్‌ అంతా స్త్రీ శక్తి మీద ఆధారపడి ఉంటుందని ముక్త కంఠంతో చెబుతున్నాయి.

సీతాన్వేషణలో భాగంగా లంకను చేరే ప్రయత్నంలో రాక్షసి అని తెలిసినా సురసను ఉద్దేశించి హనుమంతుడు ‘మాతా’ అని సంబోధించాడు. ‘రామకార్యం నెరవేర్చడానికి సహకరించమ’ని మర్యాదపూర్వకంగా ప్రార్థించాడు. సీత జారవిడిచిన ఆభరణాల ఉత్తరీయాన్ని పరిశీలించమంటే లక్ష్మణుడు... ‘నేను ఆమె ముఖం వైపు ఎప్పుడూ చూడలేదు. నిత్యం పాదాభివందనం చేసేవాణ్ని కనుక ఆమె పాదాలకు ధరించిన నూపురాలను మాత్రం గుర్తించగలన’ని చెప్పాడట. అదీ మన సంస్కృతి స్త్రీకి ఇచ్చిన గౌరవం. స్త్రీ... పురుషుడి వెనుక ఉంటే బలం. ముందుంటే కవచం. పక్కనే ఉంటే జీవితాన్ని వసంతంగా మార్చేసే అద్భుతం. అందుకే మహాశివుడు సైతం అర్ధనారీశ్వరుడు అయ్యాడు. భగవంతుడు ప్రతి ఇంట తాను ఉండే అవకాశం లేక తల్లిరూపంలో ఓర్పుగా నిలబడతాడని పెద్దల మాట. అందుకే ఉపనిషత్తులు ‘మాతృదేవోభవ’ అని చెప్పింది. మేనమామ ఇంటినుంచి అయోధ్యకు చేరిన భరత శత్రుఘ్నులకు తండ్రి మరణించడానికి, రాముడు వనవాసానికి వెళ్లడానికి కారణం కైకేయి అని, దానికి ప్రేరకురాలు మంధర అని తెలుస్తుంది. శత్రుఘ్నుడు పట్టలేని కోపంతో మంధర శిగను పట్టుకుని రాజ ప్రాంగణానికి ఈడ్చుకు వచ్చాడు. అప్పుడు భరతుడు రాముడిక స్త్రీలపై ఉన్న గౌరవాన్ని వివరించి, ఆమెను క్షమించి వదిలిపెట్టమని కోరాడు. ఇదీ మన సంస్కృతి విశిష్టత.

ఇంత గొప్పగా చెప్పుకొంటున్నా... నాణానికి రెండో వైపు అన్నట్టుగా స్త్రీలను హింసించి ఇబ్బందులకు గురి చేసేవారు, చెరబట్టి వినాశనాన్ని కొని తెచ్చుకునేవారూ కోకొల్లలు. ద్రౌపదిని తన అంకం మీద కూర్చోమని ఆజ్ఞాపించిన, ఆమెను నిండు సభకు తీసుకొచ్చిన దుర్యోధన దుశ్శాసనులు ఎటువంటి మరణాన్ని పొందారో, పరస్త్రీ వ్యామోహంతో రావణుడు ఏమయ్యాడో మనకు తెలుసు. మన చుట్టూ ఇటువంటి కీచకులూ ఉన్నారు. రామలక్ష్మణుల వంటి మర్యాదా పురుషోత్తములూ ఉన్నారు. సమాజానికి చీడవంటి నరకాసురులను దునుమాడటానికి సత్యభామ స్త్రీ శక్తిగా లోకానికి ప్రేరణ అయింది. మనుషుల్లోని ఇటువంటి రాక్షసులను వదిలించుకోవాలని, ‘స్త్రీల ఉద్ధరణ జరగకుండా భారతదేశం పురోగమించద’ని వివేకానందుడు అన్నాడు. దాన్ని నేటితరం అర్థం చేసుకోవాలి. మహిళలను చిన్నచూపు చూడటమంటే ‘అమ్మశక్తి’ని అవమానించడమేనని తెలుసుకోవాలి.

గంటి ఉషాబాల
మౌన ఫలం

మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండటం కాదు. వాక్కు, మనసు, ఇంద్రియాలపై నియంత్రణ సాధించడం. రమణమహర్షి చెప్పినట్లు మౌనం ఒక నిశ్శబ్ద సంభాషణ, అత్యంత సమర్థవంతమైన భాష.

వాక్‌ మౌనం అంటే వ్యర్థమైన మాటలను నియంత్రించడం. ఇంద్రియ మౌనం అంటే పంచేంద్రియాల ద్వారా కలిగే కోరికలను అదుపులో ఉంచుకోవడం. మానసిక మౌనం అంటే మనసులో కలిగే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోశాలు, వాంఛలను నిరోధించడం. మనసును దైవచింతనపై ఉంచి, పరిపూర్ణ నిశ్చల స్థితికి చేరుకోవడం. నిజానికి మౌనం ద్వారా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. జ్ఞానోదయం కలిగి ఆరోగ్యం, ప్రశాంతత, సంకల్పశక్తి, ఆత్మవిశ్వాసం అందివస్తాయి. మౌనం ద్వారా అంతరంగ ప్రబోధంతోపాటు అంతర్ముఖ పయనం సాధ్యమై, అంతర్యామిని దర్శించే అవకాశం లభిస్తుంది. వేదాలు, పురాణాలు మొదలైన భారతీయ ధార్మిక గ్రంథాలలో మౌనానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. వేదకాలం నుంచి మౌనం తపస్సులో ముఖ్య భాగంగా ఉంది. ఇంద్రియ నిగ్రహానికి, చిత్తశుద్ధికి మార్గంగా గుర్తింపు పొందింది. రుషులు, మునులు సత్యదర్శనం కోసం, బ్రహ్మజ్ఞానం కోసం... మౌనం అవసరమని గుర్తించారు. ‘వాక్కును నిరోధించడం ద్వారానే దివ్యత్వం వైపు అడుగులు వేయగలం’ అంటారు శంకరాచార్యులు. మహర్షులు భక్తి ప్రపత్తులతో దీర్ఘకాలం మౌనవ్రతాలు ఆచరించడం ద్వారా గొప్ప శక్తులను, జ్ఞానాన్ని పొందినట్లు పురాణ గాథలలో పేర్కొన్నారు. మౌనం ద్వారా దైవసాన్నిధ్యం సాధ్యమని పురాణాలు ఘోషిస్తున్నాయి. దక్షిణామూర్తి మౌనం ద్వారా జ్ఞానబోధ చేశాడని చెబుతారు.

మౌనం మెదడుపై సానుకూల ప్రభావం చూపుతూ ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక స్పష్టతను, సృజనాత్మకతను పెంచుతుందని న్యూరోసైన్స్‌ అధ్యయనాలు సూచిస్తున్నాయి. సాంఖ్య సిద్ధాంతం మనిషి మనసు, దాని శక్తి సామర్థ్యాలపై నమ్మకాన్ని ప్రకటిస్తుంది. మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడానికి మౌనం సాయపడుతుందని, భగవంతుడిపై మనసును లగ్నంచేసేందుకు తగిన వాతావరణాన్ని కల్పించే స్వతంత్ర తత్వశాస్త్రం మౌనమని చెబుతుంది.

