Devotional Telugu
3.55K subscribers
105 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
ప్రకృతి దేవత

ప్రకృతి పులకింపజేస్తుంది, మైమరపింపజేస్తుంది. రుతుగీతాలతో, వసంత సోయగాలతో కనులకూ, వీనులకూ విందును కలిగించి అలరిస్తుంది.

రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్లు 'అందమైన ప్రకృతి జనజీవనానికి వరం'. మన పాంచభౌతిక శరీరం ప్రకృతిలో భాగమే. అందుకే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఆయుర్వేదం, ఇతర భారతీయ శాస్త్రాలు అన్నీ ప్రకృతికి అపార ప్రాధాన్యమిచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రకృతిని ఆరాధించే సంప్రదాయం ఇప్పటికీ ఉంది.

ప్రకృతిని కేవలం వనరుల సమాహారంగా కాక దైవిక శక్తిగా భావించేవారు పూర్వీకులు. అందుకే వేదాలలో ప్రకృతిని అనేక రూపాల్లో దేవతగా అభివర్ణించారు. అగ్ని, వాయువు, సూర్యుడు, వరుణుడు, భూదేవి వీరందరూ మానవాళికి జీవనాధారమైన ప్రకృతి మూలమైన దేవతలే. చెట్లు, నీటివనరులు, ఖనిజాలు- ఇవన్నీ భూమాత ఒడిలోని సంపదలే. ప్రకృతి ద్వారానే పరమాత్మను దర్శించగలమని శివపురాణం చెబుతుంది. మార్కండేయ పురాణం శక్తిని ప్రకృతిగా పేర్కొంది. ఆయుర్వేదం ప్రకృతి ఆధారిత వైద్యం. త్రిదోష సిద్ధాంతాలైన వాత, పిత్త, కఫ- ప్రకృతి సమతుల్యతపై ఆధారపడి ఉంటాయి. భారతీయ రుషులు ప్రకృతిని శరీరంలాగా, భూమిని తల్లిలాగా, గాలి- నీటిని ప్రాణాలతో సమానంగా భావించారు. ప్రకృతిని నిశితంగా పరిశీలించడం ద్వారానే విజ్ఞానశాస్త్ర అభివృద్ధిని సాధించగలిగాం. ప్రకృతిని కాపాడటం అంటే మన ధర్మాన్ని నిలబెట్టుకోవడమే.

కృతయుగంలో ధర్మపుర గ్రామంలో సుమతి అనే పేద రైతు ఉండేవాడు. అతడు దైవభక్తి, ప్రకృతిపట్ల అమితమైన ప్రేమ కలవాడు. ప్రతి చెట్టును, మొక్కను తన కుటుంబ సభ్యుల్లా ప్రేమగా చూసుకునేవాడు. ఒకరోజు పొలంలో పనిచేస్తుండగా దివ్యమైన వెలుగుతో వనదేవత ప్రత్యక్షమైంది. 'నువ్వు ప్రకృతి పట్ల చూపిస్తున్న నిస్వార్థ ప్రేమ నన్ను ఎంతగానో సంతోషపరిచింది' అని రైతుతో అంది. సుమతి ఆనందంతో, 'నా తోటి రైతులు కూడా సుఖంగా ఉండాలి. భూమి తల్లికి ఎలాంటి కష్టం రాకూడదు' అని వేడుకున్నాడు. వనదేవత రైతు నిస్వార్థానికి ముగ్ధురాలైంది. 'నీ కోరిక నెరవేరుతుంది. ఈ సంవత్సరం నుంచి నీ పొలంలోనే కాదు, ఈ ప్రాంతమంతటా పంటలు సమృద్ధిగా పండుతాయి. అయితే, ఒక షరతు. ప్రతి ఒక్కరూ భూమిని, ప్రకృతిని తమ తల్లిలా భావించాలి. అప్పుడే ఈ సంపద శాశ్వతంగా ఉంటుంది' అని చెప్పింది. వనదేవత వరంతో గ్రామం సుభిక్షంగా మారింది. గ్రామదేవతల పూజలన్నీ ప్రకృతి ఒడిలోనే జరగడం కనిపించే దైవాన్ని ఆరాధించడంలో భాగమే.

వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ, మన పురాణాలు వేల సంవత్సరాల క్రితమే ఈ సత్యాన్ని బోధించాయి. ప్రకృతిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే, మనకు అది అంతకు మించిన ప్రతిఫలాన్ని ఇస్తుంది.

కె శ్రీధర్
సుపర్ణతత్వం

శ్రీమహావిష్ణువుకు గరుత్మంతుడనే గొప్ప పక్షి వాహనమని పురాణాలు వర్ణించాయి, తిరుమల శ్రీవారి బంగారు వాకిలికి ఎదురుగా ఉండే గరుడ మందిరంలోని అరడుగుల శిలామూర్తిది చూడచక్కని రూపం. బ్రహ్మోత్సవాల్లో అయిదో రోజున జరిగే గరుడోత్సవం ఎంతో ప్రధానమైనది. గరుత్మంతుడికే వైనతేయుడు, సుపర్ణుడనే పేర్లు ఉన్నాయి. కశ్యప మహర్షి ద్వారా వినతకు జన్మించాడు కాబట్టి వైనతేయుడన్నారు.

గరుత్మంతుణ్ని పురాణాలు కాలపురుషుడిగా పరిగణించాయి. ఉత్తరాయణం- దక్షిణాయనం, శుక్లపక్షం- కృష్ణపక్షం, పగలు రాత్రి.. ఇలా కాలానికి చెందిన రెండు విభాగాలను పురాణాలు ఆయన రెండు రెక్కలుగా సంకేతించాయి.

పురాణాల్లో గరుత్మంతున్నే వేదాలు సుపర్ణుడిగా చెప్పాయి. 'ఇంద్రం మిత్రం వరుణము గ్నిమాహు రధోదివ్యః ససుపర్ణోగరుత్మన్.. అంటూ వేదం వర్ణించింది. ఇంద్రాది దేవతలతో సమానంగా పెద్దపీట వేసింది. ఆయన రెండు రెక్కలను జ్యోతిర్విద్య, మోక్షవిద్యలుగా సూచించింది. శాస్త్రవిద్య, బ్రహ్మవిద్యలకు వాటిని ప్రతీకలుగా చెప్పింది. ఈ వర్ణనలతో కూడిన రుగ్వేదం మొదటి మండలంలోని 'అస్య వామస్య సూక్తానికి ప్రత్యేకంగా సుపర్ణసూక్తం'గా పేరు స్థిరపడింది. దీన్ని బట్టి వేదాల్లో సుపర్ణుడికి గల ప్రాధాన్యాన్ని గ్రహించ వచ్చు. పురాణాల్లోని గరుడ ఉపాఖ్యానానికి వేదాల్లోని సుపర్ణసూక్తానికి మధ్య ప్రతీకాత్మక సమన్వయాన్ని అర్ధం చేసు కుంటే 'సుపర్ణతత్వం' మనకు బాగా బోధ పడుతుంది. ఆగమ శాస్త్ర గ్రంథాలు సుపర్ణున్నే ఒకవైపు ప్రాణవాయు స్వరూపు డిగా మరోవైపు వేద స్వరూపుడిగా అభివ ర్థించాయి. వీటిలో మొదటి ప్రాణవాయు స్వరూపుడనేది జీవాత్మకు సంకేతం. రెండోది పరమాత్మకు ప్రతీక. వేదవేద్యుడైన శ్రీమన్నారాయణుడికి వేదస్వరూపుడైన గరుత్మంతుణ్ని వాహనంగా చెప్పడంలోని విశేషం ఏమంటే- జీవాత్మను పరమాత్మ చైతన్యం ఆవహించిందని లేదా ఆక్రమించిందని అర్ధం.

గరుత్మంతుడు కూర్చుని ఉన్నప్పుడు కుడికాలి పాదాన్ని నేలపై నిలిపి ఎడమ కాలిని మడిచి నేలకు ఆనించి, చేతులు జోడించి నమస్కరిస్తున్న భంగిమలో ఉంటాడు. లోక ప్రసిద్ధమైన ఆ భంగిమను క్రియా యోగ ముద్రగా యోగశాస్త్రం చెబుతోంది. అది జీవాత్మ పరమాత్మల అనుసంధానానికి యోగ్యమైన ముద్ర. ఆ స్థితిలో సర్వేసర్వత్రా పరమాత్మ భావన నిండిపోతుంది. కాలాలు లోకాలు.. వంటి పరిమితులు, సరిహద్దులు చెరిగి పోతాయి. కైవల్యస్థితి సిద్ధిస్తుంది. అలా పరమాత్మ స్వరూపాన్ని భావన చేసిన అన్న మయ్య దేశకాలాదులు చెరిగిపోయిన వైనాన్ని గమనించాడు. 'ఇట గరుడుని నీవు ఎక్కి నను పటపట దిక్కులు బగ్గన పగిలి' అంటూ ఎలుగెత్తి గానం చేశాడు. కేవలస్థితిలో చేసిన గానమది. ఆ అనుభూతి పేరే కైవల్యం. గరుడ పంచమినాడు సువర్ణతత్వాన్ని ఆవాహన చేసుకుంటే- అన్నమయ్యకు సిద్ధించిన కైవల్యస్థితి భక్తులకూ దక్కుతుంది.
మాటే అలంకారం

వాక్కు పరబ్రహ్మ స్వరూపం. దాన్ని ఎంత అవసరమో అంతే వాడాలి. అతిగా మాట్లాడటంవల్ల అసత్యాలు దొర్లే ప్రమాదముంది. ఇతరులను నొప్పించే అవకాశముంది. సత్యవాక్కు కలిగి మితభాషులుగా ఉండేవారంటేనే అందరికీ గౌరవం.

అగ్నిదేవుడు వాక్కు రూపంలో ఉంటాడు. అగ్ని ఎంత పవిత్రమో మాట కూడా అంతే పవిత్రంగా ఉండాలి. మధురమైన వాక్కు కన్నా ప్రియమైంది మరొకటి లేదు. రామాయణంలో శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడుగానే కాదు, ప్రియభాషణుడుగానూ వాసికెక్కాడు. అలాగే ఆంజనేయుడు అత్యంత మధురంగా మాట్లాడి శ్రీరాముడి మనసును ఆకట్టుకున్నాడు. భారతంలో రాయబారానికి వచ్చిన శ్రీకృష్ణుడితో దుర్యోధనుడు- యుద్ధం చేయకుండా సూది మొనంత భూమి కూడా ఇవ్వనని కఠోరంగా మాట్లాడి కురుక్షేత్ర సంగ్రామానికి కారణమయ్యాడు. ఎందరో వీరులను, పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యాన్ని కోల్పోయాడు.

సమస్త జీవరాశి నుంచి మనిషిని వేరుచేసేది, ఒక మెట్టు పైన ఉంచేది మాట మాత్రమే. అందుకే అది సాత్వికంగా, సత్యంగా మనుషుల మధ్య బంధాలను పెంచేదిగా ఉండాలి. ఎదుటి వ్యక్తులను కించపరిచేటట్లుగా ఉండకూడదు. వాగ్భూషణం భూషణం... అంటాడు భర్తృహరి నీతి శతకంలో. ‘చంద్రకాంతిలా ప్రకాశించే రత్నాలహారాలు, స్నానలేపనాదులు, పువ్వులు, కేశాలంకరణలూ ఇవేవీ మనిషికి నిజమైన సౌందర్యాన్ని చేకూర్చలేవు. చక్కగా సంస్కారంతో కూడిన మాట ఒక్కటే మనిషికి నిజమైన అలంకారం. మిగిలిన భూషణాలన్నీ నశించినా, చివరకు శరీరం నశించిన తరవాత కూడా వాక్కు నిలిచి ఉంటుంది’ అని ఆ నీతిశతకం బోధిస్తుంది. ఒక మంచిమాట, స్వచ్ఛమైన చిరునవ్వు ఎటువంటి మనిషిని అయినా ఆనందంగా ఉంచుతాయి. దుర్మార్గుణ్ని కూడా మనిషిగా మారుస్తాయి.

మాట ప్రళయాన్ని సృష్టించగలదు. మానవాళికి సుఖశాంతులూ అందించగలదు. ఎదుటి వ్యక్తి ఏమాట మాట్లాడితే మనకు బాధ కలుగుతుందో అలాంటి మాటలు మనమూ మాట్లాడకూడదు. హితవుగా, ప్రియంగా, మనసుకు తృప్తిగా ఉండే మాటలు మాట్లాడటం మంచిది. లేకుంటే మౌనంగా ఉండటం శ్రేయస్కరం. మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడితో ‘మనం మాట్లాడే తీరులోనే మనకు ఎవరితోనైనా స్నేహం చిగురిస్తుంది. మాట తీరు బాగా లేకపోతే శతృత్వం ఏర్పడుతుంది. గొడ్డలి దెబ్బతిన్న చెట్టు మళ్లీ చిగురించి ఏపుగా పెరుగుతుంది. కానీ ఒక్క పరుషవాక్యం వల్ల విరిగిన మనసు తిరిగి అతకటం చాలా కష్టం. ఆ గాయం సలుపుతూనే ఉంటుంది. శరీరంలో గుచ్చుకున్న బాణాన్ని ఎలాగైనా బయటికి తీయవచ్చు. కానీ మనసును నొప్పించే మాటను పలికాక వెనక్కు తీసుకోవటం అసాధ్యం’ అని బోధిస్తాడు.

మాటలే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. మాటలవల్లే మానవ సంబంధాలు పటిష్ఠమవుతాయి. అందుకే మాటలు పరిమళభరిత పుష్పంలా, కోకిలగానంలా ఉండాలి. అప్పుడే మైత్రి, సఖ్యత, ప్రేమ, అభిమానం వంటి దైవీగుణాలతో మనిషి అందరికీ దగ్గరవుతాడు. సత్సంబంధాలు పెంపొందించుకోగలుగుతాడు.
జీవన సాధన

‘జీవితం జీవించడానికే.. జీవించడమే గొప్ప సాధన!’ అన్నాడు గీతాకారుడు. ‘జీవితంలోని రహస్యం, దివ్యత్వం ఏంటి అనేది తెలుసుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన’ అని వ్యాఖ్యానించారు పరమహంస యోగానంద! నిజానికి పుట్టుక నుంచి మరణం వరకు జరిగేది జీవనసాధనే.. అయితే మనం భగవంతుడి పట్ల ఎరుకతో చేస్తే అదే అద్భుతమైన సాధన అవుతుంది.

మట్టిలో నాటిన విత్తనం మూడోరోజుకల్లా మొలకెత్తుతుంది. అదే కాలక్రమంలో చెట్టుగా ఎదిగి నీడనిస్తుంది. లోకానికి పలురకాలుగా ఉపయోగపడుతుంది. ప్రతిఫలం కోరకుండానే కారుమబ్బు జలజలా చినుకులు రాలుస్తుంది. చల్లటి గాలి స్వేచ్ఛగా వీస్తూ ప్రాణికోటిని సేద తీరుస్తుంది. ప్రకృతిలో ప్రతి చర్య ఎంతో సహజంగా, పరోపకారమే లక్ష్యంగా జరిగిపోతుంది. మనిషి జీవితమూ అలా సాగిపోవాలి. అడుగడుగునా మానవత్వం వెల్లివిరియాలి. ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్లు పదిమంది జీవితాల్లో మనిషి వెలుగులు నింపాలి! అలాంటి జీవితసాధనలోనే ఆధ్యాత్మికత మమేకమవుతుంది. మనిషికి దివ్యత్వాన్ని దర్శనం చేయిస్తుంది!

మానవ జన్మను భగవంతుడి ప్రసాదంగా భావించినప్పుడు భక్తిగా రెండు చేతులూ పైకెత్తి ఆ దివ్య జీవనాన్ని ఆహ్వానించాలి. అందులోని తాత్వికతను గుర్తించాలి. ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడి వల్లే అనేక హింసలకు గురయ్యాడు. ఎన్ని బాధలు పడ్డా ‘నారాయణ’ శబ్దాన్ని మాత్రం వీడలేదు. అందులోని మాధుర్యాన్ని, మాహాత్మ్యాన్ని ప్రహ్లాదుడు అనుభూతి చెందాడు.. పలవరించాడు! చివరికి పరమార్థాన్ని సాధించాడు. ‘ఇందుగలడు అందులేడని సందేహము వలద’ంటూ ప్రత్యక్షంగా నారాయణుణ్ని దర్శించి తరించాడు.

సాధారణ మనిషి కూడా సాధనవల్ల అనేక ధార్మిక ప్రయోజనాలు పొందగలడు. అందుకు నియమబద్ధమైన జీవితం గడపాలి. కోరికలు లేని స్థితిని సాధించాలి. ఇటుక మీద ఇటుక పేర్చినట్లు ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించుకోవాలి. మాట, ఆలోచన, చర్య ప్రతిదానిలోనూ మంచే ప్రతిబింబించాలి. అప్పుడు.. సమస్త జగత్తు ఏకమై దివ్యమైన ఆనందమయమైన అనుభవాలను మనకోసం పోగుచేస్తుంది. ఆ దివ్యానుభవాలే అంతర్యామి సన్నిధికి చేర్చే ఆలంబనలవుతాయి. ఆ అలౌకిక అనుభూతి పొందడానికి మనిషి కష్టపడాలి. సంతోషంతో, ఆశతో, సాహసంతో ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలి. ఏ పని చేస్తున్నాసరే, అంతరంగ చైతన్యాన్ని మేల్కొల్పుతూ ఉండాలి. తన ప్రజ్ఞను వదులుకోకూడదు. అన్ని విషయాల్లోనూ దృఢంగా ఆలోచించాలి. అలా వాస్తవ పరిస్థితులపై తిరుగులేని విజయం సాధించాలి.

స్వామి చిదానంద ఆకాంక్షించినట్లు- తన మనసును గెలుచుకున్న చక్రవర్తిగా మనిషి ఎదగాలి. తన భవిష్యత్తుకు తానే ప్రభువవ్వాలి. ఈ ప్రయాణంలో ఎక్కడా అలసిపోకూడదు. విజయ దరహాసంతో, తాదాత్మ్యంతో ఆధ్యాత్మిక శిఖరాన్ని చేరుకోవాలి. అప్పుడే మనిషి జీవనసాధన ఫలిస్తుంది! ఆధ్యాత్మిక సాధనలోని రహస్యం... ఆ సచ్చిదానంద రూపమైన దివ్యత్వం మనిషి అనుభవంలోకి వస్తుంది. అపురూపమైన ఆ అనుభవాన్ని, ఆత్మానుభూతిని, ఆనందానుభూతిని మనిషి మాత్రమే పొందగలడు. ఇదంతా ఆధ్యాత్మిక జీవన సాధనవల్లే సాధ్యమవుతుంది.
అంతఃకరణ శుద్ధి

మనసును ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకోవాలి. అప్పుడే కోరిక, పగ, ద్వేషం, భయం, అజ్ఞానం వంటి మాలిన్యాలు తొలగిపోతాయి. స్పష్టమైన అవగాహన, ఆలోచన, సత్సంకల్పం, ప్రశాంతతలతో జ్ఞానంవైపు సాగడాన్నే అంతఃకరణ శుద్ధి అంటారు. ఆధ్యాత్మిక జీవితంలో దీనికి చాలా ప్రాధాన్యం ఉంది. అంతఃకరణ శుద్ధి ద్వారానే నిజమైన ఆనందం, శాంతి, జ్ఞాన చింతన లభిస్తాయి. మన దైనందిన జీవితాల్లో దీన్ని అనేక విధాలుగా అభ్యసించవచ్చు. వృద్ధులకు సాయపడటం, పేదల ఆకలి తీర్చడం, అనాథాశ్రమాలలో, విపత్తు సమయాలలో స్వచ్ఛందంగా సేవ చేయడం వంటి వాటి ద్వారా అహంకారం తగ్గి మనసులో దయ, జాలి, కరుణ వృద్ధి చెందుతాయి.

ఇతరుల తప్పులను క్షమించడం, రాగద్వేషాలకు అతీతంగా ఉండటం అలవర్చుకోవాలి. ఎవరి వల్లనైనా బాధ కలిగినప్పుడు వారిని క్షమించి ముందుకు సాగడం వలన మనసులో ప్రతికూల ప్రభావాలు తొలగి సానుకూల దృక్పథం మొదలవుతుంది. సత్యాన్నే పలకడం వల్ల ఆలోచనల్లో, మాటల్లో ప్రక్షాళన జరుగుతుంది. నిజాయతీగా జీవించడం అలవడుతుంది. మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ ఎవరికీ హాని తలపెట్టకుండా ఉండటం సాధన చేయాలి. అప్పుడు సకల జీవుల పట్ల దయాగుణం పెరుగుతుంది. మనకు ఉన్నదాంతో సంతృప్తిపడటం, ఇతరులను చూసి అసూయ చెందకుండా ఉండటం వల్ల ప్రశాంతత నెలకొంటుంది. ధ్యానం అంతర్గత లోపాలను తెలుసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి సహాయపడుతుంది. అనవసరమైన కోరికలను తగ్గించుకోవాలి. అవి దుఃఖానికి హేతువులని గుర్తించినప్పుడే వాటిపై నియంత్రణ ఏర్పడుతుంది. స్వార్థంతో చేసే కర్మలు రాగద్వేషాలకు దారితీస్తాయి. అంతఃకరణ శుద్ధి ద్వారా నిస్వార్థంగా చేసే పనులు ఆధ్యాత్మికతకు బాటలు వేస్తాయి.

అంతఃకరణ శుద్ధి వల్ల మనసులో కల్లోలం సృష్టించే ఆందోళనలు, ఒత్తిడి తగ్గుతాయి. తేలికైన మనసు ఆనందాన్ని కలిగిస్తుంది. అప్పుడు బాహ్య వస్తువులు, సంఘటనలపై ఆధారపడకుండా అంతర్గత ఆనందాన్ని అనుభవించగలుగుతారు. ఇతరుల పట్ల జాలి, దయ, కరుణ, క్షమ వంటి దైవీ గుణాలు అలవర్చుకుని సమాజ హితాన్ని కాంక్షించాలి. అప్పుడే అపార్థాలు, కక్షలు, కార్పణ్యాలు తగ్గి సమాజంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. మనసు కల్మషరహితం అవుతుంది. మానసిక స్పష్టత వల్ల సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్ధం తొలగిపోతుంది.

అంతఃకరణ శుద్ధితో అనేక అనారోగ్య సమస్యలకు ఉపశమనమూ లభిస్తుంది. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ అంతఃకరణ శుద్ధిని సాధన చేస్తే సమాజంలో శాంతి, సామరస్యాలు పెరుగుతాయి. నేరాలు తగ్గి మానవత్వం పరిమళిస్తుంది. అంతఃకరణ శుద్ధి ఆధ్యాత్మిక పురోగతికి ప్రధానమైనది. ఇది జ్ఞానం పొందడానికి, ఆత్మసాక్షాత్కారానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. అంతఃకరణ శుద్ధి అనేది ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదు, అదొక జీవన విధానం. నిరంతర ప్రక్రియ. దాన్ని అనుసరించడం ద్వారా మరింత అర్థవంతమైన, శాంతియుతమైన జీవితాన్ని గడపవచ్చు.
వ్రత సంకల్పం

వ్రతం అంటే నియమం, సంకల్ప దీక్ష. భక్తి, శ్రద్ధల సమ్మిళితం. అష్టదిక్కుల నడుమ, తల్లి గర్భంలోని శిశువు శరీరాకృతి సక్రమంగా రూపుదాల్చాలి. శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో పుట్టడానికి శక్తి అవసరం. ఆ శక్తికి ప్రతిరూపమే అష్టలక్ష్మీ తత్వం. మానవ జీవితంలో సంపూర్ణత్వానికి అష్టైశ్వర్యాలు ప్రతీక. అష్టకష్టాలను నివారించే వరలక్ష్మీ వ్రతాన్ని జీవన సర్వస్వంగా చెబుతారు.