రామపురం చాలా అందమైన గ్రామం. కానీ, ప్రజలమధ్య నిరంతరం కొనసాగే మాటల యుద్ధం మూలంగా ఊళ్లో ప్రశాంతత ఉండేది కాదు. అక్కడికి ఒక జ్ఞాని వచ్చి పరిస్థితి తెలుసుకుని, ‘మీరంతా ఒక నెలరోజులపాటు మౌనవ్రతం పాటించండి, అత్యవసరమైతే తప్ప మాట్లాడకండి’ అన్నాడు. ఆయన సూచనలను అందరూ అంగీకరించి, ఆచరించారు. వాగ్వివాదాలు లేకపోవడంతో ఎవరి పని వారు నిశ్శబ్దంగా చేసుకోసాగారు. అలా ప్రశాంత వాతావరణం ఏర్పడింది. మౌనం ఆలోచనలకు స్పష్టతనిస్తుంది, మనసుకు శాంతినిస్తుంది, సంబంధాలను బలపరుస్తుంది.

అంతర్గత ప్రయాణం, స్వీయ ఆవిష్కరణ, ఉన్నత స్థితికి చేరుకోవడానికి చేసే త్రివిధ తపస్సులలో మౌనం శక్తిమంతమైన సాధనమని భగవద్గీత చెబుతోంది. ముఖ్యంగా మానసిక మౌనం దైవచింతనపై ఏకాగ్రత కుదరడానికి సాయపడుతుంది. ఆ స్థితిలో మనసు బాహ్య ప్రపంచం నుంచి విడివడి, అంతర్గతమైన దైవిక అంశాలపై దృష్టి సారించగలుగుతుంది.

డాక్టర్‌ శ్రీదేవీ శ్రీకాంత్‌
ఈ పది వుంటే

మనిషి జీవితం సార్థకం కావాలంటే ఉండాల్సినవి ధనం, హోదా తదితరాలు కాదు. కానీ, దేశకాలాలకు అతీతంగా లోకమంతా జీవితం అంటే అవే అనుకుంటోంది. వాటిని సంపాదించడం కోసమే జీవితమంతా పరుగులు పెడుతున్నారు. ఆ క్రమంలో యుక్తాయుక్త విచక్షణను మర్చిపోతున్నారు. సత్యం, ధర్మం, నీతి, నడవడిక మొదలైన వాటికి సమాజంలో విలువ లేకుండా పోతోంది. సమాజం ప్రగతి సాధించినప్పుడు మానవ జీవన స్థితిగతులు మెరుగుపడాలి. సాంకేతిక అభివృద్ధితో జీవనశైలి సులభతరం కావాలి. కానీ, అందుకోసం నైతిక విలువలను పణంగా పెట్టరాదు. లోక ధర్మాలు శ్రుతి తప్పకూడదు. స్వార్థంతో మనిషి పతనం కాకుండా ఉండాలంటే కొన్ని నియమాలను పాటించకతప్పదు.

మనిషి నిర్వాణ పథం చేరుకోవడానికి భగవాన్‌ బుద్ధుడు- దానం, ధ్యానం, ఉపేక్ష, ప్రజ్ఞ, క్షమ, శీలం, సహనం, సత్యం, శౌర్యం, నిరపేక్ష అని దశ పారమితలను (పరిపూర్ణతలు) ఉపదేశించాడు. ప్రతి వ్యక్తీ ఉన్నంతలో కొంత దానం చేయడం అలవరచుకుంటే కలిగే తృప్తి, ఆనందం ఎందులోనూ లభించవు. సత్ప్రవర్తన, నైతికత మనిషి వ్యక్తిత్వానికి అలంకారాలవుతాయి. శీలసంపద మనిషిని ఉన్నతీకరిస్తుంది. ప్రాపంచిక సుఖాల పట్ల ఎంత అనాసక్తత పెంచుకుంటే అంతగా కోరికలను అదుపులో పెట్టుకోవచ్చు. దానివల్ల దుఃఖం తగ్గుతుంది. క్షమించడం వల్ల మనిషి ప్రశాంతతను పొందగలడు. పగ, కక్షలతో హింస తప్ప ఏమీ సాధించలేం. అలాగే మనిషిలో శౌర్య గుణం తప్పక ఉండాలి. దీనివల్ల ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. స్వశక్తితో జీవించగలమనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది.

అలాగే ధ్యానం అంటే- చేసే పనిమీద ఏకాగ్రత కలిగి ఉండటం విజయానికి తొలి మెట్టు అవుతుంది. ఉత్తమ జీవన విధానానికి ప్రజ్ఞ అంటే- జ్ఞానం చాలా ముఖ్యం. అది ఉన్నప్పుడే జీవితాన్ని సరైన ఎరుకతో తీర్చిదిద్దుకోగలరు. అందుకే బుద్ధిజీవులకు అపజయం ఆమడదూరంలో ఉంటుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా జీవితమన్నాక ఆటుపోట్లు తప్పవు. అటువంటి కష్ట సమయాల్లో ఓరిమి చూపాలి. సహనం లేకపోతే మనుషులను అశాంతి ఇట్టే ఆవరిస్తుంది. దృఢచిత్తంతో నిత్యం సత్యం పలికేవారి వల్ల లోకానికి మేలు జరుగుతుంది. తమ ప్రవర్తన మీద శ్రద్ధ కలిగినవారే సత్యమార్గంలో ముందుకు వెళ్లగలరు. ఎదుటివారు ఎటువంటి వారైనా మనం కొంత దయతో ప్రవర్తించాలి. చెడు చేసిన వారిపట్ల కూడా కరుణ చూపగలిగిన వారు మహోన్నతులు అవుతారు. అన్నిటికన్నా గొప్పది నిరపేక్ష. అంటే విడిచి పెట్టడం. మితిమీరిన కోరికలను, స్వార్థాన్ని, ఈర్ష్ష్య అసూయలను, కోపం, పగ, అహంకారాలను విడిచిపెట్టాలి.

ఈ దశ పారమితలను జీవితాంతం పాటించాలి. అప్పుడే జీవనగమనంలో వచ్చిపడిన వేగం తగ్గి, తానేంటో తనకు బోధపడుతుంది. మనుషుల మధ్య అనురాగం పెరిగి ద్వేషం తగ్గుతుంది. సమస్త మానవాళి మంగళకరమై వర్ధిల్లుతుంది.

డాక్టర్‌ బండి సత్యనారాయణ
అడ్డుగోడలు

గోడమీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయేవారికి వడ్డించు బొమ్మ... అంటూ చిన్నతనంలో పొడుపు కథ చెప్పుకొనేవాళ్లం. పారేసిన సినిమా రీలు ముక్కలను తీసుకుని భూతద్దం సాయంతో గోడ మీద బొమ్మలు ప్రదర్శించేవాళ్లం. గోడల మీద పెద్దల ఫొటోలు, దేవుడి పటాలు తగిలించుకోవడమూ మనకు అలవాటే. పండుగ వస్తే మట్టి గోడలను ముగ్గులతో అలంకరించేవారు పల్లెటూళ్లలో. ధ్యానం చేస్తే నాడీమండలంలో గోడలు శుభ్రపడతాయని చెబుతారు గురువులు. వీధి గోడల మీద నినాదాలు, బడి గోడల మీద ప్రార్థనా గీతాలు, గుడి గోడల మీద శ్లోకాలు.. రాసుకోవడం సహజమే కదా.