వరలక్ష్మీ వ్రతాన్ని మొదటగా చారుమతీదేవి తన భర్త క్షేమం కోరి తపస్సుగా ఆచరించిందని స్కాంద పురాణం వివరిస్తోంది. పరమేశ్వరుడి సూచనతో ఆమె ఈ వ్రతాన్ని ఆచరించి, భర్తకు ఆయురారోగ్యాలను, కుటుంబ సౌఖ్యాన్ని పొందిందన్నది పురాణ కథనం. వ్రతంలో భాగంగా చేసే కలశ పూజ పరమార్థం... అష్టలక్ష్ముల సమ్మిళిత శక్తిని ఇంట్లోకి ఆహ్వానించడం. ఆ శక్తి కుటుంబానికి ఆయుష్షునిస్తుందని విశ్వాసం. అది సమష్టితత్వాన్ని ప్రేరేపిస్తుంది. లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యప్రదాయిని కాదు. అనేక రూపాలలో మనిషి జీవన చక్రాన్ని నడిపించే మాతృశక్తి. అన్నిటికీ అదే మూలాధారం ఆ శక్తి లేనిదే మనిషి మనుగడ అసాధ్యం. ఆత్మీయత, సౌభ్రాతృత్వం, అంకిత భావం అన్నీ ఆ శక్తిలోనే ఉన్నాయి.

శ్రద్ధగా తలపెట్టిన వ్రతం మనిషిలోని స్వార్థాన్ని తొలగిస్తుంది. ఇంటి పూజామందిరంలో వెలిగే దీపం కన్నా, హృదయంలో వెలిగే జ్ఞానదీపమే శాశ్వతమైనదిగా నిలుస్తుంది. లక్ష్మీదేవి పాదాలను అలంకరించడమే కాదు, ఆమె సుగుణాలను, సంతుష్టి చెందే తత్వాన్ని నిజజీవితంలో అనుసరించాలన్న తపన కలగాలి. సమృద్ధి అంటే సంపాదించి దాచుకోవడం కాదని, పంచుకోవడంలోనే సంపత్తి తత్వం ఉన్నదని ధాన్యలక్ష్మి తెలియజేస్తుంది. గజలక్ష్మి శక్తి- శాంతి సమన్వయమే కాదు, మన లోపలి అహంకారాన్ని జయించి, స్వీయ నియంత్రణతో జీవించమన్న సందేశం ఇస్తుంది. సంతానలక్ష్మి సంతతి ప్రాప్తికి మాత్రమే కాక ధర్మ పరంపర కొనసాగింపునకు, విలువల వారసత్వానికి ప్రతీక. వీరలక్ష్మి నిర్భీతి, న్యాయంవైపు నిలబడే ధైర్యానికి ప్రేరణ. విద్యాలక్ష్మి జీవన విజ్ఞానాన్ని, సత్యాన్ని తెలుసుకునే సామర్థ్యాన్ని బోధిస్తుంది. అహంకారంపై నియంత్రణ కలిగి ఉండాలని, అంతరంగ విజయమే విజయలక్ష్మి తత్వమని సూచిస్తుంది. ఈ ఎనిమిది తత్త్వాల సమన్వయమే లక్ష్మిని సంపూర్ణంగా దర్శించే మార్గం. వ్రతం ఒక్కరోజు చేసే ఆచారంగా కాక, ఈ అష్టశక్తులను జీవితంలో ప్రతిదినం ఆచరించే ఆత్మవైభవంగా రూపాంతరం చెందాలి. అప్పుడు లక్ష్మి అనుగ్రహం అందరి హృదయాలనూ ఆనందమయం చేస్తుంది.

శ్రావణమాసం భారతీయ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రతిబింబించే కాలం. ప్రకృతి పునరుజ్జీవం పొందే ఈ రుతువులో, మనుషుల హృదయాలలోనూ భక్తి, శ్రద్ధ, శాంతి చివుర్లు వేస్తాయి. ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష పున్నమికి దగ్గరలోని శుక్రవారం నాడు జరుపుకొనే వరలక్ష్మీవ్రతం, త్రికాలబద్ధమైన ధర్మవేదిక. ఇది స్త్రీలు మాత్రమే ఆచరించాల్సిన పూజ కాదు. కుటుంబంతో చుట్టూ ఉన్న సమాజాన్ని సత్సాంగత్యంతో బంధించగలిగే ధార్మిక, తాత్విక ఆత్మ వైభవ సంస్కారమది. మహాలక్ష్మీ అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుందాం.
మనలోనే ఉన్నాడు

పంచభూతాలతో కూడిన ఈ సృష్టి అత్యంత అద్భుతమైంది. ఈ సృష్టికర్తయైన పరమాత్మ మనతో నిరంతరం మాట్లాడుతూనే ఉంటాడు. కానీ, వినే ఓపిక, తీరిక మనకు ఉండవు. తమ నాభిలోని కస్తూరి కోసం గడ్డిలో వెతికే లేడిలా, మనం ఆ స్వామి కోసం ఎక్కడెక్కడో అన్వేషిస్తుంటాం. నిజానికి ఆయన మనలోనే ఉన్నాడు. 'బుద్ధి' అనే శక్తి ద్వారా మనల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటాడు. మన అంతరాత్మ ప్రభోధం నిత్యం జరుగుతూనే ఉంటుంది. దాన్ని గ్రహించి అప్రమత్తంగా ఉండకపోవడం మన అవివేకం, అజ్ఞానం.
లోపలి చూపు ఉంటేనే ఆయన కనిపిస్తాడు. తన ఇష్టులతోనే మాట్లాడతాడు. ఇష్టులు అంటే ఎవరు? ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేస్తూ, ఆ ఫలితాన్ని ఆయనకే వదిలేసేవారు. వారినే మనం భక్తశిఖామణులు అంటాం.

భగవంతుడి కళ్ళు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఆయన కనురెప్పలు వాల్చకుండా మనల్ని చూస్తుంటే, మనం మాత్రం దర్శనం కోసం వెళ్లి కళ్ళు మూసుకుంటాం. అజ్ఞానపు చీకట్లలో, కష్టాల వలలో పడి కొట్టుమిట్టాడుతుంటాం. ఒక గురువు తన శిష్యుడికి ఇలా హితబోధ చేస్తున్నాడు: "దేవుడు కనిపిస్తాడు, వినిపిస్తాడు. అది గ్రహించి నిన్ను నువ్వు కాపాడుకో నాయనా!" ఒకసారి ఆ శిష్యుడు అడవిలో వెళ్తుండగా ఒక ఏనుగు ఘీంకరిస్తూ అతనికెదురైంది. భయంతో పరుగులు పెట్టి ఆశ్రమానికి చేరుకున్నాడు. గురువు దగ్గరికి వెళ్లి, "దేవుడంతటా ఉన్నాడని మీరు చెప్పారు కదా. ఆ ఏనుగులోనూ ఉండుంటే అది నా వెంట ఎందుకు పడింది?" అని అడిగాడు. దానికి గురువు బదులిస్తూ, "నువ్వు తెలివితక్కువగా దాని ఎదురుగా వెళ్తుంటే, అది నిన్ను ఘీంకరించి హెచ్చరించింది. అది కూడా దేవుడే. అంతేకాకుండా, ఏనుగుపై ఉన్న మావటివాడు 'తప్పుకో' అని చెబుతున్నా అతడి మాట నువ్వు వినలేదు. ఆ మావటివాడు కూడా దేవుడే. నీవు అలా వినకపోవడమే నీ అజ్ఞానం," అని వివరించాడు.
హరిని తన అహంకారంతో దూషించి, కన్న కొడుకు ప్రహ్లాదుణ్ణి చిత్రహింసలు పెట్టిన హిరణ్యకశిపుడు, ఆ బాలుడి ద్వారా శ్రీహరి చెప్పించిన మాటల విలువను అర్థం చేసుకోలేకపోయాడు. సృష్టిలోని ప్రతి అణువు నుంచీ మనకు భగవత్ సందేశం వినిపిస్తూనే ఉంటుంది. నేడు దొరికిన ఆహారంతో సంతృప్తి పడమని పశుపక్ష్యాదులు చెబుతాయి. పరోపకార వ్రతం ఆచరించమని వృక్షం బోధిస్తుంది. నిశ్చలంగా ఉండమని పర్వతం చెబుతుంది. జీవన ప్రవాహం నిర్మలంగా కొనసాగమని నది సందేశమిస్తుంది. దేవస్థానం తన దగ్గరికొచ్చి నామస్మరణతో మనశ్శాంతి పొందమని పిలుస్తుంది. నీలోని దేవుడు నిన్ను పలకరిస్తున్నాడు వినమని ధ్యానం చెబుతుంది. "నేను నీ వాణ్ణే" అని సాటి మనిషి అంటాడు.

తల్లి, తండ్రి, గురువు, మిత్రుడు ఏదో ఒక సందర్భంలో మనకు దారి చూపుతుంటారు, సలహాలు, సూచనలు ఇస్తుంటారు. వీరంతా దేవుళ్ళు కారా? ప్రత్యక్షమై, అలంకారమూర్తిగా ఎదుట నిలిస్తేనే నమ్మాలా? అందుకు కావాల్సిన యోగ్యత, తపన, భక్తి ప్రపత్తులు, ఆత్మసమర్పణ భావం, ఆర్తి, శరణాగతి వంటి లక్షణాలు మనలో ఉండాలి కదా? అటువంటి పరిణతి సాధించినవారితో పూర్వయుగాలలో ఏదో రూపంలో మాధవుడు మాట్లాడాడు. ఆధ్యాత్మికతలో పరాకాష్ఠ పొందిన వారి సన్నిధిలో ఆ సకలగుణనిధి దర్శనమిస్తాడు. సంపూర్ణ విశ్వాసంతో ఆయనను స్మరించే సాధుగుణ సంపన్నులకు సర్వేశ్వర సాక్షాత్కారం ఎప్పుడూ లభిస్తుంది. ఇది సార్వకాలీన సత్యం.
తీయని బంధం

మనిషికి లభించిన గొప్ప వరం స్నేహం. సృష్టిలోని అన్ని బంధాలను దేవుడే సృష్టిస్తాడు, కానీ స్నేహితులను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రం ఆయన మనకే ఇచ్చాడు. మంచి స్నేహానికి ఎలాంటి భేదాలు, ఎల్లలు ఉండవు. కోపాలు, అలకలు, అసూయలు తలెత్తినా అవి అద్దం మీద ఆవగింజల్లాంటివి. ఎంత త్వరగా వస్తాయో అంత త్వరగా జారిపోతాయి.

ఒక్క స్నేహితుడు మోసం చేస్తే మొత్తం స్నేహాన్ని తప్పు పట్టకూడదు. ఎందుకంటే, స్నేహం చేసేటప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న మంచి, చెడు రెండింటినీ మనం స్వీకరించాలి. జీవితాన్ని ఒక పుస్తకంగా భావిస్తే, అందులో తప్పు అనేది ఒక పేజీ మాత్రమే. బంధాలు మాత్రం పుస్తకం నిండా ఉంటాయి. అవసరమైతే ఆ ఒక్క పేజీని చించేయొచ్చు కానీ మొత్తం పుస్తకాన్ని విసిరిపారేయకూడదు!

మహాభారతంలో స్నేహానికి ప్రతీకగా కర్ణుడు, దుర్యోధనుడు నిలుస్తారు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు కుంతీదేవి కర్ణుడిని కలుసుకుని అతని జన్మ రహస్యం చెబుతుంది. "నీ తమ్ముళ్ల పక్షానికి వస్తే, పాండవులకు అగ్రజుడిగా నీకే పట్టాభిషేకం చేయిస్తాను. నీ తమ్ముళ్ల ప్రాణాలు కాపాడు" అని అర్థిస్తుంది. కర్ణుడు తల్లి మాటను సున్నితంగా తిరస్కరించి, తన స్నేహితుడి వైపే నిలబడతాడు.

అలాగే, కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న ఒక రాత్రి శ్రీకృష్ణుడు కర్ణుడి శిబిరానికి వస్తాడు. కర్ణుడికి అతని జన్మ వృత్తాంతం చెప్పి, పాండవుల పక్షంలోకి రమ్మని కోరతాడు. అప్పుడు కర్ణుడు చిన్నగా నవ్వి, "కృష్ణా! నేను ఎవరో నాకు తెలుసు. ధర్మం పాండవుల పక్షాన ఉంది కాబట్టే నువ్వు వారిని రక్షిస్తున్నావని కూడా నాకు తెలుసు. అధర్మాన్ని అనుసరించే కౌరవులు ఎప్పటికీ గెలవలేరని కూడా నాకు తెలుసు" అంటాడు.

"ఇంత తెలిసినవాడివి కౌరవులను ఎందుకు వదలడం లేదు?" అని శ్రీకృష్ణుడు అడుగుతాడు. దానికి కర్ణుడు, "నన్ను నమ్మి స్నేహం చేసిన దుర్యోధనుడిని ఒంటరిని చేసి పాండవులతో చేరడం మిత్రద్రోహం అనిపించుకోదా?" అని బదులిస్తాడు. స్నేహం కోసం ప్రాణాలను కోల్పోయిన కర్ణుడిని మించిన మంచి మిత్రుడు ఇంకెవరుంటారు!

స్నేహితుల మధ్య ప్రేమ విడిపోయిన తర్వాత కూడా చెక్కు చెదరదని చెప్పడానికి కృష్ణ, కుచేలుల స్నేహం గొప్ప ఉదాహరణ. ముల్లోకాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు నిరుపేద అయిన కుచేలుడికి బాల్యమిత్రుడు. పేదరికంతో బాధపడుతున్న తన భార్య సలహాతో సహాయం అడగడానికి వచ్చిన స్నేహితుడిని కృష్ణుడు సాదరంగా ఆహ్వానించి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటాడు. అడగకుండానే అతని పేదరికాన్ని పోగొడతాడు. స్నేహానికి పేద, గొప్ప అనే తారతమ్యాలు అడ్డురాకూడదని ప్రపంచానికి చాటిచెప్పాడు.

సజ్జనులతో చేసే స్నేహం మంచి గంధం చెక్కలా జీవితాంతం సువాసనలు వెదజల్లుతూనే ఉంటుంది. "నువ్వేంటో తెలియాలంటే నీ స్నేహితులను చూడాలి... నేనేంటో తెలియాలంటే నువ్వు నేనై పుట్టాలి" అన్నది మంచి స్నేహానికి నిర్వచనం. ఆప్తమిత్రులు చెంతనుంటే అపారమైన నిధి ఉన్నట్లే!
తథాస్తు దేవతలు

తథాస్తు... మూడక్షరాల ముచ్చటైన దీవెన. దేవతలు మెచ్చి మనుషులకు ఇచ్చే అపురూపమైన కానుక. కష్టనష్టాల నుండి కాపాడమని, కోరికలు తీర్చి కరుణించమని దేవతలను ప్రార్థించడం మనుషుల సహజ నైజం.

ఆకాశానికి, అంతరాళానికి నడుమ త్రిశంకువులా ఊగిసలాడడం మనుషులకు ఆ భగవంతుడు ఇచ్చిన వరమో, శాపమో తేల్చడం సాధ్యం కాదు. ఊగుతూ ఉన్నచోటే ఉండిపోవడం కన్నా, ముందుకు సాగిపోవడమే ఉత్తమం అన్న భావన కొందరిని స్థిరంగా ఉండనివ్వదు. మనిషి అటు స్వర్గానికీ, ఇటు నరకానికీ కాకుండా మధ్యలో వేలాడటానికి కారణం లేకపోలేదు. పైవారికి (దేవతలకు) చావు లేదు. కింది వారికి (దానవులకు) చావంటే భయం లేదు. మధ్యస్థుడైన మనిషికే చావు తప్పదు. అందుకే అదంటే అంత భయం. మనిషి పూర్తిగా చెడ్డవాడని కానీ, నూరు శాతం మంచివాడని కానీ చెప్పలేం. కాకపోతే, దివ్యమానవుడిగా ఎదిగే అవకాశం ఉన్నవాడు. సాధన ద్వారా జీవితంలో అనుకున్నది సాధించగలడు. ఏదో ఒక రోజు పూర్ణత్వం సంపాదించుకోవచ్చు. అందుకు మానవ ప్రయత్నం అవసరం. అది సఫలం కావడానికి దైవబలం కూడా తోడు కావాలి. చిత్తశుద్ధితో, బుద్ధిని ఏకాగ్రం చేయగలిగితే ఎంతటి భోగలాలసుడైనా యోగసిద్ధుడుగా మారవచ్చు. అందుకు పెట్టుబడి పట్టుదల, అవిరళ కృషి మాత్రమే. పట్టు వదలని విక్రమార్కుడు ఎన్నో సాహస కార్యాలు సాధించి దేవి అనుగ్రహం పొందాడు. మనం తలవకపోయినా, కొలవకపోయినా, పైనుంచి అదృశ్య శక్తులు మనల్ని వీక్షిస్తూనే ఉంటాయని పెద్దలు అంటారు. చెడు పనులు, చెడు భావనలు చేయకూడదన్న కట్టుబాటు ప్రగతికి దారిదీపం లాంటిది. మానవుడి అంతర్యామి శుద్ధి కావాలి.


'తథాస్తు' దేవతలు తమకు అండగా ఉంటారని భక్తుల నమ్మకం. ప్రాచీన గ్రీకు దేశస్థులు దారిచూపే దేవతలను 'ఎగ్రిగోర్స్' అని పిలిచేవారు. యుద్ధరంగానికి బయలుదేరే ముందు విజయం కోరి వారిని ప్రార్థించేవారు. శుభకార్యాలు నిరాటంకంగా జరగాలని, ముందుగానే వారికి మొక్కుబళ్లు చెల్లించేవారు. ఇలాంటి సంప్రదాయం హిందూ ధర్మానికి కూడా దారిదీపంగా నిలిచింది. 'తమసోమా జ్యోతిర్గమయ' అన్న ఉపనిషత్తుల మహావాక్యం జాతి హృదయంలో సుస్థిరమైంది.
ఈ ప్రపంచంలోని జడ, జీవ పదార్థాలను ఒక వాస్తవం శాసిస్తోంది. ఇంద్రియాల వెనుక మనసు ఉన్నట్లే, కార్యం వెనుక కారణం ఉంటుంది. భావమే బాహ్యరూపంలో జీవితాన్ని నడిపిస్తుంది. సదాచార, సద్విచారాలే మోక్ష ద్వారాలు. కొన్ని ఆకృతులు కంటికి కనిపించకపోయినా మనసును అలరిస్తాయి, కలవరపాటుకు గురిచేస్తాయి. పంచభూతాలు అందరికీ సమానంగా తమ శక్తులను పంచుతాయి. ప్రతిఫలం ఆశించవు. అలాగే మనం కూడా ప్రతిఫలం కోరకుండా పనులు చేస్తే, దేవతలు తప్పకుండా మెచ్చి 'తథాస్తు' అని దీవిస్తారు.
క్షమాగుణం: శాంతికి, ఆధ్యాత్మిక ప్రగతికి మార్గం

క్షమాగుణం భగవంతుడు మనిషికి ప్రసాదించిన అత్యున్నత గుణం. ఇది కేవలం మతపరమైన అంశం మాత్రమే కాదు, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక కోణాల నుంచి చూడదగిన గొప్ప శక్తి. క్షమ అంటే ఇతరులు మనకు చేసిన అన్యాయాలను, బాధలను మనసులో పెట్టుకోకుండా మన్నించడం. ఇది మన హృదయ ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది.

క్షమాగుణ విశిష్టత

ధార్మిక కోణం: భగవద్గీతలో శ్రీకృష్ణుడు క్షమాగుణాన్ని దైవీగుణంగా పేర్కొన్నాడు. రాముడు తన శత్రువైన రావణుడు మరణించిన తర్వాత కూడా అతనికి అంతిమ సంస్కారాలు చేయాలని ఆదేశించడం క్షమాగుణానికి గొప్ప ఉదాహరణ. జీవించి ఉన్నప్పుడు ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా, ప్రాణం పోయిన తర్వాత ఆ వైరాలు ముగిసిపోతాయనే సందేశాన్ని రాముడు ఇచ్చాడు.

ఆధ్యాత్మిక కోణం: బుద్ధుడు క్షమాగుణాన్ని అహింసకు మార్గంగా చూపాడు. జైనులు ఏటా 'క్షమాపణ పర్వం' జరుపుకుంటూ తమ వల్ల ఎవరికైనా కలిగిన బాధలకు క్షమాపణలు కోరతారు. యజుర్వేదం ప్రకారం, క్షమ, తపస్సుల ద్వారా భగవంతుణ్ణి సులభంగా పొందవచ్చు. శివపురాణం 'క్షమయే పరమధర్మం' అని బోధించింది.

మానసిక ప్రయోజనాలు:

క్షమాగుణం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ద్వేషం మనసులో నిప్పులాంటిది. మన్నించడం ద్వారా మనసు తేలికపడి ఒత్తిడి, ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. ఇది నిద్రను మెరుగుపరిచి, శారీరక ఆరోగ్యాన్నీ కాపాడుతుంది.
క్షమాగుణాన్ని అలవరచుకోవడం
మహాత్మా గాంధీ 'క్షమ బలహీనత కాదు, బలమైన లక్షణం' అని చెప్పారు. క్షమాగుణం ఒక్కసారిగా అలవడేది కాదు. ప్రవచనాలు వినడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ధ్యానం వంటి సాధనల ద్వారా దీన్ని పెంపొందించుకోవాలి. తప్పు చేసినవారిని శిక్షించడం కంటే, వారిని మన్నించి ప్రేమించడం ద్వారా వారి మనసు మార్చవచ్చని స్వామి వివేకానంద చెప్పారు. క్షమాగుణం ఉన్న భక్తులు భగవంతుడికి ప్రీతిపాత్రులవుతారని శివపురాణం వివరించింది.
క్షమ అనేది సమాజాన్ని శాంతి దిశగా నడిపిస్తుంది. ఇది మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.
సురక్ష పరిధి (కంఫర్ట్ జోన్)

మూడు పూటలా తింటూ శరీరాన్ని సుఖపెడుతూ ఒళ్లు వంచకుండా కాలం గడిపే భద్రజీవులకు సృజనాత్మకమైన, విభిన్నమైన ఆలోచనలు రమ్మన్నా రావు. సురక్షితమైన పరిధి అంటే చాలామందికి తెలియదు. అందులోనే ఉంటారు. అక్కడే బతుకుతుంటారు. కాలు తీసి బయటపెట్టరు. ఆలోచనల్లో ఉన్న వేగం ఆచరణలో ఉండదు. పాముకు పుట్ట సురక్షితం. పిట్టకి గూడు సురక్షితం. అలాంటి సురక్షిత పరిధుల్లో ఉన్న మనుషులు కూడా అంతే. వాటిని వదిలి రారు.

జీవితంలో ఏదైనా సాధించాలంటే సాధ్యమైనంత త్వరగా కంఫర్ట్‌జోన్‌ నుంచి బయటపడే మార్గం వెతుక్కోవాలి. కష్టాలకు సిద్ధపడాలి. కల్లోలానికి సమాయత్తమవ్వాలి. బాధపడాలి. బాధ్యతలు నెత్తికి ఎత్తుకోవాలి. కొలిమిలా మండాలి. కొత్త ఆలోచనలకు పుటం పెట్టాలి. మండుతున్న బంగారంలా ప్రకాశించాలి. సీతాన్వేషణకు లంకకు చేరుకోవాలంటే ఎన్నో అవరోధాలు దాటాలి. ఒక పక్క వానాకాలం. మరో పక్క సముద్రం. సురక్షితంగా గుహలో కూర్చుని ఉండలేదు శ్రీరాముడు. నాయకులతో మంతనాలు జరిపాడు. హనుమంతుణ్ని ఎన్నుకున్నాడు. సేనను ముందుకు నడిపించాడు. విజయం సాధించాడు. సురక్షితమైన పరిధిలో జీవించడానికి మనిషి భూమ్మీదకు రాలేదు. ఇంత అభివృద్ధి సాధించామంటే ఎంతోమంది తమ తమ కంఫర్ట్‌ జోన్‌లను మరిచిపోయి పనిచేయడం వల్లనే. భద్రలోకంలో బతకడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. సంపాదించిన ఆస్తులు కరగదీయవచ్చు. ఏమీ నేర్చుకోకుండా, ఏమీ సాధించకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా ఉండిపోవచ్చు కూడా. మనిషిగా పుట్టినవాడు తన ధర్మం తాను నెరవేర్చాలంటే తప్పనిసరిగా సవాళ్లను స్వీకరించాలి. జీవితమంతా సుఖమే ఉంటుందని అనుకోకూడదు. కష్ట సుఖాలు రెండూ ఉంటాయి. కంఫర్ట్‌జోన్‌ ఒక వలలాంటిది. దాని తాళ్లు తెంచుకుని బయటపడాలి. చాలామంది తాము అందులోనే ఉన్నామని తెలియకుండా భద్రలోకంలో బతికేస్తుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనుకునేవారు మాత్రం ఎంత త్వరగా దాని నుంచి బయట పడతామా అనుకుంటారు.