తల్లిదండ్రుల సేవ చేస్తూ విష్ణుమూర్తి అవతారమైన విఠలుణ్ని ‘ఇటుక’ మీద వేచి ఉండేలా చేశాడు భక్త పుండరీకుడు. ఇటుక కూడా గోడలోని భాగమే. దానిమీద కూర్చుని భక్తులను చెక్కుచెదరని ఏకాగ్రతతో గమనిస్తూ ఉంటాడు స్వామి. యోగి చాంగ్‌దేవ్‌ విసిరిన సవాల్‌కు ప్రతిగా తోబుట్టువులతో సహా గోడమీద కూర్చుని స్వారీ చేశారట సంత్‌ జ్ఞానేశ్వర్‌. ఒక సన్యాసి నడిచి వెళ్తూ ఉంటాడు. దారిలో పెద్ద గోడ అడ్డుపడుతుంది. కష్టపడి ఆ అవరోధాన్ని దాటి అవతల ఉన్న అందమైన తోటని చేరుకుంటాడు. ఇక్కడ అందమైన తోటంటే నిజశాంతి అని అర్థం. శాంతి, సంతోషాలు మనకు అందుబాటులోనే ఉంటాయనీ మనసులో మనం నిర్మించుకున్న రకరకాల అడ్డుగోడల వల్లే అవి మనకు అందకుండా ఉంటాయని ఈ చిన్న కథ చెబుతుంది.

ఎలా ఉన్నారని ఎవరో అడిగితే ‘కోడల్ని, గోడల్ని ఆసరాగా చేసుకుని బతుకు బండి నడిపిస్తున్నా’నని ఒక ప్రముఖ రచయిత జీవిత సత్యం చెప్పారు. పసిపిల్లలు నడక నేర్చుకునేటప్పుడు గోడను ఆసరాగా పట్టుకుంటారు. పెద్ద వయసులో శక్తి ఉడిగిన వృద్ధులూ గోడ మీద ఒక చెయ్యి వేసే నడుస్తారు. మనసు బాగోకపోయినా, ఒంట్లో నీరసంగా ఉన్నా గోడకి చేరగిలబడి కూర్చోవడం అందరూ చేసేదే. నిజానికి నాలుగు గోడలే చారెడు నేలను గదిగా మారుస్తాయి, ఇంటిని చేసి సంసారానికి మరుగు సమకూరుస్తాయి. కొత్తగా కాపురం పెట్టేందుకు అద్దె ఇంటికోసం వెదుకుతున్నారు దంపతులు. ‘ఒక గది మాత్రమే ఇవ్వగలం.. పర్వాలేదా?’ అని అడిగాడు ఇంటి యజమాని. ‘అలా అయితే మరీ మంచిది. మా మధ్య అడ్డుగా గోడలు ఉండవు కదా’ అని ఛలోక్తి విసిరాడు కొత్త పెళ్లికొడుకు. మనుగడకు అవసరమైన కనిపించే గోడలతో ఇబ్బంది లేదు. కానీ మనిషి మరికాస్త ముందుకెళ్లి కనిపించని గోడలెన్నో కట్టుకుంటున్నాడు. నేను, నాది... అంటూ మనసు పొరల చుట్టూ దుర్భేద్యమైన కోటగోడలు నిర్మించుకుని ఆ పరమాత్మకు దూరమవుతున్నాడు. సాధనతో, ఆధ్యాత్మిక అనుభవంతో కనిపించని ఆ గోడలను తొలగించుకుంటూ వెళ్లిన వారికే ఆ అంతర్యామి సన్నిధి లభిస్తుంది. ఆ ఎరుకే ఇప్పుడు కావాలి... అది అందరిలోనూ రావాలి.

భమిడిపాటి వెంకటేశ్వరరావు
ఆఖరి సందేశం

జెన్‌ కథ
ఒక జెన్‌ గురువుకు దేశమంతటా ఎంతోమంది శిష్యులు ఉండేవారు. ఆయన ఉపదేశాలకోసం వారు నిరంతరం ఎదురుచూస్తూ ఉండేవారు. ఒకరోజు ఉదయం ఆయన ‘‘ఇవాళ సాయంత్రం తనువు చాలిస్తాను. మన వాళ్ళందరికీ తెలియజెయ్యండి’’ అని తన శిష్యులకు చెప్పాడు. ఈ సమాచారం దావానలంలా నలుమూలలకూ పాకింది. చివరిసారి గురువును సందర్శించడానికి ఎక్కడెక్కడి నుంచో శిష్యులందరూ అక్కడికి వచ్చిచేరారు.

ముఖ్యుడైన ఒక శిష్యుడు మాత్రం గురువును వదలి దూరంగా ఉన్న సంతకు బయలుదేరాడు. ‘వేరే ప్రదేశాల నుంచి ఎందరో వస్తూ ఉంటే... ఈ ముఖ్య శిష్యుడు వెళ్ళిపోవడం ఏమిటి?’ అని అందరూ ఆశ్చర్యపోయారు. దారిలో అతనికి ఎదురుపడిన కొందరు ‘‘గురువుగారి చివరి క్షణాల్లో ఆయన దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నావు?’’ అని ప్రశ్నించారు.

‘‘నేను గురువుగారి దగ్గర ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాను. ఆయనకు చాలా ఇష్టమైన ఒక ఆహార పదార్థం ఉంది. దాన్ని ఆయనకు తెచ్చి ఇద్దామని వెళుతున్నాను’’ అంటూ ఆ శిష్యుడు పరుగులు తీశాడు.

అక్కడ కుటీరంలో గురువుకు చివరి క్షణాలు దగ్గర పడుతున్నకొద్దీ శిష్యగణంలో ఉత్కంఠ పెరిగిపోతోంది. గురువు కళ్ళు మూసుకొని పడుక్కున్నాడు. అప్పుడప్పుడు కళ్ళు తెరచి, తన ప్రియశిష్యుడికోసం చూసి, అతను లేడని గ్రహించి, మళ్ళీ కళ్ళు మూసుకుంటున్నాడు. కొంతసేపటికి ఆ శిష్యుడు వచ్చి గురువు ముందు నిలబడ్డాడు. గురువు కళ్ళు తెరచి ‘‘వచ్చావా నాయనా! నాకు ఇష్టమైనది తెచ్చావా?’’ అని అడిగాడు.