విశ్రాంతిగా ఉండటం మంచిదే కానీ జీవితమే విశ్రాంతి అయిపోకూడదు. సురక్షితమైన పరిధిలో ఎలాంటి భయాందోళనలు లేకుండా బతకొచ్చు. అయితే అది మనిషి జీవితం కాదు. ఏ ఒక్కరూ జీవితకాలం సురక్షితమైన పరిధిలో ఉండలేరు. ఎన్నో అడ్డంకులు, ప్రకృతి వైపరీత్యాలు దాటుకుంటూ ప్రయాణం సాగించాలి. తల్లి గర్భమే సురక్షితం అనుకుంటే, అక్కడ ఉండే సమస్యలు అక్కడా ఉంటాయి. భూమ్మీదకు వచ్చిన తరవాత ఎదుర్కొనే ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. మానవ జీవితం యుద్ధంలాంటిది. ప్రతి క్షణం లోపల, బయట పోరాటాలు సాగుతూ ఉంటాయి. భద్రమైన పరిధిని దాటి ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఈ సత్యం తెలుసుకున్నవాడు పాము కుబుసాన్ని విడిచి కొత్త జీవితం మొదలెట్టినట్లు, గద్ద తన ముక్కును పగలకొట్టుకుని కొత్తగా దీర్ఘ జీవితం పొంది ఆకాశంలోకి ఎగిరినట్లు తనను తాను తీర్చిదిద్దుకుంటాడు.
సుఖశాంతుల కోసం...


అర్థం తెలుసుకుని చేసిన పని ప్రయోజనకరంగా ఆనందదాయకంగా ఉంటుంది. వరలక్ష్మీవ్రతాన్ని చేయడానికి ఎటువంటి వివక్ష లేదు. ఇన్నేళ్లు చేయాలనే నియమాలేమీ లేవు. ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేస్తారు. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అని అర్థం. లక్ష్మి అంటే సంపద. మనుషులు సుఖమయమైన జీవితం గడపడానికి కావాల్సిన సమస్త అంశాలూ సంపదలో భాగమే. వాటన్నిటిలోనూ ఉత్తమమైన వాటిని ఇచ్చేది వరలక్ష్మి. వరలక్ష్మి అంటే ‘వరాలనిచ్చే లక్ష్మి.

వ్రతం అనే మాటకి నియమం, వర్తనం మొదలైన అర్థాలున్నాయి. అంటే ఒక వ్రతం ఆచరించినప్పుడు నడవడికలో మంచిమార్పు వస్తే ఆ నోము ఫలవంతమైనట్టు. అలాంటి వ్రత మాహాత్మ్యాన్ని నిరూపించే కథ వరలక్ష్మీదేవిది. దేవిని షోడశోపచారాలతో పూజించాలి. తొమ్మిది ముడులు ఉన్న తొమ్మిది పోగుల తోరం కట్టుకోవాలి. పానకం, వడపప్పు, చలిమిడి, అరటిపండ్లు, కొబ్బరికాయ నివేదనకి ప్రధానం. వీలైతే, లక్ష్మీదేవికి ఆవుపాలు, బెల్లంతో పరమాన్నం చేయొచ్చు. మగధదేశంలో కుండిన నగరంలో చారుమతి అనే గృహిణి ఉన్న దాంతో తృప్తిగా ఉండేదట. ఆమె సత్ప్రవర్తనకు మెచ్చి, వరలక్ష్మీదేవి కలలో కనిపించి, శ్రావణపూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం తనను పూజిస్తే సకలసౌభాగ్యాలూ ప్రసాదిస్తానని చెప్పింది. లక్ష్మీదేవి సెలవిచ్చిన విధంగా శుక్రవారం అన్ని ఏర్పాట్లు చేసి నగరంలోని స్త్రీలందరినీ పిలిచి వ్రతం చేసుకుంది చారుమతి. పూజానంతరం అందరికీ ఉత్తమ ఫలితాలే లభించాయి. దాంతో ఆ స్త్రీలు చారుమతిని, వరలక్ష్మిని కీర్తించి, ఏటా వ్రతం చేసుకుంటూ సకల సంపదలతో తులతూగారన్నది పౌరాణిక గాథ.

వరలక్ష్మీదేవి అనుగ్రహించిన స్త్రీ చారుమతి. కథలో ఆమె పేరు మాత్రమే చెప్పారు కానీ భర్త, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు లేవు. చారుమతి అంటే మంచిబుద్ధి కలది కాబట్టే, పెద్దలను భక్తిశ్రద్ధలతో సేవించుకుంది. అందరిని తనతోపాటు వ్రతం చేసుకోవడానికి పిలిచింది. వరలక్ష్మి పూజ చేయమన్నది చారుమతిని ఒక్కదానినే. అయినా తనకు కలగబోయే మేలు అందరికీ కలగాలని ఆశ పడింది చారుమతి. అమ్మను పూజించటానికి అందరు అర్హులే. ఇది గుర్తించింది కనుక ఆమె ‘చారుమతి’ అయింది. పూజ అయ్యాక వాయనం ఇచ్చేటప్పుడు- ‘ఇస్తినమ్మ వాయనం’, ‘పుచ్చుకొంటినమ్మ వాయనం’ అంటూ చెప్పిస్తారు. ‘నా వాయనం పుచ్చుకున్న వారెవరు?’ అని అడిగితే ‘నేనే వరలక్ష్మీదేవిని’ అని సమాధానం. ఈ కార్యక్రమం వల్ల సాటి మనిషిని ఆరాధ్యదైవంగా చూడటం అలవడుతుంది.

సామూహికంగా వ్రతాలు ఆచరించడంతో సమష్టితత్వం పెరుగుతుంది. అందరికీ మంచి జరగాలనుకోవడం, ఏ విధమైన వివక్షనూ పాటించక పోవడం, పెద్దలను ఆదరించడం, ఉన్నదాంతో తృప్తి చెందడం మొదలైన చారుమతిలోని గుణాలను అందరూ పెంపొందించుకోవాలి. అప్పుడు కుటుంబం సుఖశాంతులనే శ్రేష్ఠమైన సంపదతో విలసిల్లుతుంది.
ఆత్మీయ రక్ష

శ్రావణపౌర్ణమి పర్వదినం నాడు జరుపుకొనే రాఖీపండుగ తోబుట్టువుల అనుబంధానికి ప్రతీక. ఇంటి ఆడపడుచును మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఆదరించే సంస్కృతి మనది. దానికి ఘనమైన నిదర్శనమే రక్షాబంధనం. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలను ఇనుమడింపజేసే ఈ పండుగలో భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యం ప్రకటితమవుతుంది. ఆడపిల్లల విషయంలో అన్నదమ్ములు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలో గుర్తుచేస్తుంది. భారతీయ ధార్మిక గ్రంథాల్లోని వివిధ ఘట్టాలు రాఖీపండుగ ప్రాశస్త్యానికి నిదర్శనాలుగా నిలుస్తాయి. త్రేత, ద్వాపర యుగాల్లో అక్కాచెల్లెళ్లే కాకుండా మాతృమూర్తి, అర్ధాంగి, ఇతర బంధువర్గ మహిళలు కూడా పురుషులకు రక్ష కట్టడం ఆనవాయితీ. కాలక్రమంలో ఆ సంప్రదాయం సోదరి, సోదరుల మధ్య రక్షాబంధనానికే పరిమితమైపోయింది.

రక్షాధారణలో ఆ జగద్రక్షకుడి రక్షణ దాగి ఉంటుందని సనాతన ధర్మం ఘోషిస్తోంది. ఓ మారు దేవేంద్రుడు రాక్షసులపై యుద్ధానికి సన్నద్ధమవుతుంటాడు. అప్పుడు ఆయన అర్ధాంగి శచీదేవి శ్రీమహావిష్ణువును పూజించి, భర్తకు అభయాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తుంది. వీరతిలకం దిద్ది రక్ష కట్టి సాగనంపుతుంది. ఇంద్రాణి రక్షాకంకణ ప్రభావంతో ఇంద్రుడు దిగ్విజయుడై అమరావతికి తిరిగొస్తాడు. ఈ ఉదంతాన్ని ధర్మరాజుకు గుర్తుచేస్తూ, అన్ని అశుభాలు రక్షాబంధనంతో తొలిగిపోతాయని సాక్షాత్తూ శ్రీకృష్ణభగవానుడే చెప్పాడన్నది పురాణ కథనం.

శ్రీకృష్ణపరమాత్మ అవతార లీలల్లోనూ అన్నాచెల్లెళ్ల అనురాగబంధం సుమగంధమై పరిమళించింది. ఒకసారి గోకులనందనుడి వేలికి గాయమైనప్పుడు ద్రౌపది తన వస్త్రాన్ని చించి కట్టు కట్టింది. సోదరి స్పందనకు సంతసించిన సత్యాపతి, ఆ వస్త్రాన్నే రక్షాబంధనంగా భావించాడు. కౌరవుల నిండు కొలువులో పాంచాలికి అవమానం జరిగినప్పుడు ఆపద్బాంధవుడై అనుగ్రహించి రుణం తీర్చుకున్నాడు. మతాలకు అతీతంగా ఎందరో మహారాజులు రక్షాబంధన ఆచారానికి పెద్దపీట వేశారు. మహిళలకు పూజ్యస్థానాన్నిచ్చి, వారి మనోభావాలను గౌరవించారు, మనోభీష్టాలను నెరవేర్చారు. రక్షా శబ్దమే రాఖీ అయిందని పరిశోధకుల భావన. దేవతలను ఆదుకునేందుకు శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తిని బంధించాడు. ఆ విష్ణుబలమే రక్షాబంధనంలో నిక్షిప్తమై ఉందని నమ్మే భక్తులు రాఖీపౌర్ణమి శుభవేళ వామనావతార ఘట్టాన్ని స్మరించుకోవడం ఆనవాయితీ.

రక్షాబంధన పండుగను జంధ్యాలపూర్ణిమ, భద్రా అని కూడా పిలుస్తారు. కన్నడిగులు నార్లీపూర్ణిమ అని, తమిళులు, మలయాళీలు పౌవతి పూర్ణిమ పేర్లతో జరుపుతారు. పురుషుడు పరకాంతలో తోబుట్టువును చూసుకోగలిగే సంస్కారాన్ని అలవరచుకోవటమే రక్షాబంధనంలోని పారమార్థిక లక్ష్యం. పున్నమినాటి చంద్రుడిలా ఈ అన్నాచెల్లెళ్ల అనుబంధాలు కలకాలం శోభాయమానమై వర్ధిల్లాలని ఆశిద్దాం!
కన్నాయ లీలలు

భగవంతుడి లీలలు అనేకం. అవి ప్రకటితం- అంటే పైకి కనిపించేవి, అప్రకటితం- అంటే పైకి కనిపించనివి... అనుకోవచ్చు. సామాన్యులకు మొదటివే తెలుస్తాయి. జ్ఞానులకు రెండూ గోచరిస్తాయి. భాగవతంలో అలాంటి ఎన్నో సందర్భాలు కనిపిస్తాయి.