అందరూ చాలా ఆశ్చర్యపోయారు. ‘గురువుకు ఏదీ చెప్పకుండానే ఆ శిష్యుడు సంతకు వెళ్ళాడు. అతను తనకు ఇష్టమైన ఆహార పదా ర్థాన్ని తీసుకురావడానికి వెళ్ళాడని గురువుకి ఎలా తెలుసు?’ అని గుసగుసలాడుకున్నారు. ఇంతలో ఆ శిష్యుడు తన చేతిలోని పదార్థాన్ని ఇవ్వబోతే... గురువు తన రెండు చేతులూ చాపి దాన్ని అందుకున్నాడు. ‘‘ఈ చివరి క్షణాల్లో కూడా మీ చేతులు వణకడం లేదే?’’ అని చుట్టూ ఉన్న ఇతర శిష్యులు అడిగారు. ‘‘నాకు చావంటే భయం ఉంటే కదా... చేతులు వణికేది’’ అన్నాడు గురువు. తన చేతుల్లోని ఆ పదార్థాన్ని తినేశాడు. అప్పటివరకూ ఓపికగా నిలబడిన శిష్యులు ‘‘గురువుగారూ! మీ ఆఖరి సందేశం కోసం ఎదురుచూస్తున్నాం. మీరు మాకు ఇచ్చే చివరి సందేశం ఏమిటి?’’ అని అడిగారు. గురువు నవ్వి ‘‘ఈ పదార్థం చాలా బాగుంది’’ అని చెబుతూ కన్నుమూశాడు.

ఈ కథను ఓషో ఒక సందర్భంలో వివరిస్తూ ‘‘ఆ గురువు ముంచుకొస్తున్న మృత్యువు గురించి చింతించలేదు. జీవించి ఉన్న చివరి క్షణాన్ని ఎలా ఆనందంగా గడపవచ్చో చేసి చూపించాడు. అదే అతను శిష్యులకు ఇచ్చిన ఆఖరి సందేశం’’ అని చెప్పారు.

రాచమడుగు శ్రీనివాసుల
మూషికవాహన... మునిజన భావన

మూష అంటే దొంగ. ఎలుకది దొంగబుద్ధి. అందుకే మూషికం అన్నారు. మూషికం వినాయకుడి వాహనం. స్తేయం అన్నా దొంగతనమే. దొంగబుద్ధి లేకపోవడం అస్తేయం. బుద్ధుడు చెప్పిన పంచసూత్రాల్లో అస్తేయం ఒకటి. డబ్బూ వస్తువులను తస్కరించాలనుకోవడం ఒక్కటే కాదు... అసలంటూ దొంగబుద్ధి లేకపోవడం అస్తేయం. ‘అహింసా సత్య మస్తేయం శౌచం(పరిశుభ్రత) ఇంద్రియనిగ్రహః’ అనేవి పరమధర్మాలంది మనుధర్మశాస్త్రం. అదే మాటను గీతాచార్యుడూ చెప్పాడు. చాలా మందికి ఆ దురలవాటు ఉంటుంది. బాల్యంలో కాపలా మనిషి కన్నుగప్పి దొంగతనంగా కొట్టుకొచ్చిన జామ, మామిడికాయల రుచి ఇంతా అంతా కాదు మరి! ఆ చిలిపి సరదాలు వయసొచ్చేసరికి సహజంగానే అణగారిపోతాయి. కొందరిలో మాత్రం వ్యసనంగా పరిణమిస్తాయి. వృత్తిరీత్యా భారీ ఆదాయాలను అందుకునే వారు సైతం- దుకాణాల్లో చిన్నచిన్న వస్తువులు దొంగిలిస్తూ ఉంటారు- కొనుక్కోలేక కాదు, దొంగిలించాలన్న బలమైన కోరికను ఆపుకోలేక!

చేతివాటమనేది మానసిక రుగ్మత. ‘తిట్టే నోరూ, తిరిగే కాలూ ఊరికే ఉండవు’ అని సామెత. ఇదీ అంతే! మనస్తత్వశాస్త్రంలో దాన్ని ‘క్లెప్టోమేనియా’ అంటారు. తనమీద తనకు గౌరవం లేకపోవడంలోంచి పుట్టుకొచ్చే దుర్బుద్ధి అది. ‘నాకు ధర్మం ఏమిటో తెలుసు- కానీ అది నా స్వభావం కావడం లేదు, అధర్మం అంటేనూ నాకు తెలుసు- నన్నది విడిచిపెట్టడం లేదు’ అన్నాడు సుయోధనుడు. క్లెప్టోమేనియా బాధితుల పరిస్థితి సరిగ్గా అదే. చేతుల నిండా డబ్బుండీ- చేతివాటుతనం ప్రదర్శిస్తారు. పరువు పోగొట్టుకుంటారు. ‘తుచ్ఛమున హాని వచ్చును, కుచ్చితమే తన్ను చెరచు కోవిదు(పండితుడి)నైనన్‌’ అని వేమన హెచ్చరించాడు. దొంగతనంలోని థ్రిల్లే తప్ప- దొరికిపోతే ఏమిటనేది తెలియదు. ‘పెక్కు భంగుల్‌ వివేకభ్రష్ట సంపాతముల్‌...’ అని భర్తృహరి చెప్పిందదే!

మనిషి బుద్ధిని మన పెద్దలు చాలా లోతుగా వివేచించారు. వక్రబుద్ధులకు సరైన పరిష్కారాలను మన ఆచారాల్లో, సంప్రదాయాల్లో- ముఖ్యంగా వ్రతకథల్లో గొప్ప ప్రతీకలుగా ఇమిడ్చారు. ‘పండితులు సాయంసంధ్యల్లో చోర ప్రసంగాలతో కాలక్షేపం చేయడం సంప్రదాయం’ అన్నారు. సాయంసంధ్య అంటే వృద్ధాప్యం, చోరుడంటే వెన్నదొంగ. మలి వయసులో భాగవతం అధ్యయనం చేయమని సూచన. ‘గుటకపడని అగ్గిఉండ సాగరాలనీదుకుంటు తూరుపింట తేలుతుందిరా’ అన్నట్లు భవసాగరాలను దాటిన పిదప భాగవత తత్త్వం బోధపడుతుంది. అగ్గిఉండ అంటే జ్ఞానానికి సంకేతమైన సూర్యుడు. ఇక, అంత పెద్ద వినాయకుడు బుల్లి ఎలుకపై ఊరేగడం దేనికంటే- మనలోని చోరాది లేకి గుణాలను అణిచిపెట్టమని! దాంతో మంచి బుద్ధి సిద్ధిస్తుంది కాబట్టి బుద్ధినీ, సిద్ధినీ వినాయకుడి భార్యలన్నారు. పురాణ గాథల్లోని ప్రతీకలు, అంతరార్థాలన్నీ ఇంతటి విశిష్టమైనవే!

ఎర్రాప్రగడ రామకృష్ణ
అపార్థాలే అవరోధాలు

ఒక్కోసారి కళ్లు మోసం చేస్తాయి. మరోసారి చెవులున్నూ. కన్నదీ విన్నదీ నిజమవ్వాలని లేదు. మనసు స్థిమితంగా లేనప్పుడు కనబడే దృశ్యాలు, జరిగే సంఘటనలు భయాందోళనలను పెంచుతాయి. కల్లోలమైన సరస్సులో ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు. కలవరపాటుకు గురయ్యే మదిలో జరిగే నిర్ణయమేదీ సరిగ్గా ఉండదు. తేట నీటిలో స్పష్టమైన రూపం కనబడినట్టు ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే అపోహల పొరలు కరిగి, అవగాహన పరిధి పెరుగుతుంది.