భార్య ఇచ్చిన అటుకులను, బాల్య స్నేహితుడైన కృష్ణుడికి ఆప్యాయంగా సమర్పిస్తాడు సుదాముడు. శ్రీకృష్ణుడు వాటిని ఇష్టంగా ఆరగిస్తాడు. అటుకుల రూపంలో ఉన్న అపూర్వమైన భక్తి, ప్రపత్తులను భగవంతుడు స్వీకరించాడని అంతరార్థం. ‘గోకులం’ అంటే ఆవుల మంద అని అర్థం. రేపల్లెలో పెరిగిన శ్రీకృష్ణుడు బాల్యంలో మన్ను తినడానికి కారణం... గోవులుగా పుట్టిన అనేకమంది రుషుల పాదధూళి సోకి పవిత్రమైన మన్నుతో తనలో ఇమిడి ఉన్న సమస్త జీవకోటి జవసత్వాలు అద్దుకుంటుందని; అలాగే తల్లికి సమస్త భువన భాండాలు గోచరింపచేయడానికి. పెంచిన తల్లి యశోదకు లౌకిక విషయాల మీద మోహం పోగొట్టాలనుకున్నాడు పరమాత్మ. ఒక రోజు ఆమె మజ్జిగ చిలుకుతూ పరమేశ్వరుని నామస్మరణ చేస్తుండగా, బాలకృష్ణుడు స్తన్యం కోసం ఏడుపు లంకించుకున్నాడు. తల్లి తన దగ్గరికి రాగానే అవతల పొయ్యిమీద పాలు పొంగించాడు. యశోద అటు పరుగెత్తింది. అప్పుడే ఇటు పక్కన స్వయంగా పెరుగు కుండని పగలకొట్టాడు. ఆ అల్లరికి యశోదకు పట్టలేని కోపం వచ్చింది. గర్వానికి ప్రతీక అయిన కర్ర పట్టుకుని అతని వెంటబడింది. కొడుకును తాడుతో బంధించాలని ప్రయత్నించింది. కానీ తాడు సరిగ్గా రెండు అంగుళాలు తగ్గింది. ఆ రెండు అంగుళాలే అహంకార, మమకారాలు. ఆ రెండు మనలో ఉన్నంత కాలం పరమాత్ముణ్ని చేరుకోలేం.

శకటాసుర భంజనంలో అంతరార్థం మన సంసారమనే బండికి భగవంతుణ్ని రథసారథిగా చేసుకోవాలని. అప్పుడే ఆయన మన కోరికలనే అశ్వాలను అదుపు చేసి, సన్మార్గంలో నడిపించి, మనల్ని లౌకిక బంధ విముక్తులను చేస్తాడని. భగవంతుడు, తనని ఆశ్రయించిన వారి దోషాలను హరించి వేస్తాడని పూతన వధ ఘట్టం తెలియజేస్తోంది.

శ్రీకృష్ణుడికి వెన్న అంటే ఇష్టం. మజ్జిగ లాంటి మన లౌకిక సంబంధాలను వదులుకుని, వెన్నలా వేరై శరణు కోరితే అక్కున చేర్చుకుంటానన్నది ఆయన ఉపదేశం. శాపగ్రస్తులై, వృక్షరూపంలో తన పాదాలను తాకిన యక్షులకు శాపవిమోచనం కలిగించడం ద్వారా, భక్తితో తనని వేడుకుంటే లౌకిక బంధాల నుంచి తప్పిస్తానన్నాడు భగవానుడు. గోపికా వస్త్రాపహరణం సమయానికి శ్రీకృష్ణుడు బాలుడు. కామమనే ప్రశ్నే ఉదయించదు. ‘మీరు మాయ అనే తెరలను(వస్త్రాలను) తొలగించుకుని రండి. మీ మోహ తెరలు(దేహంపై అభిమానం) నేను తొలగిస్తాను’ అన్నాడు పరమాత్ముడు. జీవాత్మ, పరమాత్మ మధ్య ఉండే మోహపు తెరలు తొలగిపోతేనే భగవానుడి అనుగ్రహం పొందగలం. ఇదే గోపికా వస్త్రాపహరణంలోని అంతర్లీన రహస్యం. తరచి చూడాలే కానీ ఇలాంటి ఎన్నో విషయాలను భాగవతం మనకు బోధిస్తుంది.
ఆత్మ స్తుతి….పరనింద

కురుక్షేత్ర యుద్ధం భీకరంగా సాగుతోంది. దుర్యోధనుడి ప్రాణమిత్రుడు, మహా పరాక్రమవంతుడు అయిన కర్ణుడి ధాటికి పాండవ సైన్యం నిలువలేకపోతోంది. సైనికులు చాలామంది మరణిస్తున్నారు. పాండవ యోధులకు ఏమీ తోచడంలేదు. కర్ణుణ్ని ఎదుర్కొనే వీరుడెవరు అని ఆలోచిస్తున్న ధర్మరాజుకు ఆ శక్తి ఒక్క అర్జునుడికే ఉందని తెలుసు. కానీ అర్జునుడు కర్ణుడితో తప్ప అందరితోనూ యుద్ధం చేస్తున్నాడు. ఇది ధర్మరాజుకు నచ్చలేదు, అందుకే అర్జునుణ్ని కర్ణుడి మీదకి ఉసిగొల్పాలని అనుకున్నాడు.

యుద్ధ ధర్మం ప్రకారం రోజూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే పోరాడాలి. అలా ఒకరోజు యుద్ధం ముగిసిన వెంటనే మర్నాడు అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చిస్తున్నారు పాండవులు. అప్పుడు ధర్మరాజు అర్జునుడి వంక చూస్తూ ‘నువ్వు గొప్ప పరాక్రమవంతుణ్ని అనుకుంటున్నావు కానీ ఒట్టి పిరికివాడివి. కర్ణుణ్ని ఎదుర్కొనే ధైర్యం లేక నీ ప్రతాపాన్ని బలహీనులైన సైనికుల మీద చూపిస్తున్నావు. శివుణ్ని మెప్పించి శక్తిమంతమైన పాశుపతాస్త్రాన్ని పొందావు, గాండీవధారి అనిపించుకోవడమే తప్ప దాన్ని ప్రయోగించడం నీకు తెలియదా లేక అది కేవలం అలంకరించుకోవడానికే పనికొచ్చేదా?’ అంటూ కావాలనే అపహాస్యం చేస్తూ మాట్లాడాడు. ఆ మాటలకు అర్జునుడికి చాలా కోపం వచ్చింది. శివుడి దగ్గర నుంచి పాశుపతాస్త్రాన్ని పొందిన నాడే ఒక శపథం చేశాడు అర్జునుడు. ఎవరైనా తన పాశుపతాస్త్రాన్ని అవమానిస్తే వారిని సంహరిస్తానని. కానీ ఇప్పుడు సాక్షాత్తు తన సోదరుడే గాండీవాన్ని అవమానించాడు. ఏం చేయాలో తెలియక తన సమస్యను కృష్ణుడి దగ్గర మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ‘చిన్నవాళ్లు పెద్దవాళ్లని శిక్షించాల్సిన పరిస్థితుల్లో వారిని దుర్భాషలాడితే సరిపోతుంది. ఎందుకంటే అది వారికి మరణంతో సమానం’ అని సలహా ఇచ్చాడు. అప్పుడు అర్జునుడు ధర్మరాజు దగ్గరికి వెళ్లి ‘మీవల్లే మాకీ పరిస్థితులు వచ్చాయి, మీరు వ్యసనానికి లోనై, రాజ్యాన్ని పోగొట్టారు, మమ్మల్ని అందరినీ పణంగా పెట్టి ఓడిపోయారు, బానిసల్ని చేశారు, ఇదంతా కేవలం మీ వల్లే జరిగింది’ అంటూ అన్నదమ్ములందరి ఎదుట ధర్మరాజుపై నానా నిందలు మోపాడు.

అనడం అయితే అనేశాడు కానీ పెద్దవాడు, ధర్మం తప్పనివాడు అయిన అన్నని నిందిస్తూ మాట్లాడటాన్ని అర్జునుడు జీర్ణించుకోలేకపోయాడు. తీవ్రమైన మనస్తాపంతో మళ్లీ కృష్ణుణ్నే ప్రాయశ్చిత్తం అడిగాడు. అప్పుడాయన ‘నిన్ను నువ్వు పొగుడుకో, నలుగురిలో నీ గురించి నీవే గొప్పగా చెప్పుకో. అదే నీకు ప్రాయశ్చిత్తం. ఎందుకంటే ఆత్మస్తుతి కూడా మరణంతో సమానమే’ అంటూ నవ్వుతూ చెప్పాడు. కాబట్టి ఊరికే ఎవరినీ నిందించకుండా, ఆత్మస్తుతి చేసుకోకుండా నలుగురితో కలిసికట్టుగా పయనించేవారే... సంఘజీవి అనిపించుకుంటారు.
జ్ఞానమృత భండం

శ్రీమద్భగవద్గీత పరమ పవిత్ర గ్రంథం. అదో విశిష్ట వేదాంత బోధగా వినుతికెక్కింది. అసంఖ్యాక భాష్యాలకు నిలయమై నిలిచింది. భగవద్గీతను భక్తిశ్రద్ధలతో చదివినవారు, విన్నవారు తమ కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. పరోపకార భావంతో ముందుకెళ్తారు. ప్రతి ఒక్కరూ యుక్తాయుక్త విచక్షణతో ప్రవర్తిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని చెబుతుంది గీత. ఇది మానవుణ్ని మాధవుడి స్థాయికి చేర్చి ముక్తిని ప్రసాదిస్తుంది. భవబంధాలను తొలగించి ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించి శాంతిని చేకూర్చుతుంది.

సృష్టిలోని నిగూఢ రహస్యాలను కనుగొనడం మానవుడికి సాధ్యం కాదు. అందుకు ఈ లోకంలో ఆ పరమాత్ముడే శ్రీకృష్ణుడిగా అవతరించాల్సి వచ్చింది. ఆయన బోధనలే భగవద్గీత రూపంలో మనకు లభించాయి. మానవుడి మనసుకు అందని ఈశ్వరుణ్ని భగవద్గీతలో నిర్వచించిన విధంగా మరే ఇతర పవిత్ర గ్రంథాల్లోనూ వివరించడం కనబడదు. అర్జునుడు శ్రీకృష్ణుడి ఇష్టసఖుడు. ఏ కర్మ కారణంగానో అతడు ఈ మృత్యు ప్రపంచంలోకి వచ్చి పడ్డాడు. మోహితమైన ఈ లోకంలో చిక్కుకుపోయిన తన సఖుణ్ని ఈశ్వరోన్ముఖుడిగా చేసి తరింప చేయాలన్న తపనతో అనేక కోణాల్లో వేదాంత బోధ చేశాడా పరమాత్మ. కృష్ణభగవానుడు కేవలం అర్జునుడికి బోధించిందే అయినా సమస్త లోకానికీ జ్ఞానబోధగా భాసిల్లింది గీత. ధర్మరక్షణ కోసం భగవంతుడు ప్రతి యుగంలో అవతరించి మంచిని బోధించి చెడును తుడిచిపెట్టమని చెప్పి వెళ్తూంటాడు. ప్రపంచమంతా ఆ పరమాత్ముడి మాయామయమే. సత్వగుణ సంపన్నులైనవారు జ్ఞానమార్గం, బుద్ధియోగంతో విశేష సాధనచేసి మోక్షాన్ని పొందుతున్నారు. రజో, తమో గుణ సంజాతులకు జ్ఞానోదయం కావాలంటే, వారు ఆధ్యాత్మిక సాధనవైపు ఆకర్షితులు కావాలి. వారి స్థాయిని బట్టి ఉద్ధరించాలనే సంకల్పంతో భగవానుడు వారికి తగిన విధంగానే వేదాంతాన్ని బోధిస్తాడు. సాధన చేసి తరించమని ప్రబోధిస్తాడు.

మనిషి అస్థిర విషయాల వలలో చిక్కుకుని శాశ్వత సుఖానికి దూరమవుతున్నాడు. అఖిల సృష్టినీ ఆవరించి అఖండ జ్యోతిగా వెలుగుతున్న ఈశ్వరుడు మరెక్కడో లేడు. మనిషి దేహంలోనే ఉన్నాడు. అది తెలుసుకోలేక మానవుడు పరమాత్ముడికి దూరమైపోతున్నాడు. అందుకే ‘భక్తుడివై నామీద మనసు నిలిపి పూజ చెయ్యి. నమస్కరించుకో. అప్పుడిక తప్పక నన్నే పొందుతావు’ అంటూ అభయమిస్తున్నాడు పరమాత్ముడు. ఆధ్యాత్మిక పరిపూర్ణ సాధనకు భగవద్గీతను మించింది లేదు. అందులోని ఏ ఒక్క శ్లోకాన్నయినా తీసుకుని సగం చదివినా, విన్నా మనిషికి సద్గతులు కలుగుతాయని వరాహ పురాణం చెబుతోంది. స్వామి వివేకానంద సైతం భగవద్గీత పారాయణకు ఎంతో ప్రాధాన్యమిచ్చేవారు.