ఎంతటి వారైనా తామున్న పరిస్థితిని బట్టే ఆలోచిస్తారు. మంచిలో చెడును చూడటం, సత్యంలో అసత్యాన్ని వెతకడం ఒక్కోసారి జరగవచ్చు. కొత్త ప్రమాదాలు ముంచుకొస్తాయన్న మనసు చేసే ముందస్తు హెచ్చరికలే అందుకు కారణం. అలాంటి అభద్రతాభావ పరిస్థితి ఎంతటి వారికైనా సహజమే. ఆందోళనకర, అనిశ్చిత వాతావరణంలో ఒక్కోసారి మహాత్ములైనా, నిజమేదో గ్రహించలేని డోలాయమాన పరిస్థితి ఎదుర్కొంటారనేందుకు దృష్టాంతాలు రామాయణంలో కనబడతాయి. సీతమ్మను వెతుకుతూ రుష్యమూక పర్వతం వైపు వెళ్లిన రామలక్ష్మణులను చూసిన సుగ్రీవుడు, వాలి పంపిన గూఢచారులనుకుని తొలుత భయపడ్డాడు. శత్రువర్గం వాళ్లే అయితే ఏం చేయాలో తోచక ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు దూకుతూ బెంబేలెత్తిపోయాడు. అది చూసిన హనుమ- మలయ పర్వతానికి వాలి రాలేడని గుర్తు చెయ్యడమే కాకుండా వచ్చిందెవరో తెలుసుకోవడానికి సన్యాసి రూపంలో వెళ్లాడు. ఇద్దరూ దశరథ పుత్రులని రూఢి చేసుకుని, సుగ్రీవుడితో మైత్రికి ఒప్పించాడు. వానరరాజు భయాలను పారదోలాడు. దూరాన్నుంచి చూసి ఆందోళన చెందేకన్నా దగ్గరికెళ్లి సత్యమేదో తెలుసుకోవాలని నిరూపించాడు.

అరణ్యవాసం చేస్తున్న అన్నావదినలను రాజ్యానికి తీసుకుపోవడానికి సైన్య సమేతంగా వెళ్లిన భరతుణ్ని దూరాన్నుంచే చూశాడు లక్ష్మణుడు. శాశ్వతంగా తమ అడ్డు తొలగించుకోవడానికే వస్తున్నాడని సందేహించాడు. అస్త్రాలు ప్రయోగించి భరతుణ్ని చంపేస్తానన్నాడు.లోతైన దృష్టితో ఆలోచించిన శ్రీరాముడు- తమ క్షేమ సమాచారం తెలుసుకోవడానికి వస్తున్నాడే కానీ మరో ఉద్దేశం ఉండదని వారించడంతో ముప్పు తప్పింది. మనసులో విచారం కమ్ముకున్నప్పుడు కళ్ల ముందున్నవి నమ్మబుద్ధి కాదనే సంగతి అశోకవనంలో ఉన్న సీత విషయంలోనూ జరిగింది. తాను రాముడి దూతనని హనుమ చెప్పినప్పటికీ నమ్మలేకపోయింది సీతమ్మ తల్లి. రావణుడు పంపిన మరొక మాయావి అనుకుంది. వినయంతో, నిజమైన రామభక్తితో జానకిని నమ్మించి రామకార్యాన్ని సఫలం చేశాడు హనుమ. తగిన పరిశీలనతోనే నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందరపడకూడదని లోకానికి వెల్లడించిన ఘటనలివి.

బుద్ధి వెలుగులో లేకపోతే, మనసు మాయలోపడి చుక్కాని లేని నావలా కొట్టుకుపోతుంది. జరుగుతున్నది తప్పుగా అనిపిస్తుంది. జరగబోయేది ముప్పుగా కనిపిస్తుంది. మంచి మాటల్లోనూ అపార్థాలు ధ్వనిస్తాయి. యోగ, ధ్యానాల ద్వారా మనసును శాంతంగా ఉంచుకోవడమే దీనికి పరిష్కారం. హృదయంతో ఆలోచిస్తూ బుద్ధికి పదును పెట్టడమే అభద్రతలోంచి బయటపడే మార్గం. అప్పుడే అపార్థాల తెరలు తొలగుతాయి. అనుబంధాలు నిలబడతాయి.

నారంశెట్టి ఉమామాహేశ్వరరావు
అంకితభావం ప్రధానం

మనకు నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్క మార్గంలోనైనా, అనేక మార్గాల్లోనైనా మనుషులు దైవసేవ చేసి, తరించవచ్చు. కానీ మూగజీవాలు ఎలా దైవసేవ చేస్తాయి? ఎలా మోక్షం పొందుతాయి? మహాకవి ధూర్జటి సైతం ఇలా ప్రశ్నించి, తానే చక్కటి సమాధానమిచ్చాడు. ఆ మూగజీవాలు మోక్షం సాధించిన విధానాన్ని విశదీకరించాడు. శ్రీ అంటే సాలె పురుగు. కాళం అంటే పాము. హస్తి అంటే ఏనుగు. వీటికి మోక్షం ప్రసాదించిన కాళహస్తీశ్వరుడి మహిమలను ధూర్జటి కొనియాడాడు. భగవంతుడికి చేరువై మోక్షం సాధించడానికి సకల జంతు ప్రపంచానికి అవకాశం ఉందని తేటతెల్లం చేశాడు.

మూగజీవాలు పరమాత్ముడి పట్ల భక్తిశ్రద్ధలు చాటుకున్న ఉదంతాలెన్నో ఉన్నాయి. రామాయణంలో ఉడతాభక్తి గురించి తెలియనివారుండరు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే పులకించి పోయి, ఉడత ఒంటిని నిమిరాడంటే ఆ మూగజీవి ఎంత పుణ్యం చేసుకుంది! దైవ సేవ ఎంత పరిమాణంలో ఉందని కాదు, ఎంత అంకిత భావంతో జరిగిందన్నది ముఖ్యం. అలాంటి సేవ చేసిన జీవి మీద పరమాత్ముడు పరిపూర్ణమైన కరుణ జూపి మోక్షమిస్తాడు. ఇది దైవానుగ్రహ రహస్యం. ఇక జటాయువు సంగతి జగానికంతా తెలుసు. దశరథుడికి మిత్రుడైన పక్షి రాజు జటాయువు సీతమ్మ తల్లిని అపహరించుకుని వెళ్తున్న రావణాసురుడి దురాగతాన్ని అడ్డుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. ధిక్కారం సహించని రావణాసురుడు జటాయువు రెక్కలు నరికేశాడు. అది తెలిసి శ్రీరామచంద్రుడు జటాయువును అనుగ్రహిస్తాడు. దైవసేవలో భక్తుడి శక్తి కన్నా భక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఫలితంతోపాటు ప్రయత్నానికీ విలువ ఉంటుంది. దానికి దేవుడి నుంచి గుర్తింపు లభిస్తుంది. అనుగ్రహం దక్కుతుంది.

మనుషుల దైవసేవలు రకరకాలుగా ఉన్నట్టే జంతువుల సేవలు కూడా రకరకాలుగా ఉంటాయి. నవవిధ భక్తి మార్గాల్లో ఒకటైన సంస్మరణం భాగవతంలోని గజేంద్రుడిలో కనిపిస్తుంది. మొసలిబారిన పడి తాను ప్రాణాంతక పరిస్థితిలో విలవిలలాడుతున్నప్పుడు గజేంద్రుడు విష్ణుమూర్తిని శరణు జొచ్చి వేడుకుంటాడు. ‘కలడందురు దీనులయెడ’ అని ప్రగాఢ భక్తి విశ్వాసాలు ఉన్న గజేంద్రుడికే ఒక దశలో ‘కలడు కలండనెడు వాడు కలడో లేడో’ అనే సంశయం కలుగుతుంది. అయినా విష్ణుమూర్తి వరదుడే. తన భక్తుణ్ని రక్షించుకోవడానికి విష్ణువు ఆగమేఘాల మీద బయలుదేరిన తీరును పోతనామాత్యుడు భాగవతంలో అమోఘంగా వర్ణిస్తాడు. భక్తికి భాషలు కూడా అవసరం లేదు. నోరూ, వాయీ లేని మూగజీవాలు కూడా ఈ పని చేయగలవు. మోక్షమూ సంపాదించగలవు.
పవిత్ర హృదయంతో పత్రం, పుష్పం, ఫలం, తోయంలలో ఏది ఇచ్చినా తీసుకుంటానని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెబుతాడు. జగద్గురువే అలా చెప్పినప్పుడు తిరుగేముంది? వస్తురూపంలో కనిపించని తన హృదయపుష్పాన్ని మన కంటికి కనిపించని ఆ పరమాత్ముడికి అంకితమిచ్చి పూజ చేస్తే అంతకు మించిన సేవ ఏముంటుంది?

శంకర నారాయణ
ఆలోచనల ప్రవాహం

సృష్టిలో మనిషి ప్రత్యేకమే కాదు సర్వోన్నతుడు కూడా. సహనం, ధైర్యం, తేరుకునే గుణం లాంటి వాటితో ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కోగల సామర్థ్యం మనిషి సొంతం. దానికి కారణం- అతడి ఆలోచనాశక్తి.

ఆలోచన, మాట, పని- ఈ మూడింటిలో ఆలోచన మహా శక్తిమంతమైంది. మిగతా రెండింటికన్నా ముందు పుడుతుంది. దానివల్ల విజయం రెండుసార్లు ప్రాప్తిస్తుంది. మనసులో ఒకసారి, వాస్తవంలో మరోసారి. ఆలోచన ఎవరి మనసులో పుట్టిందనేది ముఖ్యం కాదు. దాని శక్తి లక్ష్యాన్ని వెతుకుతుంది. అందుకే మనం ఆవాహనకు అంత ప్రాధాన్యం ఇస్తాం. ఏదైనా సంకల్పించే ముందు దైవం ఆశీర్వాదాలు కోరుకుంటాం. సానుకూలమైన ఆలోచనలు సంక్షేమానికి, విజయానికి అవసరమైన శక్తినిస్తాయి. ఒత్తిళ్లను తగ్గిస్తాయి. మంచి హార్మోన్లను విడుదల చేసి శారీరక, మానసిక ఆరోగ్యాలకు దోహదం చేస్తాయి. ప్రతికూలమైన ఆలోచనలు అనారోగ్యంపాలు చేస్తాయని శాస్త్రీయంగా రుజువైంది. అందుకే, గొప్పగా ఆలోచించాలి. పెద్ద పెద్ద కలలు కనాలని పిల్లలను ప్రోత్సహించాలి. ఉన్నత లక్ష్యాలను వారి మనసులో నాటాలి.

మన చర్యలు, భావాలు, ప్రవర్తన... అన్నింటినీ నియంత్రించేది మనసని చెబుతుంది గీత. కాస్త తీరిగ్గా కూర్చున్నప్పుడు చుట్టూ కనిపించే వస్తువుల గురించి, వ్యక్తుల గురించి ఆలోచిస్తాం. ఒక్కోసారి ఆ ఆలోచనలు మన లోలోపలికి కూడా వెళ్తాయి. మనల్ని మనం తెలుసుకోవడానికి కూడా కారణమవుతాయి. కొత్త ఆలోచనలు సమాజాన్ని కొత్త కోణంలో చూసేలా చేస్తాయి, మనదైన గుర్తింపునిస్తాయి.

సంకల్పం అంటే... కోరుకున్నది సాధించే వరకూ ఆ ఆలోచనను మనసులోంచి పోనివ్వకుండా చూసుకోవడం. ఆలోచనల నాణ్యత జీవిత నాణ్యతను నిర్ణయిస్తుంది. సానుకూలంగా ఆలోచించే వ్యక్తులు చుట్టూ ఉంటే మన ఆలోచనలు మరింత సానుకూలంగా మారతాయి. కైకేయికి నిజానికి భరతుడికన్నా రాముడంటేనే ఎక్కువ ప్రేమ. కానీ కాసేపు మంధర మాటలు విన్న ఫలితం- ఆమె మనసు మారిపోయింది. రాముణ్ని భరతుడికి ప్రత్యర్థిగా భావించింది. కఠినమైన నిర్ణయాలు తీసేసుకుంది. హృదయానికి అనేక ముఖద్వారాలుంటాయి. ఏ పక్కనుంచి ఏ భావం లోనికి ప్రసరిస్తుందో కనిపెట్టుకోవాల్సిందీ మనమే. శకుని సాహచర్యం దుర్యోధనుడి పతనానికి కారణమైతే, శ్రీకృష్ణుడి స్నేహం అర్జునుణ్ని విజేతను చేసింది. మనకూ రకరకాల మనుషులు తారసపడతారు. ఎవరితో కొనసాగాలన్న నిర్ణయం మన చేతిలోనే ఉంటుంది. ముఖ్యంగా జీవితం సందిగ్ధంలో పడిన ప్రతిసారీ చుట్టుపక్కల ఉండాల్సినవారిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. మంచి మాటలతో చేయూతనిచ్చి పైకి లాగుతారా, నీరసపు మాటలు చెప్పి మరింత కిందికి నెడతారా అన్నది వారిమీదే ఆధారపడి ఉంటుంది.

ఎలాంటి ఆలోచనలూ లేకుండా మనసు ఖాళీగా ఉండటమనేది జరగదు. దాని మానాన దాన్ని వదిలేయకుండా వరద నీటిని కాలువలోకి మళ్లించినట్లు ఆలోచనల ప్రవాహాన్ని మనకు అవసరమైన విషయం మీద కేంద్రీకరించేలా మళ్లించాలి. అప్పుడే ఆలోచనలు ఆచరణాత్మకం అవుతాయి. జీవితాన్ని అర్థవంతం చేస్తాయి.