నిజానికి ఈశ్వరుడికి వారు, వీరనే భేదం ఉండదు. ప్రతి హృదయంలో కొలువై ఉంటాడు. ఆయన మానసాతీతుడు. రూప రహితుడు. ఆయన ఉనికిని నిర్ధారించలేం. ‘ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను దర్శించాలంటే మనసు తెరను తొలగించి తీరాలి’ అని విడమరచి చెబుతోంది భగవద్గీత.
నిజమైన తపస్సు

మాళవదేశాన్ని శిఖిధ్వజుడు ధర్మబద్ధంగా పాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య చూడాల మహాజ్ఞాన సంపన్నురాలు. ఇద్దరూ ఆత్మజ్ఞానం పొందాలనుకున్నారు. కానీ వారి మనఃస్థితులు వేరుగా ఉన్నాయి. శిఖిధ్వజుడు భౌతిక జీవితమే ఆనందకారకం అని భావించాడు. చూడాల నిజమైన జ్ఞానం కోసం భగవత్‌ తత్త్వాలను అధ్యయనం చేసింది. ఆత్మ కళంకం కాకపోతే జీవాత్మ పరమాత్మతో ఏకమవుతుందని గ్రహించింది. ధ్యానం, తపస్సు ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందింది. రాజు భార్యలో దైవత్వాన్ని గ్రహించి ఇంత ఆనందం ఎలా పొందుతున్నావని ప్రశ్నించాడు. సుఖదుఃఖాల వ్యత్యాసం లేని స్థితిలో, ఇంద్రియాలకు గోచరించని పరబ్రహ్మ స్వరూపాన్ని తాను దర్శిస్తున్నానని చెప్పింది చూడాల. అది విన్న శిఖిధ్వజుణ్ని వైరాగ్యం ఆవహించింది. సంసార జీవనం వ్యర్థమని భావించి అడవులకు వెళ్లిపోయాడు. కందమూలాలు తింటూ దేహాన్ని శుష్కింపచేస్తూ తపస్సు చేస్తున్నాడు. తన భర్త అసలు తత్వాన్ని గ్రహించలేకపోయాడని తెలుసుకున్న చూడాల ఆయనకు నిజమైన ఆధ్యాత్మికజ్ఞానం కలుగజేయాలనుకుంది. యోగబలంతో ‘కౌమారి’ అనే యోగినిగా మారి ఆయనను సమీపించింది.

ఎంత ప్రయత్నించినా తపస్సుకు ఏకాగ్రత కుదరని శిఖిధ్వజుడు ఆ యోగినీమాత ముఖంలో ప్రశాంతత, వర్ఛస్సు, ఆనందం చూసి మీరు అలా ఎలా ఉండగలుగుతున్నారని అడిగాడు. అప్పుడామె రాజుకు జ్ఞానోపదేశం చేస్తూ.. నిజమైన వైరాగ్యం అంటే శరీరాన్ని వదిలేయడం కాదు, మనసును వదిలేయడం; సంసారాన్ని వదిలేయడం కాదు, మనసులోని అహంకారాన్ని కోరికలను వదిలేయడం... అదే నిజమైన మోక్షం- అని చెప్పింది. నువ్వు రాజ్యాన్ని, భార్యను వదిలావు కానీ మనసునూ మోహాన్నీ వదలలేదు. అదే నీకు బంధనం అవుతోంది అని వివరించింది. తన పరిస్థితిని అర్థం చేసుకున్న శిఖిధ్వజుడు యోగినికి నమస్కరించి- నిజమే, తపస్సు మనసులో ఉండాలి కానీ బయట కాదన్న నిజాన్ని అర్థం చేసుకున్నానని చెప్పాడు. క్రమంగా తనకీ ఆనందానుభూతి కలగడాన్ని అతడు గ్రహించాడు. అప్పుడు చూడాల తన నిజరూపాన్ని చూపగా ఆమెను గురువుగా భావించి నమస్కరించాడు శిఖిధ్వజుడు. నిజమైన జ్ఞానంతో రాజ్యంలోకి తిరిగి వచ్చిన ఆ రాజు వాస్తవమైన ధర్మాన్ని పాటిస్తూ రాజ్యపాలన చేశాడు. అనంతరం దంపతులిద్దరూ మోక్షాన్ని పొందారు.

వాసిష్ఠ రామాయణంలో వశిష్ఠుడు శ్రీరాముడికి ఆధ్యాత్మిక రహస్యాలను తెలియజేస్తూ ఆత్మజ్ఞానం ఎలా పొందాలో ఈ కథ ద్వారా వివరించాడు. తపస్సు అంటే- మనసును మౌనం చేయడం, మనసే బంధనాలకు కారణమని గ్రహించడం. ‘తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా’ అని భగవద్గీత చెప్పినట్టు గురువు ఆశ్రయం లేకుండా జ్ఞానం రాదని చూడాలోపాఖ్యానం తెలియజేసింది.

మోక్షం అంటే జీవితాన్ని వదిలేయడం కాదు, బ్రహ్మాన్ని గ్రహించడం. అంతేకాదు, జీవించి ఉన్నప్పుడే మోక్షాన్ని సాధించడాన్నే జీవన్ముక్తి అంటారు. అన్నీ వదిలేసినవాడు కాదు... ప్రపంచంలోనే, ప్రపంచంతోనే సంచరిస్తూ ఆకర్షణలకు లొంగక జ్ఞానంతో జీవించగలిగిన వాడే నిజమైన ముని.
అనిశ్చితే నిశ్చితి


‘అనిశ్చితే నిశ్చితి. అభద్రతతో జీవించడంలోనే భద్రత’ ఉంటుంది అని గణితశాస్త్రజ్ఞుడు జాన్‌ అలెన్‌ పౌలస్‌ అంటారు. అనిశ్చితిని మనం స్వీకరించలేకపోతే అది భయంగా మారుతుంది. అదే స్వీకరిస్తే ఉల్లాసానికి, సృజనాత్మకతకు దారితీస్తుంది. ఉన్నదున్నట్లుగా స్వీకరించడం మనం ఎదుర్కొనే సవాలు. నిశ్చితికోసం వెతకడం అర్థరహితం. అనిశ్చితిలోనే మన శక్తులను మనం తెలుసుకోగలుగుతాం. పరిస్థితులు ఎప్పుడెలా మారతాయో చెప్పలేం. శక్తికొద్దీ వాటిని ఎదుర్కోవాలి. కొన్నిసార్లు అద్భుతమైన ఫలితాలు చూస్తాం. కాని అవి మనం ఊహించినవి కాకపోవచ్చు. అయినా హుందాగా వాటిని స్వీకరిస్తూ ముందుకు సాగాలి. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎదుగుతూనే ఉండాలి.

ఒక సన్యాసి తన జీవితంలో బౌద్ధసూత్రాలను తు.చ.తప్పకుండా పాటిస్తూ వచ్చాడు. అయితే ఓ రోజు రాత్రి చీకట్లో నడుస్తుండగా కీచుమన్న శబ్దంతో పాటు కాలికింద ఏదో నలిగినట్లు అనిపించింది. కప్పను కాలితో తొక్కి చంపేశాననుకుని చాలా బాధపడ్డాడు. నిద్ర కూడా సరిగా పట్టలేదు. పొద్దున్నే ఆ ప్రదేశానికి వెళ్లి చూస్తే నలిగి పడి ఉన్న వంకాయ కనిపించింది. తాను ఏ ప్రాణికీ హాని చేయలేదని తెలిశాకే అతడిలో అశాంతి మాయమైంది.

ఏవేవో భయంకరమైన విషయాలన్నీ ఊహించుకుంటాం. దుఃఖపడతాం. చెడు జరగకముందే జరిగినట్లుగా ఊహించుకుని భద్రత లేదనుకుంటాం. ఏ క్షణంలో ఏమవుతుందో ఎవరికీ తెలియదు. జీవితం అంటేనే అనిశ్చితి. అంతమాత్రాన దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే- అది ఒత్తిడికి దారితీస్తుంది. భౌతిక, మానసిక ఆరోగ్యానికి భంగం కలిగిస్తుంది. ఏ పనీ చేయలేం. అన్నీ చెడుగా ఊహించుకునే బదులు మంచి విషయాలు తలచుకోవాలి. ఏకాగ్రత పెంపొందించుకుని వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. భవిష్యత్తు గురించి ప్రశ్నలు వేధిస్తే ఆందోళన, నిరాశ కలుగుతాయి. నిస్సహాయత ఎదురవుతుంది. చేపట్టిన పని సత్ఫలితాన్ని ఇస్తుందో లేదో తెలియదని అసలు చేయకపోవడం వివేకవంతుల లక్షణం కాదు. కష్టమో నష్టమో వెనకటి తరాల వారంతా చేయాలనుకున్నది ధైర్యంగా చేశారు కాబట్టే నాగరికత ఇంత దూరం వచ్చింది. మనకీ సౌకర్యాలన్నీ సమకూరాయి. అనిశ్చితి తాలూకు భయాలను వెనక్కి నెట్టి మన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. పనిచేయడం వరకే మన కర్తవ్యం, ఫలితం మన చేతిలో లేదని భగవద్గీత చెబుతోంది.

చాలావరకు నిత్యజీవితంలో అనిశ్చితిని ఎదుర్కొనడానికే ప్రయత్నిస్తాం. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకుంటాం. ప్రవర్తనను అదుపులో పెట్టుకుంటాం. అయితే అది అన్ని విషయాల్లోనూ చూపలేరు కొందరు. అలాంటి వాళ్లు శరీరంపట్ల, మనసుపట్ల శ్రద్ధ వహించాలి. కంటినిండుగా నిద్రపోవాలి. మనసును ఉల్లాసంగా ఉంచుకోవాలి. అంతా మంచే జరుగుతుందని, కోరుకున్న ఫలితం వస్తుందని ఆశించాలి. ఒకవేళ రాకపోతే మళ్లీ ప్రయత్నించాలి. అంతేకానీ నిరుత్సాహపడకూడదు. సహనాన్ని పెంపొందించుకోవాలి. నిత్యజీవితంలో మార్పులు స్వీకరించినట్లు పెద్ద సవాళ్లను కూడా స్వీకరించడం... అభిలషణీయం, ఆరోగ్యదాయకం.

తరిగొప్పుల విఎల్లెన్
పూర్ణ పురుషుడు

భగవంతుడు అన్ని ప్రాణులలో క్షేత్రజ్ఞుడిగా ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు. జగత్తు అంతా ఆయన మాయే. దానికి వశుడై ఉన్న జీవుడు ‘నేనే చేస్తున్నాను, అంతా నాదే, అన్నీ నాకే తెలుసు’ అనే అజ్ఞానపాశాలతో బంధితుడవుతున్నాడు. అరిషడ్వర్గాల ఊబిలో కూరుకుపోతున్నాడు. అందుకే మనిషి సంపూర్ణుడు కాలేకపోతున్నాడు. అజ్ఞానాంధకారంలో చిక్కుకుని జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించలేకపోతున్నాడు.

భగవంతుడు పూర్ణ పురుషుడు. మనిషిగా జన్మించి, తనేమిటో, తన తత్త్వమేమిటో లోకానికి స్పష్టంగా విశదపరిచాడు. బ్రహ్మ సృష్టిలోని చాకచక్యం అంతా కృష్ణుడి రూపంలో సంపూర్ణంగా కనిపిస్తుంది. అందుకే అందరూ చేసే పనులు ఆపేసి మరీ చెంతకుచేరి ఆయన్నే చూస్తూ ఉండి పోయేవారు. త్రిగుణాత్మకమైన ప్రకృతికి, ముల్లోకాలకు ఆయనే అధిపతి. స్వయం ప్రకాశుడు, ఆనంద స్వరూపుడు. ఇక వినయంలో కృష్ణుడికి సాటి ఎవరూ లేరు. కంసవధ అనంతరం దేవకీ వసుదేవులకు నమస్కరించి ‘ఇన్నేళ్లుగా మీ పాదసేవా భాగ్యాన్ని పొందలేకపోయాను. క్షమించి అనుగ్రహించండి‘ అని వేడుకున్నాడు. కృష్ణుడి వల్లనే ఉగ్రసేనుడు మహారాజయ్యాడు. అయినా ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడి గౌరవంగా ‘మహారాజా!’ అని మాట్లాడేవాడు. తనను చూడవచ్చిన బంధువులు, పెద్దలకు తలవంచి నమస్కరించేవాడు.