మంత్రవాది మహేశ్వర్‌
పుణ్యం - నైపుణ్యం

పుణ్యం లోకమార్గాన్ని, లోకాంతర మార్గాన్ని చూపిస్తుంది. బలిచక్రవర్తి తన ధనాన్ని, అధికారాన్ని త్యాగంచేసి పుణ్యాత్ముడిగా నిలిచాడు. ధనాన్ని సంపాదించడంలో నైపుణ్యమున్నా దాన్ని పుణ్యకార్యాలకు ఉపయోగించడంలోనే ఉంటుంది ఆధ్యాత్మిక విజయం. నైపుణ్యానికి రుజువర్తన జతకూడితే- అది ప్రపంచానికి మేలుచేస్తుంది. పుణ్యం అనేది ధర్మపథంలో చేసిన సత్కార్యాలకు సంకేతం. నైపుణ్యం ఏమో మన శక్తిసామర్థ్యాలను మెరుగు పరుచుకునే క్రమంలో సాధించే అభివృద్ధి. ఈ రెండు అంశాలు భిన్నమైనవైనా ఆధ్యాత్మిక జీవితంలో పరస్పర అనుబంధంతో నడుస్తాయి. ఒకటి ధర్మబలం అయితే మరొకటి కర్మశక్తి. ఇవి కలిసినప్పుడే జీవితమార్గంలో పరిపూర్ణత సిద్ధిస్తుంది.

భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ ‘చేసే కార్యంలో నైపుణ్యమే యోగం’ అంటాడు. ఇది నైపుణ్యాన్ని ధర్మపథంలో వాడటం అనే అర్థాన్ని ఇస్తుంది. పుణ్యం మనసును పవిత్రం చేస్తే, నైపుణ్యం చేతుల్ని శక్తిమంతం చేస్తుంది. పుణ్యంతో ఉన్న దిశ, నైపుణ్యంతో ఉన్న దృష్టి కలిసినప్పుడే జీవితం ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుతుంది. ఈ రెండు లక్షణాల సమన్వయం యోగ్యుణ్ని తయారుచేస్తుంది.
మన ప్రవర్తన, నైపుణ్యం, ధర్మం కలిసినప్పుడే పరమార్థాన్ని సాధించగలం. మహాభారతంలో ధర్మరాజు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించాడు. నైపుణ్యం, శాస్త్రజ్ఞానం ఉన్నవాళ్లను నియమించుకున్నాడు. సమర్థుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కర్తవ్యనిష్ఠ, సామర్థ్యం, దయ, ధర్మం అన్నింటి సమన్వయ మూర్తి శ్రీరాముడు. పుణ్యం, నైపుణ్యం రెండూ మనిషిని దైవత్వానికి దగ్గర చేసే మార్గాలు. ఆధ్యాత్మిక జీవితం అంటే కేవలం ధ్యానం, పూజలు మాత్రమేకాదు. సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా పుణ్య నైపుణ్యాలను సమన్వయ పరచి జీవించడం.

నైపుణ్యం నేర్పరితనాన్ని సూచిస్తుంది. కొందరి నైపుణ్యం వారిని అందలం ఎక్కిస్తుంది. కుబేరుల్ని చేస్తుంది. వ్యక్తిగత ప్రయోజనాలను సిద్ధింపజేస్తుంది. మరికొందరి నైపుణ్యం నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతుంది. దేశాభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇతరులకు మార్గదర్శనం చేస్తుంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటుంది. ఒక బోరుబావిలో పడిన బాలుణ్ని రక్షించడానికి నిపుణులు అవసరమవుతారు. దేశ రక్షణకు అవసరమైన ఆయుధ సామగ్రి తయారుచేయడానికి మేధావుల తోడ్పాటు కావాలి. ఇలాంటి వారి జీవితాలే ధన్యమవుతాయి.

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నాడు వేమన. ధర్మాన్ని రక్షించే పుణ్య పురుషుల శక్తి దేశాన్ని రక్షిస్తుంది. శాంతి సౌభాగ్యాలతో వికసింప జేస్తుంది. పుణ్యపురుషులకు నైపుణ్యం తోడైతేనే లోకకల్యాణం సాధ్యమవుతుంది. ఈ రెండూ కలిసినప్పుడే మనిషి జీవనయానం నాణ్యతతో శోభిల్లుతుంది. పుణ్యంతో నైతికత, కరుణ, సేవాభావం పెరుగుతాయి; నైపుణ్యంతో సామర్థ్యం, విశ్వాసం, కార్యదక్షత మెరుగవుతాయి. ఇవి రెండూ కలిసి ఒక్క వ్యక్తిని మాత్రమే కాదు, సమాజాన్నే మార్చే శక్తిగా మారతాయి. మన చేతుల్లోని నైపుణ్యాన్ని మనసులోని పుణ్యభావంతో కలిపి ఉపయోగించినప్పుడే ఆధ్యాత్మిక పరిపక్వత సిద్ధిస్తుంది.

తల్లాప్రగడ గోపాలకృష్ణ
మానవతే ఆధ్యాత్మికత

మానవత్వం, ఆధ్యాత్మికతల మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండూ ఒకదానితో మరొకటి పెనవేసుకుని వ్యక్తిగత, సామాజిక శ్రేయస్సుకు దోహదపడతాయి. వేర్వేరుగా కనిపించినా, నాణానికి బొమ్మా బొరుసుల్లా రెండూ అవిభాజ్యాలు.

మనిషిగా పుట్టినంత మాత్రాన మానవత్వం సిద్ధించదు. సాటి మనుషుల మీద, ప్రాణుల మీద జాలి, దయ, కరుణ, సహనం, ప్రేమ చూపుతూ సాయపడటమే అసలైన మానవత్వం. తనను తాను తెలుసుకుంటూ, విశ్వంతో తనకున్న సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. తద్వారా కంటికి కనిపించని సర్వాంతర్యామితో అనుసంధానం కావాలి. అంతరంగ శాంతిని పొందుతూ, సదా చైతన్య స్థితిలో ఉండటమే అసలైన ఆధ్యాత్మికత. దీనులను, రోగులను అక్కున చేర్చుకుని, వారి చివరి రోజుల్లో ప్రేమ, కరుణలను పంచి ఇచ్చి అసలైన ఆధ్యాత్మికతకు మానవతా రూపంగా నిలిచారు మదర్‌ థెరిసా.

మతపరమైన కర్మలు, ఆచారాలు, సంప్రదాయాలు పాటించడం వల్లనే ఆధ్యాత్మిక వికాసం కలగదు. అది స్వీయ అన్వేషణ, స్వయం నియంత్రణలకు సంబంధించిన అంతర్గత ప్రయాణం. ‘నేను ఎవరు?’ అనే ప్రశ్నతో ఈ ప్రయాణం మొదలవుతుంది. ఆత్మాన్వేషణ ద్వారా అంతంలేని నిరంతర చైతన్య స్థితికి చేరుకోవడమే ఆధ్యాత్మికత పరమావధి. కబీర్‌ దాస్‌ బోధనల్లో మానవత్వం, ఆధ్యాత్మికత విడదీయలేని అంశాలు. మతం, కులం, అంతస్తు వంటి భేదాలను పక్కనపెట్టి, మానవత్వానికీ అంతర్గత ఆధ్యాత్మికతకు ప్రాచుర్యం కల్పించిన సాధువు ఆయన. సుఖంగా ఉన్నప్పుడు కూడా భగవంతుణ్ని తలచుకునే వారికి దుఃఖం ఎందుకు వస్తుంది..? అని ప్రశ్నించి తన ఆధ్యాత్మిక మానవతా దృక్పథాన్ని ప్రకటించాడు.

మానవత్వం... ఆధ్యాత్మిక మార్గానికి ముఖద్వారం వంటిది. ఆ మార్గంలో పయనించాలంటే స్వార్థం, అహం, ఆశ, కోరిక, క్రోధం వంటి మాలిన్యాలను తొలగించుకోవాలి. ప్రతిఫలాపేక్ష రహితంగా అందరికీ చేయూతనివ్వాలి. ఆధ్యాత్మికత లక్ష్యం కేవలం మోక్షానికి, ప్రశాంత జీవనానికి మాత్రమే పరిమితం కాదు. నిస్సహాయుల బాధలను అర్థం చేసుకుని వారికి నిస్వార్థంగా సేవ చేయడం ద్వారానే పరిపూర్ణత సిద్ధిస్తుంది. మానవత్వం లేని ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికత లేని మానవత్వం అసంపూర్ణం. ఆ సంగతిని అర్థం చేసుకున్న ఆధ్యాత్మిక వాది సమాజసేవకు ముందుంటాడు. తద్వారా అసలైన ఆనందాన్నీ ఆత్మతృప్తినీ అనుభవిస్తాడు. సమూహ సంక్షేమాన్ని కోరుకుంటాడు. నిరుపేదలకు ఆహారం, వస్త్రాలు, విద్య, వైద్య సేవలు అందిస్తాడు. విపత్తు సమయాల్లో అసహాయులను ఆదుకుంటాడు. అహింసను బోధిస్తూ శాంతి స్థాపనకు కృషి చేస్తాడు.

ఆధ్యాత్మికత సర్వం సమానమేనన్న భావనను ప్రోత్సహిస్తుంది. ప్రతి జీవీ దైవ స్వరూపమేననే దృక్పథం కలిగిస్తుంది. సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని కాంక్షిస్తుంది. సహనాన్ని అలవరుస్తుంది. అందరినీ సమానంగా ప్రేమించడం నేర్పుతుంది. మానవత్వం ఆధ్యాత్మికతకు ఒక ఆచరణాత్మక రూపం. మానవతా విలువలను నిలబెట్టుకోవడం ద్వారానే ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించగలం.

ఎం వెంకటేశ్వర రావు
నవ రూపాల చల్లని తల్లి

భారతీయ సంస్కృతిలో ఎన్నో పండుగలున్నాయి. వాటిలో విశిష్టమైనవి, అందరూ భక్తితో ఆరాధించేవి దేవీ నవరాత్రులు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు ఆసేతుహిమాచలం అమ్మవారి ఆరాధనలో పూనీతమవుతుంది. శరదృతువులో వచ్చేవి కనుక దేవీ నవరాత్రులు శరన్నవరాత్రులుగానూ పేరొందాయి.


భూలోకంలో అసురశక్తులు విజృంభించినప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, లోక కల్యాణం కోసం దుర్గాదేవి పరాశక్తిగా అవతరించి తన లక్ష్యాలను సాధిస్తుందన్నది ఆర్షవాక్కు. దుర్గ నామంలో ‘ద’ కారం దైత్య నాశకం. ‘ఉ’ కారం విఘ్ననాశకం. ‘ర’ కారం రోగనాశకం. ‘గ’ కారం పాపనాశకం. ‘ఆ’ భయ శత్రునాశకమైన శక్తి వాచకం. అందుకే దేవికి పర్యాయపదమైన ‘దుర్గా’ శబ్దాన్ని స్మరిస్తే పాపాలన్నీ నశిస్తాయని సాక్షాత్తు పరమశివుడు చెప్పాడని బ్రహ్మ మార్కండేయ మహామునికి వివరించాడు. దుర్గాదేవిని కష్టాలను తొలగించే దేవతగా ‘మహానారాయణోపనిషత్తు’ పేర్కొంది. విభిన్న ప్రయోజనాల కోసం పరాశక్తి అనేక పేర్లు, రూపాలు ధరిస్తుంది. రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు తొమ్మిది అవతారాలు ధరించిందని చెబుతారు. అందుకే ఆ దేవిని తొమ్మిది రూపాలుగా ఆరాధిస్తారు.

దుర్గాదేవి తొలి నామం శైలపుత్రి. కమలం, శూలం ధరించి కోరిన కోరికలు తీర్చే తల్లి. అందుకే తొలిరోజున ఈ దేవిని కొలుస్తారు. రెండో రూపం ‘బ్రహ్మచారిణి’. కుడిచేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం కలిగి శ్వేత వస్త్రధారిణిగా శోభిల్లే ఈమెను పూజిస్తే ఏకాగ్రత కలుగుతుంది. అమ్మవారి మూడో నామం చంద్రఘంట. ధనుస్సు, గద, శూలం, పాశం మొదలైన ఆయుధాలు ధరించి పది చేతులతో కనిపించే ఈ దేవిని ఆరాధిస్తే శత్రువులను జయించే శక్తినిస్తుందని విశ్వాసం. జగన్మాత నాలుగో పేరు కూష్మాండ. చక్రం, గద, బాణం ఒక వైపు; కమండలం, అమృతకలశం, జపమాల, పద్మం వంటివి మరోవైపు ధరించి ఉంటుంది. ఎనిమిది భుజాలతో దర్శనమిచ్చే ఈ దేవిని కొలిస్తే ఆరోగ్యం వృద్ధి చెందుతుందంటారు.

దేవి అయిదోరూపమైన స్కంధ మాతను పూజిస్తే శాంతి సౌభాగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఆరో రూపం కాత్యాయని వాహనం సింహం. ఆ తల్లిని ఆరాధించడం ద్వారా రోగాలూ కష్టాలనుంచి బయట పడవచ్చని పెద్దలు చెబుతారు. అమ్మవారి ఏడో నామం కాళరాత్రి. విరబోసుకున్న తల, నల్లని మేనిరూపు కలిగిన ఈ దేవి దుష్టులకు భయంకరి, శిష్టులకు అభయంకరి. దేవి ఎనిమిదో రూపం మహాగౌరి. వృషభ వాహిని. శ్వేత వస్త్రధారిణి. చతుర్భుజాలు కలిగి అభయ, వరద ముద్రలతో దర్శనమిస్తుంది. అమ్మవారి తొమ్మిదో నామం సిద్ధిధాత్రి. కమలాసని అయిన ఆ దేవిని పూజిస్తే సర్వసిద్ధులను ప్రసాదిస్తుందంటారు.

నవరాత్రులన్నీ ముఖ్యమైనవే అయినా మహాష్టమి, మహార్నవమి, విజయదశమిని అత్యంత పవిత్ర దినాలుగా భావిస్తారు భక్తులు. సకల ప్రాణులను అన్ని వేళలా ఆదుకునే దుర్గాదేవిని శరన్నవరాత్రులలో ఆరాధిస్తే సర్వశుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు.

వి.హరిప్రియ