దయామయుడైన శ్రీకృష్ణుడు పెంచిన తల్లి యశోదకు ఏ పుణ్యలోకాలను ప్రసాదించాడో తనను మట్టుపెట్టాలని వచ్చిన పూతనని కూడా అవే పుణ్యలోకాలకు పంపాడు. తన పట్ల శత్రుభావంగల రాక్షసులు కూడా తన భక్తులే అని భావించి మరణానికి ముందు వారికి తన పూర్ణదర్శన భాగ్యాన్ని అనుగ్రహించాడు. కృష్ణుడు ఏకసంథాగ్రాహి. సాందీపని మహర్షి ఆశ్రమంలో వేదాన్ని అధ్యయనం చేశాడు. మరణించిన గురుపుత్రుణ్ని పంచజనుడు అనే రాక్షసుడి ఉదరం నుంచి బయటకు రప్పించి గురుదక్షిణ ఇచ్చాడు. పరమాత్మ గృహస్థ ధర్మాన్ని పాటించి అష్టదేవేరులను ఆనందపరిచాడు. సచ్చిదానందమైన జ్ఞానంతో నిష్ఠ కలవాడై ద్వారకను సమర్థంగా పాలించాడు. లోకంలో జ్ఞానమార్గాన్ని నిలబెట్టాడు. అపూర్వ గీతావాణిని అందించాడు.

కోరికలు లేకుండా, కర్మలు అంటకుండా ఉండే స్వామి కర్మలు చేస్తున్నట్లు కనిపించాడు. కాల మృత్యుస్వరూపుడైనా శత్రువులకు భయపడి ద్వారకా ద్వీపంలో తలదాచుకున్నట్లు నాటకమాడాడు. ఒక వంక ‘జగత్తును నడిపించేది నేనే’నంటూనే మరో వంక ‘నిమిత్తమాత్రుణ్ని, నాకేమీ తెలియద’ని అనేవాడు. ఆయనపై పరిపూర్ణ విశ్వాసం ఉంటే గానీ ఆ తత్త్వం అర్థం కాదు. పరమ భక్తి కలిగినవారు నిత్యమూ భగవత్‌ సాన్నిధ్యాన్నే కోరుకుంటారు. వారి దృష్టి ఎప్పుడూ ఆయనపైనే ఉంటుంది. పాండవులు అంతటి భక్తిపరులు కాబట్టే వారికి రాజ్యం దక్కింది. ఇలాంటి పరాభక్తిని సాధన చేస్తే దైవం తనను తానే సమర్పించుకుంటాడు. దూడ వెంట గోవులా మన వెంటే ఉంటాడు.

మాడుగుల రామకృష్ణ
జీవితాన్ని అంగీకరిద్దాం

పంచభూతాత్మకమైన ప్రకృతి మన చుట్టూ అల్లుకున్న ఆవరణ మాత్రమే కాదు, కనిపించని చైతన్యశక్తి. అది ఉన్నందుకే సకల చరాచరాలు అస్తిత్వంలో ఉన్నాయి. జీవన గమనానికి ప్రకృతి దిశానిర్దేశమే ప్రామాణికం. దాని అడుగుజాడల్లో పయనించే పశు పక్ష్యాదులు ఆనందంగా ఉంటున్నాయి. కానీ, మనిషి మాత్రం భారంగా బతుకీడుస్తూ దుఃఖంతో ఉంటున్నాడు. అందుకు కారణం అతడు ప్రకృతి తాలూకు నియమనిబంధనలకు విరుద్ధంగా నడచుకోవడం, గాలి వీచినవైపు నడవకపోవడం, ప్రకృతిధర్మాల్ని అసలే లెక్కచెయ్యక వాటిని తుంగలో తొక్కేయడం... ఇదంతా మనిషి అజ్ఞానానికి పర్యవసానం. అజ్ఞానం అహంభావానికి దారితీస్తుంది. అది జీవితం పట్ల అవగాహన కుదరనివ్వదు.

పులిని ధైర్యానికి ప్రతీకగా, పిల్లిని పిరికితనానికి ఉపమానంగా భావిస్తుంటాం. ఈ పోలికలు మనిషి ఆలోచనలే కానీ పులికి, పిల్లికి అవేమీ తెలియవు. అవి ఆ క్షణాల్లో ఎదురైన జీవితాన్ని యథాతథంగా స్వీకరిస్తాయి. సమయానుకూలంగా నడచుకుంటాయి. అంతేగానీ పౌరుషానికి పోవు, ఎవరి మెప్పూ పొందాలని అనుకోవు. ఒక వ్యక్తి పిల్లిని గదిలో బంధించి కర్రతో బాదుతున్నాడు. కాసేపటికి మూసిన గది తలుపులు గభాల్న తెరచుకున్నాయి. పిల్లి ఎదురుతిరిగి దాడి చేయబోగా కర్ర పట్టుకున్న వ్యక్తి పరుగు లంకించుకున్నాడన్న మాట. సాధుజంతువుగా ఉండే పిల్లి ఆపద వస్తే పులిలా మారింది. మరోచోట... ఊళ్లోకి పులి వచ్చింది. జనం గుంపుగా కర్రలతో దాని దారికడ్డంగా నిలిచారు. అప్పుడా పులి రెండడుగులు వెనక్కి వేసి తేరిపారజూసి వచ్చిన దారిన వెళ్లిపోయింది. అంతటి పెద్దపులి తనను చూసి పిల్లిలా వెనుదిరిగిందని మనిషి బీరాలు పోతాడు. నిజానికి ఆ జంతువుకు అవేమీ పట్టవు. ప్రతి జీవి సాధ్యమైనంత వరకు తనకే ఆపదా రాకుండా జీవించి ఉండాలని కోరుకుంటుంది. పరిస్థితిపై తనది పై చేయి కాగలదనుకుంటేనూ, తప్పనిసరి అయితేనూ మాత్రమే అది ప్రతిఘటిస్తుంది. ఆ అవకాశం లేదనుకుంటే నిశ్శబ్దంగా అక్కడినుంచి నిష్క్రమిస్తుంది. అంతేగానీ ఎవరో ఏమో అనుకుంటారని గొప్పలకు పోయి ప్రాణాలమీదకు తెచ్చుకోదు. వెనుకడుగు వెయ్యడాన్ని చిన్నతనమనుకోదు. అది వాటి సహజస్వభావమే కానీ రాజీపడటమో ఓటమిని అంగీకరించడమో కాదు. ఎక్కడ తగ్గాలో తెలియడం కూడా జీవితాన్ని ఎదుర్కోవడమే. ఒక పెద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రయాణంలో పెద్ద కొండ అడ్డువచ్చింది. అప్పుడా నది పరుగు వేగం తగ్గింది, కాస్త వెనక్కి మళ్లింది. కాసేపటికి కొండ పక్కనుంచి కొత్తదారి చూసుకుని ప్రయాణం కొనసాగించింది. ఒక్కోసారి వెనక్కి రావడమూ ముందుకు పోవడంలో భాగమే.

మిగిలిన రాళ్లకన్నా నాలుగు ఉలిదెబ్బలు ఎక్కువ తిన్నదే విగ్రహమై పూజలందుకుంటుంది. పట్టాభిషిక్తుడు కావాల్సిన శ్రీరాముడు అరణ్యవాసాన్ని అంగీకరించి ఆచంద్రతారార్కం దేవుడై నిలిచాడు. లక్ష్యసాధనకు ముందుకు సాగుతున్నప్పుడు తగిలే ఎదురుదెబ్బలను విజయానికి మెట్లుగా భావించాలే తప్ప పరాజయాలుగా కాదు. ప్రకృతి నియమాన్ని అనుసరించి జీవితాన్ని అంగీకరించాలి. సందర్భానికి తగినట్లుగా స్పందించాలి.

మునిమడుగుల రాజారావు
పుష్ప వైభవం

సప్తవర్ణ శోభిత పూదోటల్లో విహరిస్తున్నప్పుడు మనసు పరవశిస్తుంది. భగవంతుడి అద్భుత సృష్టిలోని విశిష్టత బోధపడుతుంది. వివిధ రంగుల పువ్వులు కంటికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సువాసనలు వెదజల్లే సుమాలను ఇష్టపడని వారుండరు. పూజాద్రవ్యాలలో పూలకే పెద్దపీట. సహస్ర నామార్చనకు సుమ సౌరభం తోడైనప్పుడు భగవంతుడు ప్రీతిచెందుతాడు.

శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి అచ్చంగా పువ్వులతో చేసే అలంకరణను తోమాలసేవ అంటారు. స్వామివారికి ఆపాదమస్తకం చేసే ఈ పుష్పాలంకరణ సేవలో పాల్గొన్నవారి మనసు అనే పుష్పం శ్రీవారి పాదాలచెంత చేరి జన్మ ధన్యమవుతుందని చెబుతారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలోనైతే ఆలయ ప్రాంగణమంతా పుష్పాలంకరణతో అలరారుతూ చూపరులకు నయనానందకరంగా ఉంటుంది. ఆ ఉత్సవాల అనంతరం ఏటా కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రం రోజున శ్రీవారి కల్యాణమండపంలో జరిగే పుష్పయాగమూ చూసి తీరాల్సింది. ఈ రోజుల్లో దైవార్చనకు వాడిన పువ్వులను వృథాగా పారవేయట్లేదు. వాటితో అగరుబత్తులు, పరిమళద్రవ్యాలు తయారుచేస్తున్నారు. ఆ విధంగా అవి రెండుసార్లు భగవంతుడికి సేవజేసుకునే భాగ్యానికి నోచుకుంటున్నాయి.

కమలనాభుడు విష్ణుమూర్తి. కమల సంభవుడు బ్రహ్మ. శ్రీమహాలక్ష్మికి ఎర్ర తామర పూలంటే ఇష్టం. సరస్వతీ దేవికి అత్యంత ప్రీతికరమైనది తెల్ల తామర. ‘చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచా’ అని లలితా సహస్ర నామ స్తోత్రంతో అమ్మవారిని స్తుతిస్తాం. రుక్మిణీదేవి పద్మం వంటి శరీర పరిమళం కలిగి లక్ష్మీదేవి అంశతో జన్మించిందన్నది భాగవత కథనం. దేవదానవులు సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవించింది. బ్రహ్మదేవుడు లక్ష్మీదేవిని సృష్టించినప్పుడు వికసించిన ఎర్రతామరల కొలనులో సుగంధం వ్యాపించింది. తుమ్మెదల ఝంకార ధ్వనులతో కూడిన కలువపూల దండ పట్టుకుని లక్ష్మీదేవి మేఘాల నడుమ మెరిసిపోయే బంగారంలా దేవతల మధ్య నిలుచుందని భాగవతం వర్ణించింది. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త, జిల్లేడు, గన్నేరు, జాజి, మల్లె, పారిజాత పువ్వులతో శివుణ్ని పూజిస్తే ఉత్తమ ఫలాలనిస్తాడని శివపురాణం చెబుతోంది. భగవంతుడికి ప్రీతి పాత్రమైన పుష్పాలు మనుషుల మనసులనూ మురిపిస్తాయి. అందుకే వాకిట్లో ఓ పూల మొక్క పెట్టుకోవాలని ప్రయత్నించని వారుండరు. ప్రేమను వ్యక్తపరచడానికి గులాబీ సహకరిస్తుంది. శకుంతల కణ్వమహర్షి ఆశ్రమంలో పెరుగుతున్నప్పుడు చెట్లకు బాధ కలుగుతుందని ఒక్క ఆకు కూడా తుంచి ఎరుగదట. అవి మొదటిసారి పుష్పించినప్పుడు శకుంతల పండుగ చేసేదని కాళిదాసు వర్ణించాడు.

కనువిందు చేసే రంగులతో, మైమరపించే సువాసనలతో సూర్యోదయం కాగానే శుభోదయం చెప్పే పూబాలలను భగవంతుడి దరికి చేర్చే భాగ్యం మానవమాత్రులకు మాత్రమే లభించింది. నిర్మలత్వానికి, అమాయకత్వానికి, దైవత్వానికి ప్రతిరూపంలా ఉండే పువ్వులు నిష్కల్మషమైన హృదయానికి ప్రతీకలు. భగవంతుడి పాదాలదగ్గర పువ్వులను ఉంచడమంటే భక్తుడు తన హృదయాన్ని ఆయనకు సమర్పించుకున్నట్లే!

ఇంద్రగంటి నరసింహమూర్తి